దారిద్య్రం నుంచి ధనం వైపునకు, అజ్ఞాన తిమిరం నుంచి సుజ్ఞాన దిశగా నడిపే దివ్య తేజోమూర్తి శ్రీమహాలక్ష్మిని విష్ణుపురాణం ‘విశ్వమాత’గా అభివర్ణించింది. ధనం అంటే కేవలం స్థిరచరాస్తులే కాదు. ఆరోగ్యం, ఆయుష్షు, విద్యా, వివేకాలు, కీర్తిప్రతిష్ఠలు, అభయం, ధైర్యం, స్థయిర్యం, విజయం, వీర్యం, శౌర్యం, సాహసం, ధనధాన్యాలు, వస్తువాహనాలు, పుత్ర పౌత్రాదులు… ఇలా అన్నీ సంపదే. వీటన్నిటికి అధిదేవత శ్రీ మహాలక్ష్మి. మహిళలు తమ సౌభాగ్యం, కుటుంబ శ్రేయస్సు కోసం వరలక్ష్మిదేవిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. క్షీరసాగర మథనవేళ ఉద్భవించిన హాలాహలాన్ని పరమశివుడు స్వీకరించి ‘నీలకంఠుడు’ అయ్యిందీ ఈ మాసంలోనే కనుక, ఈ నెలలోని సోమవారాల్లో ఆయనకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు.

లక్ష్మీనారాయణులది అవిభాజ్య బంధమని, వారిని అర్చించడం వల్ల ముక్తి లభిస్తుందని పెద్దల మాట. విష్ణు సహస్రపారాయణానికి ముందు మహాలక్ష్మిని స్తుతించినట్లే, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేందుకు మొదట శ్రీహరిని ఆరాధించాలని పూర్వాచార్యులు అనుగ్రహించారు. చపలచిత్తగా పేరున్న అమ్మవారు శ్రీహరిని మాత్రం వీడి ఉండరు. అంటే లక్ష్మీకటాక్షానికి విష్ణ్వారాధన ప్రధానంగా భావిస్తారు. లక్ష్మీదేవి వైకుంఠంలో ‘మోక్షలక్ష్మి’గా ఉంటుందని, చతుర్విధ పురుషార్థాలకు ఆమె చతుర్భుజాలు ప్రతీకలని చెబుతారు. ఆమెను అర్చించే ప్రధాన పర్వదినమే వరలక్ష్మి వ్రతం. ‘లోకంలో పరమ పావనమైన వ్రతం ఏది?’ అన్న జగన్మాత పార్వతీదేవికి మహాదేవుడు దీనిని ఉపదేశించారని, ఆమె మొట్టమొదటిసారిగా వరలక్ష్మి వ్రతం ఆచరించారని భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. ‘వరం’ అంటే శ్రేష్ఠమైన అని, ‘లక్ష్మి’ అంటే సకల శుభలక్షణాలు గల దేవత. ఆమె కరుణా కటాక్షాలతోనే సకల సంపదలు, శుభాలు కలుగుతాయని మహిళాలోక విశ్వాసం. అందుకే వర్ణ,వర్గ,భేదాలకు అతీతంగా వరలక్ష్మి వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించడం సంప్రదాయకంగా వస్తోంది. ఈ వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని ‘వ్రతరత్నాకరం’ పేర్కొంటోంది. అవకాశం లేనివారు ఈ మాసంలోనే ఇతర శుక్రవారం కూడా వ్రతం ఆచరించవచ్చని పెద్దలు ప్రత్యా మ్నాయం సూచించారు. అమృతం కోసం దేవ దానవులు పాలకడలిని చిలికినప్పుడు శుక్రవారం నాడు అవతరించిన అమ్మవారిని విష్ణుపురాణం ‘విశ్వమాత’గా అభివర్ణించింది. అందుకే లక్ష్మీదేవికి శుక్రవారం ప్రీతికరమైనదిగా చెబుతారు. భృగుప్రజాపతి తపస్సుకు మెచ్చి లక్ష్మీదేవి ఆయన తనయగా అవతరించినందున, ఆయన అధిపతిగా గల శుక్రవారం (భృగు వాసర) లక్ష్మీపూజకు శ్రేష్ఠమని శాస్త్రం. సౌమాంగల్యం, సత్సంతానాభివృద్ధి కోసం వర•లక్ష్మిని ఆరాధిస్తారు. వైవాహిక జీవితం సవ్యంగా సాగాలని వివాహితలు, ఉత్తమ జీవిత భాగస్వాముల కోసం అవివాహితలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆషాడంలో పుట్టినింట ఉండే నవ వధువులు శ్రావణం ప్రవేశించాక, మొదటి మంగళవారం నోము జరుపుకుని మెట్టినింటికి చేరి వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఆచారంగా వస్తోంది. వివాహితలు శ్రావణంలోని శుక్రవారాలు లక్ష్మీపూజ, పెళ్లికాని యువతులు మంగళవారాలు మంగళగౌరి వ్రతం ఆచరించడం సంప్రదాయం.

ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ప్రత్యేక నియమాలంటూ లేవని, నిశ్చలమైన భక్తితో దేవిని అర్చించి, వ్రత కథ చదివితే చాలని అంటారు. అమ్మవారి ధ్యాన, ఆవాహనలతో ప్రారంభమయ్యే వ్రతం షోడశోపచార•, అంగపూజలు, అష్టోత్తరశత (సహస్ర) నామాలతో కొనసాగి, వ్రతకథతో పరిసమాప్తమవుతుంది. వ్రతకర్తలు ముత్తయి దువలకు…

‘ఇందిరా ప్రతిగృహ్ణాతి ఇందిరా వై దదాతి చ!

ఇందిరా తారికా ద్వాభ్యామ్‌ ఇం‌దిరాయై నమో నమః’ (తోటి ముత్తయిదువా! ఈ వ్రత పరిసమాప్తితో మనిద్దరం లక్ష్ములమే. మనందరిలోనూ,మన చేతి తోరాల్లోనూ లక్ష్మి ఉందని గ్రహించాను. లక్ష్మీ స్వరూపిణీవై దీనిని స్వీకరించు) అని వాయనం ఇస్తారు. చారుమతీదేవి అనే భక్తురాలు ఈ వ్రతాన్ని ఆచరించి అష్టైశ్వర్యాలు, సకల శుభాలు పొందిందని పురాణాలు పేర్కొంటున్నాయి. దాని స్ఫూర్తితోనే ఈ వ్రతవిధానం అచరణలోకి వచ్చింది.

పసుపు, కుంకుమ, పూలు, సుగంధ•ద్రవ్యాలు, ఆవునేతితో వెలిగే జ్యోతి రూపంలోనూ గౌరీదేవి కొలువై ఉంటుందని, అందుకే ఇంటికి వచ్చిన ముత్తయిదువులకు మంగళకరమైన వస్తువులు ఇచ్చి ఆశీర్వాదం పొందుతుంటారు. ఈ వేడుకల వల్ల ఆధ్యాత్మికతే కాక పాటు సామాజిక బంధాలు పటిష్టమవుతాయి. పేరంటం వేడుకలో ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు స్నేహభావం, సహకార భావం పెంపొందే అవకాశం ఉంటుంది.

ఏనుగులతో అభిషేకం అందుకుంటున్న శ్రీమహాక్ష్మిని ఉదయం నిద్రలేవగానే స్మరించడం వల్ల ఆరోగ్యానికి, సంపదకు లోటు ఉండదని శంకర భ•గవత్పాదులు అనుగ్రహభాషణ చేశారు. అష్టలక్ష్ములుగా భక్తజనావళిని అనుగ్రహించే శ్రీసతి గురించి …

‘కమల నయన! నీవు కచోటు సరసంబు

నీవు లేని చోటు నీరసంబు

కంబుకఠి! నీవు కలవాడు కలవాడు

లేనివాడు నీవు లేని వాడు’

అని కవిసార్వభౌముడు శ్రీనాథ మహాకవి చాటువులో చాటించాడు. ఇందుకు ప్రచారంలో ఉన్న పురాణగాథ కూడా అదే చెబుతుంది. ఒకసారి ఇంద్రుడు అహంకారం కొద్దీ విష్ణు ప్రసాదాన్ని ధిక్కరించి, అటు తరువాత పశ్చాత్తాపం చెందాడు. ‘దైవారాధన, ప్రేమానురాగాలు, సచాచారం, ధర్మనిష్ఠ, విష్ణు-గోసేవ, శుచీశుభ్రత, సత్య సంభాషణంగల లోగిళ్లు లక్ష్మీనిలయాలు. అందుకు వి

రుద్ధంగా వ్యవహరించడమే కాక, సూర్యోదయ, సూర్యా స్తమయాల్లో నిద్రించే చోట లక్ష్మి క్షణమైనా నిలవదు’ అని శ్రీహరి వివరించాడట. ఇది పురాణ గాథ అయినా, మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునే హితోక్తులుగానే భావించాలి.


ఆత్మీయ‘ఖని’ రాఖీ

సమైక్య జీవన సూత్రాలను, సమష్టి తత్వ్తాన్ని ఆవిష్కరించేదే రాఖీ పండుగ. రక్షాబంధన్‌, ‌రక్షా మంగళ్‌, ‌రక్షా దివస్‌, ‌రాఖీ పూనవ్‌, ‌సలోని ఉత్సవ్‌ ‌తదితర పేర్లతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో దీనిని జరుపుకుంటారు. రక్షాబంధన్‌ ‌పేరిట రక్ష కట్టుకొనే సంప్రదాయం అనాదిగా ఉంది. భవిష్యోత్తర, విష్ణు, కూర్మ పురాణాలు రక్షాబంధన్‌ ‌గురించి చెబుతున్నాయి. విష్ణుపురాణం

రాఖీ పౌర్ణమిని ‘బలేవా’గా ప్రస్తావించింది (బలేవా అంటే బలీయమైన శక్తి). దేశమంతటా బంధుభావంతో జరుపుకునేది రాఖీపండుగ. ఇది సోదర•త్వానికి ప్రతీక. మనుషుల మధ్య ఆత్మీయ భావనను పెంపొందించడమే కాక కుటుంబ విలువలను పటిష్ట పరుస్తుంది. యుద్థాలలో విజయసిద్ధి కోసం, దుష్టశక్తులను పారదోలేందుకు ఉద్దేశించిన ఈ రక్షాబంధన్‌ ‌కాలక్రమంలో సోదర సోదరీ ప్రేమకు ప్రతీకగా మారింది. యుద్ధవీరులలో పట్టుదల, ఆత్మస్థయిర్యం కలిగేందుకు రక్ష కట్టేవారు. సోదరీమణులతో రక్ష కట్టించుకున్న వారికి యమకింకరుల బెడద ఉండదని యముడు తన సోదరికి యయునకు చెప్పినట్లు భవిష్యోత్తర పురాణం వెల్లడించింది. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల విజయం కోసం రుక్మిణితో శ్రీకృష్ణుడు వారికి రక్ష కట్టించి. దానిని ‘విజయపథం’గా అభివర్ణించాడని కథనం. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో బాలా గంగాధర్‌ ‌తిలక్‌ ఆ ‌పండుగను ‘స్వేచ్ఛాభారత్‌ ‌రక్షా పర్వ్‌గా వ్యవహరించారు.


శ్రావణ పున్నమి వైశిష్ట్యం

ఈ మాసంలోని పున్నమికి ఎన్నో విశిష్టతలు. జ్ఞానప్రదాత, వాగీశ్వరుడు హయగ్రీవుడు అవతరించిన తిథి. కలియుగదైవం శ్రీనివాసుడి ఆవిర్భావం శ్రవణ నక్షత్ర యుక్త పౌర్ణిమ నాడే. మహాలక్ష్మికి పరమేశ్వరుడు ధనాధిపత్యాన్ని, సరస్వతీమాతకు విద్యాధిపత్యాన్ని అనుగ్రహించినది ఈ తిథినాడే అని పురాణాలు చెబుతున్నాయి. సంస్కృత భాషను సృజించి, సర్వేశ్వరుడు బ్రహ్మకు జ్ఞానభాండంగా అందించినది ఈ తిథి నాడే అని శరభసంహిత పేర్కొంది. వైఖానస సంప్రదాయ ప్రవర్తకులు విఖానస మహర్షి కూడా ఆవిర్భవించిన తిథి. వేదాధ్యాయనం ఆరంభించే రోజు. ‘ఇతర పున్నములు అనధ్యాయాలు.

శ్రావణ పౌర్ణమి అందుకు మినహాయింపు’ అని వేదమూర్తులు చెబుతారు. అందుకే వేదాధ్యాయనాన్ని ఈ తిథినాడే ఆరంభిస్తారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పౌర్ణమి నాడు సముద్రాన్ని పూజించే ఆచారం ఉంది. శ్రావణ పౌర్ణమికి రెండు నెలల ముందు సముద్రం తుపానులతో నిండి ఉండడం వల్ల సముద్రయానాన్ని నిలిపివేసి, పరిస్థితి చక్కబడిన తరువాత ఈ తిథి నాడు సముద్రాన్ని అర్చించి ప్రయాణం పునః ప్రారంభించేవారు. సాగరపూజ చేసి కొబ్బరికాయలు సమర్పిస్తారు కనుక నారికేళ పౌర్ణమి, నార్లీ పూర్ణిమ అంటారు.


నూతన యజ్ఞోపవీతధారణ / ఉపాకర్మ

శ్రావణ పూర్ణిమ నాడు ద్విజులు నూతన యజ్ఞోపవీతధారణ చేస్తారు. జపహోమాది వైదిక క్రియల నిర్వహణకు దీక్షా సూచికగా నూతన యజ్ఞపవీతం ధరించాలని శాస్త్రం చెబుతోంది. గడచిన సంవత్సరంలో ఏమైనా దోషాలు చోటు చేసుకుంటే మంత్రసహిత నూతన యజ్ఞోపవీత ధారణతో సమసి పోతాయని పెద్దల మాట. ఈ తిథికి ముందు ఉపనయనం చేసుకొన్న వారికి ఉపాకర్మ నిర్వహిస్తారు. ఉపనయనం వేళ యజ్ఞోపవీతంలో కట్టే ‘మౌంజి’ని నూతన యజ్ఞోపవీతాన్ని ధరింప చేస్తారు. ఉపాకర్మ వేదాధ్యయనానికి సంబంధించినది. దీనిని ‘ఉపాకరణం’ అని కూడా అంటారు. ‘సంస్కార పూర్వం గ్రహణం స్యా దుపాకరణం శ్రుతేః’… సంస్కారం అంటే ఉపనయం. ఆనాటి నుంచి వేదాన్ని అధ్యయనం చేయడం ఉపాకరణం. కొత్తగా వేదాధ్యయనం మొదలు పెట్టడానికి, అధ్యయనం చేసిన దానిని జ్ఞాపకం ఉంచుకునేందుకు ఆవృత్తి చేయడం, వల్లె వేయడానికి కూడా ఈ రోజునే నిర్ణయించారు.

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE