‘మరొకరి ధర్మాన్ని అద్భుతంగా ఆచరించడం కంటే, లోపాలున్నా సరే మన స్వధర్మాన్ని ఆచరించడం మిన్న’- భగవద్గీత
నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని స్థితి. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తి ‘‘ధర్మాచరణ’’ ఎలా చేయగలడు?
ప్రస్తుత కాలంలో సాఫ్ట్వేర్ రంగంలో జరుగు తున్న లేఆఫ్స్-సామూహిక ఉద్యోగాల తొలగింపు, ఉద్యోగ అనిశ్చితి నేపథ్యంలో ఆధ్యాత్మిక ధర్మాచరణ అనేది కేవలం ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఇలాంటి సంక్షోభ సమయాల్లోనే మనకు నిజమైన పరీక్ష పెడుతుంది.
స్థితప్రజ్ఞత
లేఆఫ్స్ జరిగినప్పుడు భయం, ఆందోళన కలగడం సహజం. అయితే ఆధ్యాత్మిక ధర్మం మనకు ‘స్థితప్రజ్ఞత’ను నేర్పుతుంది. అంటే, బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా, మన అంతర్గత ప్రశాంతతను కోల్పోకూడదు. ‘నా ప్రతిభ, నా కర్మ నా దగ్గరే ఉన్నాయి, కంపెనీ మారవచ్చు కానీ నా సామర్థ్యం మారద’నే నమ్మకం ధర్మాచరణలో ఒక భాగం. చాలామంది తమ ఉద్యోగాన్ని తమ ‘గుర్తింపు’గా భావిస్తారు. ఉద్యోగం పోగానే తమ ఉనికి కోల్పోయినట్లు భావిస్తారు. కానీ ఆధ్యాత్మికంగా మనం అంటీముట్టనట్టు ఉండాలి. అంటే, ఉద్యోగాన్ని పూర్తి బాధ్యతతో చేయాలి, కానీ అది పోయినప్పుడు కుప్పకూలిపోకూడదు. మనం ఒక పాత్రను పోషిస్తున్న నటుడి లాంటి వాళ్లమే అని గుర్తించడం ఇక్కడ ఉదాత్తమైన భావన. కంపెనీ తన లాభాల కోసం లేఆఫ్స్ చేసినా, ఒక ఉద్యోగిగా తన ‘స్వధర్మం’ ఏమిటి? ఆఫీసులో ఉన్నంత కాలం తన పనిని నిజాయితీగా చేయడం, తోటి ఉద్యోగులకు అండగా ఉండటం. సంక్షోభ సమయంలో తోటివారిని తొక్కేసి మనం నిలబడాలి అనుకోవడం ‘అధర్మం’. అందరి హితాన్ని కోరుకుంటూ మన ప్రయత్నం మనం చేయడం ‘ధర్మం’.
ఆపద్ధర్మం
లేఆఫ్స్ ఎదురైనప్పుడు అధైర్యపడి తప్పుడు మార్గాల్లో వెళ్లకుండా, ఓపికతో కొత్త అవకాశాల కోసం వెతకడం, ఉన్న వనరులను పొదుపుగా వాడుకోవడం ‘ఆపద్ధర్మం’ కిందకు వస్తుంది. ఇది మనల్ని మానసికంగా దృఢంగా ఉంచుతుంది.
