గత సంచిక తరువాయి..

కేంద్ర ప్రభుత్వం రాజకీయ ఒత్తిడి మేరకు కర్మాగారం మరొక భాగాన్ని (రైలుచక్రాల తయారీ కోసం) సోనియా గాంధీ నియోజకవర్గం రాయ బరేలిలో ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. సుమారు వేయికోట్ల రూపాయలను ఆ కర్మాగార నిర్మాణం కోసం వెచ్చించింది. ఏ పనులూ జరగలేదు. మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాతే రైలు చక్రాల కర్మాగారం పనులు వేగం పుంజుకున్నాయి.

ఆదాయం లేని ఖర్చులు

ఒరిస్సాలోని ఇనుప ఖనిజం కొనుగోలు కోసం తమవంతు 50 శాతం వాటాగా రూ.329 కోట్లు కర్మాగారం పెట్టుబడి పెట్టింది. అయితే ఆ గనుల తవ్వకాలు పర్యావరణ కాలుష్యానికి కారణమవు తున్నాయని సుప్రీంకోర్టు రూ।।1000/-కోట్లు అపరాధ రుసం చెల్లించాలని ఆదేశించింది. చివరికి రూ।। 700/-కోట్లు విశాఖ ఉక్కు కర్మాగారం తనవంతు వాటాగా చెల్లించింది. ఒరిస్సా గనులకొరకు రూ.1029 కోట్లు ఉక్కు కర్మాగారం ఖర్చుపెట్టినా అవసరమైన ఇనుప ఖనిజం ఇంతవరకు రాలేదు.

ఉత్పాదకత 100శాతం నుండి 130 శాతం వరకు నమోదు చేసినా యాజయాన్యంలో పెచ్చు మీరిన అవినీతి వల్ల నగదు నిల్వలు లేక, అప్పుల కారణంగా ముడి ఖనిజం కొనడానికి కూడా ఇబ్బందులు మొదలైనాయి.

కర్మాగార విస్తరణలో ఫినిష్డ్ ఉత్పత్తులు తయారు చేయడానికి యాజమాన్యం ప్రాధాన్యం ఇచ్చిఉంటే అదనపు ఆదాయం సమకూరి ఉండేది. సేలబుల్‌ ఉత్పత్తుల విస్తరణకు కాక ముడి ఉత్పత్తుల విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వడంవల్ల ఆదాయం లేకపోగా వడ్డీల భారం పెరిగింది. యాజమాన్యం పొరపాటు విధానానికి ఇదొక ఉదాహరణ. కోక్‌ – ఓవెన్‌ ‌బాటరీ – 4, సెంటర్‌ ‌ప్లాంట్‌ -2, ‌బ్లాస్ట్ ‌ఫర్నెస్‌ -3, ‌స్టీల్‌ ‌మెల్ట్ ‌షాపు -2, వీటిని కట్టడంవల్ల ఆర్ధికలోటు మరింత పెరిగింది.

కాంట్రాక్టు కార్మికుల విధానానికి పెద్దపీట

యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల విధానానికి ఎక్కువ ప్రోత్సాహాన్ని ఇచ్చింది. పర్మినెంటు కార్మికులు చేసే పనులను కూడా కాంట్రాక్టర్లకు ఇవ్వడం ప్రారంభ మైంది. పర్మినెంటు కార్మికులు చేస్తున్న పనులను కూడా కాంట్రాక్టు కార్మికులు చేస్తున్నట్లు దొంగ రికార్డులు సృష్టించి నిధులను కాంట్రాక్టర్ల పరం చేశారు. పర్మినెంటు కార్మికులను పనికి దూరం పెడుతూ ఇబ్బడిముబ్బడిగా కాంట్రాక్టు కార్మికులను నియమించారు. దీనివల్ల కొన్ని కార్మిక సంఘాలకు యాజమాన్యంలోని కొందరికి పెద్దఎత్తున డబ్బులు ముడుతున్నాయి. ఒక అన్‌స్కిల్డ్ ‌కార్మికుని ఉద్యోగానికి 3-4లక్షలు, సెమీస్కీల్డ్ ‌కార్మిక ఉద్యోగానికి 5 నుంచి 6 లక్షలు, స్కిల్డ్ ‌కార్మిక ఉద్యోగానికి 6 నుంచి 8 లక్షలు లంచంగా తీసుకుంటున్నారన్న విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. అనవసరపు కాంట్రాక్టు కార్మికులవల్ల  పని సంస్కృతి నశించింది. అనేక ప్రభుత్వ ప్రయివేటు కర్మాగారాలలో, కార్యాలయా లలో బయోమెట్రిక్‌ ‌వ్యవస్థ ప్రవేశపెట్టారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇది అమలుకాలేదు. దీనికి కార్మిక సంఘాలు, అవినీతి యాజమాన్యం కారణం.

