ఫిబ్రవరి 8 రథసప్తమి

దేవతలు, మానవులే కాదు.. రాముడు, కృష్ణుడు లాంటి అవతార పురుషులూ ఆయనను అర్చించారని ఐతిహ్యం. శ్రీరామచంద్రుడు ఆదిత్య హృదయస్తోత్ర పఠనంతోనే లంకేశ్వరుడిపై విజయం సాధించాడని, హనుమ సూర్యోపాసన ద్వారానే సర్వవిద్యలు అభ్యసించినట్లు పురాణ కథనం. శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు సూర్యారాధనతో కుష్టువ్యాధి నుంచి విముక్తుడయ్యాడట. ధర్మరాజు వనవాస కాలంలో సూర్యారాధనతోనే ‘అక్షయ పాత్ర’ను పొంది ఆకలిదప్పులను జయించగలిగాడు. దివాకరుడిని ప్రసన్నం చేసుకునే సత్రాజిత్‌ ‘‌శ్యమంత కమణి’ని పొందాడు. మానవ మనుగడకు ప్రధాన మైన ఆహార, ఆరోగ్యప్రదాత సూర్యభగవానుడే.

‘సర్వం సూర్యమయం జగత్‌..’ అన్నట్లు సకల జగత్తు ఆయన తేజస్సుతో చైతన్యం పొందుతోంది. సమస్త ప్రాణకోటి ఆయనపైనే ఆధారపడి ఉంది. ‘నమస్కార ప్రియోభానుః’ అని ఆర్యోక్తి. కేవలం వందనంతోనే ప్రసన్నుడై ఆరోగ్య విజ్ఞానాలను ప్రసా దించే ప్రత్యక్ష భగవానుడు సూర్యదేవుడు. యోగ్యత, అయోగ్యలతో నిమిత్తం లేకుండా సర్వ జీవకోటికి సమానంగా వెలుగులు (కాంతులు) పంచే భగ వానుడు. సృష్టి స్థితి లయలు సూర్యుని ప్రమేయంతోనే జరుగుతున్నాయని (సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితానిచ/సూర్యే లయం ప్రాప్నువంతి య సూర్యః సోహ మేవచ) ‘సూర్యోపనిషత్తు’ పేర్కొంది.

సూర్యభగవానుడికి, సముద్రుడికి, మట్టికి (భూమికి) గల స్నేహం, బాంధవ్యం వర్షం, పంటల రూపంలో లోకాన్ని ఆదుకుంటోంది. తన కిరణాలతో నీటిని గ్రహించి వర్షరూపంలో ధరణిని సస్యశ్యామలం చేస్తున్నాడు. తినే మెతుకుపై వారి వారి పేర్లుంటా యన్నది ఎంత నిజమో, పండే ప్రతి గింజ సూర్య భగవానుడి దయాపాత్రమనడం అంతే నిజమంటారు విజ్ఞులు. ఆయనకు గల అనేక పేర్లలో ‘మిత్రుడు’ అనేది సార్థకమైనది. సమస్త లోకాలకు కర్మసాక్షిగా అనంతమైన శక్తికిరణాలతో వెలుగును, తేజస్సును ప్రసాదిస్తున్న ఆదిత్యుడు ఆదితి కశ్యప ప్రజాపతి కుమారుడిగా విశాఖ నక్షత్రంలో ఉద్భవించినట్లు బ్రహ్మాండ పురాణ కథనం. సూర్యభగవానుడు నిత్యానుసంధాన నీయుడు. మరీ ముఖ్యంగా మాఘ మాసంలోని ఆదివారాలలో ఆయన అర్చనను మరీ ప్రత్యేకతగా చెబుతారు. ఆదివారాలలో సూర్య నమస్కారాలు చేసి పాలను నివేదిస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం.

చైతన్యం, ఆరోగ్య ప్రదాత

సూర్యభగవానుడు సమత్వానికి, చైతన్యానికి, క్రమశిక్షణకు ప్రతీక. తరతమ భేదాలు, పాప పుణ్యాలతో నిమిత్తం లేకుండా అందరికి వెలుగు నిస్తాడు. ఆయన ఉదయాస్తమానాలు క్రమశిక్షణకు నిదర్శనం. కాలానికి ఆదిత్యుడే కొలమానం. సమస్త జీవరాశికి ఆధారభూతుడు. కాలం ఎవరి కోసం ఆగదని నిరూపిస్తూ సాగుతాడు. లోకబాంధవుడు సూర్యుడు ఎవరి ప్రభావం లేకుండానే ఉదయిస్తూ, ఆరోగ్యభాగ్యాన్ని ప్రసాదిస్తూ తన పని చేసుకుంటూ పోతాడు. ఎప్పటిపనులు అప్పుడు చేయాలన్న సందేశం ఆయన గమనంలో కనిపిస్తుంది.

‘సప్తలోక ప్రకాశాయ సప్తసప్త రథాయచ

సప్త ద్వీప ప్రకాశయ భాస్కరాయ నమోనమః’…

‘ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్‌’ (ఆరోగ్యం కోసం భాస్కరుని ఆరాధించాలి) అంటారు. సూర్యారాధన సర్వరోగాలను హరించి ఆరోగ్యాన్ని, బలాన్ని, తేజస్సును ప్రసాదిస్తుంది. ఆయన ఔషధరూపుడని, ఆయన కిరాణాల వల్ల ఎన్నో వ్యాధులు తొలగి పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయాస్తమయ వేళల్లోని సూర్యకిరణాలు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. వేదకాలంలో ప్రస్కణ్వుడు అనే మహర్షి సౌరమంత్రాలు మూడుసార్లు జపించి చర్మవ్యాధి నుంచి విముక్తుడయ్యాడని (అది ‘తృచభాస్కరం’ అని ప్రసిద్ధికెక్కింది), మయూరుడనే కుష్టువ్యాధిగ్రస్తుడు ‘సూర్యశతకం’ రచనతో సంపూర్ణ ఆరోగ్యం పొందారని చెబుతారు. సూర్యజయంతి రథసప్తమిని ‘ఆరోగ్య సప్తమి’ అనీ అంటారు. ఆ రోజు చేసే స్నాన, ధ్యాన, నమస్కారాది పక్రియలు శారీరక రుగ్మతలను దూరం చేయడంతోపాటు మానసిక ప్రవృత్తులను సన్మార్గంలో పెడతాయంటారు. సూర్యుడిలో అపారమైన రోగ నిరోధక శక్తి ఉందని, అంతటి శక్తి ప్రపంచంలోని మరే వస్తువులోనూ లేదని పాశ్చాత్య వైద్యశాస్త్రవేత్తలు సైతం ప్రకటించారు.

రథసప్తమి విశిష్టత

ఏడాదికి వచ్చే 24 సప్తమి తిథుల్లో రథసప్తమికి విశిష్టత ఉంది. మన్వంతర ప్రారంభంలో మాఘ శుద్ధ సప్తమి నాడే సూర్యుడు తొలిసారి కిరణాలను ప్రసరింపచేశాడట. అందుకే ఈ తిథి ‘సూర్య జయంతి’గా స్థిరపడింది. సూర్యుడికి వివస్వతుడు అని మరోపేరు ఉంది. ఆయన కుమారుడే ఏడవ మనువు వైవస్వతుడు. రథసప్తమి నాడే ఆయన మన్వంతరం ప్రారంభమైందని చెబుతారు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడంతో ఉత్తరాయణం మొదలవుతుంది. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మకర సంక్రాంతిని, ఆయన పుట్టినరోజు రథసప్తమి (మాఘశుద్ధ సప్తమి)ని జరుపుకుంటారు. మాఘశుక్ల సప్తమినాడు సూర్యుడు రథాన్ని అధిరోహించడం వల్ల ‘రథసప్తమి’ అని పేరువచ్చిందని మత్స్యపురాణం పేర్కొంటోంది. దీనినే మహాసప్తమి, భానుసప్తమి, అచలాసప్తమి అని వ్యవహరిస్తారు. తెలుగువారు ఒకప్పుడు రథసప్తమి నాడే ఉగాది జరుపుకునేవారట.

రథసప్తమి నాటి స్నానపక్రియ ప్రత్యేకత గురించి ‘వ్రతచూడామణి’ పేర్కొన్న ప్రకారం, ఆరోజు సూర్యోదయానికి ముందే నెయ్యి లేదా నువ్వులనూనెతో దీపాన్ని వెలిగించి నదీతీరంలో కాని, చెరువులో కానీ వదిలి, జిల్లేడు ఆకులు, రేగుపండ్లు తల మీద ఉంచుకుని స్నానమాచరించాలి. ఇలా చేయడంవల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, తేజస్సుపెంపుతో పాటు చర్మరోగాలు నశిస్తాయని, జన్మాంతర సప్తవిధ పాపాలు నశిస్తాయని, రథసప్తమి నాడు సూర్యోదయ సమయస్నానంతో సూర్యగ్రహణం నాటి స్నానమంత ఫలితం లభిస్తుందని విశ్వాసం.

‘సప్త సప్త మహాసప్త సప్తద్వీపా వసుంధరా

సప్త జన్మకృతం పాపం మకరే హంతుసప్తమీ

యద్యత్‌ ‌జన్మకృతం పాపం మయాసప్తసు జన్మను

తన్మోరోగం చ శోకం చ మకరే హంతు సప్తమీ’ (ఏడు గుర్రాల సూర్య రథం, ఏడు ద్వీపాల విస్తృతి గల సమస్త భూమండంలోని ఏడు జన్మల పాపాలను, వ్యాధులను, శోకాలను పోగొట్టుగాక) అనే శ్లోకాన్ని చదువుతూ తలపై జిల్లేడు ఆకు, రేగుపండ్లు పెట్టుకొని స్నానం ఆచరించాలి. స్నానం, దీపం, అర్ఘ్యం, అర్చనం, తర్పణం రథసప్తమి నాటి ప్రత్యేక ధర్మాలు.

ముందురోజు (షష్టి) నిరాహారంగా ఉండి మరునాడు శాస్త్రోక్తంగా రథసప్తమి వ్రతం ఆచరించడం వల్ల ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఏడేడు జన్మల పాపాలు నశిస్తాయని ‘ధర్మసింధువు’ పేర్కొంటోంది. ఈరోజు సూర్యునికి 12సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. ప్రత్యక్ష భగవానుడు పరమాన్నప్రియుడు. అందునా ఆవు పాల పాయసం మరింత శ్రేష్టంగా చెబుతారు. కనుకనే ఆదిత్య హృదయం పారాయణం చేసి పరమాన్నం నివేదిస్తారు. ధనుర్మాసంలో పెట్టిన గొబ్బి పిడకలపై ఈ మధుర పదార్థాన్ని తయారు చేయాలని చెబుతారు. చిక్కుడు కాయలతో అలంకరించిన రథంలో సూర్యుడిని ఆవాహనచేసి, ఎర్రచందనంతో కలిపిన అక్షతలతో అర్చిస్తారు. క్షీరాన్నాన్ని మొత్తం పదిహేను ఆకుల్లో ఉంచి అగ్నిదేవుడు, తులసికోటకు, సూర్యుడికి సమానంగా నైవేద్యం సమర్పిస్తారు. ఎరుపు సూర్యునికి• ప్రీతికరమైనది కనుక ఆయన జయంతి నాడు శక్తి మేరకు ఎర్రటి వస్త్రం, గోధుమలు, సువర్ణం, ఎర్రటి పూలు దానం చేయాలని పెద్దలు చెబుతారు. కైలాసగౌరీ, పదహారు ఫలాలులాంటి నోములు ప్రారంభించేందుకు రథసప్తమి అనువైన రోజని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నోములను ఏడాదిలోపు ఎప్పుడైనా ముగించవచ్చని, ఒకవేళ రథసప్తమి నాడు నోము ఆరంభానికి వీలుకుదరకపోతే శివరాత్రినాడు చేపట్టవచ్చని చెబుతారు.

శ్రీవారి ఉత్సవ హేల

తిరుమలలో ఇతర పండుగల మాదిరిగానే రథసప్తమిని నిర్వహిస్తారు. అయితే ఎన్నడూ లేనివిధంగా ఆ ఒక్కరోజే శ్రీవారు ఏడు రథాలపై వివిధ అలంకారాలలో ఊరేగి కనువిందు చేయడం ప్రత్యేకం. సూర్యప్రభ వాహనంతో తిరువీధి ఉత్సవం మొదలై చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చందప్రభ వాహనాలతో ముగుస్తుంది. దీనిని అర్థ బ్రహ్మోత్సం అంటారు.

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram