తిరుమల తిరుపతి దేవస్థానాల విషయంలో పాలకమండలి తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అనే స్థాయిని మించిపోయి చాలాకాలమైంది. వివాదాస్పదం స్థాయిని దాటి కుట్ర అనుకోవలసి వస్తున్నదని చాలామంది భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతిమంగా ఈ విమర్శలన్నీ ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతాయి. తర్జనులన్నీ రాష్ట్ర ప్రభుత్వం వైపే చూపిస్తాయి. తిరుపతి పట్టణంలో పరమతాల విజృంభణ, తిరుమల కొండమీద అన్య మత ప్రచారం , రాజకీయ నాయకుల వీరంగం అన్నిటికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించక తప్పదు. క్రైస్తవులు, మహమ్మదీయులు కూడా తిరుపతి పట్టణం మీద కన్నేసిన సంగతి గత కొద్దికాలంగా హిందువులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆఖరికి బ్రిటిష్‌ ఇం‌డియా ప్రభుత్వంలో, అంతకు ముందు ముస్లింల పాలనలో కూడా లేని ప్రమాద ఘంటికలు తిరుమలేశుని ఆలయం చుట్టూ మోగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. హిందువుల ఆరాధ్యదైవం ఇలాంటి చిక్కులలో కూరుకుపోవడానికి కారణాలను కొద్దికాలంగా భక్తులు అన్వేషిస్తూనే ఉన్నారు. బయటపడుతున్న వాస్తవాలతో ఆందోళన చెందుతూనే ఉన్నారు. అవన్నీ తీవ్ర ఆందోళన కలిగించేవే కూడా.

కరోనా ప్రపంచం మొత్తానికి సంబంధించిన విపత్తే. కాదనలేం. కానీ ఆ పేరు చెప్పి టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాలు భక్తులు కొండమీదకు రాకుండా నిరుత్సాహ పరచడానికీ, నిరోధించడానికీ వ్యూహంగా ఉపయోగపడుతున్నాయన్న విమర్శ వచ్చింది. కరోనాను చూపి ఉచిత దర్శనాల సంఖ్యను తగ్గించారు. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి? పైగా రూ.300, వీఐపీ  దర్శనాల సంఖ్యను పెంచడం అనుమానాలకు తావిచ్చేదే. ఒక పేద హిందువుకూ, ఏడుకొండలవాడికీ నడుమ టిటీడీ నిర్ణయం దూరం పెంచింది. గత రెండు మాసాలుగా ఉచిత దర్శనాల వ్యవహారాన్ని కూడా ఆన్‌లైన్‌ ‌పరం చేశారు. ఇది సామాన్య భక్తుల పాలిట అశనిపాతమే.

సాధారణ ప్రజలు, గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి నోచుకోని వారు ఈ నిర్ణయంతో శ్రీవారి దర్శనం చేసుకోలేకపోతున్నారు. చదువుకొని సెల్‌ఫోన్‌, ‌కంప్యూటర్‌ ‌జ్ఞానం ఉన్నవారు కూడా టీటీడీ ఉచిత దర్శన టికెట్‌ ‌తెచ్చుకోలేకపోతున్నారు. మొత్తంగా చూస్తే దర్శనం విషయంలో తీసుకువచ్చిన ఈ మార్పుల వల్ల  సుమారు 80, 90% మంది ఇక్కట్లు పాలవుతున్నారు.అసలు ఆన్‌లైన్‌ ‌సౌకర్యం గురించి చాలామందికి తెలియదు. ఇందులో తమ తప్పేమీ లేదనీ, ఈ విధానం గురించి టీటీడీ ప్రచారం చేస్తున్నదని వారు సమాధానం చెబుతున్నారు. ఇప్పటికీ టైమ్‌స్లాట్‌ ‌టోకెన్స్ ఉం‌టాయని జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు హతా

శులవుతున్నారు. వెసులుబాటు లేక, దర్శనం లేక కొందరు భక్తులు  వెనుతిరిగి పోతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. కొందరు కాలినడకన తిరుమలకు చేరుకుంటే దారిలో టోకెన్‌ ‌వేస్తారని వచ్చి, అలాంటి అవకాశం లేదు అని తెలుసుకొని బాధపడుతున్నారు. కరోనా తగ్గిపోయిందని వేలాదిమంది భక్తులు సొంత వాహనాలు, బస్సులు, రైలు ద్వారా ఇక్కడికి చేరుతున్నారు. కానీ  ఇక్కడికి చేరుకున్నాక కొత్త నిబంధనలు తెలిసి బాధపడుతున్నారు.

కానీ ఈ పరిస్థితిని బ్రోకర్లు ఉపయోగించుకుంటున్నారు. భక్తులను మోసం చేస్తున్నారు. ఇక్కడి ప్రయివేటు వాహనదారులు కారు, జీపులలో మేము  తీసుకెళతామని, దర్శనం చేయిస్తామని చెప్పి మోసం చేసి భక్తుల నుండి  అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజానికి కింద అలిపిరి దగ్గరే దర్శన టికెట్‌ ఉం‌టేనే వాహనాన్ని పైకి పంపుతున్నారు. కానీ ఈ చెక్‌పోస్ట్ ‌దగ్గర వారితో ప్రవేటు వాహనదారులు లాలూచీ పడి తీసుకెళ్లి తిరుమలలో వదిలి వచ్చేస్తున్నారు. అక్కడ వసతి, దర్శనం లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు.  కొంతమంది పాత ఎమ్‌.ఎల్‌.ఏ., ఎమ్‌.‌పి., పాలకమండలి సభ్యుల ఉత్తరాల పేరుతో నకిలీ లేఖలు భక్తుల పేరిట తయారుచేసి వేల రూపాయలు వసూలు చేస్తున్నారు.

ఎప్పుడో తలనీలాలు మొక్కుకున్న వారి బాధ వర్ణనాతీతం. కరోనా తగ్గిందని వారు వస్తున్నారు. మొక్కు చెల్లించాల్సిన సమయం, నెలలు గడిచిపోయి ఏమి చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు మరింత ఇబ్బంది పడుతున్నారు.

ఇతర జిల్లాల నుండి, రాష్ట్రాల నుండి భక్తులు రిజర్వేషన్‌ ‌చేసుకొని వచ్చి దర్శనం అయ్యే వరకు అయ్యే వ్యయం భరించలేక పోతున్నారు. దర్శనం, వసతి లేక రోడ్లపైన, ఫుట్‌పాత్‌లపైన, రైల్వేస్టేషన్ల దగ్గర, బస్టాండ్‌ల దగ్గర ఇబ్బంది పడుతున్నారు. ఆన్‌లైన్‌ ‌టికెట్స్‌లోను ఏదో మతలబు ఉందని ఆరోపణలు ఉన్నాయి.

ఆన్‌లైన్‌ ఓపెన్‌ ‌కాగానే మొదట కొన్ని రోజులపాటు కొన్ని టికెట్స్ ‌మాత్రమే ఉన్నట్లు కనపడుతున్నాయి. అన్ని నెట్‌ ‌సెంటర్స్ ‌దగ్గర ఓపెన్‌ ‌కావడం లేదు. నెట్‌ ‌సెంటర్స్ ‌దగ్గర అనేకమంది భక్తులు తమ పనులు వదిలేసి క్యూలో కూర్చుంటున్నారు. నెట్‌ ‌సెంటర్స్ ‌దగ్గర టి.టి.డి. టికెట్స్ ‌బుక్‌ ‌చేసుకోవడానికి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. దీని కారణంగా సామాన్య, పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