ఉత్పత్తుల అమ్మకంలో అవినీతి

ఉత్పత్తుల ఎగుమతిలో అనేక రకాలుగా అవినీతి జరుగుతున్నది. ఉదా:  సరుకు నింపటానికి, బిల్లులు క్లియర్‌ ‌చేయడానికి క్రిందిస్థాయి కార్మికుల నుండి ఉన్నతస్థాయి అధికారుల వరకు లంచం ఇవ్వనిదే లారీలలో సరుకు వేయనీయరు.

  1. వేయాల్సిన సరుకుకన్నా ఎక్కువ సరుకువేసి తూనిక యంత్రాంగాల వద్ద తక్కువగా చూపటం మరొక అవినీతి విధానం.
  2. ఒకే ఇన్వాయిస్‌పై రెండుమూడుసార్లు ఉత్పత్తులను పంపుతుంటారు.

అధికారులు-కార్మికుల నిష్పత్తి నియామకాలకు భిన్నంగా అధికంగా అధికారులను నియమిస్తున్నారు. ఏ రాష్ట్రానికి చెందినవారు సి.ఎమ్‌.‌డి. అయితే ఆ రాష్ట్రానికి చెందినవారినే అర్హతలు లేకపోయినా కీలక పదవులలో నియమిస్తున్నారు.

సంబంధంలేని అంశాలపై సమ్మెలు

కేంద్రం సీఏఏ, వ్యవసాయ చట్టాలు తెచ్చింది. వీటికీ కార్మికులకూ ఏమీ సంబంధంలేదు. అయినప్పటికి ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు సమ్మెలు చేశాయి. ఈ సమ్మెలలో యాజమాన్య పరోక్ష సహకారం ఉంది.

గనుల కేటాయింపే పరిష్కారమా?

ఈ కర్మాగారానికి గనులు లేవని, వాటిని కేటాయిస్తే నష్టాలు ఉండవని, కాబట్టి కేంద్రం ఈ కర్మాగారానికి గనులు కేటాయించాలని కొందరు కోరుతున్నారు. 2004లో కర్మాగారం 5వేలకోట్ల రూపాయల మిగులులో ఉంది. అప్పుడు కర్మాగారా నికి ఏ గనులు లేవు కదా! ఉక్కు కర్మాగారానికి అవసరమైన ముడిబొగ్గు మనదేశంలో దొరకదు. ఆస్ట్రేలియా నుండి దిగుమతి చేసుకునే ‘మెటలర్జికల్‌’ ‌బొగ్గునే నేడు ఉక్కు కర్మాగారాలు ఉపయోగిస్తున్నాయి.

