‘యుక్తి కల్పతరు’-భారతీయ చరిత్ర కారులకు స్మరణీయ గ్రంథం. ధారానగర పాలకుడు భోజుడు (11వ శతాబ్దం) సంస్కృతంలో రాశాడు. ఇదొక విజ్ఞాన సర్వస్వం. ప్రాచీన భారతదేశంలో ఓడల నిర్మాణం, రకాలు, సముద్రయానాల గురించి ప్రామాణిక సమాచారం ఇస్తుంది. The work deals with diverse subjects of secular interest such as a few topics, relating to polity, construction of buildings and selection of sites therefor articles of furniture, precious stones, ornaments, weapons, drought and other animals vehicles, ships, ship buildings etc. The last two subjects are very rarely met with and contribute not a little to the value of the book” (Yukti Kalpataru, forword)
‘యుక్తి కల్పతరు’ సమాచారం ఎంత ప్రామాణికమో చెప్పే గ్రంథాలు తరువాత చాలా వచ్చాయి. సంజీవ సన్యాల్ భారత ప్రధాని ఆర్థిక సలహాదారు, ఆర్ధిక చరిత్రకారుడు. ఆయన, ప్రాచీనకాలంలోనే భారతీయ వర్తకులు సముద్రాలను దాటి గ్రీస్, రోమ్, చైనా, అరేబియాలతో పాటు మధ్య దక్షిణ, తూర్పు, ఆసియా ప్రాంతాలకు వెళ్లి వాణిజ్య వ్యవహారాలు సాగించేవారు. సొంత సైన్యాన్ని సమకూర్చుకునేవారు. ఐరోపా దేశాలు భారత్ను పరిపాలించడానికి ముందే భారతీయ వ్యాపారులు అంతర్జాతీయ వాణిజ్యం నిర్వహించేవారు. ఉత్తర, దక్షిణ భారతంలో అద్భుతమైన నౌకా నిర్మాణ కేంద్రాలు ఉండేవి. వారు ఎక్కడా మేకులు ఉపయో గించకుండా తాళ్లతోనే చెక్కలు కట్టి దృఢమైన ఓడలు నిర్మించేవారు అని వెల్లడించారు. అంటే ఇనుము వాడిన మాగ్నెట్ల వల్ల ప్రమాదమని నాడే గుర్తించా రన్న మాటను గుర్తు చేశారు. జలమార్గాలు అతి ప్రాచీనమైన రవాణా సాధనాలు. మన పూర్వులు సరుకు రవాణాకు నదులు, కాలువలు వంటి మార్గాలను సముద్రానికి అనుసంధానం చేశారు. జలమార్గాలు ఆర్థికవ్యవస్థ ఆయువుపట్టు.
ప్రాచీన భారతదేశంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. చేతివృత్తులు ఉపవృత్తులు. కావలసిన ముడి సరుకు ఎక్కడ తక్కువ ధరకు లభిస్తే అక్కడ కొనేవారు. తక్కువ ధర ఉంటే విదేశీ మార్కెట్లనే ఆశ్రయించారు. రోమన్ సామ్రాజ్యం, ఆగ్నేయాసియా దేశాలతో వ్యాపారం చేశారు. నిజానికి క్రీ।।పూ।। 3000 సంవత్సరాల నాడే (లోథాల్, సింధు నాగరికత) విదేశీ వాణిజ్యం జరిగింది. వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, లోహాలు వివిధ రకాల రాళ్లు ఎగుమతి అయ్యేవి.
