కాలు తొక్కినప్పుడే కాపురం సంగతి తెలిసిపోతుందంటారు. 1947 నాటి దేశ విభజన తొలి క్షణాలలోనే పాకిస్తాన్‌లో మిగిలిన మైనారిటీల భవిష్యత్తు తేలిపోయింది. హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు భారత్‌ వైపు చూడక తప్పని పరిస్థితి వచ్చింది. దీనిని గాంధీజీ, ప్రథమ ప్రధాని నెహ్రూ, తొలి హోంమంత్రి సర్దార్‌ పటేల్‌, జనసంఫ్‌ు వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ ముఖర్జీ 75 ఏళ్ల క్రితమే ఊహించారు. ఆ దేశాల నుంచి వచ్చిన ఈ ‘చరిత్ర శాపగ్రస్థుల’ను ఆదుకోవాలనే గట్టిగా కోరుకున్నారు. ఆ పనిని ఇప్పుడు వేగవంతం చేయవలసి వచ్చింది. అందుకే బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం నాలుగేళ్ల నాడు పౌరసత్వ సవరణ చట్టం తీసుకువచ్చింది. పాకిస్తాన్‌లో పెరిగిన మత ఛాందసవాదం, ఉగ్రవాదం ఫలితంగా పరిస్థితులు మారాయి. మైనారిటీలు భారత్‌వైపు చూశారు. కానీ ఇక్కడి పరిస్థితులు మారాయి. పాక్‌లో మతోన్మాదం, ఛాందసవాదం పెచ్చరిల్లాయి. ఇక్కడ బుజ్జగింపు, సెక్యులరిజం పెచ్చరిల్లాయి. ఫలితం ఒక్కటే హిందువులంటే ద్వేషం. బాధితులైన హిందువులను, మతోన్మాదంతో రెచ్చిపోతున్న ముస్లిం ఉగ్రవాదులను ఒకే విధంగా చూడాలన్న రీతి. ఫలితమే ఇవాళ సీఏఏకు ఎదురైన వ్యతిరేకత. గాంధీ, నెహ్రూ ఏమన్నా అనవచ్చు. కానీ ముస్లింలను దేశంలోకి అనుమతించాలంటోంది కుక్కమూతి పిందె కాంగ్రెస్‌. దీనికి కమ్యూనిస్టులు, బీజేపీ వ్యతిరేకత పేరుతో భారత్‌ను వ్యతిరేకించే శక్తులు, హిందూత్వను పెకలించే పనిలో ఉన్న విధ్వంసక గణాలు వంత పాడుతున్నాయి. సీఏఏతో బాగా లాభపడేది పాకిస్తాన్‌లో మిగిలిపోయిన దళితులే. సీఏఏ అమలుపై స్టే విధించవలసిందిగా విపక్షాలు కోరినా భారత సుప్రీంకోర్టు సుస్పష్టంగా తిరస్కరించింది. అయినా కొన్ని పక్షాలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. మరొకసారి చరిత్రలో తమ హీన స్థానాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి.


విభజన విషాదానికి, తప్పిదానికి విరుగుడు

డిసెంబర్‌ 11, 2019న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పార్లమెంట్‌ ఆమోదం పొందింది. అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేశారు. అయితే ఈ చట్టంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో నిబంధనలు, విధివిధానాలు మాత్రం కేంద్రం రూపొందించలేదు. నాలుగేళ్ల తరువాత ఇప్పుడు అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. తాజా చట్టం 1955నాటి పౌరసత్వ చట్టానికి సవరణ. 2014కు ముందు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్తాన్‌ దేశాల నుంచి భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించడమే ఈ చట్టం ఉద్దేశం. 2014 కంటే ముందు భారత్‌కు వలస వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనుల, బౌద్దులు, పార్సీలు (ఆరు మతాలు) మన దేశ పౌరసత్వానికి అర్హులు. అంటే దేశ విభజనలో జరిగిన ఘోరమైన తప్పిదాన్ని సవరించే ప్రయత్నమే. దశాబ్దాలుగా లేని మత స్వేచ్ఛను తిరిగి ప్రసాదించడమే.

నెహ్రూ, గాంధీ, పటేల్‌, ముఖర్జీ ఏమన్నారంటే..

 ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం వచ్చింది. దేశం ముక్కలైంది. విభజనతో తూర్పు పాకిస్తాన్‌, పశ్చిమ పాకిస్తాన్‌ ఏర్పడ్డాయి. రాత్రికి రాత్రి లక్షలాది మంది హిందువులకు భారత్‌ పరాయి దేశమైంది. తాముంటున్న దేశంలో వారు మైనారిటీలు. వారందరికి రక్షణ కల్పించడమేకాక సుఖశాంతులతో కూడిన జీవనాన్ని కలిగించడం మన బాధ్యత అంటూ గాంధీజీ, నెహ్రూ గట్టిగానే చెప్పారు.

