పశ్చిమాసియా సంక్షోభం కాస్తా ‘కె•తి పుండు బ్రహ్మ రాక్షసి’ అన్నట్లుగా మారింది. ఏప్రిల్ 22తో అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగిసినా రెండో విడత చర్చలు మొదలు కాలేదు. దీంతో యుద్ధం మరింత తీవ్రంగా మారే ప్రమాదం పొంచి ఉంది. తమ డిమాండ్లను అమెరికా ఏమాత్రం పట్టించుకోకుండా తమకు ఆమోదయోగ్యం కాని షరతులు విధించడంపై ఇరాన్ ఆగ్రహంతో ఉంది. ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్న రెండో విడత చర్చలు ఏప్రిల్ 20న జరగాల్సి ఉన్నా, రెండు దేశాల ప్రతినిధులు వెళ్ల కుండా దూరంగానే ఉండిపోయారు. యుద్ధానికి చర్చలతో ముగింపు పలకాలని ప్రపంచ దేశాలు మొదటి నుంచి సూచిస్తున్నా అమెరికా, ఇరాన్ తమ మొండి పట్టుదలను అలాగే కొనసాగిస్తున్నాయి. మళ్లీ యుద్ధం మొదలైతే పరిస్థితులు అత్యంత భయానకంగా ఉంటాయి.
యుద్ధం ముగించేందుకు అమెరికా విధించిన షరతులు ప్రకారం…ఇరాన్ తన అణు సామర్థ్యాన్ని, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను వెంటనే నిలిపేయాలి. ఇప్పటి వరకూ తయారైన ఆయుధా లను నాశనం చేయాలి. శుద్ధి చేసిన యురేనియంను తమకు అప్పగించాలి. లెబనాన్, యెమెన్, సిరియా, ఇరాక్లలో ఇరాన్ మద్దతు ఉన్న మిలిషియా గ్రూపులకు ఆయుధాలు, నిధుల సరఫరాను ఆపాలి. అంతర్జాతీయ చమురు సరఫరాకు ఆటంకం కలిగించకుండా హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచాలి. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్పస్ నియంత్రణ తగ్గించాలి. అమెరికా, ఇజ్రాయోల్ దాని మిత్రదేశాలపై దాడులు, సైబర్ దాడులు ఆపాలి. ఇరాన్ తమ షరతులకు అంగీకరించకపోతే ఆ దేశంలోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలను నాశనం చేస్తాం. ఇక మీదట అంత మంచివాడిలా ఉండను’ అంటూ ట్రంప్ హెచ్చరించారు. ట్రం•,• ఓవైపు చర్చలకు సిద్ధం అంటూనే మరోవైపు ఇరాన్ ఓడ రేవులను దిగ్బంధించారు.
అమెరికా షరతులు తమకు ఏమాత్రం ఆమోద యోగ్యంగా లేవని స్పష్టం చేసింది ఇరాన్. శాంతి ప్రయోజనాల కోసం చేపట్టిన తమ అణు కార్యక్రమాన్ని వదులుకునేది లేదని ప్రకటించింది. యురేనియంను అమెరికాకు అప్పగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్.
ఇక ఇరాన్ అమెరికా ముందు పెట్టిన డిమాండ్లు ఇవి: అమెరికా, ఇజ్రాయెల్ తమపై జరుపుతున్న దాడులు, హత్యలు తక్షణమే ఆగిపోవాలి. ఇరాన్పై మళ్లీ ఎప్పుడూ ఇలాంటి సైనిక దాడులు జరగవని పటిష్టమైన అంతర్జాతీయ హామీ ఉండాలి. తాము కోరుకోని యుద్ధం కారణంగా జరిగిన నష్టానికి అమెరికా, ఇజ్రాయెల్ స్పష్టమైన పరిహారం చెల్లించాలి. ఇరాన్తో పాటు, ఈ ప్రాంతంలోని తమ ప్రతిఘటన సమూహాలపై దాడులు నిలిపివేయాలి. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ చట్టపరమైన సార్వభౌమాధికారాన్ని (టోల్ వసూలుతో సహా) గుర్తించాలి.
తమ దేశ ప్రయోజనాలు, భద్రత కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ చెబు తోంది. అయితే, అమెరికన్లు తమ బెదిరింపు విధానంతో అధిక డిమాండ్లను సాధించుకునేందుకు చర్చల వేదికలను వాడుకుంటే కుదరదని హెచ్చ రించింది. తమతో అమెరికా కుదుర్చుకునే ఎలాంటి ఒప్పందంలో అయినా లెబనాన్ ఉండి తీరాల్సిందే అని ఇరాన్ స్పష్టం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పట్టించుకోకుండా, లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడులను ఖండించింది.
యుద్ధం మళ్లీ మొదలైతే..
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలు విఫలమైతే తలెత్తే ప్రమాదాలు ఇలా ఉన్నాయి.. కాల్పుల విరమణ గడువు ముగిసిన తర్వాత సైనిక ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితి ఏర్పడుతుంది. పశ్చిమా సియాలో భద్రతా పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. ఇతర దేశాలు ఈ ఘర్షణలో చేరే ప్రమాదం ఉంది. దౌత్య చర్చలు పూర్తిగా నిలిచిపోయి దీర్ఘకాలిక అస్థిరత నెలకొనే అవకాశం ఉంది. హార్మూజ్ జలసంధి వద్ద రవాణా అంతరాయం వల్ల చమురు సరఫరా దెబ్బతింటుంది.. గ్యాస్, ఇంధన కొరత పలు దేశాల్లో ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ చమురు ధరలు పెరగడంతో పాటు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యే పరిస్థితి రావచ్చు.
ట్రంప్ నాలుకలు ఎన్నో..
అసలు అమెరికా అధ్యక్షుని డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలు, ప్రకటనలు చూస్తుంటే ఆయనకు సంక్షోభానికి తెరదించే ఆలోచన ఏమాత్రం లేనట్లే కనిపి స్తోంది. ఆయన మాటలు ఉద్రిక్తతలను మరింతగా పెంచుతున్నాయి. తాము అమెరికా విధించిన షరతులకు తలొగ్గామని ట్రంప్ చేస్తున్న ప్రకటనలు అన్నీ అవాస్తవాలే అంటున్నారు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్. ఆయన గంట వ్యవధిలోనే పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారని చెబుతున్న ఇరాన్ వాటికి ఖండనలు, వివరణలు కూడా ఇచ్చేసింది. అవి ఇలా ఉన్నాయి..
హర్మూజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉందని ట్రంప్ చెప్పారు.. తమ అనుమతితోనే తెరుస్తామని ఇరాన్ అంటోంది.
నావికాదళ ఆంక్షలు త్వరగా ముగుస్తాయని ట్రంప్ తెలిపారు.. అమెరికా బ్లాకేడ్ కొనసాగు తోందని ఇరాన్ చెప్పింది.
ఇరాన్ యుద్ధంలో ఓడిపోయిందని ట్రంప్ అన్నారు.. తాము యుద్ధంలో నిలబడ్డామని ఇరాన్ స్పష్టం చేసింది.
చర్చలు దాదాపుగా పూర్తయ్యాయని ట్రంప్ తెలపగా.. ఆయన చెప్పిన అంశాలపై చర్చలు జరగలేదని ఇరాన్ చెబుతోంది.
శుద్ధి యురేనియం ఇరాన్ అమెరికాకు తరలి స్తుందని ట్రంప్ చెప్పగా. శుద్ధి చేసిన యురేనియం ఎక్కడికీ తరలించబడదని ఇరాన్ అంటోంది.
హర్మూజ్ ద్వారా అమెరికాకు ఫ్రీ చమురు రాబోతోందని.. ఇరాన్ ఒప్పుకుందని ట్రంప్ చెప్పడంతో అదంతా అబద్ధమేనని ఇరాన్ ప్రకటించింది.
త్వరలోనే ఒప్పందం అని ట్రంప్ చెబుతుండగా.. చర్చలు క్లిష్ట దశలో ఉన్నాయని ఇరాన్ స్పష్టీకరిం చింది.
హర్మూజ్ తెరచినట్లే తెరచి..
అమెరికాతో చర్చల వేళ హర్మూజ్ జలసంధిని తెరిచినట్లు ప్రకటించిన ఇరాన్, కొద్ది గంటల్లోనే తిరిగి మూసేసింది. దాదాపు నెలరోజులకు పైగా హర్మూజ్ మార్గాన్ని దిగ్బంధించిన ఇరాన్ ఏప్రిల్ 17న దానిని తెరుస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై అన్ని రకాల వాణిజ్య నౌకల రాకపోకలకు అనుమతి నిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాలు ఉపిరి పీల్చుకున్నాయి. దీనిపై వెంటనే స్పందించారు ట్రంప్. ఇరాన్కు ధన్యవాదాలు తెలిపిన ట్రంప్.. కాసేపటికి దాన్ని ఇప్పుడు తాము మూసివేస్తున్నట్లు ప్రకటించారు. హర్మూజ్ జలసంధి ఇక తమది అనే సంకేతాలిచ్చి ఇరాన్ను మళ్లీ బెదిరించే యత్నం చేశారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ట్రంప్ తన ఇష్టాను సారం ప్రకటనలు ఇచ్చుకుంటూ పోతున్నారు. అమెరికా దిగ్బంధం కొనసాగితే తాము సహించేది లేదని ఇరాన్ ప్రకటించింది. ఏప్రిల్ 18 నాడు తిరిగి హర్మూజ్ జలసంధిని మూస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాలు మరోసారి తలపట్టుకోవాల్సి వచ్చింది.
అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిపై మరింత పట్టు కోసం ఇరాన్ ప్రణాళికలు, కొత్త చట్టాలను అన్వేషిస్తోంది. ఇప్పటి వరకు ఇరాన్కు నష్టం కలిగించిన ఇజ్రాయెల్ సహా పలు దేశాలపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ సిద్దమైంది. జలసంధిపై నియంత్రణను కట్టుదిట్టం చేసే కొత్త చట్టాన్ని ఇరాన్ రూపొందించి నట్లు తెలుస్తోంది. హార్మూజ్ జలసంధిలో నౌకల భద్రత ఉచితం కాదని ఇరాన్ ఉపాధ్యక్షుడు మహ్మద్ రెజా ఆరిఫ్ అన్నారు. ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ ప్రపంచ దేశాలు తమ నౌకల భద్రతను ఉచితంగా ఆశించడం కుదరదని తేల్చి చెప్పారు.
భారత నౌకలపై కాల్పుల కలకలం
శాంతి చర్చలకు ఆటంకం కారణంగా హర్మూజ్ జలసంధి మరోసారి రణరంగంగా మారింది. రెండు భారత వాణిజ్య నౌకలపై ఇరాన్ గన్ బోట్స్ కాల్పులు జరిపాయి. చమురుతో మన దేశానికి వస్తున్న ఈ నౌకలపై ఒమన్ తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఐఆర్జీసీ ఒక్కసారిగా మెషీన్గన్లతో విరుచుకుపడింది. దీంతో సన్మార్ హెరాల్డ్, జాగ్ ఆర్నావ్ సహా సుమారు 13 భారత నౌకలు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుని హర్మూజ్ జలసంధి నుంచి వెనుదిరిగాయి. వాస్తవానికి ఇరాన్ అనుమతి ఇచ్చిన తర్వాత ఈ నౌకలు ముందుకు కదిలాయి. అయినా ఇలా కాల్పులు జరపడంపై భారత విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీని కార్యాలయా నికి పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలాల్లో భారత జెండా ఉన్న నౌకలపై ఇలాంటి దాడులు సహించబోమని స్పష్టం చేసింది. ఈ ఘటనపై ఇరాన్ కూడా స్పందించింది. భారత నౌకలపై కాల్పులు జరిపింది తమ దళాలేనా అన్న అంశంపై దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించింది. ఈ మేరకు ఆ దేశ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘేయి ఒక ప్రకటన చేశారు.