ప్రాణి కోటి ఎలా ప్రవర్తించాలో తెలియజేసేదే ధర్మం. అది మార్పు చెందే ప్రసక్తే ఉండదు. మనిషికి ఆధ్యాత్మికోన్నతి అందించేదే ధర్మం. మానవ ధర్మాల్లో ముఖ్యమైనవి- నిగ్రహం, ప్రేమ, సంతృప్తి, త్యాగం. అలాగే మనిషిని దహింపజేసేవి-అత్యాశ, ద్వేషం, పరదూషణ, పగ. ధర్మాన్ని ఆచరించడం అంటే బాధ్యతల నుండి పారిపోవడం కాదు. వాటిలో ఉంటూనే వాటికి బందీ కాకపోవడం. ఆధ్యాత్మికంగా ధర్మం అంటే మన అంతరాత్మ చెప్పే మాటను వినడం. బయటి ప్రపంచం ఏమనుకుంటుందో అన్నదాని కంటే, మన మనస్సాక్షికి ఏది సరైనది అనిపిస్తుందో అది చేయడమే నిజమైన ధర్మాచరణ. దీనినే ‘‘హృదయ ధర్మం’’ అంటారు. నిజమైన ధర్మాచరణ అంటే కర్మలను చేస్తూనే, వాటి ఫలితాల పట్ల మమకారం లేకుండా ఉండటం. తామరాకు మీద నీటిబొట్టులా, సంసారంలో ఉంటూనే దేనికీ లొంగిపోకుండా తన కర్తవ్యాన్ని నిర్వహించడం అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితి. ఇది చిత్తశుద్ధిని కలిగిస్తుంది. భగవద్గీత బోధించినట్లుగా, ‘‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’’ అంటే పని చేయడం మీద మాత్రమే నీకు అధికారం ఉంది, ఫలితం మీద లేదు. ఫలాపేక్ష లేకుండా చేసే పని ఆధ్యాత్మికంగా మనిషిని బంధనాల నుండి విముక్తుడిని చేస్తుంది. కానీ కష్టాలు ఎదురైనప్పుడు మనల్ని కాపాడేది మన లోపల ఉన్న నిజాయితీ, విలువలే తప్ప పైన ఉన్న మెరుగులు కావు. ప్రకృతిలో ప్రతిదీ ఒక ధర్మాన్ని అనుసరిస్తుంది. సూర్యుడు సమయానికి ఉదయిస్తాడు, నదులు ప్రవహిస్తాయి. అలాగే మన జీవితంలో ఒక క్రమశిక్షణను అలవర్చుకోవడం ధర్మం. అది సరైన మార్గంలో నడిపించే ఒక దిక్సూచి. విజయానికి నీతిని, ధర్మాన్ని జోడిస్తే అప్పుడు విజయం అజేయం అవుతుంది. ధర్మం అంటే కట్టడి చేసే సంకెళ్లు కాదు.
ఆధ్యాత్మిక ప్రయాణం
మన చుట్టూ చీకటి (లేఆఫ్స్) ముసిరినప్పుడు, మన లోపల ఉన్న ధర్మం అనే దీపాన్ని వెలిగించు కోవాలి. బాహ్య ప్రపంచం మన ఉద్యోగాన్ని తీసుకోగలదు కానీ, మన జ్ఞానాన్ని, ధర్మాన్ని, ఉదాత్తమైన ఆలోచనలను ఎవరూ తీసుకోలేరు. ధర్మాచరణ అంటే బాధ్యతలను విస్మరించడం కాదు, బాధ్యతలను నెరవేరుస్తూనే వాటి ఫలితాలకు బందీ కాకుండా ఉండటం. మనం చేసే ప్రతి పనిని (అది కోడింగ్ అయినా, పెయింటింగ్ అయినా) ఉదాత్తమైన భావంతో చేసినప్పుడు, జీవితమే ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా మారుతుంది. ధర్మాచరణలో ప్రధానమైనది సాటి ప్రాణుల పట్ల కరుణ కలిగి ఉండటం. ‘‘ఆత్మవత్ సర్వభూతాని’’ అంటే అన్ని జీవులను తన వలెనే చూడటం. ఇతరులకు మేలు చేయడమే పుణ్యం, కీడు చేయడమే పాపం అనే భావనతో జీవించడం ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధన. ధర్మాన్ని ఆచరించడం వల్ల ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఆహార విహారాల్లో, ఆలోచనల్లో ఒక పద్ధతిని పాటించడం వల్ల మనస్సు