భక్తులకు ఇన్ని సమస్యలు ఉన్నా పాలక మండలి ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నది. దర్శనాల నిబంధనలు పదేపదే మార్చి వేస్తున్నారు. ఈరోజు ఉన్న నిబంధన రెండు రోజుల తర్వాత, లేదా వారం తర్వాత ఉండదు. నెల తర్వాత అసలే ఉండదు. దర్శన ఆఫ్‌లైన్‌ ‌టికెట్స్‌కు ఒకరోజు భూదేవి కాంప్లెక్స్ అం‌టారు. తర్వాత రోజు ఉదయాన్నే అక్కడికి వెళితే శ్రీనివాసం అంటారు. మరొకరోజు విష్ణు నివాసం అంటారు. ఇదంతా భక్తులను  అయోమయంలో పడేస్తున్నది. ఒక ఉదాహరణ:  స్థానికులు, స్నేహితుల, బంధువుల ద్వారా సమాచారం తెలుసుకొని పశ్చిమ గోదావరి జిల్లా నుండి వచ్చిన భక్తులు ఉదయం 5 గం।।లకు టికెట్స్ ‌కోసం వచ్చారు. ఉదయం 3 గం।।లకు క్యూలో నిలబడితే ఈరోజు, రేపటి టికెట్స్ ‌నిన్న రాత్రి ఇచ్చేశారంటూ సమాధానం వచ్చింది. రద్దీ ఎక్కువైనందున ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు వివరణ ఇచ్చారు.  మళ్లీ రెండు రోజులు ఉండలేక, సెలవులు పెట్టుకోవడం ఇబ్బంది కలిగి దర్శనం లేక బాధపడుతూ వెనుతిరిగి వెళ్లిపోయారు. ఆఖరికి చిత్తూరు జిల్లా ప్రజలకు, తిరుపతి నగర ప్రజలకు కూడా దర్శనం ఇంత కష్టంగా ఏనాడూ లేదన్న మాట వినిపిస్తున్నది. జిల్లా ప్రజలు దగ్గరే కదా అని కాలినడక దారి నుండి వెళ్లి ఉచిత దర్శనం చేసుకొనే వారు అధికంగా ఉండేవారు. వారికీ ఇబ్బందులు తప్పడం లేదు.

దేశంలో ఎంతో ప్రాచుర్యం కలిగిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. వేటి వైశిష్ట్యం వాటిదే. అక్కడ కూడా కరోనా నేపథ్యంలో ఆంక్షలు వచ్చాయి. తరువాత కొన్నింటిని సడలించారు. కానీ తిరుమలలో  ఎక్కడా లేని కఠిన నియమాలను పాలకమండలి అమలు చేస్తన్నదని భ•క్తుల అభిప్రాయం. కరోనా ఆంక్షలు దశలు వారీగా ఎత్తివేస్తున్న క్రమంలో సినిమా హాళ్లు తెరిచారు. రైలు ప్రయాణాలు పున:ప్రారంభమైనాయి.

బస్సులు నడుస్తూ వేలాది మందిని గమ్యాలకు చేరుస్తున్నాయి. లక్షలాదిగా జనం వెళ్లి వస్తున్నారు. కానీ తిరుపతిలో ఉన్నన్ని ఇబ్బందులు వారు ఎదుర్కొనడం లేదు. రాజకీయ నేతల సమావేశాలు, ఎన్నికల ప్రచారాలు – వీటిలో వేటికి లేని నిబంధనలు తిరుమల వెళ్లే సాధారణ భక్తజనం మీద ఎందుకు రుద్దుతున్నారు? కరోనా తగ్గింది. ఇప్పటికైనా వైద్యుల, ప్రభుత్వాల నిబంధనల మేరకు ఉచిత దర్శనాల సంఖ్యను పెంచాలి. దర్శనాల నిబంధనలు, నిర్ణయాలు పదేపదే మార్చకుండా ఉండాలి. వి.ఐ.పి. బ్రేక్‌ ‌దర్శనాల సంఖ్యను తగ్గించి, ఉచిత దర్శనాల సంఖ్యను పెంచాలి. కాలిబాటలో వెళ్లి, అక్కడ దర్శన టోకెన్స్ ‌వేసుకొనే విధానం మళ్లీ ప్రారంభించాలి. భక్తుల మీద కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నాయంటూ టీటీడీ పాలక మండలి, రాష్ట్ర ప్రభుత్వాల మీద వెల్లువెత్తుతున్న విమర్శలను అవి పట్టించుకోవడం ఇంకా అవసరం.

– కె.రెడ్డెప్ప, తిరుపతి

About Author

By editor

Twitter
Instagram