దాదాపు ఒక శతాబ్ద కాలంగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-ఆర్ఎస్ఎస్ సంస్థాగత బలం దాని పూర్తికాల కార్యకర్తలైన ప్రచారక్ల నిశ్శబ్ద, నిరంతర నిబద్ధతపై ఆధారపడి ఉంది. వారి నిరాడంబర జీవితాలు, సంపూర్ణ అంకిత భావం దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ విస్తరణకు రూపునిచ్చాయి. ఈ నిబద్ధత కశ్మీర్ లోయ తరహాలో మరెక్కడా అంత తీవ్రంగా పరీక్షకు గురికాలేదు. అక్కడ ప్రచారక్లు, విస్తారక్లు రాజకీయ అస్థిరతలు, సామాజిక ప్రతిఘటన, నిషేధాలు, జైలు శిక్షలు, హింసాత్మక కాలాలను ఎదుర్కొని సంస్థాగత జ్యోతిని సజీవంగా ఉంచడానికి కృషి చేశారు. గత వంద సంవత్సరాల ఆర్ఎస్ఎస్ చరిత్ర, కృషి, పోరాటం, పురోగతి, ప్రభావాన్ని విశ్లేషిస్తే, సంస్థలో పూర్తిసమయ కార్యకర్తల పాత్ర ప్రాముఖ్యత వెల్లడవుతుంది. సంస్థలోని పూర్తిసమయ కార్యకర్తలను సాధారణంగా ‘ప్రచారక్’ అని పిలుస్తారు.
ఆర్ఎస్ఎస్కు ఈ విధానం ఆర్ఎస్ఎస్ ఏర్పడినంత పురాతనమైనది. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకు లైన డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గెవార్ స్వయంగా జీవితాంతం ప్రచారక్గా ఉన్నారు. ఇది గత వేల సంవత్సరాలుగా సనాతన ధర్మంలో ప్రబలంగా ఉన్న ‘సన్యాసాశ్రమం’ ను పోలి ఉంటుంది. ఆర్ఎస్ఎస్ తన సంస్థాగత పునాదిని, నిర్మాణాన్ని విస్తరించుకోవ డానికి కొన్ని ఆమోదయోగ్యమైన మార్పులు చేస్తూ, ప్రచారకత్వం అనే విధానం ద్వారా అదే సంప్రదా యాన్ని స్వీకరించింది. సాదాసీదా జీవనం, కఠోర నియమాలు, అప్పగించిన పనిపై నిరంతరం దృష్టి పెట్టడంపై ఆధారపడిన ఈ ప్రయోగంలో అది అపారమైన విజయాన్ని సాధించింది.
1940 దశాబ్దం మధ్యలో జగదీష్ అబ్రోల్, బల్రాజ్ మాధోక్, కేదార్నాథ్ సాహ్నిలతో కూడిన ప్రచారక్ల బృందం కశ్మీర్ లోయలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను ప్రారంభించింది. కాలక్రమేణా 1940వ సం।। చివరి నాటికి కశ్మీర్ లోయ నుండి యువ, విద్యావంతులైన, అంకితభావం గల స్వయంసేవకులు ప్రచారక్లుగా ఉద్భవించారు. వారిలో ఓంకార్ నాథ్ కక్, మఖన్ లాల్ హర్కారా (ఐమా) ఉన్నారు.