‘యుక్తి కల్పతరు’ భారతీయ సముద్రయానం గురించి వివరించింది. పులోమావి గురించి వివరిస్తూ, అక్కడ యుద్ధ నౌకల ముద్రలు ఉన్న నాణేలు దొరికిన సంగతి చెప్పారు. ఇవి ఒక నౌకాదళ విజయానికి గుర్తుగా జారీ చేసిన నాణేలు (పేజీ 650). మౌర్యుల నౌకాదళం అశోకుని వరకు కొన సాగింది. రెండవ పులకేశి మనుమడు విజయాది త్యుడికి పెద్ద నౌకాదళం ఉండేదని, తద్వారా ఉత్తర భారతదేశపు రాజులను సయితం ఓడించగలిగాడని ఐహోల్ శాసనం వివరించింది. మహేంద్రుడు (అశోకుని కుమారుడు) బౌద్దమత వ్యాప్తికి సిలోన్ (శ్రీలంక) వెళ్లాడు. క్రీ।।శ।। 48వ సంవత్సరంలో అయోధ్య యువరాణి సూరిరత్న ఒక పడవలో ప్రయా ణించి కొరియాలోని కరక్ రాజ్యానికి చేరుకుంది. కరక్ రాజు కిమ్సురో ఆమెను వివాహం చేసుకు న్నాడు. ఆమె భారతీయ సంస్కృతి, బౌద్ధం, తేయాకు విత్తనాలు, సుగంధ ద్రవ్యాలను కొరియాకు పరిచయం చేసింది. భారతదేశానికి 7516.6 కి।।మీటర్లు తీర రేఖ (దీవులతో కలిపి) ఉంది. కాబట్టి వారికి సముద్రయానం, సముద్ర వ్యాపారం పెద్ద విషయం కాదు.
మధ్యయుగ చోళ సామ్రాజ్య (900-1100) నౌకాదళం హిందూ మహా సముద్రంపై ఆధిపత్యం చేసింది. ఆగ్నేయ ఆసియాలోని శ్రీ విజయ సామ్రాజ్యానికి (ఆధునికి ఇండోనేషియా, మలేషియా) వ్యతిరేకంగా వాణిజ్య విస్తరణ, సైనిక విజయాలకు వీలు కల్పించింది. రాజేంద్రచోళుని నౌకావిజయాన్ని గురించి. “Transforming the Bay of Bengal into a ‘Chola Lake” ‘యుక్తి కల్పతరు’ తామ్రలిప్తి, కావేరి, భరుఖచ్చ, సుర్పరక మొదలైన నౌకాశ్రయాల గురించి పేర్కొన్నది. అనేకమంది హిందూ సముద్ర వ్యాపా రులు ఆఫ్రికా తీరదేశాలలో స్థిరపడ్డారని ‘పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ’ గ్రంథం చెబుతున్నది. సముద్రయానం ప్రమాదకరం. తుపానులతో ఎందరో వ్యాపారులు, నావికులు మరణించారు. అయినా సముద్రయానంపై మోజు, ఆ వాణిజ్యంతో వచ్చే లాభాలు వాటిని లెక్క చేయనివ్వలేదు. మెగస్తనీసు (ఇండికా) చంద్రగుప్త మౌర్యుని సైన్యం గురించి రాస్తూ, తన సైన్యాన్ని 6 సమితులుగా విభజించాడని దానిలో మొదటిది ‘నావికాదళం’ అని చెప్పాడు. ఈ దళ నిర్వహణను ఐదుగురు సభ్యుల మండలి నిర్వహించేది. కౌటిల్యుని అర్థశాస్త్రంలో ‘నవాధ్యక్షుడు’ అంటే నౌకల నిర్వహణాధికారే. పాన్యపట్టణ చరిత్ర (వాణిజ్యరేవుల చరిత్ర)లో సుల్క (వాణిజ్య ఓడలపై విధించే పన్ను) హింస్రిక (ఓడ దొంగలు) (పైరేట్స్) (పేజీ 649) అన్న మాటలు ఉన్నాయి. కాసకుడి శాసనాల ప్రకారం పల్లవరాజు నరసింహవర్మ శ్రీలంక లేక సిలోన్ను జయించాడు. పెద్ద నావికా దళం లేకుండా ఈ విజయం సాధ్యపడదు. సముద్ర గుప్తుని సార్వభౌమత్వాన్ని అనేకమంది రాజులు అంగీకరించారని హరిసేనుడి అలహాబాద్ శాసనం చెబుతున్నది. వారిలో సింహాళ, వివిధ దీవుల రాజులు ఉన్నారు. హర్షవర్థనుడు గొప్ప నావికాబలాన్ని కలిగి ఉన్నట్లుగా శాసనాలు తెలియజేస్తున్నాయి. కామరూప రాజు భాస్కరవర్మ 30 వేల ఓడలతో వచ్చి కనోజ్ రాజు హర్షవర్ధనుని చేరగా ఇరుసైన్యాలు గౌడ శశాంకునితో యుద్ధం చేసి ఓడించాయని చైనా యాత్రీకుడు యువాన్త్సాంగ్ రాశాడు.
