అక్టోబర్‌ 16‌న దేవీనవరాత్రులు ప్రారంభం సందర్భంగా..

దశవిధ పాపాలను హరించి, దుర్గతులను దూరం చేసి సద్గతులను ప్రసాదించే పండుగ ‘దశహరా’. అదే దసరా. దుష్టశిక్షణకు, శిష్ట రక్షణకు ప్రతీక. లోకకంటకుల పట్ల రౌద్రం ప్రదర్శించిన జగన్మాత నమ్మిన వారికి కొంగు బంగారమై కరుణ కురిపిస్తూ ‘అమ్మలగన్న అమ్మ’గా దేశవిదేశాల్లో పూజలందుకుంటోంది. స్వాతంత్య్ర సముపార్జనకు దుర్గాపూజ ఎంతగానో ఉపకరించింది. ప్రజలను సంఘటితపరచి చైతన్యపరచేందుకు జాతీయ నాయకులు దుర్గాపూజను వేదికగా చేసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో అమ్మవారి విగ్రహాలు నెలకొల్పి ఘనంగా పూజలు నిర్వహించారు. అదే ఆనవాయితి నేటికి కొనసాగుతోంది.

విజయదశమిని ‘దసరా’ అని అంటారు. దశవిధ పాపాలను హరించేది కనుక ‘దశహరా’అనే పేరువచ్చిందని, కాలక్రమంలో ‘దసరా’గా వాడుకలోకి వచ్చిందని పెద్దలు అంటారు. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి అర్చిస్తారు. బాలాత్రిపురసుందరి, మహాలక్ష్మి, గాయత్రిమాత, అన్నపూర్ణేశ్వరి, మహాకాళి, లలితాంబ, సరస్వతి, మహాదుర్గా, మహిషాసురమర్ధని, రాజరాజేశ్వరీదేవి రూపాలతో అమ్మవారిని ఆరాధిస్తారు. గణపతి నవరాత్రుల మాదిరిగానే దేవీ నవరాత్రులకు పెద్ద విగ్రహాలు ప్రతిష్ఠించి చివరిరోజున నిమజ్జనం చేస్తారు. దేశవ్యాప్తంగా ఊరూవాడా ఏకమై జరుపుకునే పండుగ. గ్రామాల నుంచి నగరాల వరకు తాత్కాలికంగా ఏర్పాటైన మండపాల్లో భక్తుల రద్దీతో కిటకిటలాడతాయి.

ఒకప్పుడు దేవీనవరాత్రులను వసంత రుతువులో (చైత్రమాసం)లో నిర్వహించేవారట. రామాయణ కాలం వరకు ఆ విధానం ఉండేదట. రావణుడితో యుద్ధ సమయంలో శ్రీరామచంద్రుడు అనివార్యంగా ఆశ్వయుజ మాసంలో చండీహోమాన్ని నిర్వహించి దుర్గాదేవి అనుగ్రహానికి పాత్రుడయ్యాడని, నాటి నుంచి శరదృతువులో నవరాత్రులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, అందుకే వీటిని శరన్నవరాత్రులుగా వ్యహరిస్తున్నారని ప్రతీతి. అమ్మవారిని చైత్రమాసంలో పూజించడమే సరైనదని, ఆశ్వయుజంలో అర్చించడం అంటే అమ్మవారిని అకాలంలో నిద్రలేపడమేనని (అకాల్‌ ‌బోధొ) బెంగాలీలు కొందరు విశ్వసిస్తారు. నవరాత్రుల ప్రాశస్త్యంలో భాగంగా ఒక పురాణగాథను చెబుతారు. కృతయుగంలో సుకేతనుడనే రాజు జ్ఞాతుల వల్ల రాజ్యం కోల్పోయి అడవుల పాలు కాగా, అంగీరస రుషి ఆయనకు నవరాత్రి పూజావిధులు ఉపదేశించారని, దాన్ని ఆచరించిన రాజు పూర్వవైభవం పొందాడని కథనం. దీన్ని బట్టి త్రిమాతలను మూడేసి రోజులు అర్చిస్తారు. అలా అవకాశం లేనివారు చివరి రోజున దేవీత్రయాన్ని పూజిస్తారు. అందుకే ఈ తిథిని ‘మహానవమి’ అంటారు.