1950-51లో ప్రజాపరిషత్ ఉద్యమం ప్రారంభం కావడంతో, కశ్మీర్ లోయ నుండి ఒక స్వయంసేవకుల బృందం పూర్తికాల ప్రచారక్లుగా ఉద్భవించి, ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడానికి జమ్మూ, కశ్మీర్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నియమితులయ్యారు. కశ్మీర్ లోయకు చెందిన ఈ అంకితభావం గల ప్రచారక్ల బృందంలో అవతార్ క్రిషన్ కావ్, నిరంజన్ నాథ్ కౌల్, జంకినాథ్ ధోబీ, దేవకినందన్ నఖాసీ, బ్రిజ్నాథ్ మియాన్, సోమనాథ్ ఓగ్రా, ప్రాణనాథ్ మియాన్ వంటి ప్రముఖులు ఉన్నారు. వీరందరూ శ్రీనగర్ నగరానికి చెందినవారు. వారు ప్రజా పరిషత్ ఉద్యమం మొత్తం కాలం పాటు ప్రచారక్లుగా కొనసాగారు. వారిలో చాలా మందిని జమ్మూ, కాశ్మీర్లోని అప్పటి షేక్ అబ్దుల్లా ప్రభుత్వం అవాంఛనీయ వ్యక్తులుగా ప్రకటించింది. వారు ఆశయ సాధన కోసం ప్రగాఢమైన అంకితభావంతో, నిబద్ధతతో అవిశ్రాంతంగా పనిచేశారు.1953లో ఆ ఉద్యమం ముగిసినప్పుడు మాత్రమే తమ ఇళ్లకు తిరిగి వచ్చారు.
1970వ దశకం ప్రారంభంలో, శ్రీనగర్కు చెందిన డిప్లొమా సివిల్ ఇంజనీర్ ఇందర్ క్రిషన్ జుత్షి మూడు సంవత్సరాల పాటు ప్రచారక్గా పనిచేశారు. ఆయన మూడవ సంవత్సరం ఓటీసీ (సంఘ శిక్షా వర్గ) శిక్షణ పొందిన స్వయంసేవక్ కూడా. ఆయన తర్వాత బారాముల్లాకు చెందిన డాక్టర్ రోషన్ లాల్ బాలి ప్రచారక్గా ఎదిగి, చాలా కాలం పాటు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సేవలందించారు. ఆ సమయంలో ఆయన తహసీల్ ప్రచారక్గా, జిల్లా ప్రచారక్గా, విభాగ ప్రచారక్గా కూడా పనిచేశారు. ఆయన ఒక హోమియోపతి వైద్యుడు. తరువాతి కాలంలో హిమాచల్ప్రదేశ్లో స్థిరపడ్డారు.
శ్రీనగర్లోని రైనావారికి చెందిన ఉపేందర్ భట్ 1975లో భదేర్వాలో తహసీల్ ప్రచారక్గా చేరారు.
భారత ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించి, ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ను నిషేధించిన రాత్రి, జమ్మూలోని వీర్ భవన్-రఘునాథ్పురాలో ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నుండి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అత్యవసర పరిస్థితి కొనసాగిన చాలా కాలం పాటు ఆయన జైలులోనే ఉన్నారు. మార్చి, 1977లో ఇందిరాగాంధీ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయిన తరువాత, అత్యవసర పరిస్థితి ముగిసింది. ఆర్ఎస్ఎస్పై నిషేధాన్ని కూడా ఎత్తివేశారు.
1978వ సంవత్సరంలో, ఈ రచయిత తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత ప్రచారక్గా కూడా బయటకు వచ్చారు. నన్ను జమ్మూలో ఒక సంవత్సరం పాటు మహానగర్-సాయంకాల్ ప్రచారక్గా నియమించారు. ఆ తరువాత దోడా, భదేర్వా తహసీళ్లలో ఒక సంవత్సరం పాటు తహసీల్ ప్రచారక్గా నియమించారు.మూడవ సంవత్సరానికి, నాకు దోడా జిల్లా ప్రచారక్ బాధ్యతను అప్పగించారు. 1981వ సంవత్సరంలో, నేను శ్రీనగర్లోని నా ఇంటికి తిరిగి వచ్చాను. నా ప్రచారక్ పదవీకాలం లోనే 1980లో నా మూడవ సంవత్సరం ఓటీసీని పూర్తి చేసే అవకాశం నాకు లభించింది.
1985లో శ్రీనగర్లోని ప్రభుత్వ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అశోక్ కౌల్ తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, జీవితకాల ప్రచారక్గా చేరారు. గత నాలుగు దశాబ్దాలుగా ఆయన ఈ పాత్రను నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు. సంస్థలో వివిధ స్థాయిలలో పలు హోదాలలో తన బాధ్యతలను నిర్వర్తించిన తర్వాత, 2012లో ఆయనను బీజేపీకి పంపించారు. ప్రస్తుతం ఆయన జమ్మూ కాశ్మీర్లో బీజేపీకి ప్రధాన కార్యదర్శి(సంస్థాగత)గా ఉన్నారు. గత ఒకటిన్నర దశాబ్దాలుగా ఆయన ఈ పదవిలో ఉంటూ, జమ్మూ, కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలలో బీజేపీని ఒక అగ్రగామి రాజకీయ సంస్థగా తీర్చిదిద్దడంలో అపారమైన కృషి చేశారు.
కశ్మీర్లోని హిందూ సమాజం సామూహికంగా వలస వెళ్లిన అనంతర కాలంలో, కశ్మీర్ లోయకు చెందిన ఇద్దరు అంకితభావం గల స్వయంసేవకులు ప్రచారక్లుగా వచ్చారు. బారాముల్లాకు చెందిన వీరేందర్ కుచ్రూ, 1990వ దశకం మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు ప్రచారక్గా పనిచేశారు. రాంబన్ తహసీల్కు నియమితులయ్యారు. దురదృష్టవశాత్తు, ఆయన తన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, కరోనావైరస్ మహమ్మారి బారిన పడి 2020లో చిన్న వయసులోనే మరణించారు.
ప్రస్తుతం లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో ఆశిష్ గంజూ అనే యువ స్వయంసేవక్ గత మూడు సంవత్సరాలుగా లేహ్ జిల్లా ప్రచారక్గా పనిచేస్తు న్నారు. ఆయన తల్లిదండ్రులు దక్షిణ కశ్మీర్లోని షోపియాన్కు చెందినవారు. ఆయన పోస్ట్-గ్రాడ్యుయేట్.
కశ్మీర్కు చెందిన అత్యంత జ్యేష్ఠ స్వయంసేవక్ అమర్నాథ్ వైష్ణవి, 1980లో ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసిన తర్వాత, 1981లో ఆర్ఎస్ఎస్లో పూర్తికాల వానప్రస్థిగా చేరారు. ఆయనను విశ్వహిందూ పరిషత్కు నియమించారు. అక్కడ ఆయన ఐదు సంవత్సరాల పాటు జమ్మూ కశ్మీర్ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శిగా పనిచేశారు. ఆ కాలంలో, అక్కడ నెలకొన్న తీవ్రవాద వాతావరణానికి ప్రతిస్పందనగా, ఆర్ఎస్ఎస్ను ఒక ముఖ్యమైన సంస్థగా సమాజంలో విశ్వాసాన్ని పెంపొందించేం దుకు, ఆయన జమ్మూ కశ్మీర్ నుండి పంజాబ్కు ‘బలిదానీ-జాతా’కు నాయకత్వం వహించారు. ఆయన ఐదు సంవత్సరాల పాటు వానప్రస్థిగా పనిచేసి, 1986లో లోయలోని తన ఇంటికి తిరిగి వచ్చారు. విస్తారక్ల వ్యవస్థ అనేది సాధారణంగా సంవత్సరం వరకు, ఒక చిన్న కాలానికి సంస్థకు పూర్తికాల సేవలను అంకితం చేయడానికి మరొక మార్గం. ఈ నేపథ్యంలో, గత యాభై సంవత్సరాలకు పైగా కశ్మీర్లోని ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు వివిధ సమయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. కశ్మీర్లో ఇటువంటి విస్తారక్ల మొదటి బృందం 1972 నుండి 1977 వరకు ఐదు సంవత్సరాల కాలానికి పనిచేసింది. కశ్మీర్ లోయలోని అన్ని ఉప ప్రాంతాలకు చెందిన ప్రముఖ యువ, విద్యావంతులైన స్వయంసేవకులు ఈ విషయంలో తమ వంతుగా సహకరించారు. ఆర్మీ రిటైర్డ్ కల్నల్ అశోక్ కౌల్, టెలికమ్యూనికేషన్ల శాఖలో రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్ అనుపమ్ కౌల్, విస్తారక్లుగా జమ్మూ జిల్లాలో నియమితులయ్యారు. తరువాతి సంవత్సరం రాజిందర్ రైనా (కంపాసి) , చాంద్జీ భట్ వారిని అనుసరించారు. అదే సంవత్సరం రైనావారికి చెందిన జ్యేష్ఠ స్వయంసేవక్లు ఉత్పల్ కౌల్, ప్రమోద్ దుర్రానీ కూడా విస్తారక్లుగా ఉన్నారు. నిర్ణీత పద్ధతి ప్రకారం వారిని జమ్మూ నగరంలో పనిచేయడానికి నియమించారు. 1977-78లో, రాజిందర్ చ్రుంగూ జమ్మూ జిల్లా సరిహద్దు ప్రాంతంలో రెండుసార్లు విస్తారక్గా పనిచేశారు.