మలబార్ తీరం (కేరళ)లో ‘ముజిరిస్’ ప్రసిద్ద ఓడరేవు. దీనిని సుగంధ ద్రవ్యాల మార్గంగా పిలుస్తారు. ముఖ్యంగా మిరియాలు రవాణా అయ్యేవి. ఇంకా దంతాలు, గంధపుచెక్క, గుర్రాలు, ముత్యాలు, మద్యం, బంగారం ఎగుమతి అయ్యేవి. చేర రాజవంశం కాలంలో ఇది విశ్వనగర కేంద్రం. ఓడ దొంగలు కూడా ఎక్కువే. ఇస్లామ్, క్రైస్తవ మతాల రాకతో ఈ రేవు మూతపడింది. తుత్తుకుడి (ట్యూటి కోరిన్) ఇది తమిళనాడులోని ప్రధాన ఓడరేవు. ఇక్కడ సముద్రంలో ముత్యాలవేట ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ముత్యాల నగరమని పేరు. గుజరాత్ తరువాత అత్యధికంగా ఉప్పును తయారు చేసే కేంద్రం కూడా. కొల్లాం (పూర్వపు పేరు క్విన్)ను చరిత్రలో దేశింగనాడు అని పిలిచారు. ఇది తిరువనంతపురానికి 71 కిలో మీటర్ల దూరంలో ఉంది. జీడిపప్పు తయారీ, కొబ్బరికాయల ఉత్పత్తికి ప్రసిద్ధి కొల్లాం. కాలువ ద్వారా జలమార్గాలకు అనుసంధించి ఉండేది. రోమన్లు, చైనా వారు, అరబ్బులు, ఇతర పాశ్చాత్యదేశాల వారు ఈ కేంద్రం నుండే తమ వ్యాపారాన్ని కొనసాగించేవారు.
తమిళనాడులోని మైలదుత్తురై జిల్లాలోని పూంపుహర్ (కావూరి పూం) పురాతన ఓడరేవు. ఇది క్రీ।।పూ।। 3వ శతాబ్దం నుండి కీ.శ. 4వ శతాబ్దం వరకు చోళ రాజుల మొదటి రాజధానిగా ఉంది. ప్రసిద్ధ తమిళ ఇతిహాసాలు శిలప్పదికారం, మణి మేఖలై ఈ నగరం గురించి వర్ణించాయి.
తామ్రలిప్తి (తమ్లుక్) పశ్చిమ బెంగాల్లోని ప్రసిద్ద ఓడరేవు. ఇక్కడ నుండి రాగి ఎగుమతి అయ్యేది బౌద్దమత వ్యాప్తికి దోహదపడ్డ మహానగరం. దీని గొప్పతనం గురించి, జరిగిన వ్యాపారం గురించి రోమన్ యాత్రీకుడు ప్లినీ, చైనా యాత్రీకులు పాహి యాన్, యువాన్త్సాంగ్లు తమ గ్రంథాలలో వివరించారు. ఇక్కడ నుంచి రాగి, నల్లమిరియాలు, పట్టుబట్టలు ఎగుమతి చేసేవారు. బంగారం దిగుమతి చేసుకునేవారు. పారదీప్ ఒడిస్సాలోని ప్రధాన ఓడరేవు. ఇక్కడి నుండి ఎరువుల సరఫరా జరుగు తుండేది. ఇవికాక కలకత్తా, బొంబాయ్, మద్రాసు ఓడరేవులు గొప్ప వాణిజ్య కేంద్రాలుగా విలసిల్లు తున్నాయి. పుదుచ్చేరి, కరైకల్, మహే, యానాం వంటి ఇతర ఓడరేవులు కూడా ఉన్నాయి. రోమన్ సామ్రాజ్యం నుండి దీనికి వ్యాపార సంబంధాలు న్నాయి. తరువాత ఇది ఫ్రెంచ్ వారి ఆధీనంలోనికి వచ్చింది. భారతీయుల అతి ప్రాచీన ఓడరేవు ‘అరికమేడు’. వీరు రోమ్తో వ్యాపారం చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. తెలుగువారి నౌకాశ్రయాలకు వస్తే మసులా (మచిలీపట్నం) ఘంటసాల, పితుండా (పిఠాపురం త్రవ్వకాలలో) కొత్తపట్నం-క్రీకు (కయ్యా) (ఒంగోలు సమీపం) తాళ్లరేవు కోరంగి, కాకినాడ, కళింగపట్నం, దంతపురం (శ్రీకాకుళం) కృష్ణపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం మొదలైనవి.
నాటి మసులాను ఆనుకుని ఉన్న ఘంటసాల దగ్గర ప్రవహించే ఉప్పుటేరు సముద్రానికి కలిసేది. అప్పట్లో ఈ ప్రాంతంలో ప్రత్తి, వరి విస్తారంగా పండేవి. ఇక్కడ నుండి రోమన్ సామ్రాజ్యానికి వస్త్రాలు, ధాన్యం ఎగుమతి అయ్యేవి. కాలక్రమేణా ఇవి ప్రాభవం కోల్పోయాయి. పిఠాపురంలో జరిపిన త్రవ్వకాల్లో ‘పితుండ’ అనే రేవు పట్టణం బయట పడింది. ఇక్కడ నుండి చంపా (నేటి కంపూచియా) దేశంతో వర్తకం కొనసాగించినట్లు తెలుస్తున్నది. మోటుపల్లి (బాపట్ల సమీపంలో) రేవు నుండి కాకతీయ గణపతి దేవునికాలంలో సముద్ర వ్యాపారం జరిగినట్లు శాసనాధారం ద్వారా తెలుస్తున్నది. కొత్తపట్నం (ఒంగోలు సమీపం) లో కృత్రిమ ఓడరేవును అభివృద్ధి చేశారు. కోరంగి, తాళ్లరేవులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇంగ్లండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్, పోర్చుగల్ దేశాలతో వాణిజ్య సంబంధాలు ఉండేవి. 1839లో వచ్చిన తుపానులో ఈ పోర్టులు కొట్టుకుపోయాయి. కళింగపట్నం ఓడరేవు తూర్పుగాంగుల రాజధాని. నాగర్లపేట త్రవ్వకాలలో బయల్పడ్డ ‘దంతపురం’ (శ్రీకాకుళం రైల్వే స్టేషన్ దగ్గర) నుండి తామ్రలిప్తి, మాయన్మార్, శ్రీలంక మలేషియా దేశాలతో వర్తకం జరిగిన దాఖలాలున్నాయి.
ఆంగ్లేయులు రాకపూర్వం ప్రపంచ జీడీపీలో భారత్ వాటా 27 శాతమని అంగస్ మాడిసన్ అనే బ్రిటిష్ ఆర్థికవేత్త పేర్కొన్నాడు. అంతటి వాణిజ్యపు జాడలు నేటికి కొన్ని కన్పిస్తున్నాయి. ఉదా. బెంగాల్ మస్లిన్ వస్త్రాలు. పారిశ్రామిక విప్లవం పుంజు కుంటున్న రోజుల్లో తమ మిల్లు వస్త్రాలకు పోటీకి రాకుండా నైపుణ్యం కలిగిన నేతన్నల బొటనవేళ్లు కత్తిరించారు.
తూర్పు ఇండియా వర్తక సంఘానికి నౌకా యానంలో పోటీ పడినవారు మన వద్దా ఉన్నారు. వారిలో 1 అర్డేషిర్ కర్సెట్టీ 2. వి.ఓ.చిదంబరం పిళ్ళై 3. వాల్చంద్- హీరాచంద్, 4. జోతీంద్రనాథ్ టాగూర్ 5. సింధియా చరిత్ర ప్రసిద్ధులు.