‘రాజకీయ సరిహద్దుల మూలంగా మన నుండి వేరుపడిపోయిన మన సోదరసోదరీమణులు ఈ సంతోష సమయాన్ని మనతో పంచుకోలేక పోతున్నారు. వాళ్లు ఎప్పటికీ మనవాళ్లే. వారి బాగోగులు ఎప్పటికీ మనవే..’ అని ప్రథమ ప్రధాని నెహ్రూ ఆగస్ట్‌ 15, 1947న ఇచ్చిన ఉపన్యాసంలో చెప్పారు. ఆ తర్వాత నవంబర్‌ 15,1950న పార్ల మెంట్‌లో ప్రసంగిస్తూ ‘విభజన సమయంలో ఇక్కడికి వచ్చిన వారందరికి పౌరసత్వం ఇవ్వాల్సిందే. అందుకు చట్టపరమైన అడ్డంకులు ఏవైనా ఉంటే చట్టాన్ని సవరించవలసిందే..’ అన్నారు.

‘పాకిస్తాన్‌లో నివసిస్తున్న హిందువులకు, సిక్కులకు అక్కడ సుఖంగా, శాంతియుతంగా జీవించడానికి తగిన పరిస్థితులు లేవనిపిస్తే వారు వెంటనే నిరభ్యంతరంగా భారత్‌కు రావచ్చును. అలాంటివారిని భారత్‌ ఆహ్వానించాలి..’ అని మహాత్మా గాంధీ సెప్టెంబర్‌ 26, 1947న తన ఉపన్యాసంలో స్పష్టం చేశారు.

‘దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని అనేక త్యాగాలు చేసిన మన తోటివాళ్లు కేవలం భౌగోళిక మైన సరిహద్దులు మారినందువల్ల హఠాత్తుగా విదేశీయులు అయిపోరు. ఈ విషయాన్ని మనం మరచిపోరాదు’ అని తూర్పు బెంగాల్‌ శరణార్ధులను ఉద్దేశించి తొలి హోమ్‌ మంత్రి పటేల్‌ అన్నారు.

నవంబర్‌ 25, 1947న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఆమోదించిన తీర్మానంలో ‘తమ మాన ప్రాణాలు, గౌరవాన్ని కాపాడుకునేందుకు పాకిస్తాన్‌ నుంచి వచ్చిన ముస్లిమేతరులందరికి భద్రత కల్పించడానికి కాంగ్రెస్‌ సిద్ధంగా ఉంది. వీరేకాదు ఇకముందు వచ్చేవారికి కూడా ఆశ్రయం కల్పించాలి.’ అని స్పష్టంగా ఉంది.

‘తూర్పు బెంగాల్‌లోని హిందూ జనాభా రక్షణను భారత్‌ విస్మరించరాదు. మానవత్వం, స్వలాభం మాత్రమే కాకుండా స్వాతంత్య్రానికి, మేధోవికాసానికి తరతరాలుగా వారి త్యాగాలు, పడిన బాధలను దృష్టిలో ఉంచుకోవడం సముచితం’ అని జనసంఫ్‌ు వ్యవస్థాపకుడు డా. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ అన్నారు. అంటే అక్కడ మైనారిటీలుగా బాధపడుతున్న హిందువులను, ఇతరులను కాపాడుకోవడం మన బాధ్యత అన్నది చారిత్రక సత్యం. ఈ పెద్దలెవరూ ముస్లింల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం.

నెహ్రూ – లియకత్‌ ఒప్పందం

తమ దేశాల్లోని మైనారిటీలకు రక్షణ కల్పించా లని భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఒప్పందం జరిగింది. ప్రధమ ప్రధానులు జవహర్‌ లాల్‌ నెహ్రూ, లియాకత్‌ అలీ 1950 ఏప్రిల్‌లో ఆ ఒప్పందంపై సంతకాలు చేశారు. దాని ప్రకారం:

  1. శరణార్ధులకు ఎలాంటి హాని తలపెట్టకూడదు
  2. ఎత్తుకుపోయిన స్త్రీలను, దోచుకున్న సొత్తును తిరిగి ఇచ్చివేయాలి
  3. బలవంతపు మతమార్పిడులకు గుర్తింపు ఇవ్వరాదు
  4. మైనారిటీల హక్కులను కాపాడాలి

ఒప్పందాన్ని పాకిస్తాన్‌ గౌరవించలేదు. పాక్‌లోని దళితులను వెళ్లకుండా అడ్డుకుంది. అదే ఇవాళ్టి సత్యం కూడా.

మైనారిటీలపై మారణకాండ

ఇస్లామిక్‌ ఛాందసవాదం పెరగడం వల్ల, పాక్‌, బంగ్లాలు ఇస్లామిక్‌ రిపబ్లిక్‌లుగా ప్రకటించు కోవడంతో అక్కడి మైనారిటీలపై దాడులు, అణచివేత పెరిగిపోయాయి. మత మార్పిడులు, బాలికల అపహరణ, ప్రార్ధనా మందిరాల విధ్వంసం, దైవదూషణ పేరుతో చంపివేయడం వంటివి నిత్యకృత్యమయ్యాయి. ముస్లిమేతరుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. విపరీతమైన అణచివేతకు గురైన హిందువులు పెద్ద సంఖ్యలో భారత్‌కు తరలివచ్చారు. ఆ శరణార్ధుల్లో ఎక్కువ శాతం దళితులే. శరణార్ధులకు ఆశ్రయం కల్పించడం భారత్‌ కనీస బాధ్యత అయింది. ఈ విషయాన్ని ఇటీవలి తరం కాంగ్రెస్‌ నేతలు అంగీకరించారు కూడా. డిసెంబర్‌18, 2003లో రాజ్యసభలో నాటి ప్రతిపక్షనేత మన్మోహన్‌ సింగ్‌ ఈ శరణార్ధులకు ఆశ్రయం కల్పించి పౌరసత్వాన్ని ఇవ్వాలంటూ ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని కోరారు.

