సమాజంలో అత్యంత దుర్భర జీవనం గడుపుతున్న వెనుకబడిన తరగతుల్లో అత్యంత వెనుకబడిన కులాలకు చెందినవారే సంచార జాతుల వారు. రాష్ట్రంలో సంచార అర్ధసంచార విముక్త కులాలు మొత్తంగా 42 ఉన్నాయి. తమకంటూ ఒక స్థిర నివాసం లేని ఈ కులాలు బతుకుతెరువు కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పలు రాష్ట్రాలకు వలస పోతున్నారు.
సంచారజాతులు పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా పట్టణ ప్రాంత శివారులలో చిన్నచిన్న గుడారాలు, గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నాయి. ఒక ప్రదేశంలో 15 లేదా 20 రోజులకు మించి ఉండకుండా భుక్తిని వెతుక్కుంటూ నిరంతరం సంచారిస్తారు. పాము, తేలు తదితర మంత్రగాళ్లు, ఆయుర్వేద వైద్యులు, గారడీ చేసేవారు , విన్యాసాలు చేసేవారు, నటులు, కథకులు, జంతు వైద్యులు, పచ్చబొట్లు వేసేవారు, రోళ్లు తయారీదారులు , బుట్టల అల్లకం ఇలాంటి పనులతో పాటు యాచక వృత్తిని ప్రధానంగా చేసుకుని జీవనం గడుపుతుంటారు. రవాణా, పరిశ్రమలు, ఉత్పత్తి, వినోదం, పంపిణీ వ్యవస్థలలో తీవ్రమైన మార్పుల కారణంగా వారు తమ జీవనోపాధిని కోల్పోయారు.
నేరస్తుల ముద్ర వేసిన బ్రిటిషర్లు
నేడు సంచార జాతులుగా వ్యవహరిస్తున్నవారు రాజుల కాలంలో బాగానే బతికేవారు. కథలు వినాలన్నా, తోలుబొమ్మలాటలు చూడాలన్నా, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవాలన్నా రాజులు సంచార జాతులను పిలిపించుకొని వారిచేత నాటకాలు వేయించుకొని ఉల్లాసాన్ని పొందేవారు. గుళ్లు, ఇళ్లు, చెరువులు, బావులు, కోటలు కట్టేవారు. ఆ రోజుల్లో వీరికి ఎంతో గౌరవం ఉండేదని చరిత్ర చెబుతోంది. అయితే బ్రిటిష్ వాళ్ల కాలంలో సంచార జాతులకు కష్టాలువచ్చాయి. ముస్లిం పాలకులు, బ్రిటిష్ పాలనా సంస్కరణల్లో భాగంగా రైతాంగం పన్నులు చెల్లించలేక పలు ఇబ్బందులు పడ్డారు. ఆహార ఉత్పత్తిలో అధికభాగం నాటి పాలకులకు శిస్తు రూపంలో చెల్లించేందుకే సరిపోయే. వ్యవసాయ పనులు మందగించి ఎవరికీ పనులు లేకుండా పోయాయి. పనులే ప్రధానంగా గల సంచార జాతులకు పనులు లేకుండా పోయాయి. ఏ గ్రామానికి వెళ్లినా గుప్పెడు అన్నం దొరకని పరిస్థితి. ఆకలికి ఆగలేకపోయేవారు. చిన్న పిల్లల కడపు నిపేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో చిన్న చిన్న దొంగత నాలు చేయడం మొదలు పెట్టారు. బ్రిటిష్ వారు ఇలాంటి వారికి ‘క్రిమినల్ ట్రైబ్స్ ’అని పేరు పెట్టారు.
స్థిరపడిన సమాజానికి ‘ముప్పు’ కలిగించే సమూహాల పేరుతో జాబితా చేసి, 1871లో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అనే చట్టాన్ని ప్రవేశపెట్టారు. దీని ఫలితంగా దేశంలో అటువంటివి దాదాపు 200 సంఘాలను నేరస్థులుగా ‘నోటిపై’ చేశారు. ఒకరు, ఇద్దరు దొంగతనాలకు పాల్పడినా సంచార జాతులన్నిటికీ నిందితులుగా పేరు పడిపోయింది. ఇది భరించలేని సంచార జాతుల వారు చాలాసార్లు బ్రిటీష్ వారిపై దాడులు చేశారు. పోలీసులు వీరిపై లెక్కలేనన్ని కేసులు పెట్టి వేధించేవారు. చావకొట్టేవారు.
పలువురు సంఘసంస్కర్తల కృషివల్ల, స్వాతంత్య్రం వచ్చాక ‘క్రిమినల్ ట్రైబ్స్’ పరిస్థితిపై 1948లో అయ్యంగారి కమిషన్ వేశారు. వారి పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఆ పేరు (క్రిమినల్ ట్రైబ్స్’ మార్చాలని అయ్యంగార్ ప్రభుత్వానికి సూచించారు. దాంతో 1952 ఆగస్టు 31న ‘నేరస్తుల జాతుల’ చట్టాన్ని రద్దు చేశారు. వీరిని ఎస్టీ జాబితాలో చేర్చాలని పలు వినతులు వచ్చినా నాటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. 1970 దశకంలో లంబాడ, ఎరుకల కులాలను ఎస్టీ జాబితాలో చేర్చారు. మిగతా కులాలను వదిలేశారు.1980లో వీరంతా బీసీలు అయిపోయారు.
ఏళ్లు గడుస్తూనే ఉన్నాయి. అనేక కమిటీలు సంచారజాతుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేశాయి. 2004లో జస్టిస్ మోతిలాల్ రాథోడ్ అధ్యక్షతన జాతీయ కమిషన్ను అప్పటి కేందప్రభుత్వం వేసింది. 2006 లో మహారాష్ట్రకు చెందిన జస్టిస్ బాలకృష్ణ రేణకే అధ్యక్షతన రెండో కమిటీని యూపీఏ ప్రభుత్వం వేసింది. ఆ కమిటీ దేశవ్యాప్తంగా తిరిగి ఆయా జాతుల స్థితిగతులపై అధ్యయనం చేసింది. వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు 76 సిఫార్సులతో అప్పటి (2008) ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు నివేదిక సమర్పించింది. అయితే ఆ కమిషన్ సిఫార్సులను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోలేదు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వమైనా సంచార జాతుల జీవనాన్ని మెరుగుపరిచేలా బాలకృష్ణ రేణకే కమిటీ సిఫార్సులను అమలు పర్చాల్సిన అవసర ముంది. వారి సర్వతోముఖాభివృద్ధే బీజేపీ ధ్యేయం: కె.లక్ష్మణ్ దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా అత్యంత వెనుకబాటులో ఉన్న సంచార, అర్ధ సంచార జాతుల అభ్యున్నతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. వారి సంక్షేమానికి కట్టుబడి, అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరికీ గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ సంచార జాతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని తీవ్రంగా ఆరోపించారు. ‘‘గరీబీ హటావో అంటూ దశాబ్దాల పాటు నినాదాలు చేసిన కాంగ్రెస్ నాయకులు, ఈ నిరుపేద సంచార జాతుల కోసం చేసిందేమీ లేదు. వారి ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగానే ఈ జాతులు విద్య, వైద్యం, ఉపాధి వంటి మౌలిక సదుపాయాలకు దూరమై సమాజంలో అట్టడుగున ఉండిపోయాయి’ అని ఆందోళన వ్యక్తం చేశారు. కులం, మతం, ప్రాంతం, భాషల పేరుతో దేశంలో విభజన రాజకీయాలు చేయడానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడే దేశవ్యాప్తంగా సంచార జాతుల స్థితిగతులపై అధ్యయనం జరిగిందని లక్షణ్ గుర్తు చేశారు. వారిని ఆదుకున్న మొట్టమొదటి ప్రభుత్వం బీజేపీయేనని చెప్పారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే సంచార, అర్ధ సంచార జాతులకు విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక అవకాశాలు కల్పించారు. 5 లక్షల సంచార జాతుల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ కార్డులు అందించి, వారికి ఆరోగ్య భద్రత కల్పించాలని కేంద్రం కృషి చేస్తోంది. సమాజంలో వారిని చిన్నచూపు చూసేలా ఉన్న రకరకాల పేర్లను మార్చి, వారికి గౌరవప్రదమైన గుర్తింపును ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది’ అని లక్ష్మణ్ తెలిపారు
రాష్ట్రంలోనూ అండగా ఉంటాం:
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని సంచార జాతుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని విమర్శించారు. ‘‘కేంద్ర ప్రభుత్వం ఈ జాతుల కోసం కేటాయించిన నిధులను సైతం గత పాలకులు పక్కదారి పట్టించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీ, డీఎన్టీ ధ్రువీకరణ పత్రాలు అందేలా చూస్తాం. అవసరమైతే మేమే స్వయంగా వారిని కలెక్టర్ల వద్దకు తీసుకెళ్లి సర్టిఫికెట్లు ఇప్పిస్తాం,’’ అని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా, తిరుమల బ్రహ్మోత్సవాలు వంటి ప్రముఖ దేవాలయ ఉత్సవాలలో వారి సంప్రదాయ కళలను, నృత్యాలను ప్రదర్శించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎంపీ పాకా సత్యనారాయణ, మరో ఎంపీ ఆర్. కృష్ణయ్య సంచార జాతులకు న్యాయం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ ప్రసంగించారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు
తొలుత గంగిరెద్దుల, దొమ్మర్ల, పంబల విన్యాసాలు నడుమ బీజేపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. బాలసంతు, బండార, బుడబుక్కల, దాసరి, దొమ్మర, గంగిరెద్దుల, జంగం, జోగి, కాటికాపరి, కొర్చ, మొండివారు, పిచ్చిగుంట్ల, పాముల, పార్ది, పంబల, దమ్మాలి, వీరముష్టి, గూడల, కంజార, కాప్మారే, మొండిపట్ట, నొక్కార్, పరికి, మగ్గుల, యాట, చోపేమారి, కైకాడి, జోషినందివాలా, మందుల, కునపులి, పట్రా, రాజనాల, కాసికపాడి జాతులవారు చేసిన ప్రదర్శలు, పాటలు ఆకట్టుకున్నాయి. పలు రకాల డప్పు వాయిద్యాలు, సన్నాయిలు, ఇతర సంగీత సాధనాలతో తరతరాల వారసత్వంగా వస్తున్న కట్టుబాట్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి, విష్ణుకుమార్రాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్