అర్డేషీర్ కర్సెట్టీ (1808-1877) ఒక ప్రముఖ భారతీయ ఓడల నిర్మాణ నిపుణుడు. లండన్ రాయల్ సొసైటీకి ఎంపికైన మొదటి భారతీయుడు. ఆవిరి యంత్రాలపై ఆయనకు గల ఆసక్తితో 1833లో ఇండస్ అనే 60 టన్నుల ఓడను నిర్మిం చాడు. బోంబే డాక్యార్డ్లో 17 సంవత్సరాలపాటు ఇంజనీర్గా పనిచేశాడు. నవంబర్ 16,1877లో మరణించాడు.
తమిళనాడుకు చెందిన చిదంబరం పిళ్లై ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు. బాల గంగాధర్ తిలక్ అనుమాయుడు. బ్రిటిష్ గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా ‘స్వదేశీ నావిగేషన్ కంపెనీ’ (ఎస్.ఎస్. ఎన్.సి) స్థాపించారు. తుత్తుకూడి- కొలంబోల మధ్య భారతీయుల సొంత నౌకను నడిపించాడు. బ్రిటిష్ వారితో పోటీపడి స్వదేశీని ప్రోత్సహిస్తున్న కారణంగా 40 ఏళ్ల ద్వీపాంతర వాస శిక్షపడింది. జైలులో ఎద్దుకు బదులు ఆయననే కట్టి గానుగ లాగించారు. ప్రస్తుతం తూత్తుకూడి ఓడరేవుకు ఆయన పేరు పెట్టారు. వాల్చంద్ హీరాచంద్ స్వతంత్య్ర పోరాటానికి మద్దతుగా ఫ్రీ ప్రెస్ ఆఫ్ ఇండియా వార్తా సంస్థను ప్రారంభించాడు. అలాగే వ్యాపారంలో హిందూస్థాన్ ఎయిర్క్రాప్ట్ లిమిటెడ్, సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీని స్థాపించి ‘ఎస్.ఎస్. లాయల్టీ’ అనే ఓడను నిర్మించాడు. భారతదేశ పారిశ్రామిక వేత్తల పితామహునిగా పిలుస్తారు.
జ్యోతీంద్రనాథ్ టాగోర్ (రవీంద్రనాద్ టాగోర్ అన్న) 1884లో ఇన్ లాండ్ రివర్ స్టీమ్ నావిగేషన్ సర్వీసెస్ను ప్రారంభించారు. ఇది కలకత్తా – ఖుల్నా బారిసల్ ప్రాంతాల మధ్య ఓడలను నడిపింది. కానీ బ్రిటిష్ వారితో తీవ్రమైన పోటీని ఎదుర్కొని చివరికి ఆర్థికంగా నష్టపోయింది.
సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీని 1919లో నరోత్తమ్ మోరారీ, వాల్ చంద్ హీరా చంద్లు కలిపి స్థాపించారు. వీరు విశాఖపట్నంలో షిప్ యార్డ్ను నిర్మించి ఎమ్.వి. జలఉషను నిర్మించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ, దేశీయ నౌకా పరిశ్రమ అభివృద్ధిలోనూ ముఖ్య పాత్రను పోషించాడు. ఇది ఇప్పటికి నడుస్తున్న భారతీయ షిప్పింగ్ కంపెనీ, 1941లో వైజాగ్ పోర్టు నిర్మాణంలో ప్రముఖపాత్రను పోషించారు. డా।। బాబూ రాజేందప్రసాద్ దీనిని ప్రారంభించారు.
భారతదేశ ఆర్థిక రంగంలో సాధిస్తున్న ప్రగతి వెనుక శతాబ్దాల అనుభవైక చరిత్ర ఉందన్న నిజాన్ని నేటితరం తెలుసుకోవాలి. దేశానికి వాణిజ్యరంగం లోనూ ఘన చరిత్ర ఉన్నదన్న వాస్తవాన్ని పాఠశాల ల్లోనూ, కళాశాలల్లోను, విశ్వవిద్యాలయాల్లోనూ బోధించాలి.

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు