జాతీయవాదమంటే ఆయనకు చిన్నచూపు. హిందూత్వ అంటే అలుసు.  ఆ రెండే ఊపిరిగా మనుగడ సాగించే సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. అం‌దుకే ఏ అవకాశం వచ్చినా, లేదా తానే సృష్టించుకుని మరీ ఆర్‌ఎస్‌ఎస్‌ను ఆడిపోసుకుంటూ ఉంటారాయన. జార్జి సోరెస్‌ ‌వంటి భారత వ్యతిరేకుల భాషే ఎప్పుడూ ఆయన నోట వినిపిస్తుంది. ఆయనే రాహుల్‌ ‌గాంధీ. దేశంలో..విదేశాలలో.. నోరు విప్పితే చాలు సంఘ్‌ను ఆడిపోసుకోవడం మరువరు. అందుకు ఇవి కొన్ని దాఖలాలు.

‘భారతదేశం తన ప్రజాస్వామిక లక్షణాన్ని పూర్తిగా కోల్పోయినదంటే అందుకు కారణమే రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌). అది మత ఛాందసవాద, ఫాసిస్ట్ ‌సంస్థ. అన్ని భారతీయ వ్యవస్థలనీ ఆక్రమించింది.’ ఈ సంవత్సరం మార్చి 6వ తేదీన లండన్‌లోని ఛాతమ్‌ ‌హౌస్‌ ‌మేధావుల సమావేశంలో కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌గాంధీ చేసిన తీవ్ర ఆరోపణ ఇది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పత్రికారంగాన్ని, న్యాయవ్యవస్థను, పార్లమెంట్‌ను, ఎన్నికల సంఘాన్ని కబ్జా చేసిందని కూడా ఆయన విశ్లేషించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను ఫాసిస్ట్ ‌సంస్థ అంటూ విమర్శించడం రాహుల్‌తోనే మొదలు కాలేదు. గతంలో కమ్యూనిస్టుల, ఉదారవాదుల నోళ్లలో చిరకాలం నానిన ఎంగిలి ఆరోపణే. అదే పట్టుకుని రాహుల్‌ ‌వేలాడుతున్నారు. భారత ప్రజాస్వామ్యం మీద పాశవిక దాడి జరుగుతోందని ఆయన విదేశీ గడ్డ మీద నుంచి ఆరోపించారు.

ఛాతమ్‌ ‌హౌస్‌ ‌సమావేశంలోనే రాహుల్‌ ఇం‌కాస్త తెంపరితనమే చూపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నిర్మాణమే ‘ముస్లిం బ్రదర్‌హుడ్‌’ ‌విధానంలో ఉంటుందని కూడా సెలవిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన అగ్నివీర్‌ ‌పథకం సైన్యం ఆలోచన కాదు, అది ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నుంచి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి వచ్చిందని ఫిబ్రవరి 7, 2023న బడ్జెట్‌ ‌సమావేశాలలో రాహుల్‌ ‌వ్యాఖ్యానించారు. ఈ విషయం ఆయనకు సీనియర్‌ అధికారులే చెప్పారట.

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సభ్యులంటే 21వ శతాబ్దపు కౌరవులని భారత్‌ ‌జోడో యాత్ర సందర్భంగా ఒక వీధి సమావేశంలో రాహుల్‌ ‌జనవరి 9, 2023న ఆరోపించారు. హరియాణాలోని అంబాలాలో మాట్లాడుతూ, కౌరవులు అంటే ఎవరు? మొదట మీకు 21వ శతాబ్దపు కౌరవుల గురించి చెబుతాను. వాళ్లు ఎవరో కాదు, ఖాకీ నిక్కరు వేసుకుని, చేతిలో కర్రతో ఉండేవారే. వాళ్లు శా•లు నడుపుతూ ఉంటారు. భారతదేశంలోని ఇద్దరు ముగ్గురు బిలియనీర్లు కూడా వారి వెనుక ఉన్నారు అని రాహుల్‌ ఆరోపించారు.

పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో జనవరి 17, 2023న భారత్‌ ‌జోడో యాత్రలోనే ముందు ఒకసారి దేశంలోని వ్యవస్థలను (మీడియా, పార్లమెంట్‌ ‌వగైరా) ఆర్‌ఎస్‌ఎస్‌ ఆ‌క్రమించుకుందని చెప్పారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే జనం నమ్ముతారని ఆయన గట్టి నమ్మకం కాబోలు.

రాహుల్‌లో ఒక కొంటె కోనంగి కూడా ఉన్నాడని లోకానికి తెలియాలి కదా! బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను గురువులుగా భావిస్తారట ఆయన. అదెందుకో డిసెంబర్‌ 31, 2022‌న ఢిల్లీలో జరిగిన విలేకరులు సమావేశంలో చెప్పారు. మా మీద ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీ దాడి ఇంకా తీవ్రం కావాలని కోరుకుంటున్నాను. అందువల్ల కాంగ్రెస్‌లో సైద్ధాంతిక పరమైన చైతన్యం పెరుగుతుంది. సైద్ధాంతికంగా సుస్థిరంగా ఎలా ఉండాలో వాళ్లని చూసే నేను నేర్చుకుంటున్నాను. అందుకే వాళ్లని గురువులుగా భావిస్తాను అన్నారాయన.

తన భారత్‌ ‌జోడో యాత్ర భయానికి వ్యతిరేకంగా చేపట్టిన యాత్ర అని డిసెంబర్‌ 24, 2022‌న ఢిల్లీలో ప్రవేశించినప్పుడు రాహుల్‌ అన్నారు. ఇంకా అసహనం, నిరుద్యోగ సమస్యలకు వ్యతిరేకంగా కూడా ఈ యాత్ర చేపట్టినట్టు చెప్పుకున్నారు. ఈ భయాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సృష్టించి, దానిని అసహనంగా మార్చివేస్తున్నదట. మీ అసహనం అనే బజారులో ప్రేమ అనే దుకాణం తెరవడా నికే మేం ఇక్కడ ఉన్నామంటూ ఢిల్లీ వాసుల ఎదుట కవిత్వం వెలగబెట్టే ప్రయత్నం కూడా చేశారాయన.

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వారు మహిళలను తమ సంస్థలోకి రానీయరు అని రాజస్తాన్‌లోని దౌసాలో మాట్లాడుతూ డిసెంబర్‌ 14, 2022‌న (భారత్‌ ‌జోడో యాత్ర) రాహుల్‌ ‌భాష్యం చెప్పారు. ఆ సంస్థలో మహిళలకు స్థానంలో లేదు. వారు మహిళలను అణచివేస్తారు అని కూడా సెలవిచ్చారు.

సెప్టెంబర్‌ 5, 2022‌న ఢిల్లీలోనే రామ్‌లీలా మైదాన్‌లో మేహంగి పర్‌ ‌హల్లా బోల్‌ ‌పేరుతో ప్రదర్శన జరిగింది. అక్కడ రాహుల్‌ ‌గాంధీ రెచ్చి పోయారు. ‘బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దేశాన్ని విభజిస్తాయి. వాళ్లు భయోత్పాతాలను సృష్టించి ప్రజల మధ్య చీలికలు తెస్తారు. భయోత్పాతాలను సృష్టించడం ద్వారా లబ్ధి పొందేదెవరు? పేదలా? రైతులా? చిరు వ్యాపారులా? అసలు నరేంద్ర మోదీ ప్రభుత్వం నుంచి ఎవరు లబ్ధి పొందారు? ఈ భయోత్పాతాల సృష్టి వల్ల ఇద్దరంటే ఇద్దరు కార్పొరేట్‌ ‌ప్రముఖులు బాగుపడ్డారు’ అని చెప్పారు రాహుల్‌.

ఆర్‌ఎస్‌ఎస్‌లో ఒక్క మహిళ కూడా నాయకత్వ స్థానంలో లేరని జనవరి 1, 2018న షిల్లాంగ్‌లో జరిగిన సమావేశంలో రాహుల్‌ ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మహిళలను సాధికారత నుంచి తప్పిస్తుందని కూడా అన్నారు. ఇక్కడే లోకోత్తరమైన ఉదాహరణ ఇచ్చారు రాహుల్‌. ‌ఫొటోలలో మహాత్మా గాంధీ సదా మహిళలు అటూ ఇటూ ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌సంఘచాలక్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌! ఎప్పుడూ అటూ ఇటూ మగవారితో తప్ప కనిపించరు అంటూ అపారమైన అజ్ఞానాన్ని ఒలకబోశారు.

గుజరాత్‌ ‌పర్యటనలో తన కాన్వాయ్‌ ‌మీద బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలు దాడికి దిగారని ఆగస్ట్ 5, 2017‌న ఆరోపించారు రాహుల్‌. ఆ ‌రెండు సంస్థలతోపాటు మోదీ రాజకీయాలు కూడా ఇలాగే ఉంటాయని వాక్రుచ్చారు.

About Author

By editor

Twitter
Instagram