ఆంధప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా క్వాంటం వ్యాలీ భారత సాంకేతిక చరిత్రలో సువర్ణ అధ్యాయంగా ప్రారంభమైంది. ఇది భవనాల నిర్మాణానికో, పరిపాలన సౌలభ్యానికో పరిమితం కాదు. రాబోయే తరాలకు దిశానిర్దేశం చేసే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞాన వేదిక. ఫిబ్రవరి 8,2026 న కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్రసింగ్, ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘అమరావతి క్వాంటం వ్యాలీ’ కి చేసిన శంకుస్థాపన కేవలం ఒక శిలాఫలక ఆవిష్కరణ మాత్రమే కాదు. అది ప్రపంచ సాంకేతిక పటంలో భారతదేశాన్ని, మరీ ముఖ్యంగా ఆంధప్రదేశ్ను అగ్రగామిగా నిలబెట్టే మహత్తర ఘట్టం.
అమరావతిలోని క్వాంటం వ్యాలీ శంకుస్థాపన సభాప్రాంగణం ఆ రంగానికి చెందిన సీనియర్ ప్రముఖులు, రాష్ట్ర సీనియర్ అధికారులు, వేలాది మంది విద్యార్థులు, యువకులు, రాజధాని రైతుల సమక్షంలో పండుగ వాతావరణాన్ని తలపించింది. యువత కేరింతల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, •భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్., శాస్త్ర-సాంకేతిక శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరండికర్, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి, ఐబీఎం రీసెర్చి ఇండియా ప్రతినిధి డాక్టర్ అమిత్ సింఘీ, టిసిఎస్ ప్రతినిధి డాక్టర్ హారిక్ విన్, ఎల్అండ్టీ ప్రతినిధి శ్రీ ఎం.వీ. సతీష్ క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ పైలాన్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయా నికి, ‘‘డబుల్ ఇంజిన్’’ అభివృద్ధి విధానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
ఇది కేవలం ఒక భవన శంకుస్థాపన మాత్రమే కాదని,భారత క్వాంటం భవిష్యత్తుకు పునాది రాయి అని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అభివర్ణించారు. ప్రత్యేక జాతీయ క్వాంటం మిషన్ కలిగిన దేశాల సరసన ఈ రోజు భారత్ నిలిచిందని పేర్కొన్నారు. ‘సుమారు రూ.6,000 కోట్ల కేటాయింపుతో ఈ మిషన్ 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 43 సంస్థల్లో విస్తరించి ఉంది. క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్, క్వాంటం సెన్సింగ్, మెట్రాలజీ, క్వాంటం మెటీరియల్స్, పరికరాలపై దృష్టి సారించే నాలుగు థీమాటిక్ కేంద్రాల నిర్వహణలో ఇది ఉంటుంది. ఎనిమిది సంవత్సరాల్లోపు 1,000 ఫిజికల్ క్యూబిట్లతో క్వాంటం కంప్యూటర్లను అభివృద్ధి చేయడం, సురక్షితమైన గ్రౌండ్-టు-గ్రౌండ్ క్వాంటం కమ్యూనికేషన్ నెట్వర్క్లను ఏర్పాటు చేయడం, సుదూర క్వాంటం కమ్యూనికేషన్ను ప్రారంభించడం, 2 వేల కి•లోమీటర్లలో ఇంటర్-సిటీ క్వాంటం కీ పంపిణీని సాధించడం జాతీయ లక్ష్యాల్లో భాగంగా ఉన్నాయి’ అని కేంద్ర మంత్రి వివరించారు. రేపటిలో జీవిస్తూ, ఎల్లుండి గురించి కలలుకనే నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ప్రశంసించారు. గతంలో హైటెక్ సిటీ ద్వారా ఉమ్మడి ఆంధప్రదేశ్లో ఐటీ విప్లవాన్ని తీసుకువచ్చిన చంద్రబాబు దార్శనికతను గుర్తు చేసిందని, ఇప్పుడు క్వాంటం టెక్నాలజీ ద్వారా మరో విప్లవానికి నాంది పలికారని జితేంద్రసింగ్ అన్నారు.
క్వాంటం టెక్నాలజీ అంటే…ఎందుకు అంత ప్రత్యేకం?
సాధారణ ప్రజలకు, విద్యార్థులకు కూడా అర్థమయ్యేలా చెప్పాలంటే… మనం ప్రస్తుతం వాడుతున్న కంప్యూటర్లు, సూపర్ కంప్యూటర్లు ‘బిట్స్’ ఆధారంగా పనిచేస్తాయి. అంటే సమాచారాన్ని సున్నా లేదా ఒకటి రూపంలో నిల్వ చేస్తాయి. కానీ క్వాంటం కంప్యూటర్లు ‘‘క్యూబిట్స్’’ ఆధారంగా పనిచేస్తాయి. ఇవి ఏకకాలంలో సున్నా, ఒకటిగా కూడా ఉండ గలవు. దీనివల్ల సాధారణ సూపర్ కంప్యూటర్లు కొన్ని వేల సంవత్సరాల్లో చేయగలిగే గణనలను, క్వాంటం కంప్యూటర్లు కేవలం కొన్ని నిమిషాల్లో లేదా సెకన్లలో పూర్తి చేయగలుగుతాయి. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చెప్పినట్లుగా, క్వాంటం టెక్నాలజీ అనేది ఇప్పుడు ఒక ఐచ్ఛికం కాదు, అది ఒక వ్యూహాత్మక అవసరం. ప్రపంచవ్యాప్తంగా చైనా, అమెరికా వంటి దేశాలు ఈ రంగంలో పోటీపడు తున్నప్పుడు, భారత్ వెనుకబడిపోకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. ఆరు వేల కోట్లతో ‘‘జాతీయ క్వాంటం మిషన్’’ను చేపట్టింది. అందులో భాగంగానే అమరావతిని ఎంచుకోవడం విశేషం.
మానవాళికి వరం
ఈ సాంకేతికత కేవలం కంప్యూటర్ల వేగాన్ని పెంచడానికే పరిమితం కాదు. దీని ఉపయోగాలు అత్యంత విస్తృతమైనవి.విప్లవాత్మకమైనవి.
1.వైద్య రంగం (హెల్త్ కేర్): క్వాంటం టెక్నాలజీ ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులకు చికిత్స చేయడంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. శరీరంలోని ఇతర ఆరోగ్యకరమైన అవయవాలకు, కణజాలానికి ఎటువంటి హానీ కలగకుండా, కేవలం కణితులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని రేడియేషన్ చికిత్స అందించడం సాధ్యమవుతుంది. దీనివల్ల రోగులు త్వరగా కోలుకుంటారు.
2.రక్షణ రంగం- సైబర్ సెక్యూరిటీ: దేశ రక్షణ వ్యవస్థలో ఇది కీలక పాత్ర పోషించనుంది. శత్రు దేశాలు మన సమాచారాన్ని దొంగిలించకుండా లేదా హ్యాక్ చేయకుండా ‘‘క్వాంటం ఎన్క్రిప్షన్’’ ద్వారా అభేద్యమైన భద్రతను కల్పించవచ్చు. ఈ ఎన్క్రిప్షన్ను ఛేదించడం ప్రస్తుతమున్న ఏ సూపర్ కంప్యూటర్కూ సాధ్యం కాదు.
3. కమ్యూనికేషన్: ఉపగ్రహాల ద్వారా జరిగే సమాచార మార్పిడిని, గ్రౌండ్-టు-గ్రౌండ్ కమ్యూని కేషన్ను అత్యంత సురక్షితంగా మార్చవచ్చు. సుదూర ప్రాంతాలకు కూడా క్షణాల్లో సురక్షితమైన సమాచా రాన్ని పంపగలగడం దీని ప్రత్యేకత.
4. ఔషధ తయారీ : కొత్త రకాల మందులను, రసాయనాలను కనుగొనడంలో క్వాంటం సిమ్యులేషన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది ఫార్మా రంగంలో సమరీరీల మార్పులకు దారితీస్తుంది.
ఆంధప్రదేశ్కు, అమరావతికి ఒనగూరే ప్రయోజనాలు
క్వాంటం వ్యాలీ ఏర్పాటు ఆంధప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఆర్థిక, సాంకేతిక మలుపు. అమరావతిలో క్వాంటం వ్యాలీ స్థాపన రాష్ట్రానికి అనేక విధాలుగా ప్రయోజనకరం. వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అధునాతన సాంకేతిక రంగంలో నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి తయారవు తుంది. పరిశోధన అభివృద్ధి రంగంలో రాష్ట్రం ముందంజలోకి వెళుతుంది. దేశీ విదేశీ పెట్టుబడులు రాష్ట్రంలోకి ప్రవహిస్తాయి. విద్యా సంస్థలకు అత్యాధునిక పరిశోధన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. విద్యార్థులు ప్రపంచస్థాయి సాంకేతికతతో పరిచయం సాధిస్తారు. స్టార్టప్ సంస్కృతి బలపడు తుంది. ఆవిష్కరణలకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఏర్పడుతుంది. రాష్ట్రం సమగ్ర ఆర్థిక అభివృద్ధి సాధిస్తుంది. ఆరోగ్య సంరక్షణ రంగంలో రాష్ట్రంలోని ఆసుపత్రులు అత్యాధునిక చికిత్సలను అందించగలుగుతాయి. వ్యవసాయ రంగంలో కృషి రంగంలో వాతావరణ అంచనాలు మెరుగు పడతాయి. పంట నష్టాలను తగ్గించడానికి మెరుగైన సలహాలు లభిస్తాయి. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో రాష్ట్రం ముఖ్య పాత్ర పోషిస్తుంది.
అంతర్జాతీయంగా పెట్టుబడుల వెల్లువ
శంకుస్థాపన రోజునే 15 ప్రతిష్ఠాత్మక సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చు కుంది. ఇందులో టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. ఐబీఎం-టీసీఎస్ క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకావడం వల్ల ప్రపంచ స్థాయి పరిశోధనలు అమరావతిలోనే జరుగు తాయి. క్వాంటం హార్డ్వేర్, సాఫ్ట్వేర్, సెక్యూరిటీ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఐక్యూ లీప్, క్యూబిట్ ఫోర్స్ వంటి సంస్థలు ముందుకు రావడం శుభపరిణామం. సాంకేతికత కొత్తదైనప్పుడు, దానికి సంబంధించిన నిపుణుల కొరత ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది. అమరావతి ఈ కొరతను తీర్చే హబ్గా మారనుంది. ‘‘వాషింగ్టన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్టెమ్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ రీసెర్చ్’’ (వైజర్) సంస్థ రాబోయే ఐదేళ్లలో 31 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తామని ప్రకటించడం సాధారణ విషయం కాదు. దీనివల్ల రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. క్వాంటం టాలెంట్ హబ్ ద్వారా మన యువత అంతర్జాతీయ స్థాయి పోటీని తట్టుకునేలా తయారవుతారు. ఎస్ఆర్ఎమ్ విశ్వవిద్యాలయం, ఐఐటీ మద్రాస్, ఐఐటీ తిరుపతి వంటి విద్యాసంస్థల భాగస్వామ్యంతో పరిశోధనలు ముమ్మరంగా సాగుతాయి. ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ పార్క్ తరహాలో అమరావతిలో కూడా అంకుర సంస్థలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేసే వ్యవస్థ ఏర్పడుతుంది.
గతంలో ఐటీ రంగంలోకి భారత్ ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ, క్వాంటం టెక్నాలజీ, కృత్రిమ మేధ వంటి రంగాల్లో భారత్ ఇప్పుడు ముందంజలో ఉంది. అమరావతిలో ఈ ఎకో-సిస్టమ్ అభివృద్ధి చెందడం వల్ల, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున ఊతం లభిస్తుంది. హార్డ్వేర్ తయారీ, సాఫ్ట్వేర్ అభివృద్ధి ద్వారా రాష్ట్రం ఎగుమతుల కేంద్రంగా మారే అవకాశం ఉంది.
నాయకత్వ దార్శనికత -కేంద్ర ప్రభుత్వ సహకారం
ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సత్సంబంధాలు కీలక పాత్ర పోషించాయి. విశాఖపట్నంలో రెండు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న జాతీయ సముద్ర విజ్ఞాన కేంద్రం ప్రాజెక్టును, ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే పూర్తి చేయడాన్ని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఉదహరించారు. ఇది పరిపాలన సామర్థ్యానికి నిదర్శనం. చంద్రబాబు నాయుడు ఐటీ రంగాన్ని ప్రోత్సహించడంలో చూపించే చొరవ, దానికి తోడు కేంద్రం అందిస్తున్న ‘నేషనల్ క్వాంటం మిషన్’ నిధులు ఆంధప్రదేశ్ను సాంకేతిక రంగంలో అగ్రగామిగా నిలబెట్టనున్నాయి అమరావతి క్వాంటం వ్యాలీ కేవలం ఒక ప్రభుత్వ ప్రాజెక్టు కాదు, అది ఆంధప్రదేశ్ యువత భవిష్యత్తుకు భరోసా. ‘వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్య సాధనలో ఆంధప్రదేశ్ ఒక కీలక భాగస్వామిగా మారుతోందన డానికి ఇది నిదర్శనం. క్వాంటం టెక్నాలజీ వంటి అత్యాధునిక రంగంలో అడుగుపెట్టడం ద్వారా, రాబోయే రోజుల్లో రక్షణ, వైద్య, వ్యవసాయ, సమాచార రంగాల్లో విప్లవాత్మక మార్పులకు అమరావతి కేంద్రం కానుంది. ప్రపంచం మొత్తం క్వాంటం కంప్యూటింగ్ వైపు చూస్తున్న తరుణంలో, ఆ టెక్నాలజీకి చిరునామాగా అమరావతి మారడం రాష్ట్ర ప్రజ లందరికీ గర్వకారణం. సరైన ప్రణాళిక, ప్రభుత్వ చిత్తశుద్ధి, పారిశ్రామిక వర్గాల సహకారంతో అమరావతి త్వరలోనే ‘‘గ్లోబల్ క్వాంటం క్యాపిటల్’’గా అవతరించడం ఖాయంగాచెప్పవచ్చు.

తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్