డిసెంబర్‌ 16 ధనుర్మాసారంభం

– పూర్ణిమాస్వాతి

దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలగలసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. విష్ణు ఆలయాలలో ఉదయం పూట అర్చనలుచేసి, నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. దీనిని బాలభోగం అని పిలుస్తారు. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. సహస్రనామార్చనలో తులసీదళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. శయన బేరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణస్వామిని అర్చిస్తారు. ఇది తిరుమలలో జరిగే సంప్రదాయం.

ధనుర్మాసంలో ఉభయ సంధ్యలలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం దూరమవుతుంది. ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో తిరుప్పావై పారాయణం చేసినవారు దైవానుగ్రహానికి పాత్రులవుతారని శాస్త్రవచనం.

సాక్షాత్తూ భూదేవి, అవతారమూర్తి అయిన అండాళ్‌ రచించిన దివ్యప్రబంధమే తిరుప్పావై. వేదాలు, ఉపనిషత్తులసారమే తిరుప్పావై అని మన పూర్వాచార్యులు ప్రస్తుతించారు. ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వసులభరీతిలో వెలువడినాయనీ, తిరుప్పావై మహావిష్ణు పాదపద్మాలను అందు కోవటానికి మార్గదర్శకమని చెబుతారు. ఈ మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి. పెళ్లీడు అమ్మాయిలు ఇళ్లముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణునికి ధనుర్మాసం నెలరోజులూ తులసీమాల సమర్పించే యువతులకు, నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది.

విష్ణుచిత్తుడి కుమార్తెjైున గోదాదేవి మానవ మాత్రులని కాక రంగనాథుడినే వివాహం చేసు కుంటానని దీక్ష బూనుతుంది. ఆ కారణంగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణుపూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని, భావాన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితంచేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా.. ఆమె కోరికపై తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాథ స్వామితో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగానాథుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది.

 ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మ దేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సంహితలో కనిపిస్తాయి. ఈ వ్రతం ఆచరించాలనుకునేవారు శక్తిమేరకు విష్ణుప్రతిమని తయారుచేయించి, పూజాగృహంలో ప్రతిష్టించు కోవాలి. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు లేచి, స్నానాదికాలు ముగించాలి. పంచామృతాలతో శ్రీమహావిష్ణువును అభిషేకించాలి. అభిషేకానికి శంఖం ఉపయోగించడం మంచిది. తర్వాత తులసీ దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం నమర్పించాలి. ఈ నెలరోజులూ విష్ణుకథలు చదవాలి. తిరుప్పావై పఠించాలి. నెలరోజులూ చెయ్యలేనివారు పదిహేను రోజులు, 8 రోజులు లేదా కనీసం ఒక్కరోజైనా ఆచరించవచ్చు.

ధనుర్మాస వ్రతం వల్ల ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారు. ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వత్రాన్ని ఆచరి స్తున్నారు. భక్తిమార్గం చేత భగవంతుని సులభంగా వశపరచుకోవచ్చనీ నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాశురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా తిరుప్పావై పారాయణం చేసిన వారికిÑ తిరుప్పావై గానం, శ్రవణం చేసినవారికి ఆయురారోగ్యాలూ, అష్టైశ్వర్యాలూ కలుగుతాయి.

నైవేద్యం ప్రత్యేకత

ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసా దంగా పులగం, పాయసం, దద్యోజనం సమర్పిస్తారు. చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది. ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది. పాలు, పెరుగు, పెసరపప్పులలో చలువ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగిస్తారు. ఆయుర్వేదం, జ్యోతిష్యం ప్రకారం ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వగుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి.

రవి ధనురాశిలో ప్రవేశించి మకరంలోకి వెళ్లే సమయమే ధనుర్మాసం. ధనుస్సు, మీనంలో రవి ఉన్నప్పుడు రవి రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యమూ జరపకూడదు. కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువగా సూర్య పూజలు చేస్తారు.

గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు? ఇంటిముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యంపిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు. నిత్యం ముగ్గులు వేయడం వలన స్త్రీలకు మంచి వ్యాయామం కలుగుతుంది.

తిరుప్పావై అంటే?

తిరుప్పావై ఒక అద్భుత వేదాంత గ్రంథం. భగవంతుని సులభంగా అందించగలిగే సాధనా మార్గం. ‘తిరు’ అంటే శ్రీ అని, ‘పావై’ అంటే పాటలు లేక వ్రతం అని అర్థం. కలియుగంలో మానవకన్యగా జన్మించి గోదాదేవిగా ప్రఖ్యాతమైన ఆండాళ్‌ భగవంతుడినే తన భర్తగా భావించి, ఆయన్ను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం. తిరుప్పావైలో పాశురాలు ఉంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాళ్‌ అపురూప భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా అందించారు.

తిరుప్పావై వ్రతానికి కొన్ని విధివిధానాలు ఉన్నాయి. వేకువజామునే నిద్రలేచి స్నానం చేయాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను, తిరుప్పావై పాశురాలను ఆలపించాలి. పేదలకు దానాలు, పండితులకు సన్మానాలు చేయాలి. స్వామికి, ఆండాళ్‌కు ఇష్టమైన పుష్పకైంకర్యం చేయాలి. ప్రతిరోజూ స్వామివారికి పొంగలి నివేదించాలి. సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మానవు లందరూ స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అటువంటి విష్ణుమూర్తిని భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతాన్ని నేటికీ మనం ఆచరిస్తున్నాం. ధనుర్మాసం మొదటిరోజున ఈ వ్రతాన్ని ఆరంభించి, భోగిరోజున ఆండాళ్‌, శ్రీరంగనాథుల కల్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది.e

వ్యాసకర్త : సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
Instagram