ఏకాగ్రతను పొందుతుంది. ఇది ధ్యానానికి, తద్వారా దైవత్వానికి దారితీస్తుంది. ఆధ్యాత్మిక పరంగా ధర్మాచరణ అంటే ఏదో బాహ్య నియమాలను పాటించడం కాదు. అది మన అహంకారాన్ని తగ్గించుకుని, విశ్వజనీనమైన ప్రేమతో బాధ్యతాయుతమైన ప్రవర్తనతో జీవించడం. ధర్మబద్ధమైన జీవితం గడిపే వ్యక్తికి మరణ భయం ఉండదు. వారు ఎల్లప్పుడూ అంతర్గత శాంతిని అనుభవిస్తారు. ‘‘సత్యం వద – ధర్మం చర’’ (సత్యాన్నే మాట్లాడు – ధర్మాన్నే ఆచరించు) అనేది ఉపనిషత్తులు మనకు అందించిన పరమ సత్యం. సాధారణంగా మనం ఏదైనా పని చేసేటప్పుడు ‘‘నాకేం వస్తుంది?’’ అని ఆలోచిస్తాం. కానీ ఆధ్యాత్మిక ధర్మాచరణలో ‘‘ఫలాపేక్ష లేని పని’’ ప్రధానం. ఫలితం మీద ఆశ వదిలేసినప్పుడు, మనస్సు భయం, ఆందోళన నుండి విముక్తి పొందుతుంది. ఈ స్థితిలో చేసే పని అత్యంత నాణ్యతతో ఉంటుంది. ఇదే ‘యోగం’. సంసారంలో ఉంటూ, అందరినీ ప్రేమిస్తూనే.. ‘‘ఎవరూ నా వారు కారు, అంతా ఈశ్వరేచ్ఛ’’ అనే భావనతో ఉండటం మనల్ని మానసిక వేదనల నుండి కాపాడుతుంది. బురదలో ఉన్నా అంటని తామర పువ్వులా జీవించడమే అసలైన ధర్మం.
ధర్మాచరణతో ఉన్నతస్థితి
మానవునికి ధర్మాచరణ ముఖ్యం, తాను జీవిస్తున్న సమాజ భద్రతకు, తన జీవన క్రమశిక్షణకు మానవుడు విధిగా ఆచరించనలసిన కొన్ని విశేష ధర్మాలను భాగవతం చెప్పింది. సత్యనిష్ట, దయాగుణం, తపస్సు, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, త్యాగం, నిజాయితీ, నిష్కపటం, ఓర్పు, వినయం మొదలైనవి ప్రతి వ్యక్తి పాటించవలసిన ఉత్తమ ధర్మాలు. ఇవి వ్యక్తిగతంగా తనకే గాక తాను జీవిస్తున్న సమాజానికి, సర్వమానవాళికి కూడా శ్రేయస్సును కలిగిస్తాయి. మానవులకు, జంతువులకు పరమాత్మ ధర్మాలను నిర్దేశించాడు. వినయం, సహనం, ఆచారం, పరాక్రమం మనిషికి సంస్కారం అందించే సాధనాలు. తనకు నచ్చని అంశాలను పరులమీద రుద్దకుండా చేయటం ధర్మం. తన దారిలో ఎవరి మాట వినకుండా ముందుకు నడవడం అధర్మం. అగ్ని వేడిని, నీరు చల్లదనాన్ని అందిస్తాయి. సింహం గర్జిస్తుంది. అటు ఇటూ పరుగెత్తుతూ చపలత్వాన్ని ప్రదర్శించడం లేడి లక్షణం. ఈ రకంగా ప్రతిదీ తన ధర్మాన్ని పాటింపజేయడం కేవలం పరమాత్మ సృజన. ఆయన సంకల్పం లేనిదే మానవ ధర్మం మృగ్యమే. ప్రతి పనిలో మనిషి అభివృద్ధిని ఆశిస్తాడు. అది సాధించాలంటే కఠోర సాధన అవసరం. సాధనే ధర్మం.అది మనిషిని పతనం కానివ్వకుండా కాపాడు తుంది. ‘ధర్మో రక్షతి రక్షితః’’, ధర్మాన్ని ఎవరైతో కాపాడుతారో వారిని ధర్మమే కాపాడు తుంది. ధర్మాచరణ వ్యక్తిని, మనసును శుద్ధిపరుస్తుంది. ధర్మం అంటే సహజ గుణం. రచయితకు రాయడం ధర్మం. ఒక సైనికుడికి రక్షించడం ధర్మం. సహజ సిద్ధమైన ప్రతిభను లోక కళ్యాణం కోసం ఉపయోగించడమే ఆధ్యాత్మిక మార్గం. ‘‘నేను కేవలం ఒక నిమిత్త మాత్రుడిని, ప్రకృతి లేదా దైవం నా ద్వారా ఈ పని చేయిస్తోంది’’ అనే సాక్షి భావన కలగడం.
మనిషి ఆధ్యాత్మిక కర్మలను ధర్మబద్ధంగా ఆచరించినప్పుడే తనను. సమాజాన్ని, ఇతర ప్రాణుల్ని, ప్రకృతిని, ప్రపంచాన్ని రక్షించగలుగుతాడు. ధర్మం అనేది లేకపోతే పై వాటికి రక్షణ లేదు.
స్వధర్మం-విధర్మం-పరధర్మం-ఉపధర్మం
ధర్మాచరణ వలన అర్థ ప్రాప్తి, ధర్మాచరణం వల్లనే సుఖం, ధర్మం వల్లనే సమస్తం సాధించవచ్చన్న సత్యం మనకు తెలుస్తోంది. స్వధర్మానికి బాధ కలిగించేది-విధర్మం. ఇతరుల ప్రేరణతో ఇతరుల ధర్మాన్ని ఆచరించేది- పరధర్మం, భగవంతుడి పట్ల విశ్వాస రహితులైన వారు చేసేది, చెప్పేది-ఉపధర్మం, తన ధర్మాన్ని నిర్లక్ష్యం చేయడం, ధర్మానికి వివరీతార్థ్ధాలను తీసి వివరించడం అనే అయిదు ‘అధర్మాలు’ త్యజించ వలసినవిగా వేదవ్యాసుడు పేర్కొన్నాడు. కరుణ, ఆదర్శ గృహస్థ జీవనం, నిత్యకర్మాచరణశీలత లోక కల్యాణకారకాలు, భగవద్భక్తి మార్గ నిర్దేశాలు. వీటిని మరవడం అంటే మన ధర్మాన్ని మనం విస్మరించడమే అవుతుంది. కాలం గడిచేకొద్దీ ధనం వెళ్లిపోతుంది, మన వాళ్లనుకున్న వాళ్లు వెళ్లిపోతారు, అధికారం పోతుంది. జ్ఞాపకశక్తి కూడా పోతుంది. అన్నీ పోతాయి… అలాగే యవ్వనం కూడా. కానీ మిగిలిపోయేది ఏదైనా ఉందంటే ఆ వ్యక్తి ధార్మికంగా జీవించా.. లేదా? అన్నదే. నిజమైన ధర్మాచరణలో ప్రేమ అంతర్లీనంగా ఉంటుంది. స్వార్థం అంతమైన చోట, అక్కడ ధర్మం మొదలవుతుంది. రాసే ప్రతి అక్షరం, చేసే ప్రతి ఆలోచన లోకానికి హితాన్ని చేకూర్చాలనే సంకల్పం ఉంటే, అది అత్యున్నతమైన ఆధ్యాత్మిక ధర్మాచరణ అవుతుంది. దైనందిన జీవితం, సృజనాత్మక ప్రయాణం ఈ రెండూ వేర్వేరు కాదు. ఒకదానికొకటి ప్రతిబింబాలు. ఆధ్యాత్మిక ధర్మాచరణను వీటిలో అన్వయించు కోవడం అంటే మన ఉనికిని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లడమే. దైనందిన జీవితంలో ధర్మాచరణ, నిత్యం మనం చేసే పనులలోనే ఆధ్యాత్మికతను వెతుక్కోవడం సాధ్యమే. ప్రస్తుత క్షణంలో జీవించడం. గతంలో జరిగిన పొరపాట్ల గురించి చింతించకుండా, భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా, ఇప్పుడు చేస్తున్న పనిని పూర్తి ఏకాగ్రతతో చేయడమే గొప్ప ధర్మం.
