బిహార్లో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాకు సంబంధించి చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) సక్రమమేనని తాజాగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ చేపట్టడానికి ఎన్నికల సంఘానికి అడ్డంకులు తొలగిపోయాయి. ముఖ్యంగా ఎన్నికల సంఘానికి ఇటువంటి పక్రియ చేపట్టే అధికారం లేదంటూ పిటిషనర్లు చేసిన వాదనలను కోర్టు కొట్టివేసింది. ఇదే సమయంలో ఆధార్, రేషన్ కార్డులను కూడా ఓటర్ల గుర్తింపునకు ఆధారంగా తీసుకోవచ్చని స్పష్టం చేసింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 కింద ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను తయారుచేస్తుంది. ఈ చట్టంలోని 16వ సెక్షన్ కింద పౌరులు కాని వారిని ఎన్నికల జాబితానుంచి తొలగించి, సెక్షన్-18 కింద, 18 సంవత్సరాలు నిండిన వయోజనులను ఈ జాబితాలో చేరుస్తుంది. ఇదే చట్టంలోని 21వ సెక్షన్ ప్రకారం ఎన్నికల సంఘం సరైన కారణాల నేపథ్యంలో ప్రత్యేకంగా సమీక్షించి ఓటర్ల జాబితాను నవీకరించే అధికారాన్ని కలిగివుంటుంది. ఎన్నికల సంఘం చేపట్టే నిరంతర పక్రియ ఇది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కింద బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్ఓ) నియోజకవర్గాల్లోని ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితాను సరిచూసి అవసరమైన మార్పులు చేర్పులతో సవరిస్తారు. ఈ చట్టం కింద గతంలో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో సవరణలు చాలాసార్లు చేపట్టింది. 1952-56, 1957, 1961, 1965, 1966, 1983-84, 1987-88, 1992, 1993, 1995, 2002, 2003, 2004 సంవత్స రాల్లో ఓటర్ల జాబితాలో సవరణలు జరిగాయి. కాగా వచ్చే ఏడాది మే-జూన్ నాటికి అసెంబ్లీ కాల పరిమితులు ముగియనున్న అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ను ఈ ఏడాదిలోగా ప్రారంభించ నుంది. ముందుగా బిహార్లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో తక్షణం ఇక్కడ ఎస్ఐఆర్ పక్రియను చేపట్టింది. తదనంతరం పశ్చిమబెంగాల్లో ఈ పక్రియను చేపడుతుంది.
బిహార్లో ఎస్ఐఆర్
ఈ ఏడాది బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం గత జూన్ 24 నుంచి రాష్ట్రంలో ఎస్ఐఆర్ను ప్రారంభించింది. ఇంటింటికి తిరిగి ఓటర్ల వివరాలను పరిశీలించి నప్పుడు ఆశ్చర్యకరంగా జాబితాలో నేపాల్, బాంగ్లాదేశ్, మయన్మార్లనుంచి వలస వచ్చినవారి పేర్లు అధికంగా ఉన్నట్టు తేలింది. వీరు చూపించిన ఆధార్కార్డులు, డొమిసిల్ సర్టిఫికెట్లు, రేషన్ కార్డులు అక్రమ మార్గాల ద్వారా సంపాదించినవేనని తేలింది. ఇటువంటి కేసులను ఆగస్టు 1నుంచి 30లోగా విచారించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. విచారణలో అక్రమ వలసదార్లని తేలితే వీరి పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు.