 అనుబంధ పరిశ్రమల మూత

విశాఖ ఉక్కు కర్మాగారానికి అనుబంధంగా చిన్నా, మధ్య తరహా పరిశ్రమలు పలు ఉన్నాయి. వీటి సంఖ్య, వీటిలోని కార్మికుల సంఖ్య తక్కువేమి కాదు. స్థానికమైన ఈ చిన్న పరిశ్రమలన• యాజమాన్యం ప్రోత్సహించలేదు. ఈ ఆధారిత చిన్న పరిశ్రమలు ఉత్పత్తిచేసే వస్తువులు కాకుండా ఇతర రాష్ట్రాల పరిశ్రమల నుండి కొనుగోలు చేయటం ప్రారంభించింది. ఇందులో యాజమాన్యం అవినీతి ఎంతోఉంది. కోల్‌కతా, ఒరిస్సాలకు చెందిన పరిశ్రమల నుండి నేడు ఉక్కు కర్మాగారం అనేక చిన్నచిన్న వస్తువులను కొనుగోలు చేస్తున్నది. దీనిని గమనించాలి.

అప్పుల ఊబిలో కర్మాగారం

(లోటు కోట్లలో)

2015 – 16              1702       1604

2016 – 17              1690       1263

2017 – 18              1911      1369

2018 – 19              307        97కోట్ల మిగులు

2019 – 20              39          10.17 కోట్లు

అసమర్ధ, అవినీతి అధికారుల వల్లే ఉక్కు కర్మాగారం అప్పుల ఊబిలోకి వెళ్లిపోయింది. పైన పేర్కొన్న, ఇంకా పేర్కొనని అనేక కారణాలతో 2005 తరువాత ఏటా కర్మాగారం అప్పుల ఊబిలోకి కుంగిపోతూనే ఉంది. 1984 సంవత్సరంలో ప్రధానమంత్రి రాజీవ్‌ ‌గాంధీ తీసుకున్న నిర్ణయంమేరకు ‘ఏ ప్రభుత్వరంగ పరిశ్రమలకూ లోటు పూడ్చటానికి కేంద్రం నిధులు ఇవ్వదు.’ ఇలా మరికొంత కాలం కొనసాగితే యాజమాన్యం కర్మాగారాన్ని మూసివేయ వలసి వస్తుంది. కర్మాగారాన్ని మూసివేయటం కంటే ప్రయివేటు యాజమాన్యానికి అప్పగించటం మేలైన విధానమని కేంద్ర ప్రభుత్వ వాదన. ఇది కొంతవరకు సరియైనదే కావచ్చు.

ప్రభుత్వరంగ సంస్థలు – ప్రైవేటురంగ సంస్థలు

దేశంలో ప్రభుత్వరంగ సంస్థలు నడవాలని అందరూ కోరుకుంటారు. ఉద్యమాలు చేస్తారు. ప్రతి పక్షంలో ఉండి ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీ కరణను వ్యతిరేకించినవారే అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సంస్థలను ప్రయివేటీకరించడం చూస్తున్నాం. దేశంలో ప్రయివేటురంగంతో పోలిస్తే ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలు ఎక్కువగా అప్పుల ఊబిలోకి వెళ్లిపోతున్నాయి. దీనికి అనేక కారణాలు.

  1. ప్రభుత్వం నియమించే ఉన్నతాధికారులకు నిర్వహణా సామర్థ్యం లేకపోవటం. అవినీతి, నిర్ణయాలలో పొరపాట్లు.
  2. రాజకీయ నాయకుల మితిమీరిన జోక్యం.
  3. కార్మికులలో పని సంస్కృతి తగ్గిపోవడం. కార్మిక సంఘాలు, యాజమాన్యాలు, కార్మికులు తాము ప్రభుత్వరంగ సంస్థలలోనే ఉండాలని కోరుకుంటారు. పని సక్రమంగా చేసినా చేయకపోయినా ప్రభుత్వరంగ సంస్థల్లో నిలదీసేవారు ఉండరు. ఉద్యోగ భద్రత ఎక్కువ. అదే ప్రయివేటు రంగ సంస్థల్లో క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. అక్కడ ఉద్యోగ భద్రత సాపేక్షంగా తక్కువ. చాలా ప్రభుత్వరంగ సంస్థల్లో అటు యాజమాన్యానికి, ఇటు కార్మికులకు సంస్థ అభివృద్ధి పట్ల బాధ్యత ఉండదు. ఇలా అనేక కారణాలు. విశాఖ ఉక్కు కూడా ఇదే కోవలోకి పోయింది.

కేంద్ర గనుల శాఖ ప్రేక్షకపాత్ర

మోదీ ప్రధాని అయ్యాక ఈ 6 సంవత్సరాలలో విశాఖ ఉక్కు లోటు ప్రతి ఏటా పెరుగుతోంది.అయినా  కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ మౌనం దాల్చడం ఏమిటి? ప్రభుత్వ సంస్థల లోటు,ఆ లోటు ఎందుకు వంటి అంశాల మీద నిపుణుల సలహాలను స్వీకరించవలసిన బాధ్యత లేదా? ప్రభుత్వరంగ ఉక్కు కర్మాగారాలకు సి.ఎమ్‌.‌డి.లను, డైరక్టర్లను నియమించేది కేంద్రమే. అసమర్థత, అవినీతిగల ఉన్నత అధికారులను తొలగిస్తే బాగుండేది. ఈ ప్రక్షాళన ఎందుకు చేపట్ట లేదు? అప్పులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన తరువాత విశాఖ ఉక్కుకర్మాగారాన్ని ప్రయివేటీకరణ చేస్తూ చేతులు దులుపుకోవటం సరియైనదేనా? ఉక్కు కర్మాగారం కోసం భూములిచ్చిన పేద ప్రజలు ఉక్కు కర్మాగారంలో ఉపాధి లభిస్తుందని 40 సంవత్స రాలుగా ఎదురు చూస్తున్నారు. వారికి న్యాయం చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా? ఆర్థికలోటు పేరుతో ప్రతి ప్రభుత్వరంగ సంస్థను ప్రయివేటురంగానికి అప్పచెప్పటమే ఏకైక ఉత్తమ పరిష్కారం అనే విధానం సరియైనది కాదు. ఈ నిర్ణయం పరిమితులను కేంద్ర పాలకులు వీలైనంత త్వరగా గ్రహించి వ్యవహరించటం దేశ ఆర్థిక వ్యవస్థకు, కార్మికులకు మంచిది!

 కేంద్రం ప్రభుత్వరంగంలో కొత్త పరిశ్రమలను ప్రారంభించకపోవచ్చు. ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు దారితప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

పరిష్కారాలు

  1. ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలోని అన్ని కర్మాగారాలను, గనులను ఒకే సంస్థ పరిధిలోకి తీసుకురావాలి.
  2. N.M.D.C – R.I.N.L. – K.I.O.L.లను ఒకే సంస్థగా రూపొందించాలి.
  3. ప్రభుత్వరంగ SAIL – RINL మార్కెట్‌లను విలీనం చేయాలి.
  4. ఉన్నత యాజమాన్యంపై జవాబుదారీతనాన్ని విధించాలి.
  5. బయోమెట్రిక్‌ ‌వ్యవస్థను అమలుచేయాలి.
  6. ‘అధికారుల – కార్మికుల’ నిష్పత్తిని క్రమబద్ధ్దీకరించాలి.
  7. రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణపనులలో విశాఖ ఉక్కును వినియోగించేలా చేయాలి.
  8. కిరండోల్‌ ‌నుండి స్లర్రీ పైప్‌లైన్‌ (ఒప్పందం జరిగింది)ను అత్యవసరంగా నిర్మించి సుమారు రూ. 2,000 కోట్ల రవాణా భారాన్ని వెంటనే తగ్గించాలి.
  9. రాబోయే నాలుగేళ్లలో విశాఖ ఉక్కులో సుమారు 4వేలమంది పదవీ విరమణ చేస్తారు. ఆ ఖాళీలను నిర్వాసితులతో భర్తీచేసి న్యాయం చేయాలి.

 ఒక కార్మికుడు

(విశాఖ ఉక్కు కర్మాగారం)

About Author

By editor

Twitter
Instagram