నవరాత్రులను శాస్త్రోక్తంగా నిర్వహించాలనుకునే వారు పాడ్యమినాడు కలశస్థాపనతో ఉపక్రమిస్తారు. ఆయా తిథుల్లో అమ్మవారి అవతారాలకు సంబంధించిన అష్టోత్తర, సహస్రనామాలు, పూజాద్రవ్యాలతో అర్చించి, శక్తికొద్దీ నైవేద్యాలు సమర్పిస్తారు. విదియ, తదియల్లో చక్కెర, పాలు నివేదించినా, అమ్మవారికి ఇష్టమైన పాయసాన్ని ఈ మాసమంతా ఆరగింపుగా సమర్పిస్తారు.

నవరాత్రి వేడుకలు

దసరా వేడుకలకు ఘన చరిత్ర ఉంది. విజయనగరం రాజులు హంపీలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారట. ఆ సామ్రాజ్యం పతనం తరువాత మైసూర్‌ ‌మహారాజులు (వడయార్‌ ‌రాజవంశీయులు) వీటిని అందిపుచ్చుకున్నారు. 17వ శతాబ్ది తొలినాళ్లలో ఈ ఉత్సవాలను శ్రీరంగ పట్టణంలో నిర్వహించేవారని, మూడవ కృష్ణరాజ వడయార్‌ ‌హయాంలో (1805 నుంచి) ఇవి మైసూరుకు మారాయని చరిత్ర చెబుతోంది. ఈ నవవరాత్రుల సందర్భంగా రాజవంశీయుల ఇలవేల్పు చాముండేశ్వరీ దేవిని 750 కిలోల బంగారంతో నిర్మించిన మండపంపై ఉంచి అర్చిస్తారు.

కోల్‌కతాలోని కాళీఘాట్‌ ‌ప్రాంతంలోని కాళీ ఆలయంలో (కలకత్తా కాళీ), దక్షిణేశ్వర్‌ ‌ప్రాంతంలో హుగ్లీ నదీతీరంలోని కాళీమాత (భవతారిణి మాత) ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. జగత్‌ ‌ప్రసిద్ధమైన కలకత్తా కాళీ మాత దర్శనానికి దేశవిదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక్కడే కాదు ఆ రాష్ట్రమంతా ఆ పండుగ సమయంలో కోలాహలంగా మారుతుంది. రావణునితో యుద్ధంలో రాముడి విజయానికి చిహ్నంగా ‘రామ్‌లీలా’ పేరిట ఉత్తరాదిలో రావణదహన ఘట్టాన్ని అట్టహాసంగా నిర్వహిస్తారు. భారీగా రూపొందించిన రావణ, కుంభకర్ణ, మేఘనాథుల దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని పరవురామేశ్వర ఆలయంలో లభించిన  ఆరవ శతాబ్దం నాటి శిల్పం ఆధారంగా దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహించేవారని తెలుస్తోంది బెంగాల్‌, అస్సాం రాష్ట్రాల్లో తమ ఆడపడుచు పార్వతీదేవి పుట్టింటికి వచ్చినట్లుగా భావించి పండుగ జరుపుకుంటారు. గుజరాత్‌లో దాండియా నృత్యం చేయడం సంప్రదాయం. శ్రీకృష్ణుడి కోడలు ఉష (అనిరుద్ధుని భార్య) ఈ నాట్యాన్ని ప్రవేశపెట్టిందని అక్కడి వారి విశ్వాసం. శ్రీకృష్ణుని లీలలు, ఆదిపరాశక్తి గాథలను ఆలపిస్తూ నృత్యం చేస్తారు.

హిమాచల్‌‌ప్రదేశ్‌లోని కులు ప్రాంతంలో దసరా వేడుకలు విలక్షణంగా ఉంటాయి. ఇతర ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు విజయదశమితో ముగిస్తే, అక్కడ ఆ రోజు ప్రారంభమై వారం పాటు కొనసాగుతాయి. విదేశాల్లోనూ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. నేపాల్‌లో ఈ పండుగను ‘దసైన్‌’‌గా పిలుచుకుంటారు. బంగ్లాదేశ్‌ ‌రాజధాని ఢాకాలో ఢా•కేశ్వరి ఆలయంతో పాటు ఇతర ఆలయాల్లోనూ, సింగపూర్‌, ‌మలేషియా, బ్రిటన్‌, అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో, జర్మనీ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌లో స్థిరపడిన భారతీయులు ఈ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించుకుంటారు.

మనకు సంక్రాంతి పండుగలాంటిదే ఉత్తరాది వారికి దసరా వ్యయసాయ పండుగ. వారు దేవీనవరాత్రుల ప్రారంభం రోజున స్థానికంగా పండే గోధుమలు, బార్లీ వంటి ధాన్యాన్ని మట్టికుండలో పోసి, దసరా నాటికి మొలకెత్తిన వాటిని చెరువులు లేదా నదులలో నిమజ్జనం చేస్తారు. కశ్మీర్‌, ‌పంజాబ్‌, ‌హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ‌పశ్చిమ బిహార్‌ ‌ప్రాంతాల్లో ఈ ఆచారాన్ని పాటిస్తారు.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. దక్షయజ్ఞం సందర్భంలో సతీదేవి కల్పించుకున్న యోగాగ్ని ఫలితంగా ఆమె శరీరభాగాలు పడిన ప్రాంతాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధ•మయ్యాయి. అవి అష్టాదశ పీఠాలుగా అలరారుతున్నాయి.  వాటిలో నాలుగు పీఠాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అలంపురం జోగులాంబ (తెలంగాణ), శ్రీశైలం భ్రమరాంబ, పీఠికాపురం పురహుతాదేవి, దాక్షారామం మాణిక్యాంబ (ఆంధప్రదేశ్‌). ‌విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన  కనకదుర్గమ్మ, శ్రీశైలంలోని  భ్రమరాంబికాదేవి, అలంపురంలోని జోగులాంబ దేవికి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. విజయవాడ కృష్ణానదిలో కనక దుర్గమ్మకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. దసరా అనగానే వెంటనే స్ఫురించే క్షేత్రాలు ఇవే అయినా అన్ని ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో నవరాత్రులను విశేషంగా నిర్వహిస్తారు.

బొడ్డెమ్మ / బతుకమ్మ

శరన్నవరాత్రుల్లో మరో ప్రధాన అంశం బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలు. తెలంగాణ ప్రాంతంలో మహిళలకు ‘బొడ్డెమ్మ, బతుకమ్మ’ పెద్ద పండుగ. ఈ పండుగకు దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. దీనిని ఆ రాష్ట్ర ప్రభుత్వం ‘రాష్ట్ర పండుగ’గా గుర్తించింది. బొడ్డెమ్మను పూజించడం అంటే ప్రకృతిని పూజించడమేనని భావిస్తారు. తెలంగాణ ప్రాంతంలో ‘బొడ్డి’ అంటే చిన్నపిల్ల అని అర్థం. మంచి భర్త లభించాలని కోరుతూ పెళ్లీడు పిల్లలు భాద్రపద బహుళ పంచమి లేదా దశమి నుంచి మహాలయ అమావాస్య వరకు ‘బొడ్డెమ్మ’ ఆడతారు (అధిక ఆశ్వయుజం వస్తే నిజ మాసం తిథుల ప్రకారం కార్యక్రమం ఆరంభ, ముగింపులు ఉంటాయి). బొడ్డెమ్మ పండుగను శరన్నవరాత్రులకు ముందు తొమ్మిది రోజులు జరుపుతారు. భాద్రపద బహుళ పంచమి నాడు బొడ్డెమ్మను తయారు చేస్తారు. ఆమెను వివిధ రూపాలుగా తీర్చిదిద్దుతారు. పసుపుతో తయారు చేయడం ఒక పద్ధతికాగా, పుట్టమన్నుతో బొడ్డెమ్మను చేసి చుట్టూ పందిరి వేస్తారు. దీన్ని పందిరి బొడ్డెమ్మ అంటారు. చిన్న గుంతతీసి, దాని చుట్టూ పుట్టమన్నుతో గోపురం ఆకారంలో నిర్మిస్తారు. లేదా చెక్కపై పుట్ట మన్నుతో ఐదు లేదా ఏడు దొంతర్లుగా గోపురం ఆకారంలో నిర్మిస్తారు. దానిపైన తులసిమొక్కను అలంకరిస్తారు. చాలా గ్రామాల్లో  బొడ్రాయి వద్ద,  ఆలయాల వద్ద బొడ్డెమ్మను ఆడతారు. సాధారణంగా బతుకమ్మ పాటలనే ఇప్పుడూ పాడతారు. ఈ పండుగ ముగిసిన మరునాడు బతుకమ్మ పండుగ మొదలవుతుంది. నవరాత్రులు ముగిసిన తర్వాత బొడ్డెమ్మను బతుకమ్మ తరహాలోనే నిమజ్జనం చేస్తారు.

బతుకమ్మను బతుకునిచ్చే అమ్మగా భావిస్తారు. తంగెడు, మోదుగ, గన్నేరు, తామర, బంతి, కనకాంబరం, నిత్యమల్లి, గానుగు తదితర పూవులతో బతుకమ్మను ఏడు పొరలుగా వలయాకారంలో అలంకరిస్తారు. స్త్రీలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ చేతులు తడుతూ, పాటలు పాడతారు. పాటలకు అనుగుణంగా కోలాటాలు వేస్తారు. ఈ పాటలు జానపద సాహిత్యానికి అద్దం పడతాయి. రామాయణ, భాగవతాది కథలను జానపద బాణీలో ఆలపిస్తారు. ‘త్రిమాత’ల స్వరూపంగా పూజిస్తారు. ముఖ్యంగా ఈ పండుగ సందర్భంగా పార్వతి ఆడపడచుగా పుట్టింటికి వచ్చిందని, నిమజ్జనం పక్రియతో అమెను మెట్టినింటికి తిరిగి పంపినట్లుగా భావిస్తారు. లక్ష్మీపార్వతుల స్తుతులతో పాటు సీత, అనసూయ, సావిత్రి, కన్యకాపరమేశ్వరి, చంద్రమతి, సత్యభామ తదితరుల గాథలను, వైభవాన్ని పాటలుగా పాడతారు. ఈ పండుగ నేపథ్యం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. చోళరాజ్యంలో ధర్మాంగదుడు, సత్యవతి దంపతుల పుత్రులంతా యుద్ధంలో వీరమరణం పొందగా, జగన్మాత వారికి కూతురుగా జన్మించి, తాను బతికి ఎన్నో బతుకులను దారి చూపిన ‘బతుకమ్మ’గా ప్రాచుర్యంలోకి వస్తుందని మునులు ఆశీర్విందించారని చెబుతారు. వివాహితలు మాంగళ్య రక్షణ కోరుతూ గౌరీదేవిని ప్రార్థిస్తారు. కొత్తగా పండిన సజ్జలను ఇచ్చిపుచ్చుకోవడం వల్ల ‘సజ్జల బతుకమ్మ’ అని వ్యవహరిస్తారు. చివరిరోజు నాటి పండుగను ‘పెద్ద బతుకమ్మ’ లేదా ‘సద్దుల బతుకమ్మ’ అంటారు.

అయ్యవారికి..

దసరా అంటే పిల్లలకు సరదాయే కాదు. ఉపాధ్యాయులకూ ఆనందమే. ఇప్పుడది అరుదైన సందర్భమనే చెప్పాలి. వీధిబడుల కాలంలో ఉపాధ్యాయులు శిష్యులతో పూలబాణాలు పట్టించి ఊరిలోని ఇంటింటికి వెళ్లేవారు. సంబంధిత విద్యార్థికి సంబంధించిన ఇంటికి రాగానే అతను వరుసలో ముందుకు వచ్చేవాడు. ‘దసరాకు వస్తిమని విసవిసలు పడక/ బహుమానాలు ఇచ్చి పంపండి వేగం’ అని గడుసుగా అడిగేవారు. తమకు పాఠం చెబుతున్నందుకు గురుదక్షిణ సమర్పించుకోలేక మిమ్మల్ని అర్థిస్తున్నాం అనే భావంతో ‘గురునకు దక్షిణల్‌ ‌కోరి యీదలచి/వెరపు తోడుత మిమ్ము వేడవచ్చితిమి’అని పిల్లలు పాట రూపంలో తమ అశక్తను, గురుభక్తిని చాటిచెప్పేవారు. పెద్దలకు కోపం తెప్పించడం ఇష్టంలేక, వినయంగా ‘అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు’ అని తమకు తాము మినహాయింపునిచ్చుకునేవారు. తల్లిదండ్రులు కూడా ఆనందంగా తోచినంత ఇచ్చేవారు. ఇక్కడ ‘దసరా దక్షిణ’సమర్పణలేనిదే గురువుకు గడవదని అర్థం కాదు. పిల్లలకు లోకజ్ఞానం, దాతృత్వాన్ని నేర్పడం,పదిమందితో కలివిడిగా ఉండేలా చేయడం దీని తాత్పర్యం.‘బతకలేక బడి పంతులు’ అన్న నానుడి ఉన్నప్పుడూ తృప్తిగా వెళ్లదీసిన కాలం అది. దసరా అంటే సరదాల పండుగ. చీకూచింతా లేకుండా తిరిగే వారిని ‘దసరాబుల్లోడు’ అని వ్యవహరించడం తెలిసిందే.