ఈ చర్య వల్ల రాష్ట్రంలో రాజకీయపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ విధంగా ఓటర్ల జాబితాలో పేర్లు నమోదైన వారంతా విపక్షాలకు అనుకూలురు కావడం గమనార్హం. ఇటువంటి అక్రమ వలసదార్లకు, దొడ్డి దారిన ఆధార్కార్డులు, రేషన్కార్డులు ఇప్పించి ఓటర్ల జాబితాలో వీరి పేర్లను చొప్పించారన్న ఆరోపణలున్నాయి. ఈ పేర్లు తొలగిస్తే విపక్షాల ఓటుబ్యాంకు గండిపడటం ఖాయం. అందువల్లనే కాంగ్రెస్ సహా విపక్షాలు ఈ ఎస్ఐఆర్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అసలు ఈ పక్రియను ఇప్పుడు చేపట్టడమేంటని అవి ప్రశ్నిస్తున్నాయి. కేవలం బీజేపీకి ప్రయోజనం కలిగించేందుకే ఎన్నికల సంఘం ఇప్పుడు ఈ పక్రియ మొదలుపెట్టిందంటూ గగ్గోలు పెడుతున్నాయి. అయితే ఎన్నికల సంఘం వాదన మరోలా ఉంది. గతంలో ఎస్ఐఆర్ చేపట్టి తర్వాత పట్టణీకరణ, వలసలు పెద్దఎత్తున చోటుచేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఓటర్ల జాబితాల పరిశీలన తప్పనిసరని స్పష్టం చేస్తోంది. అంతేకాదు ఇటీవలి సంవత్సరాల్లో పట్టణాలకు విపరీతంగా వలసలు పెరిగిన నేపథ్యంలో ఓటర్ల జాబితాను తాజాగా రూపొందించడం అత్యంత అవసరమని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం వాదనను బీజేపీ సమర్థిస్తుండగా, విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో ఎన్నికల సంఘం ఈ పక్రియను మరింత వేగంగా అమలు జరుపనుంది. బిహార్లో 2003లో ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ను నిర్వహించింది. ఈ పక్రియ కింద అనర్హులైన ఓటర్ల పేర్లను తొలగించి, అర్హులైనవారు, గతంలో జాబితాలో పొరపాటున తమపేర్లు తొల గింపునకు గురైనవారి పేర్లను ఎన్నికల సంఘం చేరు స్తుంది. అంతేకాదు వలస వచ్చినవారు లేదా ఇతర ప్రాంతాలనుంచి వచ్చి స్థిరపడినవారి పేర్లను తిరిగి నమోదు చేయడం కూడా ఎస్ఐఆర్లో భాగమే. ఎస్ఐఆర్ డిజిటల్ ఇంటిగ్రేషన్కు కూడా వెసులుబాటు కల్పిస్తుంది. ఈ విధానం కింద వలసవచ్చినవారు రిమోట్ ఓటింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. దేశంలో ఈ విధంగా మొబైల్ ఈ-ఓటింగ్ అమలు జరిపిన మొట్టమొదటి రాష్ట్రం బిహార్. మున్సిపల్ ఎన్నికల్లో ఈ-ఎస్ఈసీబీహెచ్ఆర్ యాప్ ద్వారా బ్లాక్ ఛైన్, ముఖం గుర్తింపు, బయోమెట్రిక్ స్కానింగ్, ఓటర్ ఐ.డి.ని పరిశీలించడం ద్వారా ఓటింగ్ పక్రియను నిర్వహించారు.
88.18% మంది వివరాల సేకరణ
ఎన్నికల సంఘం అందించిన సమాచారం ప్రకారం బిహార్లో ఇప్పటి వరకు 6.6 కోట్ల మంది తమ వివరాలను అందజేశారు. అంటే మొత్తం ఓటర్లలో 88.18% మేర ఈ పక్రియ పూర్తి చేసినట్లయింది. జులై 25వ తేదీలోగా రాష్ట్రంలోని ఓటర్లు తమ వివరాలను కమిషన్కు అందజేయాలి. మొత్తం ఓటర్లలో 1.59% మంది మరణించారు. అంటే వీరి సంఖ్య 12.5 లక్షలు! అయినప్పటికీ వీరి పేర్లు ఇంకా ఓటర్ల జాబితాలో కొనసాగుతున్నాయి. మరో 17.5లక్షల మంది అంటే 2.2% మంది బిహార్ నుంచి శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వీరు బిహార్లో తమ ఓటుహక్కును వినియోగించుకోవడానికి వీల్లేదు. మరో 5.5లక్షల మంది అంటే 0.73 శాతం మంది పేర్లు రెండు సార్లు నమోదయి ఉన్నాయి. ఈ మొత్తాలను పరిశీలిస్తే 35 లక్షల ఓటర్ల పేర్లు జాబితానుంచి తొలగించడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. అంటే మొత్తం ఓటర్లలో 4.5%. ఈ తొలగింపుతో రాష్ట్ర ఎన్నికల రాజకీయమే పెద్ద కుదుపునకు లోనుకానున్నది. ముఖ్యంగా ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గం నుంచి ఒక్కశాతం ఓట్లు తగ్గించినా, సగటున ఒక్కొక్క నియోజకవర్గానికి 3200 ఓట్లు తొలగింపునకు గురవుతాయి. ఈ రకంగా ఓట్లు తొలగించుకుంటూ పోతే మొత్తంమీద 5 శాతం ఓట్లు తగ్గిపోయే ప్రమాద ముంది. ఇది ఎన్నికల ఫలితాలను తారు మారు చేస్తుందని హెచ్చరించారు.
అనధికారిక సర్వేలు
అనధికారిక సర్వేల ప్రకారం రాష్ట్రంలో 77 లక్షల మంది పేర్లు సందేహా స్పదంగా మారాయి. అయితే అధికారిక సమాచారం ప్రకారం 35 లక్షల మంది ఇటువంటి ఓటర్ల పేర్లు తొలగించే అవకాశ మున్నట్టు తెలుస్తోంది. వీరిలో చాలామంది ఇతర ప్రాంతాలకు వలసవెళ్లడమో లేక చనిపోవడమో జరిగింది. 2025 జూలై నాటికి ఎన్నికల సంఘం జాబితా ప్రకారం బిహార్లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.89 కోట్లు. అయితే ఇందులో 7.12కోట్ల మంది మాత్రమే నిజమైన ఓటర్లని, మిగిలిన వారు సందేహాస్పదులన్నది ప్రైవేటు సర్వేలు వెల్లడిస్తున్నాయి! ఇదే నిజమైతే నకిలీ ఓటర్లు 9.7శాతం అధికంగా ఉన్నట్టే లెక్క! ఒక్కొక్క నియోజకవర్గానికి సగటున ఇటువంటి ఓటర్లు 30 వేల వరకు ఉన్నారు. అంటే ఎన్నికల ఫలితాలను ఇటువంటి దొంగ ఓటర్లు తీవ్రంగా ప్రభావితం చేసే స్థితిలో ఉన్నారు. గట్టిపోటీ ఉండే నియోజకవర్గాల్లో తక్కువ మెజారిటీతో అభ్యర్థుల విజయం సాధించడంలో ఈ ఓటర్ల ప్రభావం కీలకంగా ఉంటోంది. స్వాతంత్య్రానంతరం బిహార్లో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే 20 శాతం సీట్లలో, ముఖ్యంగా 14 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల గెలుపు మార్జిన్ 2.5 శాతం ఓట్లుగా తేలింది. వీటిల్లో ఏడు నియోజక వర్గాల్లో అభ్యర్థి విజయానికి కేవలం ఒక్క శాతం ఓట్లు దోహదం చేసినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సరైన ధ్రువీకరణ లేని ఓటర్ల పేర్లను కొనసాగించకపోతే ప్రజాస్వామ్య పక్రియకు అర్థం ఉండదు.
2003-2023 మధ్యకాలంలో 1.12 కోట్లమంది బిహార్కు చెందిన వయోజన ఓటర్లు ఇతర ప్రాంతాలకు వలసపోయినట్టు ప్రైవేటు సర్వేలు తెలుపుతున్నాయి. అంటే వార్షికంగా సగటున రాష్ట్రం నుంచి 5.5 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నట్టు లెక్క! 2012-25 మధ్యకాలంలో కూడా ఇదే మాదిరి వలసలు తప్పక కొనసాగి ఉంటాయని అంచనాకు రావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో 2012-25 మధ్యకాలంలో 72 లక్షల మంది వలసదారుల పేర్లు అదనంగా ఓటర్ల జాబితాలో చేరినట్లు ఈ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ సమస్య కేవలం బిహార్కే పరిమిత మనుకుంటే పొరపాటే. ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్, ఒడిషా రాష్ట్రాలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. వీటిని పరిశీలిస్తే ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ను చేపట్టడం ఇప్పటికే ఆలస్య మైందని చెప్పాలి. ఎందుకంటే గత ఎస్ఐఆర్ను బిహార్లో 2003లో నిర్వహించింది. అంటే 22 సంవత్సరాలు దాటిపోయింది.
మమతమ్మ గొంతులో పచ్చి వెలక్కాయ
పశ్చిమ బెంగాల్లో కూడా ఓటర్ల జాబితాలో పెద్దఎత్తున మార్పులు చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించిన నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గొంతులో పచ్చివెలక్కాయ పడిన చందంగా మారింది. పశ్చిమ బెంగాల్నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు ఇతర రాష్ట్రాల్లో బ్లూ కాలర్ ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. ముఖ్యంగా వీరంతా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారే. 2011 జనగణన ప్రకారం ఈవిధంగా ఇతర రాష్ట్రాకు వలస వెళ్లి పనిచేస్తున్న బెంగాలీల సంఖ్య కేవలం 24.1 లక్షలు కానీ ప్రస్తుతం ఈ సంఖ్య మూడుకోట్లు దాటిపోయి ఉంటుందని అంచనా. అయితే ఇతర రాష్ట్రాల్లో వివిధ రకాల వృత్తుల్లో వైట్కాలర్ ఉద్యోగాల్లో ఉన్నవారిని ఇందులో చేర్చలేదు. ఇటువంటి వారిలో ఓట్లకోసం బెంగాల్కు వచ్చేవారి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. సీఈఐసీ అనే ఒక ప్రైవేటు సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఇతర రాష్ట్రాలకు వలసపోయిన బెంగాలీల సంఖ్య 3.34 కోట్లు! కానీ వెస్ట్ బెంగాల్ మైగ్రెంట్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో నమోదు చేసుకున్న వారి సంఖ్య 21.67లక్షలు మాత్రమే. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ సమాచారం ప్రకారం ఈవిధంగా వలసలు ప్రధానంగా ముర్షిరాబాద్, నాదియా, మాల్డా, బీర్భుమ్, 24 పరగణాల జిల్లాల నుంచి చోటుచేసుకున్నాయి. ఇవన్నీ దాదాపుగా బాంగ్లాదేశ్ సరిహద్దులో ఉండే జిల్లాలు కావడంతో, ఇక్కడికి బాంగ్లాదేశీయుల వలసలు అధికం. బాంగ్లాదేశీయు లంటే 80 శాతం వరకు ముస్లింలే. అయితే వీరెవరికీ పశ్చిమబెంగాల్లో జీవనోపాధికి అవకాశాలుండవు కనుక, రెండు మూడు నెలలపాటు ఈ జిల్లాల్లో ఉండి తప్పుడు మార్గాల ద్వారా ఆధార్కార్డులు, రేషన్ కార్డులు సంపాదించి, వీటి ఆధారంతో ఇతర రాష్ట్రాలకు వలసపోవటం జరుగుతోంది. ఇటువంటి వారికి అవసరమైన సదుపాయాలన్నీ కల్పించేది తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే. అంటే ఈ పార్టీ అధికారంలో ఉన్నంతవరకు తమ భద్రతకు ఢోకా లేదన్న అభిప్రాయం ఈ ముస్లింలలో ఉంటుంది.
ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఈ బాంగ్లాదేశీ ముస్లింలను, అసవరమైన ఖర్చులన్నీ పెట్టుకొని స్వరాష్ట్రానికి రప్పించి ఓటుబ్యాంకుగా ఉపయోగించుకుంటోంది. అంతే కాదు, రాష్ట్రంలో ఇతర పార్టీలకు ఓట్లు వేసేవారిని లేదా ఇతర పార్టీల కార్యకర్తలను బెదిరించడం, హింసకు పాల్పడటానికి కూడా వీరు గూండాలుగా పనికి వస్తున్నారు. స్థానిక బెంగాలీ ముస్లింలు కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం కద్దు. కానీ ఆ విధంగా వెళ్లేవారి సంఖ్య చాలా తక్కువ. అయితే బాంగ్లాదేశ్ ముస్లింలకు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లక తప్పదు. స్థానిక ఎన్నికలు లేదా అసెంబ్లీ లేదా సాధారణ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున తన ఓటర్ల సమీకరణ కార్యక్రమాన్ని చేపడుతుంది.
ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న బాంగ్లాదేశ్ వలస కార్మికులను (ముస్లింలు) వారి పేర్లు ఎక్కడ రిజిస్టరయి ఉన్నాయో తెలుసుకొని ఆయా ప్రాంతాలకు తరలిస్తుంది. ఆ విధంగా వారంతా తమకే ఓటువేసే విధంగా అన్ని జాగ్రత్తలు తీసు కుంటుంది. ఇదే సమయంలో ఇటువంటి ఓటర్లకు చార్జీలు పెట్టుకొని కొంత ముట్టచెబుతుండటంతో వీరంతా గంపగుత్తగా తృణమూల్ కాంగ్రెస్కే ఓట్లు వేస్తున్నారు. నిజానికి అంతకుముందు వామపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతిని అనుసరించాయి. ఇప్పుడు ఎన్నికల సంఘం ఇటువంటి ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తే తృణమూల్ కాంగ్రెస్ పుట్టి మునగడం ఖాయం.
బాంగ్లాదేశ్లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.5కోట్లు కాగా ముస్లిం ఓటర్లు 2.25 కోట్లు. ముస్లిం ఓటర్లు ప్రధానంగా రాష్ట్రంలోని 74 నియోజకవర్గాల్లో కేంద్రీ కృతమై ఉన్నారు. మరో 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీరు గెలుపును ప్రభావితం చేసే స్థాయిలో ఉండటం గమనార్హం. ఇటువంటి నియోజకవర్గాల్లో వలస కార్మికుల ఓట్లను తొలగిస్తే ఇది తృణమూల్ కాంగ్రెస్కు గట్టి దెబ్బ కాగలదు. దీనికి తోడు పశ్చిమ బెంగాల్లో హిందువుల ఓట్లు సుసంఘటితం కావడం ఇప్పటికే మొదలైంది. ఉదాహరణకు నాదియా జిల్లాలో ముస్లింల జనాభా 30 శాతం. వీరిలో చాలామంది ఇతర రాష్ట్రాల్లో జీవనం గడుపుతున్నారు. ఇదే జిల్లాకు చెందిన కాళిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2.48 లక్షలు. వీరిలో ముస్లిం ఓటర్ల సంఖ్య 1.43లక్షలు. వీరిలో 43 వేల మంది ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు కనుక వారిని ఈ నియోజకవర్గానికి చెందిన సాధారణ పౌరులుగా పరిగణించరు. ఫలితంగా ఈ 43వేల ఓట్లను ఎన్నికల కమిషన్ తొలగిస్తే, ఈ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు చాలా కష్టం కాగలదు. ఇదే పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో, వలస కార్మికుల పేర్లను తొలగించడం వల్ల రాష్ట్రం మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో బీజేపీకి సానుకూలత ఏర్పడగలదు.
2021 అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే దాదాపు 45 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లే మెజారిటీగా ఉండటంతో, వీరి ఓట్లతోనే తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. విశేష మేంటంటే ఈ నియోజకవర్గాల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు గరిష్టంగా 15వేల ఓట్ల తేడాతో ఓటమి చెందడం గమనార్హం. ఈ నేపథ్యంలో వలస ఓట్ల తొలగింపు బీజేపీకి ఎంతటి ప్రయోజనం కాగలదో ఆలోచించవచ్చు.
ఇదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ లక్షలాది బోగస్ ఓట్లను జాబితాలోకి చొప్పిం •డం మరో కారణం. ఎన్నికల సంఘం ఇటువంటి వాటిని కూడా విజయ వంతంగా తొలగిస్తే, అప్పుడు నిజమైన ఓటర్లు మాత్రమే ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకో గలగుతారు. ఇప్పుడు కోర్టు ఎన్నికల సంఘానికి అనుకూలంగా తీర్పు చెప్పడంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన చేపట్టాలని తృణమూల్ కాంగ్రెస్ యోచిస్తోంది. ఏ విధంగానైనా ఈ వలస కార్మికుల పేర్లను ఓటర్ల జాబితానుంచి తొలగించ కుండా చూడాలన్న లక్ష్యంతో తృణమూల్ కాంగ్రెస్ పావులు కదుపుతోంది.
జమలాపురపు విఠల్రావు
సీనియర్ జర్నలిస్ట్