ద్విజాతి సిద్ధాంతాన్ని సమర్ధించి విభజనకు కారణమైన కమ్యూనిస్టులు ఆ దేశాలలో ముస్లిమే తరుల అణచివేతను చూసి చలించిపోయారు. మే 22, 2012న అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ఒక లేఖ రాస్తూ సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌ కారత్‌, మతపరమైన అణచివేతకు గురై బంగ్లాదేశ్‌ నుంచి తరలివచ్చిన లక్షలాది శరణార్ధులకు ఆశ్రయం కల్పించాలని, పౌరసత్వం ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా షెడ్యూల్‌ కులాలకు చెందిన నామశూద్రులు, పొంద్రఖత్రియ, మారిa మొదలైన వారికి రక్షణ కల్పించాలని కోరారు.

పాక్‌, బంగ్లాల నుంచే ఎందుకు?

పౌరసత్వ సవరణ చట్టంలో పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్తాన్‌లను మాత్రమే ప్రస్తావించ డానికి కారణం ఏమిటి అనే ప్రశ్నకు కూడా సమాధానం ఉంది. ఈ దేశాలు నాటి అఖండ భారత్‌ భాగాలు. విదేశీ దండయాత్రలు, రాజకీయ, మత కారణాల వల్ల క్రమంగా మన దేశం నుంచి విడి పోయాయి. కానీ ఈ దేశాల సాంస్కృతిక మూలాలు ప్రధాన భూభాగమైన భారత్‌ తోనే ముడి పడి ఉన్నాయి. ఈ కారణంగా ఆ దేశాలల్లో సనాతన ధర్మాన్ని నమ్ముకొని అణచివేతలకు గురవుతూ మైనారిటీలుగా మిగిలిపోయినవారు భారత దేశం వైపు ఆశగా చూస్తున్నారు. వీరి ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత భారత్‌పై ఉంది.

హిందువులకు ప్రత్యేక దేశం లేదు

ప్రపంచంలో క్రైసవం, ఇస్లాంల తర్వాత మూడో అతిపెద్ద మతం హిందూత్వం. క్రిస్టియన్లకు, ముస్లింలకు ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి. కొన్ని దేశాలు మతం ప్రాతిపదికనే ఏర్పడ్డాయి. హిందువు లకు ప్రత్యేకంగా ఒక్క దేశం కూడా లేదు. ఒకప్పుడు నేపాల్‌ హిందూ దేశంగా ఉన్నా కమ్యూనిస్టు నేత ప్రచండ అధికారంలోకి వచ్చాక ఆ హోదా తొలగిం చారు. హిందువుల మత విశ్వాసాలకు, ఆచార వ్యవహారాలకు మూలం మన దేశమే. ప్రపంచంలో ఏ దేశంలో నివసిస్తున్న వారే అయినా హిందువు అంటే వారి మూలాలు భారత్‌లోనే ఉంటాయి.

పౌరసత్వ సవరణ చట్టం నేపథ్యం

పాకిస్తాన్‌, అఫ్ఘానిస్తాన్‌, బంగ్లాదేశ్‌లలో ఇస్లాం అధికారిక మతం. ఆ దేశాల మైనారిటీలు హిందు వులు, సిక్కులు, బౌద్ధ, జైన్‌, పార్సీ, క్రైస్తవులు క్రమంగా మత స్వేచ్ఛకు దూరమయ్యారు. హింస, అత్యాచారా లతో చాలామంది ఆ దేశాల నుంచి పారిపోయి భారత్‌కు వచ్చేశారు. చాలామంది దగ్గర సరైన గుర్తింపు పత్రాలు కూడా లేవు. ఒకవేళ ఉన్నా వాటి కాలవ్యవధి ఎప్పుడో పూర్తైపోయింది. ఇలాంటివారికి సరైన గుర్తింపు ఇవ్వడం కోసం 1955 చట్టానికి సవరణ చేయవలసి వచ్చింది. దీని ప్రకారం డిసెంబర్‌ 31, 2014కి ముందు ఆ మూడు దేశాల నుంచి మైనారిటీలు భారత్‌లో ప్రవేశించి ఉంటే అక్రమ చొరబాటుదారులుగా పరిగణించరు.

సవరణ ఎందుకు?

విదేశీయులకు పౌరసత్వాన్ని మంజూరు చేయడానికి ప్రత్యేకమైన చట్టం ఉండగా ఈ మూడు దేశాల శరణార్ధుల కోసం ప్రత్యేక సవరణ ఎందుకు? డిసెంబర్‌ 31, 2014 ముందు ఇక్కడకు వచ్చిన శరణార్ధులకు పౌరసత్వం ఇవ్వడానికి ప్రత్యేక సవరణ అవసరమైంది. వారిలో చాలామంది ఎంతోకాలం క్రితమే ఇక్కడికి వచ్చారు. కాబట్టి వారికి పరిచ్ఛేదం 5 ప్రకారం వెంటనే పౌరసత్వం ఇవ్వడానికి ఈ సవరణ వీలు కల్పిస్తుంది. ఆ మూడు దేశాల మైనారిటీ వర్గాల వారు కనీసం ఐదు సంవత్సరాలు (ఇంతకు ముందు 11 సంవత్సరాలు) భారత్‌లో ఉంటున్నట్లు చూపితే వారికి పౌరసత్వం లభిస్తుంది.

