భారతీయ మజ్దూర్‌ ‌సంఘ్‌ – ‌బీఎంఎస్‌ ‌భారతదేశ కార్మిక వర్గం హక్కులు, గౌరవం కోసమని 70 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా, అంకితభావంతో పనిచేస్తోంది. ఏకాత్మ మానవతావాదం సూత్రా లపై స్థాపితమైన దీని ప్రస్థానం సమాజంలోని చివరి వ్యక్తిని ఉద్ధరించే అంత్యోదయ స్ఫూర్తిని కలిగి ఉంటుంది. బీఎంఎస్‌ ‌విలువలలో మమేకమై సమ్మిళిత వృద్ధిని సాధించడంలో భారత్‌లో అతిపెద్ద కార్మిక సంఘంగా కొనసాగు తోంది. ఏడు దశాబ్దాల ఈ మైలురాయి న్యాయ మైన, సామరస్యపూర్వకమైన శ్రామిక శక్తి పట్ల దాని అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

బీఎంఎస్‌ ‌వ్యవస్థాపకుడు దత్తోపంత్‌ ‌ఠేంగ్డీ బీఎంఎస్‌ అనేది రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ‌సృష్టి అని తరచు వ్యాఖ్యానించేవారు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ ‌రెండవ సర్‌సంఘ్‌చాలక్‌ ‌పరమ పూజనీయ గురూజీ గోల్వాల్కర్‌ ‌సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో ఈ సంస్థను స్థాపించారు. ఏఐటీ యూసీ, ఐఎన్‌టూయూసీ, హెచ్‌ఎంఎస్‌, ‌తదనంతరం ఏర్పడిన ప్రధాన జాతీయ కార్మిక సంఘాల్లో బీఎంఎస్‌ ‌చివరిది. అయినప్పటికీ కేవలం 34 సంవత్సరాల్లో దేశంలోనే అతి పెద్ద జాతీయ కార్మిక సంఘంగా ఎదిగింది. బీఎంఎస్‌ ‌తన ప్రస్థానంలో ఇతర కార్మిక సంఘాలు తరచుగా విస్మరించే సమస్యలను పరిష్కరించింది.

భారత్‌కు శక్తిమంతమైన కార్మిక సంఘ ఉద్యమంతో కూడిన ఒక ఘనమైన సంప్రదాయం ఉంది. ప్రముఖ నాయకులు, కార్మిక సంఘ ఉద్యమానికి కీలకమైన నేతలు ఎం.కె.గాంధీ, డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌, ‌దత్తోపంత్‌ ‌ఠేంగ్డీ వంటి మహోన్నత వ్యక్తుల నేతృత్వంలోని అవిశ్రాంత పోరాటాల ఫలితంగా నేడు కార్మికులు హక్కులను, వృత్తి జీవితంలో పురోగతిని అనుభవిస్తున్నారు.

జాతీయ స్ఫూర్తి కీలకంగా..

కార్మికులకు మంచి వేతనాలు, పని పరిస్థితులను నిర్ణయించే కృషిలో బీఎంఎస్‌ ‌మొదట్నుంచీ ముందం జలో ఉంది. అది ఎల్లప్పుడూ సంపాదన, ఆహారం వంటి అంశాలకు మించి ఆలోచించింది. లోతైన దేశభక్తి లక్షణంతో ప్రత్యేకతను సంతరించు కుంది. కార్మిక రంగంలో ‘శ్రామిక శక్తిని జాతీయం చేయాలి’ అని పిలుపును ఇచ్చింది. అది ‘రాజకీయ యూనియనిజమ్‌’, ‌కేవలం ‘రొట్టె, వెన్న ట్రేడ్‌ ‌యూనియనిజమ్‌’ ‌రెండింటిని గట్టిగా తిరస్కరించింది. బీఎంఎస్‌ ‌చర్చల్లో కార్మికుల కోసం మాత్రమే కాకుండా కార్మికులు, యజమానులతో పాటు అన్ని పారిశ్రామిక విషయాల్లో మూడవ, అత్యంత కీలకమైన భాగ స్వామిగా సమాజాన్ని పరిగణించింది. కార్మికులు మెరుగైన వేతనాలు, మెరుగైన పని పరిస్థితుల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు అలాంటి ప్రయత్నాలు దేశ నిర్మాణానికి అర్థవంతంగా దోహదపడాలని బీఎంఎస్‌ ‌నిరంతరం నొక్కి చెప్పింది. ఈ సమతుల్య దృష్టి దాని స్ఫూర్తిదాయకమైన నినాదం ‘దేశ్‌ ‌కే హిత్‌ ‌మే కరేంగే కామ్‌, ‌కామ్‌ ‌కే లేంగే పూరే దామ్‌’ (‌మనం దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తాం, చేస్తున్న పనికి పూర్తి వేతనాన్ని పొందుతాము) లో ఉంది. జాతీయ సంక్షోభ సమయాల్లో నిరంతరం దేశసేవలో పాల్గొనాలని భారతీయ కార్మికులకు బీఎంఎస్‌ ‌పిలుపునిచ్చింది. 1962లో చైనా దురాక్రమణ సమయంలో, 1965, 1971 ఇండో-పాక్‌ ‌యుద్ధాల సమయంలో, బాంగ్లాదేశ్‌ ‌విముక్తి సమయంలో యుద్ధం దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా బీఎంఎస్‌ ‌ముందుకు వచ్చింది. భావ సారూప్యం కలిగిన కార్మిక సంఘాలను కూడగట్టింది. రాష్ట్రీయ మజ్దూర్‌ ‌మోర్చాను ఏర్పాటు చేసింది. అదే సమయంలో అన్ని నిరసన కార్యక్రమాలను, డిమాండ్లను నిలిపివేసింది.

అణచివేత కాలంలో ప్రతిఘటన స్వరం

జూన్‌ 25, 1975‌న ఇందిరాగాంధీ ఆత్యయిక పరిస్థితిని విధించారు. దీనికి ప్రతిస్పందనగా లోక్‌ ‌సంఘర్ష్ ‌సమితి ఏర్పడింది. బీఎంఎస్‌, ‌సీఐటీయూ, హెచ్‌ఎంఎస్‌, ‌హెచ్‌ఎం‌కేపీ ఒక సంయుక్త సర్క్యులర్‌ను జారీ చేశాయి. అయితే అప్పటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆందోళనను కొనసాగించడానికి ఇతర కార్మిక సంఘాలు భయపడినప్పటికీ బీఎంఎస్‌ ‌వీధుల్లోకి వచ్చింది. ఫలితంగా 5,000 మందికి పైగా బీఎంఎస్‌ ‌కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 111 మందిని నిర్బంధ మీసా చట్టం కింద జైలులో పెట్టారు. ఆత్యయిక పరిస్థితిలో బీఎంఎస్‌ ‌చేసిన సాహసోపేతమైన ప్రతిఘటన, త్యాగాలు దేశవ్యాప్తంగా కార్మికుల విశ్వాసాన్ని గెలుచుకున్నాయి. ఇది ఆత్యయిక పరిస్థితిని ఎత్తివేసిన తర్వాత సంస్థ వృద్ధికి దారి తీసింది. దత్తోపంత్‌ ‌ఠేంగ్డీ మొదటిసారిగా బీఎంఎస్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ 1977లో భారతీయ ప్రతినిధి బృందంలో భాగంగా స్విట్జర్లాండ్‌ ‌సందర్శించారు. అక్కడ జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సంస్థ-ఐఎల్‌వో 63వ అంతర్జాతీయ కార్మిక సమావేశానికి హాజరయ్యారు. 1980 నాటికి అప్పటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం బీఎంఎస్‌ను ఐఎన్‌టీయూసీ తర్వాత దేశంలో రెండవ అతిపెద్ద జాతీయ కార్మిక సంఘంగా ప్రకటించింది.

దీని తరువాత అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) వంటి సంస్థలు నిర్వహించే అంతర్జాతీయ సమావేశాలకు వెళ్లే ప్రతి భారతీయ కార్మిక సంఘాల ప్రతినిధి బృందంలోనూ బీఎంఎస్‌కు అధికారికంగా ప్రాతినిధ్యం లభించింది. 1989లో నిర్వహించిన ధ్రువీకరణ ఆధారంగా బీఎంఎస్‌ను దేశంలోనే అతిపెద్ద జాతీయ కార్మిక సంఘంగా అప్పటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా 1990లలో ఐఎల్‌వో తదితర అంతర్జాతీయ సంస్థలు చేపట్టే కార్యక్రమాలకు భారత ప్రతి నిధులను నడిపించే బాధ్యతను బీఎంఎస్‌కు అప్పగించింది.

బీఎంఎస్‌ 1990‌ల నుంచి ఐఎల్‌వో సహా ప్రపంచ కార్మిక వేదికలకు భారత ప్రతినిధులను నడిపించడం ప్రారంభించింది. బీఎంఎస్‌ ‌కార్మికుల ప్రయోజనాలను కాపాడటానికి భారతదేశంలోని కార్మిక సంఘాల మధ్య ఐక్యతను పెంపొందించడానికి నిరంతరం కృషి చేసింది. 1980లో బీఎంఎస్‌ ‌కార్మిక దినోత్సవంగా జరుపుకునే విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొనడానికి వివిధ కార్మిక సంఘాల నాయకులను ఆహ్వానించింది. జూన్‌ 4, 1981‌న ప్రభుత్వ లోపభూయిష్ట కార్మిక వ్యతిరేక విధానాలను ఎదుర్కోవడానికి బీఎంఎస్‌ ‌సహా ఎనిమిది జాతీయ కార్మిక సంఘాలు, జాతీయ పారిశ్రామిక సమాఖ్యలతో కూడిన జాతీయ ప్రచార కమిటీ ఏర్పడింది. 1986లో, పది జాతీయ కార్మిక సంఘాలు మరోసారి ఐక్యమై జాతీయ ఐక్యత, నిరాయుధీకరణ, జాతి వివక్ష వంటి విస్తృత సమస్యలను పరిష్కరించడానికి ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేశాయి. బీఎంఎస్‌ ఈ ఉమ్మడి వేదిక ఏర్పాటును స్వాగతించింది. ప్రపంచ శాంతి, సామరస్యాలను పెంపొందించే దృష్టితో వేదిక కార్యకలాపాలలో ప్రముఖ పాత్ర పోషించింది. ఆర్థికరంగంలో పనిచేసే సంస్థగా, వ్యక్తులు, దేశం రెండింటి ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుంది. ఇది స్వదేశీ భారత్‌ ఆర్థిక కార్యకలాపాల ఆదర్శాలకు ఊతమిచ్చింది. 1984లో హైదరాబాద్‌లో జరిగిన బీఎంఎస్‌ ఏడవ జాతీయ సమావేశంలో, ‘సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా ఆర్థిక స్వాతంత్య్ర యుద్ధం’ను బీఎంఎస్‌ ‌ప్రకటించింది.

టెక్నాలజీకి ఉద్యోగాలను పణంగా పెట్టరాదు

కంప్యూటర్ల పరిచయం ఉద్యోగులపై కొత్త సాంకేతికత ప్రభావం కలిగించే ఒత్తిడిపై ప్రశ్నలను లేవనెత్తింది. నేటికీ, పరిశ్రమ 4.0, కృత్రిమ మేధ, మెషిన్‌ ‌లెర్నింగ్‌, ‌రోబోటిక్స్, ‌తదితర ఉపాధి రంగాన్ని ఆక్రమించే ఆవిష్కరణల చిక్కులతో ప్రపంచం సతమతమవు తోంది. సాంకేతికత, యంత్రాలు ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేయడానికి బదులుగా వారికి సాయంగా ఉండాలని బీఎంఎస్‌ ‌గట్టిగా విశ్వసిస్తుంది. ఉద్యోగులు అత్యధికంగా ఉన్న దేశంగా భారత్‌ ‌హోదాను దృష్టిలో ఉంచుకుని, సాంకేతిక పరిజ్ఞానాలను వాటి అసలు రూపంలో ‘స్వీకరించడం’ కంటే భారతీయ పరిస్థితులకు అనుగుణంగా ‘స్వీకరించాలి’ అని బీఎంఎస్‌ ‌వాదిస్తుంది. అలా చేయని పక్షంలో అది ఉపాధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. బీఎంఎస్‌ ‌తదనుగుణంగా 1981లో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఉద్యోగులను భర్తీ చేసే పరికరాలకు నిరసనగా 1984ను ‘కంప్యూటరీకరణ వ్యతిరేక సంవత్సరం’గా పాటించాలని నిర్ణయించింది. అయితే పరిశోధన, రక్షణ, వాతావరణ శాస్త్రం, సముద్ర శాస్త్రం వంటి సంక్లిష్ట రంగాలలో కంప్యూటర్లను ఉపయోగించడాన్ని బీఎంఎస్‌ ‌వ్యతిరేకించలేదు. కంప్యూటరీకరణతో ఉద్యోగాలపై పడే ప్రభావంపై, ముఖ్యంగా బ్యాంకింగ్‌ ‌వంటి రంగాలలో పడే ప్రభావంపై చర్చించడానికి సంబం ధిత భాగస్వాములతో రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కూడా బీఎంఎస్‌ ‌డిమాండ్‌ ‌చేసింది. అయితే బీఎంఎస్‌ ‌డిమాండ్‌ ‌చేసిన నాలుగు దశాబ్దాల తరువాత కృత్రిమ మేధ, రోబోటిక్స్ ‌వ్యాప్తి పట్ల ఆందోళనలు, వాదనల మధ్య ప్రపంచం మరోసారి అదే తరహా చర్చలో నిమగ్నమై ఉండటం విశేషం.

బీఎంఎస్‌ అం‌తర్జాతీయ వేదికపై వర్గ విభజన కమ్యూనిస్ట్ ‌నినాదం ‘‘ప్రపంచ కార్మికులారా, ఏకం కండి!’’ స్థానంలో సామరస్యంతో కూడుకున్న ‘‘కార్మికులారా, ప్రపంచాన్ని ఏకం చేయండి!’’ అనే నినాదాన్ని ఇచ్చింది. ప్రపంచ కార్మిక సంఘాల ఉద్యమాలతో సానుకూల సంబంధాలను కొనసాగిం చింది. ముఖ్యంగా, 1991 నవంబర్‌లో మాస్కోలో ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య – డబ్ల్యూ ఎఫ్‌టీయూ కమ్యూనిస్టులకు అనుకూలంగా నిర్వహించిన సమావేశానికి బీఎంఎస్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించింది. ఈ సమావేశంలో బీఎంఎస్‌ ‌వ్యవస్థాపక సభ్యుడు ప్రభాకర్‌ ‌ఘాటే నిజమైన కార్మిక సంఘాల ఉద్యమం కోసం బీఎంఎస్‌ అనుసరిస్తున్న రాజకీయేతర ఆదర్శాలను ప్రపంచం ముందు ఉంచారు. అభివృద్ధి చెందుతున్న దేశాలతో వాణిజ్య ఒప్పందాలలో సామాజిక నిబంధనను చేర్చాలంటూ ఐఎల్‌వో చేసిన ప్రతిపాదనను బీఎంఎస్‌ ‌తీవ్రంగా వ్యతిరేకించింది. ఉత్పాదకతలో బాల కార్మికులను వినియోగించుకుంటున్నారనే ఆరోపణతో ఆయా దేశాల నుంచి దిగుమతులను నిషేధించే లక్ష్యంతో ఐఎల్‌వో ప్రతిపాదించిన సామాజిక నిబంధన, భారత్‌, ‌నేపాల్‌ ‌వంటి దేశాల ఎగుమతులపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. అప్పటి బీఎంఎస్‌ ‌ప్రతినిధి ఆర్‌. ‌వేణుగోపాల్‌ ‌దీనికి వ్యతిరేకంగా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలను కూడగట్టారు. మహిళా కార్మికులకు సాధికారత కల్పించడం కోసమని, బీఎంఎస్‌ 1981‌లో కోల్‌కతాలో జరిగిన సమావేశంలో బీఎంఎస్‌ ‌మహిళా విభాగాన్ని స్థాపించింది. ఏప్రిల్‌,1994 ‌న వైవిధ్యభరితమైన భారత్‌లో మత సామరస్యాన్ని పెంపొందించడానికి సర్వపంత్‌ ‌సమదార్‌ ‌మంచ్‌ను నెలకొల్పింది.1995లో పెరుగుతున్న పారిశ్రామిక కాలుష్యం, దాని ప్రతికూల ప్రభావాలను పరిష్కరించడానికి ‘పర్యావరణ్‌ ‌మంచ్‌’‌ను ప్రారంభించింది. తద్వారా ‘ప్రకృతి మాత పొదుగు నుంచి పాలను పిండుకోవాలి తప్ప కోయరాదు’ అనే భారతీయ తత్వానికి ఊతమిచ్చింది.

అధునాతన కార్మిక ఉద్యమాలకు నేతృత్వం

నవంబర్‌ 23, 2011‌న, బీఎంఎస్‌ ‌ఢిల్లీలో ఒక చరిత్రాత్మక సభను నిర్వహించింది. దాదాపు 2 లక్షల మంది కార్మికులు ఆ సభకు హాజరయ్యారు. అది ఇటీవలి దశాబ్దాలలో అపూర్వమైన బల ప్రదర్శనకు ఒక తార్కాణంగా నిలిచింది. ఆ సందర్భంగా బీఎంఎస్‌ ‌నిరంతర ఆందోళన ప్రారంభమైనట్లు ప్రకటించింది. బీఎంఎస్‌ ‌ప్రదర్శన ఇతర కార్మిక సంఘాలకు స్ఫూర్తినిచ్చింది. అందుకు నిదర్శనం అన్నట్టుగా ఆయా సంఘాల నాయకులు ఆ మరుసటి రోజే బీఎంఎస్‌ ‌కార్యాలయానికి వచ్చారు. బీఎంఎస్‌ ‌నాయకత్వాన్ని అంగీకరించారు. ఉమ్మడి కార్యా చరణకు ఉపక్రమించారు. మార్చి 28, 2012న, ఫిబ్రవరి 20-21, 2013లో బీఎంఎస్‌ ‌నాయకత్వంలో అన్ని జాతీయ కార్మిక సంఘాలు కలసికట్టుగా రెండు దేశవ్యాప్త సమ్మెలు చేశాయి. ఈ సమ్మెలు గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. ప్రభుత్వం, యజమానులు, మీడియా, కార్మిక రంగానికి చెందిన వారందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రధానమంత్రి డాక్టర్‌ ‌మన్మోహన్‌ ‌సింగ్‌ ఆఖరి క్షణంలో నేరుగా జోక్యం చేసుకున్నారు. కార్మిక సంఘాలతో చర్చించడానికి, వారి డిమాండ్లను పరిష్కరించడానికి నలుగురు మంత్రులతో ఒక బృందాన్ని నియమించారు. మే 17, 2013న ఢిల్లీలో జరిగిన భారత కార్మిక సదస్సు సందర్భంగా కార్మిక సంఘాల డిమాండ్లను ప్రధానమంత్రి బహిరంగంగా గుర్తించారు. దేశవ్యాప్తంగా కార్మికులలో కొత్త ఆశను, నూతన ఉత్సాహాన్ని కలిగించారు.

రెండు సంవత్సరాలకు పైగా విరామం తర్వాత, అల్లకల్లోల కార్మిక పరిస్థితుల మధ్య జూలై 20-21, 2015లో జరిగిన 46వ భారతీయ కార్మిక సదస్సు ఒక కీలకమైన మలుపునకు దారి తీసింది. ఈ సదస్సులో భాగంగా బీఎంఎస్‌ ‌ప్రతినిధి అధ్యక్షతన ‘కార్మిక చట్ట సంస్కరణలు’పై ఏర్పాటైన కమిటీ సమావేశానికి మూడు సామాజిక భాగస్వాములైన యజమాని సంస్థలు, 11 జాతీయ కార్మిక సంఘాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు హాజరయ్యారు. భవిష్యత్తులోఅన్ని కార్మిక చట్టాలకు కీలకమైన మూడు అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. అవి 1.కార్మికుల హక్కులు, సంక్షేమం, 2.సంస్థల స్థిరత్వం, ఉద్యోగాల కల్పన, 3.పారిశ్రామిక శాంతి. నాలుగు కార్మిక కోడ్‌లు ముసాయిదా దశలో ఉన్నప్పుడు, బీఎంఎస్‌ ‌ప్రతినిధుల బృందం ప్రభుత్వంతో సంప్రదింపుల పక్రియలో చురుకుగా పాల్గొంది. అదే సమయంలో ప్రతిపక్షాలకు చెందిన ఇతర జాతీయ కార్మిక సంఘాలు బహిష్కరించాయి. బీఎంఎస్‌ ‌చురుకైన సంప్రదింపుల ఫలితంగా, అనేక ప్రధాన కార్మిక అనుకూల సంస్కరణలు, ముఖ్యంగా కార్మిక ప్రయోజనాల సార్వజనీకరణ వైపు అడుగులు కోడ్‌లలో విజయవంతంగా చేరాయి. అయితే, కొన్ని నిబంధనలు ఇప్పటికీ తీవ్రమైన ఆందోళన కలిగించే నియమాలను కలిగి ఉన్నాయి. అందువల్లనే వేతన నియమావళి, సామాజిక భద్రతా నియమావళి అనేక అంశాలలో చారిత్రాత్మకమైనవిగా, విప్లవాత్మకమైన విగా పరిగణనకు నోచుకుంటున్నాయి. అయినా, బీఎంఎస్‌ ‌మిగిలిన రెండు కోడ్‌లలో కార్మిక వ్యతిరేక నిబంధనలను సవరించడానికి నిరంతర పోరాటానికి కట్టుబడి ఉంది.

అంతర్జాతీయ కార్మిక వేదికపై భారతీయ గళం

బీఎంఎస్‌ ‌ప్రపంచ నాయకత్వంలో కూడా కొత్త పాత్రను పోషించింది. 2016లో మొదటిసారిగా బ్రిక్స్ ‌కార్మిక సంఘాల ఫోరమ్‌ అధ్యక్ష పదవిని చేపట్టింది. అదే ఏడాది భారతదేశంలో జరిగిన బ్రిక్స్ ‌సదస్సు నిర్వహణ, ఆతిథ్యం అంతర్జాతీయ ప్రతినిధుల ప్రశంసలు అందుకుంది. బీఎంఎస్‌ అధ్యక్షతన 2021లో కోవిడ్‌ ‌మహమ్మారి నడుమ బ్రిక్స్ ‌సదస్సు మరోసారి ఆన్‌లైన్‌లో జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన, భారత్‌ ఆతిథ్యం వహించిన జీ-20 సదస్సుతో 2023 సంవత్సరం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. సదస్సులో కీలకమైన అంశాలలో ఒకటైన లేబర్‌ 20 (ఎల్‌20)‌కి భారత్‌లో అతిపెద్ద జాతీయ కార్మిక సంఘం హోదాలో బీఎంఎస్‌ అధ్యక్షత వహించింది. ఎల్‌ 20 ‌సదస్సుకు 29 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇది ఇప్పటివరకు అత్యంత విస్తృతంగా ప్రాతినిధ్యం వహించిన ఎల్‌20 ‌సదస్సుగా నిలిచింది.

మే 2025లో, ఇండో-పాక్‌ ‌సంఘర్షణ సమయంలో దేశ సరిహద్దులను కాపాడుతున్న సైనికులకు బీఎంఎస్‌ ‌తన తిరుగులేని మద్దతును ప్రకటించింది. సంఘర్షణ సమయంలో ఉత్పత్తికి ఆటంకం కలిగించే సమ్మెలు లేదా ఆందోళనలను ప్రోత్సహించేది లేదని ప్రతిజ్ఞ చేసింది. ఒక దేశం దాని శ్రామిక జనాభాలో ఎక్కువ మంది తక్కువ ఆర్థిక ప్రమాణాలు, పేదరికం, దుర్బలత్వంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు తాను అభివృద్ధి చెందినట్టుగా చెప్పుకోలేదు. అందువల్ల, బీఎంఎస్‌ ‌దాని పునాది భావజాలం ‘ఏకాత్మ మానవతావాదం’లో ముఖ్యమైన అంశంగా ‘అంత్యోదయ’- చివరి కార్మికుడి అభ్యున్నతి – అనే తత్వాన్ని దృఢంగా ప్రోత్సహించింది. దత్తోపంత్‌ ఊహించిన భారతీయ సామాజిక క్రమం ఈ భావనలో లోతుగా పాతుకుపోయింది. బీఎంఎస్‌ ‌దశాబ్దాలుగా భారత్‌ ‌కార్మిక రంగాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషించింది. అంత్యోదయ దృక్పథం పూర్తిగా సాకారం అయ్యే వరకు తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. 70 సంవత్సరాల బీఎంఎస్‌ ‌ప్రస్థా నాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, బీఎంఎస్‌ ‌దేశానికి, దాని శ్రామిక శక్తికి అచంచలమైన అంకిత భావం, నిస్వార్థ సేవకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇది రాబోయే సంవత్సరాల్లో దాని లక్ష్యం నెరవేరు తుందని నిర్ధారించే వారసత్వంగా వాసికెక్కుతుంది.

విశ్వకర్మ జయంతి × మే డే

విశ్వకర్మన్‌ ‌హవిష వవృధనః- (ఋగ్వేదం 10.81.6.) భారతదేశ చరిత్రలో ఇతరుల కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప వ్యక్తుల సుదీర్ఘ సంప్రదాయాన్ని విశ్వకర్మ ప్రారంభించారు. ఆయన ప్రపంచంలోనే మొట్టమొదటి శ్రమజీవి. శ్రమకు ఆచార్యుడు. వివిధ కులాల శ్రమ విభాగాలకు చెందిన చాలా మంది తాము విశ్వకర్మ వారసులమని భావిస్తారు. నైపుణ్యంతో కూడుకున్న పని ద్వారా సమాజానికి సేవ చేసిన గౌరవనీయులైన వృత్తి కార్మికులను విశ్వకర్మలు అని పిలుస్తారు. పాశ్చాత్య చరిత్రలో శ్రమ ఎల్లప్పుడూ దోపిడీకి గురవుతూనే ఉంది. పాశ్చాత్య చరిత్రలో బానిసత్వ కాలంలో, యజమానికి తన బానిసల జీవితంపై కూడా హక్కు ఉంది. అయితే పారిశ్రామిక విప్లవం తర్వాత పెద్ద కర్మాగారాలు ఆవిర్భవించాయి. కర్మాగార ప్రాంగణంలో కలసి పనిచేసే వేలాది మంది కార్మికులు తమను తాము వ్యవస్థీకృతం చేసుకున్నారు. ఆ కారణంగా పాశ్చాత్య సమాజం నెమ్మదిగా కార్మికులను గుర్తించడం ప్రారంభించింది. అయితే భారతదేశంలో వేదకాలం నుంచి శ్రమకు సమాజంలో ఉన్నతమైన గౌరవప్రదమైన స్థానం ఉంది. దైవత్వాన్ని సంతరించుకున్న విశ్వకర్మ శ్రమ గౌరవానికి ప్రతీకగా నిలుస్తారు. విశ్వకర్మ నమూనా శ్రమపై ప్రస్తుత ఆలోచనా విధానంలో మార్పును సూచిస్తుంది. దానిలో ఒక అంశం ఏమిటంటే, బీఎంఎస్‌ ‌కుటుంబాన్ని పారిశ్రామిక సంబంధాలకు ఒక నమూనాగా అంగీకరించింది, అంటే ‘పారిశ్రామిక కుటుంబం’. ఇది పశ్చిమ దేశాల యజమాని-సేవకుడు సంబంధానికి లేదా కమ్యూనిస్టుల వర్గ శత్రువు భావనకు భిన్నంగా ఉంది. పశ్చిమం నుండి దిగుమతి చేసుకున్న మేడే శ్రమను సానుకూలంగా ప్రేరేపించడంలో విఫలమవు తుంది. అయితే విశ్వకర్మ జయంతి ఆ విషయంలో సఫలమవుతుంది. అందుకనే బీఎంఎస్‌  ‌మేడేను కార్మిక దినోత్సవంగా జరుపుకోకూడ దని నిర్ణయించింది. బదులుగా, విశ్వకర్మ జయంతిని జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటుంది. భారతదేశంలోని అనేక రాష్ట్రాలు కూడా అధికారికంగా విశ్వకర్మ జయంతిని కార్మిక దినోత్సవంగా ప్రకటించాయి.

సాజీ నారాయణన్‌ ‌సీకే

బీఎంఎస్‌ ‌మాజీ అధ్యక్షుడు

‘ఆర్గనైజర్‌’ ‌నుంచి

About Author

By editor

Twitter
YOUTUBE