అంతర్మాతను అనుసరిద్దాం
కష్ట సమయాల్లో లేదా ఇతరులు విమర్శించినప్పుడు ఉద్వేగానికి లోనుకాకుండా, నిలకడగా ఉండటం ఒక ఆధ్యాత్మిక సాధన. మనం చేసే వృత్తి ఏదైనా, అది సమాజానికి ఎలా ఉపయోగపడుతోంది అనే స్పృహ కలిగి ఉండటం. ‘‘నేను నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నానా?’’ అని మనల్ని మనం ప్రశ్నించుకోవడమే ధర్మాచరణ. ఒక కళాకారుడిగా సృజన కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా, ఒక ‘సాధన’గా మారాలి. రచనల్లో లేదా సృజనలో నిజాయితీ ఉండాలి. ప్రాచుర్యం కోసమో, ఎవరినో మెప్పించడానికో కాకుండా, అంతరా త్మకు సరైనది అనిపించిన భావాలను వ్యక్తీకరించడం ‘సృజనాత్మక ధర్మం’ అవుతుంది. ‘‘ఈ కథను నేనే రాశాను’’ అనే అహంకారాన్ని పక్కన పెట్టి, ఒక ఉన్నత శక్తి ఈ సృజనను చేయిస్తోందని భావించినప్పుడు, ఆ రచనకు ఒక అద్భుతమైన శక్తి వస్తుంది. ‘‘విశ్వశ్రేయః కావ్యం’’ అన్నట్లుగా, మన సృజన చదివిన వారికి లేదా చూసిన వారికి ఒక మంచి ఆలోచనను, ప్రశాంతతను లేదా ధైర్యాన్ని అందించాలి. ‘‘అంటీముట్టనితనం’’ తో జీవితంలో బాధ్యతలను మోస్తున్నా, సృజనలో పాత్రలను సృష్టిస్తున్నా, ఆ పాత్రల సుఖదుఃఖాలకు ప్రభావితం కాకుండా ఉండటమే ఆధ్యాత్మికత. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు అవి ‘ఆత్మ’కు సంబంధించినవి కావని గుర్తించడం. సృష్టించిన పాత్రల ఘర్షణలో చిక్కుకోకుండా, ఒక ‘సాక్షి’గా వాటిని నడిపించడం. ఏదైనా కొత్త పనిని లేదా రచనను ప్రారంభించే ముందు, ‘‘నేను ఒక నిమిత్త మాత్రుడిని, ఈ పని లోక హితం కోసం సాగాలి’’ అని సంకల్పించుకోవాలి. ఇది అహంకారాన్ని తగ్గించి, సృజనాత్మకతను అనంతంగా వికసింపజేస్తుంది. మనల్ని నొప్పించిన వారిని క్షమించడం ఒక ఆధ్యాత్మిక సాధన.
కోపాన్ని అణచుకోవడం కాకుండా, అవతలి వారి అజ్ఞానాన్ని అర్థం చేసుకుని జాలి చూపడం ఉదాత్తమైన భావన. దైనందిన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ఘర్షణలను పెద్దవి చేయకుండా, హుందాగా వ్యవహరించడం ఇందులో భాగమే అవుతుంది. ‘‘నేను ఎవరు? నేను ఎక్కడి నుండి వచ్చాను? ఈ సృష్టి వెనుక ఉన్న రహస్యం ఏమిటి?’’ అనే తాత్విక ప్రశ్నలను మనసులో ఉంచుకోవడానికి దారి తీసే జిజ్ఞాస మనల్ని ప్రాపంచిక విషయాలకు అతీతంగా ఉంచుతుంది. ‘‘మనం ఏమి ఇస్తామో, అదే మనకు తిరిగి వస్తుంది.’’ సమాజానికి మంచి ఆలోచనలను, ఉదాత్తమైన భావనలను అందిస్తే, జీవితం కూడా సహజంగానే ప్రశాంతంగా, అర్థవంతంగా మారుతుంది.
ఆకాశ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రకాశ్ ఒక చిత్రకారుడు. ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకరోజు సాయంత్రం సముద్ర తీరాన నడుస్తుండగా వారి మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది. ‘‘ప్రకాశ్, ఈ ప్రపంచం అంతా పోటీ. నేను ఆఫీసులో ఎప్పుడూ టెన్షన్ పడుతూ ఉంటాను. ఉద్యోగ భద్రత, టార్గెట్లు.. వీటి మధ్య ‘ధర్మం’ గురించి ఆలోచించే సమయం ఎక్కడిది? అసలు దైనందిన జీవితంలో ధర్మాచరణ సాధ్యమేనా?’’ అని ఆకాశ్ అడిగాడు. ప్రకాశ్ నవ్వుతూ సముద్రపు అలల వైపు చూపిస్తూ ఇలా అన్నాడు, ‘‘ఆకాశ్, ఈ అలలు ఎప్పుడూ ఒడ్డుకు వస్తూనే ఉంటాయి. అవి తమ బాధ్యతను (ధర్మాన్ని) నిర్వర్తిస్తున్నాయి. అలలు ఒడ్డును తాకినప్పుడు కొన్ని గవ్వలను వదిలి వెళ్తాయి, కొన్నిసార్లు సముద్రగర్భాన ఉన్న చెత్తను ఒడ్డుకు చేరవేస్తాయి. అవి ఆశించి ఏమీ చేయడం లేదు, కేవలం తమ స్వభావాన్ని అనుసరిస్తున్నాయి.’’ మరుసటి రోజు వారిద్దరూ ఒక తోటలో కూర్చున్న ప్పుడు, అక్కడ ఒక అంధుడు నడవలేక ఇబ్బంది పడటం చూశారు. ఆకాశ్ వెంటనే వెళ్లి అతనికి దారి చూపించాడు. తిరిగి వచ్చాక ‘‘ఇది ధర్మం కదా?’’ అని ప్రకాశ్తో అన్నాడు. ‘‘అవును, కానీ దీనికంటే లోతైనది మరొకటి ఉంది. నువ్వు అతనికి సహాయం చేశావు కాబట్టి నీకు మనసులో ఒక రకమైన ‘నేను మంచి చేశాను’ అనే తృప్తి (అహంకారం) కలిగింది. కానీ నిజమైన ఉదాత్తత ఎక్కడ ఉందంటే సహాయం చేసిన విషయాన్ని మర్చిపోయి, అది నీ బాధ్యతగా మాత్రమే గుర్తించినప్పుడు. అంటే ‘అంటీముట్ట నట్టు’ ఉండటమని ప్రకాశ్ వివరించాడు. కొన్ని నెలల తర్వాత ఆకాశ్ కంపెనీలో లేఆఫ్స్ మొదలయ్యాయి. ఆకాశ్ చాలా ఆందోళనకు గురయ్యాడు. అప్పుడు ప్రకాశ్ అతడితో ‘‘ఆకాశ్, నీ పని నువ్వు నిజాయితీగా చేయడం నీ ధర్మం. కానీ ఫలితం నీ చేతుల్లో లేదు. ఉద్యోగం ఉన్నా, పోయినా నీ లోపల ఉన్న ‘శాంతి’ మారకూడదు. అదే ఆధ్యాత్మిక ధర్మాచరణ. నువ్వు నీ వృత్తిని కేవలం జీవనా ధారంగా కాకుండా, లోకానికి నీవంతు సేవగా భావించు. అప్పుడు నీ సృజనాత్మకత పెరుగుతుంది, భయం పోతుంది’’ అని అన్నాడు. ఆ మాటలతో ఆకాశ్లో మార్పు వచ్చింది. అతడు ఆఫీసులో కేవలం జీతం కోసం కాకుండా, తన పని పట్ల మక్కువతో, ఇతరులకు సహాయం చేస్తూ పని చేయడం మొదలుపెట్టాడు. చిత్రంగా, ఇప్పుడతనికి ఉద్యోగం పోయినా సొంతంగా ఏదైనా స్టార్టప్ నిర్వహించగలననే ధీమాతో ఉన్నాడు.

తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
8008577834