అంతర్జాతీయ యోగ దినోత్సవం – 2026ను ఘనంగా, ప్రభావవంతంగా నిర్వహించే దిశగా ఆయుష్ మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. గత యోగా దినోత్సవాల అపూర్వ విజయాన్ని, గత ఏడాది(2025)లో సాధించిన విస్తృత ప్రచారం ఆధారంగా అంతర్జాతీయ యోగ దినోత్సవం – 2026 కోసం సమగ్ర దృక్పథాన్ని అనుసరిస్తున్నట్లు ఆ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ‘ఆరోగ్యం, సామరస్యం, సామూహిక శ్రేయస్సు కోసం యోగా ఒక శక్తిమంతమైన సాధనమని, అన్ని మంత్రిత్వ శాఖలు, భాగస్వాముల సమన్వయ ప్రయత్నాలు యోగా అంతర్జాతీయ స్థాయిని మరింత పెంచుతాయని ఆ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా అన్నారు. గత సంవత్సరాల్లో ఏర్పరచిన బలమైన పునాదిపై అంతర్జాతీయ యోగ దినోత్సవం 2026 నిర్మితమవుతోందని అన్నారు. ప్రజా భాగస్వామ్యం, అంతర్జాతీయ సహకారంతో కొత్త కోణాలను ప్రవేశ పెడుతుందని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సం నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మర మయ్యాయి. జాతీయ స్థాయిలో నిర్ణయించిన ముహుర్తం మేరకు ఈ నెల 21వ తేదీ ఉదయం 6 గంటలు సామÖహిక యోగా కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళిక ఖరారైంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఎల్బీ స్టేడియం,గచ్చిబౌలి స్టేడియం. కేబీబఆర్ పార్కు, కన్హాశాంతివనం, పీవీ నర్సింహా రావు మార్గ్, సంజీవయ్య పార్క్, వివిధ యోగా కేంద్రాలలో ప్రత్యేక సామూహిక యోగా శిబిరాలు, తదితర ప్రదేశాలలో యోగా దినోత్సవం నిర్వహిస్తారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం, ఆయుష్ శాఖ,స్థానిక సంస్థల సంయుక్త సహకారంతో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.
యోగా దినోత్సవానికి 50`100 రోజుల పాటు ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలలు, కార్పొరేట్ సంస్థలలో యోగా అవగాహన కార్యక్ర మాలు జరిగాయి. విద్యార్థులు, వృద్ధులు, ఉద్యోగులు.. అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేలా ప్రత్యేక పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని విజయవంతం చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘యోగా కేవలం వ్యాయామం కాదు… అది ఒక సంపూర్ణ జీవన శైలి.కరోనా తరువాత ఆరోగ్యంపై అవగాహనతో పాటు యోగా ప్రాముఖ్యత మరింత పెరిగింది. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు నిత్యం యోగా చేయడం ఎంతో అవసరం. యువత యోగా అలవాటు చేసుకుంటే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది’ అని తమ సందేశంలవో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగా దినోత్సవం నిర్వహణలో గత ఏడాది గిన్నిస్ బుక్ ఘనత సాధిం చిన నేపథ్యంలో ఈసారి రెట్టించిన ఉత్సాహంతో ఈ ఉత్సవ నిర్వహణకు కృషి చేస్తోది. ప్రభుత్వం ‘యోగాంధ్ర-2026’ పేరుతో కోటి మంది భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా 14 రోజుల పాటు (జూన్ 7 నుంచి 21 వరకు) ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. 21వ తేదీన రాజధాని అమరావతిలో జరిగే ప్రధాన కార్యక్రమంలో కృష్ణానదిపై గల బైపాస్ వంతెనపై సుమారు 25 వేల మందితో యోగా ప్రదర్శన నిర్వహింస్తారు. వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా జీవించేందుకు యెగాను జీవన విధానంగా ఎలా మలచుకోవాలి (యోగా ఫర్ హెల్దీ ఏజింగ్)అనే ప్రధాన ఇతివృత్తంతో యోగాంధ్ర’ కార్యక్రమాన్ని తలపెట్టారు. దీనితో పాటు రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఒక్కొక్క విభిన్న ఇతివృత్తంతో ప్రముఖ పర్యాటక ప్రాంతాలు సహా మొత్తం 56 ప్రాంతాల్లో కోటి మందికివ పైగా పాల్గొనేలా యోగా ప్రదర్శనలు ఏర్పాటవుతున్నాయి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర పోర్టల్ ద్వారా ప్రత్యేక రిజిస్ట్రేషన్లు, డిజిటల్ లెర్నింగ్, జియో ట్యాగింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది.మన దేశం ప్రపంచానికి అందించిన అమÖల్య జీవని విధానం యోగా. రోజువారీ జీవితంలో పెరుగుతున్న ఒత్తిళ్లు, ఆందోళనలు, అనారోగ్య సమస్యల పరిష్కారానికి యోగా అత్యుత్తమ ఔషధం’ అని యోగాంధ్ర-2026 పోస్టర్ విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

డా॥ ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్ జర్నలిస్ట్