మరోవైపు గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో ఇరాన్ పతాకంతో ప్రయాణిస్తున్న తౌస్కా అనే వాణిజ్య నౌకపై అమెరికా దళాలు కాల్పులు జరిపి స్వాధీనం చేసు కున్నాయి. ఇరాన్ పతాకంతో వెళుతున్న 900 అడుగుల పొడవున్న రవాణా నౌక తౌస్కా అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని దాటుకొని వెళ్లాలనుకొంది. దీన్ని అమెరికా నౌకాదళ విధ్వంసక నౌక హెచ్చరిక లతో అడ్డుకోబోయింది. ఇరాన్ నావికులు దారికి రాకపోవడంతో దాని ఇంజిన్ రూమ్పై కాల్పులు జరిపి ఆపారు అని ప్రకటించారు ట్రంప్. ఓ నౌక ఇరాన్ పోర్టు వైపు ప్రయాణించబోతే సీజ్ చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ ఘటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా యుద్ధ నౌకల పైకి డ్రోన్లను ప్రయోగించి నట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. అమెరికా నౌకలను తరిమేశామని, ఈ చర్యలు సాయుధ పైరసీగా అంటూ అభివర్ణించింది.
ఇరాన్ మీద ఐఆర్జీసీ పట్టు
అసలు ఇరాన్లో ఏం జరుగుతోంది. అమెరి కాతో చర్చలు విఫలం కావడానికి కారకులు ఎవరు? ఆ దేశం మీద ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వానికి పట్టు లేదా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.
ఇరాన్ సైన్యంతో పాటు దౌత్య చర్చల బృందాలపై అతివాద ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్పస్ (ఐఆర్జీసీ) పట్టు సాధించిందనే వార్తలు వస్తున్నాయి. ఐఆర్జీసీ కమాండర్-ఇన్- చీఫ్ అహ్మద్ వాహిది, ఆయన సన్నిహితులు కలిసి ఇరాన్ సైనిక, దౌత్యపరమైన నిర్ణయాధికారాలను తమ చేతుల్లోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వంటి మితవాద నాయకులను అహ్మద్ వాహిది వర్గం పక్కన పెట్టినట్లు సమాచారం. అమెరికాతో చర్చలు, లెబనాన్ – ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం హర్మూజ్ జలసంధిని తాత్కాలికంగా తిరిగి తెరవ డానికి అబ్బాస్ అరాగ్చీ అంగీకరించారు. అయితే ఈ నిర్ణయాన్ని అహ్మద్ వాహిది వ్యతిరేకిచారు. ఈ నేపథ్యంలో 24 గంటల్లోపే హర్మూజ్ను మళ్లీ మూసివేస్తున్నట్లు ఐఆర్జీసీ సారథ్యంలోని ఇరాన్ మిలిటరీ కమాండ్ మరో కీలక ప్రకటన జారీ చేసింది.
ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మహ్మద్ బాఘర్ జోల్ఘాదర్, మాజీ ఇంటెలీజెన్స్ చీఫ్ హుస్సేన్ తయెబ్ల మద్దతుతో ప్రభావ వంతమైన శక్తిగా ఐఆర్జీసీ చీఫ్ అహ్మద్ వాహిది అవతరించినట్లు చెబుతున్నారు. ఏప్రిల్ 10, 11 తేదీల్లో అమెరికాతో చర్చల కోసం పాకిస్థాన్లోని ఇస్లామాబాద్కు వెళ్లిన ఇరాన్ ప్రతినిధి బృందంలో మహ్మద్ బాఘర్ జోల్ఘాదర్ కూడా ఉన్నారు. అయితే మీడియాలో కేవలం ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాఘెర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చిల పేర్లే ప్రముఖంగా వినిపించాయి. హమాస్, హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూపులకు మద్దతును ఆపాలనే అమెరికా ప్రతిపాదన విషయంలో అరాగ్చీ మెతక వైఖరితో స్పందించారని జోల్ఘాదర్ ఆరోపించి నట్లు సమాచారం. దీంతో వెంటనే టెహ్రాన్కు తిరిగి వచ్చేయాలని ఇరాన్ ప్రతినిధి బృందానికి సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ సన్నిహితుడైన హుస్సేన్ తయెబ్ వర్గీయుల నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఇరాన్లో ప్రస్తుతంకి సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీతో పాటు ఐఆర్జీసీ చీఫ్ అహ్మద్ వాహిదియే కీలక నిర్ణయాలన్నీ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

క్రాంతిదేవ్ మిత్ర
సీనియర్ జర్నలిస్ట్