భారత్ ప్రయోజనాల పరిరక్షణ కోసం వాణిజ్యం, పెట్టుబడులు, కరెన్సీలు, భౌగోళిక-రాజకీయ కూటములు కట్టడంపై ఒక దీర్ఘకాలికమైన విధానపరమైన చట్రానికి ప్రాధాన్యతను ఇవ్వాలి.
అమెరికా అధ్యక్షుడు భారత్ పట్ల అనుసరిస్తున్న ప్రతికూలమైన సుంకాల విధానం డోలాయమానంలో కొట్టుమిట్టాడుతోంది. అది కార్యాచరణలో నిలకడలేని తత్వాన్ని, క్రూరత్వాన్ని సూచిస్తోంది.
ఏప్రిల్, 2025లో 10 శాతం కనీసం సుంకాల ప్రతిపాదనతో అత్యంత అనుకూలమైన వాణిజ్య మిత్రదేశంగా పరిగణనలో ఉన్న భారతదేశం అనతికాంలోనే 50 శాతం అత్యధిక సుంకాన్ని ఆకర్షించే శత్రుదేశాల జాబితాలోకి చేరిపోయింది. గణంకాలు, డేటాను కాసేపు పక్కన పెడితే.. భారత్ లో కొద్ది రోజులుగా సాయంత్రం నాలుగు గంటలు అవుతుందంటే చాలు గడబిడ, గందరగోళం, ఆందోళన, ఆదుర్దా చోటు చేసుకుంటున్నాయి. ట్రంప్ మొదటిసారిగా సరిగ్గా అదే సమయానికి 25 శాతం సుంకాన్ని ప్రకటించారు. అనంతరం అదే సమయానికి ఉద్రిక్తతలకు ఊతమిస్తున్నట్టుగా 50 శాతం సుంకాన్ని ప్రకటించారు. ట్రంప్ వైఖరికి అలవాటుపడినవారు ఈ నాటకీయ పరిణామాన్ని పరిగణనలోకి తీసుకు న్నారు. ఎందుకంటే ట్రంప్ ఇటీవలి కాలంలో ఎవరో ఒక వాణిజ్య భాగస్వామ్యాన్ని లక్ష్యంగా చేసుకుంటు న్నారు కాబట్టి. గత కొద్ది రోజులుగా అది భారత్ వంతుగా మారింది. ట్రంప్ సుంకాల అమలుకు 21 రోజుల గడువును విధించడం ద్వారా ఏదైనా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే ముందు మంతనాలకు తాసు సిద్ధం అనే సంకేతాలను ఇచ్చారు. ఆ విధంగా భారత్ తరఫున సంప్రదింపులు జరుపు తున్నవారితో మనకు ప్రతికూలమైన వాణిజ్య ఒప్పందంపై సంతకం పెట్టేలా ఒత్తిడి తేవడానికి ఇదొక మార్గంగా ట్రంప్ భావించారు. అలాంటి ఒత్తిడికి తలొగ్గి వారే కనుక సంతకం పెట్టిన పక్షంలో భారత్లో వ్యవసాయం, మత్స్యరంగం, పాడి పరిశ్రమలో అమెరికా చొరబడటానికి దారి ఇచ్చినట్టే. భారత్తో ఏదోలా సంతకం పెట్టించడంలో ట్రంప్ ఆశావాదం అవధులు దాటింది. అది ఆయన చేసిన ప్రకటనల్లో ప్రస్ఫుటంగా కనిపించింది. వాటిలో ఒక బెదిరింపు ధోరణి కూడా దాగి ఉంది. అమెరికా అధ్యక్షుడు సమయం మించిపోతున్నది అన్నట్టుగా మాట్లాడుతూ ‘‘ఇక ఎనిమిది గంటలు మాత్రమే మిగిలి ఉంది.. ఏం జరుగుతుందో చూద్దాం.. మున్ముందు చాలా జరుగుతాయి. వాటిని మీరు ప్రత్యక్షంగా చూస్తారు. మరికొన్ని ఆంక్షలు (భారత్పైన) ఉంటాయి’’ అని అన్నారు.
ట్రంప్ సూచించిన ఎనిమిది గంటల గడువు తీవ్రంగా మంతనాలు జరుగుతున్న వేళ ‘వేచి చూడు, అదను చూసి దాడి చేయి’ అనే ఆయన వైఖరిని వెల్లడిస్తోంది.
ట్రంప్ ఎన్ని నాటకాలాడుతున్నప్పటికీ భారత్ ఆచితూచి స్పందించింది. స్పందించడంలో ఎంతో పరిణతిని ప్రదర్శించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న తరుణంలో పార్లమెంట్ లోపలా బయటా ఎంతో హుందాతనాన్ని ప్రదర్శిం చింది. 50 శాతం సుంకాలతో ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు హేతుబద్ధంగా లేదని, అవాంఛనీయమైనదని, అకారణమైందని భారత్ పేర్కొంది.
ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి అన్నట్టుగా సుంకాలతో ట్రంప్ సాగిస్తున్న తంత్రాలు, వాటి తదనంతర పరిణామాలపై స్పందించారు. ట్రంప్ విధించిన సుంకాలు కార్మికులతో ముడిపడిన రంగం, గ్రామీణ రంగంపై పెద్ద ఎత్తున దుష్ప్రభావం చూపు తాయి. కనుక ఆ ప్రభావం లేకుండా చూడటానికి తాను వ్యక్తిగతంగా ఎంతటి భారీ మూల్యం చెల్లించుకోవడానికి సుముఖంగా ఉన్నట్టు మోదీ స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ మొదటగా 140 కోట్ల మందికి పైగా భారతీయులపై వాణిజ్య ఒప్పందం, సుంకాల రూపేణా పడే భారాన్ని తన వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించారు. ప్రధాని ఇటీవల జరిగిన ఎం.ఎస్. స్వామినాథన్ అంతర్జాతీయ శతాబ్ది సదస్సులో చేసిన ప్రకటన అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. రైతులను కాపాడుకోవడంలోనూ, గ్రామీణ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించుకోవడంలోనూ, కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్న పారిశ్రామిక రంగాలకు కాపుకాయడంలోనూ రాజీపడటానికి ఆయన ఏ మాత్రం సుముఖంగా లేరు.
అంతేకాకుండా మోదీ అమెరికా విషయంలో రాజీకి అంగీకరించని విపక్షాల వైఖరిని దృష్టిలో ఉంచుకొని రాజకీయ విమర్శను సైతం ఎదుర్కోవ డానికి సుము•ంగా ఉన్నారు. తదనంతర పరిణామాలకు వ్యక్తిగతంగా భారీ మూల్యాన్ని చెల్లించడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రధాన మంత్రికి ఓ విషయం పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. అదేమిటంటే అమెరికాకు భారత వ్యవసాయ రంగాన్ని అప్పగించిన పక్షంలో అది ఆర్థికంగా ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చదు అంతేకాకుండా కీలకమైన హిందూ ఓటు బ్యాంకుకు, సంఘపరివార్కు, సంబంధిత వ్యవస్థకు రాజకీయంగా ఏ మాత్రం గిట్టుబాటుకాదు.
వాస్తవిక అధ్యయనం ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరానికి సుంకాలు 25శాతం వద్ద స్థిరపడిన పక్షంలో 0.2శాతం నుంచి 0.4శాతం మేర స్థూల దేశీయోత్పత్తి-జీడీపీ వృద్ధిపై పడే దుష్ప్రభావంతో మోదీ సర్కారు వ్యవహరించాల్సి ఉంటుంది.
అగ్రస్థాయి అధ్యయనకారుల అంచనా ప్రకారం భారత్ నుంచి అమెరికాకు 86.5 బిలియన్ డాలర్ల విలువైన వార్షిక సరకు ఎగుమతులు పోటీపడలేనివిగా లేకుంటే లాభాపేక్షకు నోచుకోనివిగా మిగిలిపోతాయి.
భారత్కు అతి పెద్ద మార్కెట్గా అమెరికా ఉంది. భారత్ అంతర్జాతీయంగా చేసే సరకుల ఎగుమతుల్లో దాదాపు 18 శాతం అమెరికాకు చెందినవి. అది జీడీపీలో 2.2 శాతంగా ఉంది. ఆ కారణంతో సమీప భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో పీలికలు కనిపించడం మొదలు కావొచ్చు.
ప్రధాని నరేంద్రమోదీ భారత్ జాతీయ ప్రయోజ నాల పరిరక్షణకు అచంచలమైన నిబద్థతను చూప డంతో అమెరికాతో భారత్ తరఫున సంప్రదింపులు జరుపుతున్న వారు తేలికగా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రతిపాదిత 50 శాతం సుంకాలు ఎట్టకేలకు అమల్లోకి వచ్చినపక్షంలో అది అప్రకటితమైన వాణిజ్య ఆంక్షలుగా రూపాంతరం చెందవచ్చు. లేకుంటే భారత్కు వ్యాపారానికి సంబంధించిన ఒక నిషేధాజ్ఞగా పరిణమించవచ్చు. ఫలితంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బ తినవచ్చు.
సుంకాలకు దీటుగా 10 మార్గాంతరాలు
భారత్, అమెరికా విధించిన సుంకాలకు దీటుగా 10 విషయాలను అమల్లోకి పెట్టవచ్చు
- అమెరికా నుంచి ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్ విమానాలను భారత్ కొనుగోలు చేయకపోవచ్చు ననే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే.. ఈ జెట్ విమానాలను విక్రయించడానికి అమెరికా తహ తహలాడిపోతోంది. కానీ దీనికి సంబంధించిన లాంఛనపూర్వకమైన మంతనాలు ఇప్పటివరకు మొదలు కాలేదు. ఎప్పుడు మొదలవుతాయనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు.
- భారత్ అమెరికా నుంచి దిగుమతి అయ్యే 28 ఉత్పత్తులపై ప్రతీకార సుంకాల విధింపును పరిగణనలోకి తీసుకోవచ్చు. ఆ ఉత్పత్తుల్లో ఆపిల్స్, వాల్నట్స్ ఉన్నాయి. దీనికి 2019లో భారతీయ ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతిగా భారత్ సుంకాలు విధించిన వైనాన్ని ఒక నిదర్శనంగా తీసుకోవచ్చు.
- అమెరికా కనుక భారత్ పట్ల తన వాణిజ్య, సుంకాల విధానాలను తిరగరాయని పక్షంలో అది ఇరుదేశాల మధ్య తెగదెంపులకు దారి తీయవచ్చు.
- పాలక పక్షం స్వదేశీ అంశంపై విస్తృతమైన ప్రచారానికి నాంది పలకవచ్చు. ప్రభుత్వం స్థానికతకు పెద్ద పీట వేయవచ్చు. మేడిన్ ఇండియా ఉత్పత్తులు, సేవల వైపు మొగ్గు చూపవచ్చు.
- ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశీ ఉద్యమాన్ని చేపట్టడానికి సామాజిక, ఆర్థిక రంగాలకు చెందిన ప్రజలను సమీకరించవచ్చు.
- భారత్ వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థికం, భౌగోళిక-వ్యూహాత్మక సంబంధాలను పునర్ వ్యవస్థీకరించుకునే అవకాశం ఉంది. రష్యా, చైనా, తదితర దేశాలతో సంబంధాలను మరింత వృద్ధి చేసుకోవడం ద్వారా అమెరికాకు దీటుగా సమతూకం చేసుకోవచ్చు. అమెరికా బ్రెజిల్ లాంటి దేశాలకు కూడా భారీగా సుంకాలను వడ్డించింది. కనుక భారత్ బ్రెజిల్ లాంటి దేశాలతో జట్టు కట్టడాన్ని ఒక ప్రత్యామ్నయంగా భావించవచ్చు.
- ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు కాలపరీక్షకు తట్టుకునే విదేశాంగ విధానాన్ని విస్తరించుకోవడానికి దారి తీయవచ్చు. అది వ్యూహాత్మక స్వయంప్రతిపత్తితో కూడుకున్నది. భారత్ ప్రతీకార, ఆత్మరక్షణ ప్రయోజనాలను కాపాడుతుంది. దక్షిణ-దక్షిణ వాణిజ్య ఒడంబడికను ప్రోత్సహించడానికి ఇదే సరైన సమయం అవుతుంది.
- భారత్ అంతర్జాతీయ ఒడంబడిక కోసమని తన విధానపరమైన చట్రాన్ని మరింత పదునుపెట్టు కోవడానికి రానున్న షాంఘై సహకార సంస్థ – ఎస్సీవో, క్వాడ్, బ్రిక్స్ సదస్సులు ఉపకరిస్తాయి.
- ఒక స్వతంత్రమైన ఆర్థిక నిర్మాణానికి రూపకల్పన, చెల్లింపుల్లో వైవిధ్యం కోసమని అమెరికా డాలర్తో తెగదెంపులు లేదా త్వరితగతిన బ్రిక్స్ కరెన్సీని రంగంలోకి దించడాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు.
- కరెన్సీ, చమురుపై ఒక మధ్యకాలిక, దీర్ఘకాలిక విధానాన్ని తీసుకొని రావచ్చు.
కె.ఎ.బదరీనాథ్
డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్,
సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అండ్
హోలిస్టిక్ స్టడీస్, న్యూఢిల్లీ.