ఆర్ఎస్ఎస్ ప్రణాళిక, కార్యాచరణ ప్రకారం మార్చి, 1977లో లోక్సభ ఎన్నికలలో గెలిచిన ఠాకూర్ బల్దేవ్ సింగ్ కూడా ఆర్ఎస్ఎస్లో ఒక సామాన్య కార్యకర్త, నిర్వాహకుడిగా పనిచేశారు. ఎమర్జెన్సీ కాలంలో జైలులో ఉన్న శిబన్ క్రిషేన్ పండిత, 1970వ దశాబ్దం చివరి సంవత్సరాలలో విస్తారక్గా కూడా పనిచేశారు. ఆయనను జమ్మూ రాష్ట్రంలోని ఉధంపూర్ పట్టణానికి నియమించారు. పైన పేర్కొన్న చురుకైన స్వయంసేవకులందరూ వాస్తవానికి శ్రీనగర్ నగరానికి చెందినవారే.
అనేక సందర్భాలలో, ఉత్తర, దక్షిణ కాశ్మీర్కు చెందిన యువ, అంకితభావం గల స్వయంసేవకులు కూడా, ప్రధానంగా శ్రీనగర్ మధ్య జిల్లాకు చెందిన తమ సహచరులతో కలిసి, కశ్మీర్ లోయలో పూర్తికాల విస్తారక్లుగా కొంతకాలంపాటు సేవలందించారు.
1947 మారణకాండ, 1967 హిందూ ఉద్యమం, 1975-77 ఎమర్జెన్సీ కాలం, రామ జన్మభూమి ఉద్యమం, 1986లో లోయలోని ముస్లిం ఛాందస శక్తులు కశ్మీర్లోని దేవాలయాలు, పుణ్యక్షేత్రాలపై జరిపిన మతపరమైన దాడి వంటి అనేక సందర్భాలలో వారు విస్తారక్లుగా ఉన్నారు. సంస్థ వారిని నియమించిన ప్రదేశాలలో, వారికి తరచుగా స్వయంసేవకుల ఇళ్లలో వసతి కల్పించే వారు. కశ్మీర్ లోయలో ఆర్ఎస్ఎస్ పని ఎల్లప్పుడూ ఒక సవాలుగా ఉండేది. కానీ స్వయంసేవకుల అంకితభావం, నిబద్ధత సంస్థ కలలను నిజం చేశాయి. కశ్మీర్లోని చాలా మంది స్వయంసేవకులు ప్రభుత్వ ఉద్యోగులు కావడం మరో సవాలుగా ఉండేది. కశ్మీర్ లోయలోని ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల కఠినమైన శిక్షణ, స్ఫూర్తిదాయకమైన ‘సంస్కారాలు’ క్షేత్రస్థాయిలో ఎంతో ప్రభావాన్ని చూపాయి. స్వయంసేవకుల సిద్ధాంతం, కఠోర శ్రమ చరిత్రను సృష్టించింది.
– అశ్వనీకుమార్ చ్రుంగు (‘ఆర్గనైజర్’ నుంచి)