బొమ్మల కొలువు

శరన్నవరాత్రుల్లో మరో సంబరం బొమ్మల కొలువు. సంక్రాంతి, దసరా పండుగల సమయంలో వీటిని పెడతారు. ఈ రెండు సందర్భాలకు కొంత తేడా ఉంది. దసరా వేళలో బొమ్మల కొలువు కన్నెలు చేసుకునే వేడుక కాగా సంక్రాంతి వేళ పెట్టే బొమ్మల కొలువులో ముత్తయిదువలు ప్రధానంగా పాల్గొంటారు. బేసి సంఖ్యలో (3,5,7,9)మెట్లున్న వేదికను ఏర్పాటు చేసి బొమ్మలను అమర్చుతారు. తొమ్మిది మెట్లు ఏర్పాటు చేయడం శుభప్రదంగా చెబుతారు. జగన్మాత ధరించిన నవరూపాలకు, నవగ్రహాలకు చిహ్నమే ఈ మెట్లు అని పేర్కొంటారు. అమ్మవారిని ఆవాహన చేసి అర్చించడం వల్ల గ్రహబాధలు తొలగిపోతాయని విశ్వాసం. దేవతామూర్తుల నుంచి అన్నిరకాలు బొమ్మలు కొలువుతీరతాయి. చందనం నుంచి మామూలు మట్టి బొమ్మల వరకు అన్నీ అర్హమే.. వాటి తయారీకి ఉపకరించిన లోహం కంటే బొమ్మలకే విలువెక్కువ. అమ్మవారికి ప్రతిరోజు నైవేద్యం సమర్పిస్తారు. నవరాత్రులు ముగిసిన తరువాత ఆ బొమ్మలను తీసి భద్రపరుస్తారు. అయితే ప్రతి సంవత్సరం ఒక కొత్తబొమ్మనైనా ఈ ‘కొలువు’లో చేర్చాలని నియమం.

ఈ పండుగల వేళ దాదాపు ప్రతి ఇంట్లో బొమ్మల కొలువు ఉండేది. యాంత్రిక జీవితంలో తగ్గుముఖం పట్టింది. యాభయ్యో పడిలో ఉన్న వారికి ఆ అనుభూతి గురించి తెలిసిఉండవచ్చు. దసరావేళ చుట్టుపక్కల పన్నెండేళ్లలోపు పిల్లలంతా అక్కడికి చేరి పాటలు  పాడేవారు. స్నేహసంబంధాలు ఏర్పడి, ఇచ్చిపుచ్చుకునే ఆరోగ్యకరమైన అలవాట్లు అలవడతాయనేది కూడా ఈ పండుగలోని ఆంతర్యం.

ఇది బాలబాలికల పండుగ. బొమ్మల పెళ్లి ఇందులోని వేడుక. మామూలు పెళ్లిళ్లకు దీనిని నమూనాగా భావించవచ్చు. వివాహాల్లో కనిపించే హడావిడి, మర్యాదలు,పెట్టుపోతల విషయంలో వియ్యాలవారి కయ్యాలు, అప్పగింతలు, అలకలు, బుజ్జగింపులు, బతిమిలాటలు లాంటివి ఈ వేడుకలో భాగాలు. ఈ సందర్భంగా పెద్దలు చెప్పే సుద్దులు భవిష్యత్తులో దంపతులకు అవగాహన కోసం అలా నిర్దేశించేవారని భావించవలసి ఉంటుంది. వాస్తవానికి బొమ్మల పెళ్లిళ్ల నాటికి వయసుకు, వివాహ వయసుకు అప్పట్లో అట్టే తేడా ఉండేది కాదు.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram