అమెరికా తన వ్యూహాత్మక మిత్రులతో విచిత్రంగా వ్యవహరించడం వలన భారత్ను కోల్పోతుంది. డీప్ స్టేట్, వామపక్ష మూకలు ఆడుతున్న మురికి ఆటతో ఇరుకున పడుతుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకోపాలు పెడుతూ, అసత్యాలు చెబుతున్నారనే ఒక తీవ్రమైన అభిప్రాయం మేధావుల్లో ఏర్పడిపోయింది. ఆయన వాషింగ్టన్ డీసీ, కననాస్కిస్లో జి-7 శిఖరాగ్ర సదస్సు, తదితర వేదికలపై అదేపనిగా చేస్తున్న వాదనలను అంతర్జాతీయ సమాజం నిశితంగా పరిశీలిస్తోంది. ట్రంప్ మొదటగా భారత్, పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల ఘర్షణ అనంతరం ఇరు దేశాల మధ్య అణు యుద్ధాన్ని నివారించడానికి తాను విజయవంతంగా మధ్యవర్తిత్వం వహించినట్టు చెప్పుకున్నారు.
2025, ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్లోని పెహల్గావ్లో పాకిస్తాన్ నిఘా ఏజెన్సీ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులు పట్టపగలు 26 మంది పర్యాటకులను దారుణంగా హత్య చేయడంతో ఇరు దేశాలు పరిమిత కాలానికి ఘర్షణకు దిగాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శ్వేతసౌధం లోపలా బయటా చేసిన తప్పుడు వాదనలను ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ నిర్ద్వంద్వంగా ఖండించారు. అధ్యక్షుడు ట్రంప్ సాయుధ ఘర్షణను ఆపడానికి ఎటువంటి మధ్యవర్తిత్వం వహించలేదు. మంతనాలు జరపలేదు. జోక్యం చేసుకున్నదీ లేదు. బదులుగా, భారత్ తన వైమానిక స్థావరాలపైకి తీవ్రంగా దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ సైన్యం నిరంతరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే మార్గా ద్వారా చేసుకున్న అభ్యర్థనతో మాత్రమే ఆపరేషన్ సిందూర్ ప్రస్తుతానికి నిలిచిపోయింది. నిజానికి, ట్రంప్ దక్షిణాసియా పొరుగుదేశాలు అతి పెద్ద అణు యుద్ధం వైపు వెళ్లకుండా నిరోధించడంలో తన నాయకత్వ పాత్రను పెద్దదిగా చూపడానికి ఒక అడుగు వేశారు. ఈ మేరకు ఎక్స్లో ఒక పోస్టు చేశారు. ప్రధాన ప్రత్యర్థుల మధ్య శాంతిని నెలకొల్పడంలో తాను అద్భుతంగా పోషించిన పాత్ర గురించి రాయలేదంటూ అంతర్జాతీయ మీడియాను వేలెత్తి చూపారు. దీనికి విరుద్ధంగా మోదీ ట్రంప్తో 35 నిమిషాలపాటు టెలిఫోన్ ద్వారా జరిపిన సంభాషణలో ట్రంప్కు ఎటువంటి పాత్ర లేదని స్పష్టంగా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రీ చదివి మరీ వినిపించారు. చాలా కచ్చితంగా చెప్పాలంటే మోదీ అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని తోసిపుచ్చారు.
మోదీ చెవిలో ఇల్లు కట్టుకొని చెప్పినప్పటికీ డోనాల్ట్ ట్రంప్ శ్వేతసౌధం నుంచి తాను యుద్ధాన్ని ఆపానంటూ అద్భుతమైన వాదనను పునరావృతం చేయడం హాస్యాస్పదంగా ఉంది.
తన మాటను ప్రధాని నరేంద్రమోదీ వినేలా చేసుకోవడానికి భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని తాను ఉపయోగించినట్టుగా ట్రంప్ తన రెండవ అతి పెద్ద వాదనను వినిపించారు. భారతదేశం ఈ వాదనను మరోసారి తోసిపుచ్చింది. ఓ పెద్ద యుద్ధాన్ని నివారించడంలో భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఉపయోగపడింది అంటూ ట్రంప్ చేసిన సూచన అర్థరహితం, అవాస్తవం అని తేలిపోయింది.
భారత ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిపిన టెలిఫోన్ సంభాషణలో ఆయనకు నచ్చినా నచ్చకపోయినా కొన్ని విషయాలనైతే స్పష్టంగా చెప్పారు. వాటిలో మొదటిదిగా పాకిస్తాన్తో మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎప్పటికీ అంగీకరించదు. తద్వారా దేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి చట్రంలో భాగమైన విధానాన్ని గట్టిగా చెప్పారు. రెండవదిగా ఉగ్రవాదానికి నిధులు ఇవ్వడం, ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడాన్ని ఇకపై పరోక్ష యుద్ధంగా కాకుండా ప్రత్యక్ష యుద్ధంగా భారత్ భావిస్తుంది. ఆ కారణంగా మనదేశానికి తగినవిధంగా ప్రతిదాడి చేసే హక్కు ఉంటుంది. మూడవ అంశం భారత్ అంతర్భాగమైన జమ్ము కశ్మీర్పై చర్చకు తావులేదు. పాక్ ఆక్రమిత ప్రాంతాలపైన మాత్రమే చర్చ ఉంటుంది.
గత కొద్ది వారాలుగా, అధ్యక్షుడు ట్రంప్ వాదనను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎదుర్కోకుండా భారత్ భారత్ అత్యంత సంయమనాన్ని పాటించింది. ఇటీవల ఇద్దరు నాయకుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ భారత్ వైఖరిని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. దీనికి సమాంతరంగా పాకిస్తాన్ జనరల్ అసిమ్ మునీర్ శ్వేతసౌధానికి సన్నిహితం కావడం, అధ్యక్షుడు ట్రంప్తో ఆంతరంగికంగా విందు చేయడం అనేది రిపబ్లికన్ హయాంలో అమెరికా విదేశాంగ విధానం పూర్తిగా భ్రష్టు పట్టిన వైనాన్ని స్పష్టంగా సూచిస్తోంది.
అమెరికా ఇరాన్పై దాడి చేయడానికి తన భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి పాకిస్తాన్ అనుమతించిందని, అందుకు ప్రతిగా ఇప్పటివరకు నిరాకరించిన రక్షణ సంబంధిత సాంకేతికతలను పాకిస్తాన్కు అందించడానికి అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ ఇచ్చుపుచ్చుకోవడాల వెనుక కూడా అనేక సాదకబాదకాలు ఉంటాయి.
భారత విదేశాంగ కార్యదర్శి మిస్రీ సహా అమెరికా పాత విదేశాంగ విధానాన్ని సమర్థించేవారు గత కొద్దికాలంగా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్న మాటలను, చేస్తున్న పనులను తోసిపుచ్చారు. దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులతో వ్యవహరించేటప్పుడు అనుసరించాల్సిన దౌత్యపరమైన నియమావళిని అధ్యక్షుడు ట్రంప్, కార్పొరేట్ ప్రపంచానికి చెందిన ఆయన సలహాదారుల బృందం చెత్తబుట్టలో పడేశారు. జనరల్ అసిమ్ మునిర్కు ఆతిథ్యం ఇవ్వడంతో దానికంటూ స్వంత సూక్ష్మభేదాలు, సందేశాలు కచ్చితంగా ఉంటాయి. ఆసియాలో అమెరికా ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో జనరల్ మునిర్ ఉపయోగపడతాడని అధ్యక్షుడు ట్రంప్ గ్రహించినట్టు కనపడుతోది. ఆ క్రమంలో పాకిస్తాన్ వైమానిక స్థావరాలను, ఇరాన్లోకి సైన్యం రాకపోకలకు ఉపకరించే 1,000 కి.మీ.ల పొడవైన సరిహద్దును ఉపయోగించడం వలన ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ రంగం మరింత విస్తరిస్తుంది. గతంలో కూడా చాలా క్లిష్టమైన సమయాల్లో పాకిస్తాన్ను అమెరికా ఆశ్రయించింది. అందుచేత మునీర్కు ట్రంప్ విందు ఇవ్వడమనేది భారత భద్రతా వేగుల్లో కొందరికి అంతగా ఆశ్చర్యమనిపించదు.
అలాగే డోనాల్డ్ ట్రంప్ ఎందుకూ పనికిరాని, దారీతెన్నూ లేని పాకిస్తాన్ను వ్యాపార లావాదేవీల ఒప్పందాలను కుదిర్చే ఒక సామర్థ్యాన్ని సంతరించుకున్న విపణిగాను చూస్తున్నారు. అంతేకాకుండా తనకు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలంటూ సిఫార్సు చేయడం ద్వారా మానవ చరిత్రలో నిలిచిపోయే ఓ మహత్తర ఘట్టానికి పాకిస్తాన్ తోడ్పడుతుందని భావిస్తున్నారు.
అమెరికా డీప్స్టేట్ ప్రధానమంత్రిగా మోదీ వరుసగా మూడోసారి ఎన్నిక కావడాన్ని తిరస్కరించడం ద్వారా ఆయన నాయకత్వంపట్ల దుష్ట పన్నాగాలు పన్నుతున్నది అనేది ఒక పెద్ద అనుమానం.
ట్రంప్, చైనా కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు జి జింగ్పింగ్ల మధ్య ఒక వాణిజ్య ఒప్పందం విజయవంతంగా కుదిరిన తర్వాత పాకిస్తాన్ సైన్యంతో శ్వేతసౌధం చేతులు కలిపి ఉండవచ్చు. అంతిమంగా, అధ్యక్షుడు ట్రంప్ భారత్ సహా ఎవ్వరూ నమ్మలేని మిత్రుడిగా మిగిలిపోతారు. నిలకడలేని ట్రంప్ పాలనాయంత్రాంగం మిత్రులు, శత్రువులతో ఉన్న సమీకరణాల్లో ఒడుదొడుకులను ఒకే రకంగా చూడవవచ్చు. అమెరికా సమాజంలో ప్రదర్శనలు, నిరసనలతో నానాటికి పెరిగిపోతున్న అశాంతి అమెరికా సంయుక్త రాష్ట్రాలు అన్న కీలకమైన భావనకు పెను ముప్పుగా మారే ప్రమాదం ఉంది. దశాబ్దాలుగా పాతుకుపోయిన అమెరికా డీప్స్టేట్, వామ పక్ష కూటమి ఈ గందరగోళాన్ని వాటికి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. అధ్యక్షుడు ట్రంప్ ఈ పక్రియలో ఇరుకునపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇదే జరిగిన పక్షంలో ట్రంప్ భారత్ను కోల్పోవచ్చు.
కె.ఎ.బదరీనాథ్
డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్,
సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అండ్
హోలిస్టిక్ స్టడీస్, న్యూఢిల్లీ.