అడ్డుకునే లక్ష్యంతో దుష్ప్రచారం

2019 డిసెంబర్‌లో పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం పొందిన తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలలో భారీగా హింసాత్మక నిరసనలు చెలరేగడం తెలిసిందే. ఈ చట్టం ద్వారా దేశంలోని ముస్లింల హక్కులను భంగం కలుగుతుందంటూ దుష్ప్రచారాన్ని మొదలు పెట్టాయి విపక్షాలు. సరైన పత్రాలు లేకుండా దేశంలోకి అక్రమంగా చొరబడిన రొహింగ్యాల వంటివారిని వారి దేశాలకు తిప్పి పంపాలన్న యోచన ప్రభుత్వానికి ఎప్పటి నుంచో ఉన్న మాట వాస్తవం. సీఏఏను బూచిగా చూపి సంతుష్టీకరణ రాజకీయాల ద్వారా లబ్ధి పొందడమే వారి లక్ష్యం. దేశంలోని ముస్లింలందరూ బాధితులవు తారని కొని దేశ వ్యతిరేక శక్తులు అంతర్జాతీయంగా ప్రచారం చేస్తున్నాయి. దేశ ప్రతిష్టను దిగజార్చడమే వారి ప్రధాన ఎజెండా.

ముఖ్యంగా దేశ రాజధాని ఢల్లీిలోని షాహీన్‌బాగ్‌ ప్రాంతంలో 69 రోజులపాటు కొనసాగిన నిరసనలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్‌ (ఎన్‌ఆర్‌సి), నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్‌పిఆర్‌) మూడూ కూడా ముస్లిం వ్యతిరేకమని.. వీటిని రద్దు చేయాలని వారి వాదన. ఈ ఆందోళనకారుల వెనుక అంతర్జాతీయ విద్రోహశక్తులు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. పనీ పాట చేయకుండా ఎవరూ మూడునెలలు ఆందోళనల్లో కూర్చోరు. భారత దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టడమే తన ఎజెండా అని ప్రధాని మోదీ మీద బహిరంగంగానే విషం కక్కిన జార్జి సోరోస్‌ లాంటి వారి నుంచి నిధులు అందాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలలో 100మందికి పైగా మరణించారు.


తమ రాష్ట్రాల్లో అమలు చేయరట!

అధికారం పరిధులు తెలియపోతే అంధత్వం వస్తుంది. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఏఏని అమలు చేయబోమని ప్రగల్భిస్తున్నారు. ఇదో పెద్ధ అబద్ధం. అసలు వారి చేతిలోనే పౌరసత్వం వ్యవహారం ఉండదు. అది కేంద్రానిది. పౌరసత్వ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయబోం అంటున్నవారు ` మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్‌), ఎంకే స్టాలిన్‌ (తమిళనాడు) పినరయి విజయన్‌ (కేరళ). అరవింద్‌ కేజ్రీవాల్‌ (ఢల్లీి) కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రజల మధ్య విభజన సృష్టించడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల ముందు సీఏఏ అమలు చేస్తోందని మండిపడ్డారు మమత. ఈ చట్టం బహుళవాదం, లౌకికవాదం, మైనారిటీ వర్గాలకు, శ్రీలంక తమిళ శరణార్థులకు కూడా వ్యతిరేకమేనని తేల్చారు స్టాలిన్‌. సీఏఏ దేశ ప్రజల మధ్య మతపరమైన వివక్షకు దారి తీస్తుందని పినరయ్‌ విజయన్‌ ఆరోపణ. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి పేద మైనారిటీలు మన దేశంలోకి వెల్లువెత్తేందుకు బీజేపీ ప్రభుత్వం గేట్లు తెరిచిందని కేజ్రీవాల్‌ నింది. సీఏఏ నిబంధనలు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయనని కూడా వీరు చెబుతున్నారు. దేశ పౌరులు జీవనోపాధి కోసం బయటి దేశాలకు వెళుతున్నారని, పౌరసత్వ చట్టంతో జరిగేదేమీ ఉండదని సమాజ్‌వాదీ నేత అఖిలేష్‌ యాదవ్‌ అంటున్నారు. ఈ చట్టాన్ని రద్దు చేయాల్సిందేని ఈ నాయకులంతా డిమాండ్‌ చేస్తున్నారు

సీఏఏపై స్టే ఇవ్వండి: కేరళ

పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలు అమలు కాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ నిబంధనలు వివక్షా పూరితం, ఏకపక్షం, లౌకికవాద సిద్ధాంతాలకు వ్యతిరేకమని కేరళ ప్రభుత్వ వాదన. 2019లో పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం 2024లో నిబంధనలు రూపొందిం చిందని, అందువల్ల వీటి అమలు అత్యవసరమేమీ కాదని భావిస్తోందని కేరళ సర్కారు తెలిపింది.

కోర్టుకెక్కిన అసదుద్దీన్‌

సీఏఏను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ చట్టంపై స్టే విధించాలని పిటిషన్‌ వేశారు. తన పిటిషన్‌పై విచారణ పెండిరగ్‌లో ఉండగా సీఏఏ ప్రకారం కొత్తగా ఎవరికీ భారత పౌరసత్వం ఇవ్వవద్దని ఒవైసీ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. సీఏఏ, ఎన్‌పీఆర్‌తో కలిపి చూడాలని ఓవైసీ కోరారు. దేశంలోని ముస్లింలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారాయన. ఈ వాదనలనే సుప్రీం కొట్టేసింది.

కాంగ్రెస్‌లో తలో మాట..

లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పౌరసత్వ సవరణ చట్టంతో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఈ చట్టం వివక్షతో కూడుకున్నదని, రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలకు, అసలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తేల్చారు.. ఆ పార్టీ సీనియర్‌ నేతలు జైరామ్‌ రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌ తదితరులు సీఏఏను వ్యతిరేకించినా.. కాంగ్రెస్‌ ముఖ్యనాయకుడు రాహుల్‌ గాంధీ మాత్రం ఈసారి ఆచితూచి మాట్లాడుతున్నారు. భారత్‌ గౌరవ్‌ యాత్రలో పెద్దగా మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదే రాహుల్‌ నాలుగేళ్ల క్రితం ప్రగల్భాలు పలికారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాగానే సీఏఏను రద్దు చేస్తాం అనేంతవరకు వెళ్లారు. అలా అని విపక్షాల మధ్య ఈ విషయంలో గొప్ప సయోధ్య ఏమీ లేదు. కాంగ్రెస్‌ వైఖరి పినరయ్‌కి నచ్చలేదు. ఆ పార్టీ సీఏఏ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని తప్పు పట్టారు. రాహుల్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ అంశం మీద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటానికి కాంగ్రెస్‌ ఎందుకు చొరవ తీసుకోవడం లేదు?అని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

రొహింగ్యాల సమస్యేమిటి?

 మయన్మార్‌ (బర్మా) రోహింగ్యాలకు పౌరసత్వం ఎందుకు ఇవ్వరని సీఏఏ వ్యతిరేకులు అడుగు తున్నారు. ఇది పూర్తిగా వితండ వాదమే. మయన్మార్‌ రోహింగ్యాలు అక్కడి ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. వారితో మొదటి నుంచి శాంతి భద్రతల సమస్య ఉంది. ఈ కారణంగానే అనేక ఇస్లాం దేశాలు వారిని అనుమతించడం లేదు. బెంగాలీ ముస్లింలుగా చెప్పుకునే రొహింగ్యాలు చివరకు బంగ్లాదేశ్‌కు కూడా సమస్యగా మారారు. ఇప్పటికే మన దేశంలోకి లక్షలాది మంది రోహింగ్యాలు అక్రమంగా ప్రవేశించారు. మయన్మార్‌ ప్రభుత్వ రోహింగ్యాలను అణచివేస్తోందని ప్రచారం జరుగుతున్నా, వారి ఆగడాలను మాత్రం ప్రస్తావిం చడం లేదు. రోహింగ్యాల బాధితుల్లోమయన్మార్‌ హిందువులు ఉన్నారు.

తమిళుల ప్రస్థావన ఎందుకు?

శ్రీలంక సమస్య సునితమైనది. తమిళుల కోసం ప్రత్యేక దేశం (ఈలం) పేరుతో లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలం (ఎల్టీటీఈ) అక్కడ దశాబ్దాల పాటు సాయుధ పోరాటం చేసింది. ఆ సంస్థ ఓడిపోయింది. తమిళులపై అక్కడ చిత్రహింసలు, అణచివేత వాస్తవమే అయినా దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి. తమిళనాడులోని కొన్ని సోకాల్డ్‌ ద్రావిడవాద పార్టీలు, శక్తులు ఈలం అంశాన్ని అడ్డం పెట్టుకొని వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాయి..

మయన్మార్‌, శ్రీలంక బౌద్దుల ఆధిక్యత ఉన్న దేశాలే అయినా మత రాజ్యాలు కావు. చైనాతో మన దేశానికి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ రెండు దేశాలతో మనకు వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలున్నాయి.. మత రాజ్యాలైన పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్తాన్‌లలోని మైనారిటీలకు, మయన్మార్‌, శ్రీలంకలతో పోలిక పెట్టడం ఏమాత్రం సమంజసం కాదు.


ఎవరికీ వ్యతిరేకం కాదు: అమిత్‌షా

భారత పౌరసత్వాన్ని పొందడమనేది ప్రభుత్వ సార్వభౌమ నిర్ణయమని, దాని విషయంలో తాము ఎప్పటికీ రాజీ పడబోమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిష్కర్షగా చెప్పారు. సీఏఏ వెనక్కి తీసుకోబోమని, కచ్చితంగా అమలు చేసి తీరుతామని కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు. మైనారిటీలు లేదా ఇతర వర్గాలు భయపడనక్కరలేదనీ, ఎవరి పౌరసత్వాన్ని రద్దు చేయడానికి చట్టంలో నిబంధన లేదనీ అన్నారు. కాంగ్రెస్‌, వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. మైనార్టీల ఓట్ల కోసం అనేక మంది బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 2019లో బీజేపీ మేనిఫెస్టోలో సీఏఏ తీసుకొచ్చి అఫ్ఘానిస్తాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ శరణార్థులకు పౌరసత్వం ఇస్తామని చెప్పింది. 2019లో దీనిని ఉభయ సభలు ఆమోదించాయి. కానీ కొవిడ్‌ కారణంగా ఆలస్యమైందన్నారు అమిత్‌షా.

రాజ్యాంగం ప్రకారం పౌరసత్వానికి సంబంధిం చిన చట్టాలను రూపొందించే హక్కు పార్లమెంటుదే. చట్టం, దానిని అమలు చేసే అధికారం కేంద్రానిది. ఇందులో రాష్ట్రాలకు సంబంధం లేదు. ఆర్టికల్‌ 11 ప్రకారం పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలను రూపొందించడానికి పార్లమెంటుకు అన్ని అధికారాలు ఉన్నాయి.

రాహుల్‌ గాంధీ, మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌, స్టాలిన్‌, పినరయి విజయన్‌, ఉద్దవ్‌ ఠాక్రే, అసదుద్దీన్‌ ఓవైసీ తదితరలు అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఓ బహిరంగ వేదికపైకి వచ్చి పౌరసత్వ సవరణ చట్టం గురించి తమ వాదన వినిపించాలని కేంద్రహోంమంత్రి అమిత్‌షా సవాలు విసిరారు. ఈ సమస్య గురించి ఎవరైనా రాహుల్‌ గాంధీని వివరంగా ఇంటర్వ్యూ చేయాలని, సీఏఏను వ్యతిరేకించడానికి గల కారణాన్ని ఆయన ద్వారా చెప్పించాలని మీడియా ముఖంగా కోరారు అమిత్‌షా.

ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకమా?

ఎంతమాత్రం కాదు. ఈ సవరణతో ప్రస్తుతం భారత్‌లో ఉన్న ముస్లింలు, ఇతర పౌరులకు కూడా ఎలాంటి సంబంధం లేదు. ఆ మూడు దేశాలలో ఇస్లాం అధికారిక మతం కాబట్టి అక్కడి ముస్లింలను ఈ జాబితాలో చేర్చలేదు. ఇస్లామిక్‌ దేశాలలో ముస్లింలపై మతపరంగా అణచివేత, అత్యాచారాలు జరిగే అవకాశం లేదు. ఈ చట్టం రాజకీయ, ఆర్ధిక శరణార్ధులకు సంబంధించినది కూడా కాదు. అందువల్ల కూడా ముస్లింలకు ఇందులో స్థానం కల్పించలేదు.

చట్టంలో ఏముందో తెలియనివారు కూడా దేశానికి ఏదో అనర్ధం జరుగుతోందని వాదిస్తున్నారు. ఇది కొత్తగా పౌరసత్వాన్ని ఇస్తుంది. ప్రస్తుతం ఉన్న వాటిని రద్దు చేయదు.

రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తోందా?

 సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే ఇలా చెప్పారు -‘‘ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు. అలాగే కొందరు చెపుతున్నట్లుగా అధికరణం 14,15 లను అతిక్రమించడం లేదు. దేశీయకరణ లేదా పౌరసత్వ గుర్తింపు ఇవ్వడంలో మూడు దేశాలలో అణచివేతకు గురైన మైనారిటీ వర్గానికి చెందినవారికి కలిగిస్తున్న ప్రత్యేక సదుపాయం, హోదా మాత్రమే. దీనికి ఇతర వర్గానికి చెందినవారి దేశీయకరణ లేదా పౌరసత్వ మంజూరు ప్రక్రియతో ఎలాంటి సంబంధం లేదు. ఈ సవరణలు అధికరణం 14ను ఏమాత్రం ఉల్లంఘించడం లేదు.’’

తస్లీమా, అద్నాన్‌ సమీలకు పౌరసత్వం

పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లో జీవించడానికి ఇష్టపడ కుండా, భారతదేశంపై ప్రేమతో ఇక్కడకు వచ్చేయాలని భావించే ముస్లింలు ఎవరైనా ఉంటే తప్పకుండా రావచ్చు. ‘లజ్జ’ నవల రాసి తన దేశంలో బెదిరింపులకు గురైన రచయిత్రి తస్లీమా నస్రీన్‌ అలా వచ్చిన వారే. ప్రముఖ గాయకుడు అద్నాన్‌ సమీ కూడా పాకిస్తాన్‌ పౌరసత్వం వదులుకొని భారత దేశానికి వచ్చేశారు.

ఈశాన్య రాష్ట్రాల ప్రయోజనాలకు రక్షణ

సీఏఏతో ఈశాన్య రాష్ట్రాలకు నష్టం జరుగు తుందునే ప్రచారంతో అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌ (ఐఎల్‌పీ) నిబంధనల పరిధిలోకి వచ్చే అరుణాచల్‌ప్రదేశ్‌, మిజోరాం, నాగాలాండ్‌లకు పౌరసత్వ సవరణ బిల్లులోని నిబంధనలు వర్తించవు. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో పేర్కొన్న అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలోని గిరిజన ప్రాంతాలకు కూడా ఈ నిబంధనలు వర్తించవని బిల్లు స్పష్టం చేస్తోంది.

అస్సాంలోని గిరిజనేతర ప్రాంతాలు పౌరసత్వ సవరణ బిల్లు పరిధిలో ఉన్నాయి. అస్సాంలోకి అక్రమంగా ప్రవేశించిన చాలా మంది ప్రధానంగా బంగ్లాదేశ్‌ నుంచి వచ్చినవారు ఈ బిల్లుతో ప్రయోజనం పొందుతారని, ఇక వీళ్లు తమ రాష్ట్రంలో అధికారికంగా స్థిరపడిపోతారని అస్సాంలోని గిరిజనేతర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతు న్నారు. ఈ అపోహలను తొలగించాల్సి ఉంది.

బంగ్లాదేశ్‌ అక్రమ వలసదారులతో ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రం అస్సామే. 1971లో తూర్పు పాకిస్తాన్‌ బంగ్లాదేశ్‌గా మారక ముందు నుంచే పెద్ద సంఖ్యలో హిందువులు భారత్‌కు వలస రావడం మొదలైంది. వీరు బంగ్లాదేశ్‌లోని పాకిస్తాన్‌ సైనికుల దురాగతాల బాధితులు. హిందువు లను శరణాగతులుగా, అక్రమ వలసదారులను బయటివారిగా వర్గీకరించే ప్రయత్నం జరిగింది. ఈ అక్రమ వలసదారుల్లో అత్యధికులు ముస్లింలు.

ఇలా పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లలో వివక్షకు గురవుతున్న ముస్లిమేతరులకు ఆశ్రయం కల్పించి పౌరసత్వం ఇవ్వాలని కోరిన ఈ కాంగ్రెస్‌, కమ్యూనిస్ట్‌ పార్టీలే ప్రస్తుతం అందుకు వీలుకల్పించే విధంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని తెస్తే గగ్గోలు పెట్టడం విచిత్రం. అది రాజ్యాంగ వ్యతిరేకమని, ముస్లిం వ్యతిరేకమని, మానవహక్కులకు వ్యతిరేకమంటూ నానా రాద్ధాంతం చేస్తున్నాయి. వీటి వైఖరి మూలంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో అల్లర్లు, హింస చెలరేగాయి.

పైన మనం అధ్యయనం చేసిన వాస్తవాలను అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పౌరసత్వ సవరణ చట్టంపై అపోహలను తొలగించి, మన దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను తిప్పి కొడదాం.


లక్ష మంది శరణార్థుల పడిగాపులు

‘చరిత్ర శపించినవారు’`హిందూ శరణార్థు లకు హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ పెట్టిన పేరు ఇది. మార్చి 31,2013న ఆ సంస్థ సంచాలకుడు సమీర్‌ కాల్రా విడుదల చేసిన విషయాలు దిగ్భ్రమ గొలుపుతాయి.ఇది అమెరికాలోని హిందువులు ఏర్పాటు చేసిన హక్కుల రక్షణ సంస్థ (హెచ్‌ఏఎఫ్‌). ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పోరాడుతున్నది. మిగిలిన దేశాలలో హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలకీ, పాకిస్తాన్‌లో హిందువులు ఎదుర్కొంటున్న పీడనకూ ఎంతో తేడా ఉంది.అక్కడ హిందువుల మీద పథకం ప్రకారం హింసాకాండ సాగుతున్నది. మత వివక్ష సుస్పష్టం. పాకిస్తాన్‌ మైనారిటీల మీద, వారి మతాచారాల మీద తీవ్ర అణచివేత కొనసాగు తున్నది. ఇటీవలి కాలంలో దాదాపు 1,00,000 మంది భారతదేశానికి శరణార్థులుగా వచ్చారని ఆ సంస్థ వెల్లడిరచింది.

పాకిస్తాన్‌కు సమీపంగా ఉన్న రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో శరణార్థులు ఎక్కువగా ఉన్నారు. అందుకే 2023 (జనవరి 14-16) ఆరంభంలోనే హెచ్‌ఏఎఫ్‌ ఈ నగరాన్ని సందర్శించింది. సంస్థ సంచాలకుడు సమీర్‌, అమెరికాలో ఉంటున్న కొందరు భారతీయ వైద్యులు అక్కడకు వెళ్లారు. స్థానికంగా ఉన్న కొన్ని హిందూ సంస్థలు వీరికి సహకరించాయి.

1947, దేశ విభజన సమయంలో తమ దేశంలో మైనారిటీలను (హిందువులు, సిక్కులు, క్రైస్తవులు తదితరులు) భద్రంగా చూసుకుంటామని పాకిస్తాన్‌ స్థాపకుడు మహమ్మదలీ జిన్నా హామీ ఇచ్చాడు. కానీ ఆది నుంచి అక్కడ హిందువులు, మైనారిటీలు వివక్షకు గురి అవుతూనే ఉన్నారు. నాటి నుంచి సరిహద్దులు దాటి భారతదేశంలోకి వస్తున్నారు. ఇది దశల వారీగా జరిగింది. 1965, 1971 (యుద్ధాల వేళ), 1992 తరువాత భారత్‌కు పాక్‌ శరణార్థులు వెల్లువెత్తారు. అయితే 1971 తరువాత వచ్చిన వారినే శరణార్థులు అని పిలుస్తారు. 1965లో ఒక్క రాజస్తాన్‌కే 8000 మంది వచ్చారు. 1971లో 90,000 మంది భారత్‌కు వచ్చారు. 1992 తరువాత 20,000 మంది వచ్చారు. భారత్‌`పాక్‌ యుద్ధాల సమయంలో అక్కడి హిందువులను ‘దేశ వ్యతిరేకులు’గా ప్రకటించారని హెచ్‌ఏఎఫ్‌ నివేదిక చెబుతున్నది. అప్పటి నుంచి వారి మీద ఆంక్షలు మరింత తీవ్రమయినాయి. ఒక పక్క పాక్‌ ప్రభుత్వం, మరొకవైపు జిహాదీలు లేదా ఉగ్రవాదులు, ముస్లిం మత గురువులు కూడా వారిని వేధించే పనిని యథేచ్ఛగా సాగిస్తున్నారు. కాలీబెరీ (రాజస్తాన్‌) శరణార్థి శిబిరంలో ఉంటున్న ఒక మహిళ చెప్పినదాని ప్రకారం రహీంయార్‌ఖాన్‌ జిల్లాలో ముస్లిం మత గురువులు హిందువులు మతం మార్చకోకపోతే ఇక్కడ ఉండక్కరలేదు అని బాహాటంగానే ప్రకటిస్తున్నారు.హిందువులుగా ఉండదలుచుకున్న వాళ్లకి పాకిస్తాన్‌లో చోటు లేదని చెబుతున్నారు. అసలు హిందూ వివాహాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఎలాంటి చట్టాలు లేకపోవడం వల్ల వివాహితలను కూడా అపహరించి మతం మార్చి వేరే పెళ్లిళ్లు చేస్తున్నారు. పైగా అపహరించుకుపోయిన వాళ్లే ఆమె చేత ఇష్టపూర్వకంగా మతం మార్చుకున్నట్టు, పెళ్లి చేసుకున్నట్టు సంతకాలు చేయిస్తారు. ఇందులో పోలీసుల జోక్యం ఉండదు. ఈ వ్యవహారానికి ఎదురు చెబితే ఆమె కుటుంబంలోని వారందరినీ చంపే స్తామని బెదిరిస్తారు. ఈ తరహా బాధితులు కూడా రాజస్తాన్‌కు వచ్చారు.

ఇక్కడ 1992 ప్రస్తావన అయోధ్యకు సంబంధించినది. ఆ సంవత్సరం ఇక్కడ వివాదాస్పద కట్టడాన్ని కూలిస్తే అక్కడి హిందువులను లక్ష్యం చేసుకుని హింసాకాండ సాగించారు.ఆ సమయంలో ఉపఖండమంతటా కూడా హిందువులను హింసించారు. ముస్లిం మూకలు హిందువుల మీద, వారి ఆలయాల మీద దాడులు చేశాయి. ఆ తరువాత భారీగా హిందువులు తరలి వచ్చారు. 2009లో 6000 మంది భారత్‌లో తలదాచుకోవడానికి వచ్చారు.అప్పటి నుంచి ఏటా వేయి మంది రాజ స్తాన్‌కు వస్తున్నారని రాజస్తాన్‌కు చెందిన హిందూ సింగ్‌ శోధ్‌ తెలిపింది. పాకిస్తాన్‌కు పక్కనే ఉండడం వల్ల కావచ్చు, రాజస్తాన్‌లోనే 400 హిందూ శరణార్థి శిబిరాలు ఉన్నాయి. రాజస్తాన్‌లోని ప్రతి జిల్లాలోను హిందూ శరణార్థులు కనిపిస్తారని హిందూ సంఘాలు చెబుతున్నాయి. ఈ శరణార్థులు ఎక్కువగా పాక్‌లోని సింధు ప్రాంతం, రహీమ్‌యార్‌ ఖాన్‌, బహావల్పూర్‌ జిల్లాల వారే. పంజాబ్‌, హరియాణా, గుజరాత్‌, ఢిల్లీలో కూడా పాక్‌ నుంచి వచ్చిన హిందువులు దీనస్థితిలో కనిపిస్తారు.

శరణార్థి శిబిరాలలో ఉంటున్నవారి నోట సాధారణంగా ఒకే రకం మాటలు వినిపిస్తాయి. సామాజిక వివక్ష, హిందూ దేవాలయాల ధ్వంసం, మత స్వేచ్ఛ లేకపోవడం, ఆర్థిక దోపిడీ, భూకా మందుల పీడనÑ రైతుల వేధింపు, దీనితో పాటు పాఠశాలల్లో హిందువుల పట్ల చూపే ధోరణి వారిని ఇక్కడికి చేర్చాయి. పాఠశాల ఉపాధ్యాయులు హిందువుల పిల్లలతో బలవంతంగా ఖురాన్‌ చదివిస్తారు. సాధారణంగా ఆడపిల్లకు 16 ఏళ్లు వస్తే ఇక భయం మొదలు. అది అక్కడ వివాహ అర్హత వయసు. బాలికలను అపహరించి, మతం మార్చి వృద్ధులకు ఇచ్చి పెళ్లి చేస్తారు.

నిజమే, భారత్‌ ఆశ్రయమిస్తుందని వారు ఆశించి వచ్చారు. కానీ ఇంతకాలం వారి ఆశ నెరవేరలేదు. రాజస్తాన్‌లో అశోక్‌ గెహ్లోత్‌ ప్రభుత్వం వారిని అష్టకష్టాలు పెట్టింది కూడా. మండు టెండలలో వారి శిబిరాలను కూల్చివేయించినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు సీఏఏ ఇలాంటి వారికి పౌరసత్వం ఇవ్వాలని అనుకుంటున్నది. వారికి సగౌరవమైన జీవితం ఇవ్వాలని చూస్తున్నది. ఇది తప్పా?

About Author

By editor

Twitter
Instagram