అయోధ్యలో భూమిపూజ సుముహూర్తానికి భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎందరో టీవీ చానెళ్లకు కళ్లప్పగించారు. జాతీయత, ధార్మికత మేళవించిన ఆ అద్భుత, అపురూప ఉత్సవాన్ని వీక్షించారు. ఎందరికో తనువు పులకరించింది. ఆనందబాష్పాలు రాలాయి. భావోద్వేగంతో కళ్లు చమరించాయి. తరువాత భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన స్ఫూర్తిదాయక ఉపన్యాసం హృదయాలను తాకింది. తట్టి లేపింది. రాజధర్మం, భారతీయత ఐక్యమైతే దాని ఫలితం ఈ దేశవాసులను ఎంతగా కదిలించగలదో, ఎంత సాధించగలదో ఆ ఉపన్యాసంలో వ్యక్తమయింది. దాదాపు మూడు దశాబ్దాలుగా గుడారంలోనే ఉన్న భారతీయుల ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడి కోసం ఇప్పుడొక భవ్య మందిరాన్ని జాతి నిర్మించుకుంటున్నది. అందుకే ఆ భూమిపూజ. ఆ క్షణం స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే కాదు, ఈ తరం భారతీయులకు కూడా మరపునకు రాని మహోన్నత ఘట్టం. మధుర సృ్మతి. ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ జీవితంలోనూ గొప్ప అనుభూతికి గుడి కట్టిన క్షణం కూడా అదే. తెల్లటి పంచెతో, బంగారు వన్నె లాల్చీతో సభక్తికంగా ఆయన చేసిన భూమిపూజ ఎందరినో ముగ్ధులను చేసింది. ఇదంతా టీవీ చానెల్‌లో వీక్షించిన మోదీ తల్లిగారితో పాటు, ఆయన అదృష్టానికి మురిసిపోయిన వారు ఎందరో! రామ్‌‌ల్లాకూ హనుమంతుని గుడి వద్ద, సాధుసంతు సమూహానికీ సాష్టాంగ ప్రణామం అర్పించారాయన. అక్కడ భూమిపూజ అంటే కేవలం ఒక కట్టడం కోసం కాదని ఆయనకు తెలియనిది కాదు. ఈ సనాతన, పురాతన భూమిలో ఓ కొత్త యుగానికి నాంది పలకడమే. గతం చేసిన వేనవేల గాయాలతో ఇప్పటికీ బాధపడుతున్న భారతీయులకు సాంత్వన కల్పించడమే. పూజ తరువాత ఉత్తేజకరంగా, ఒక జలపాత సదృశంగా సాగిన మోదీ సందేశంలో ఇవన్నీ ప్రతిధ్వనించాయి. ఇదీ ఆయన ప్రసంగ పాఠం.

‘సియావర్‌ ‌రామచంద్రకీ జై! సియావర్‌ ‌రామచంద్రకీ జై’

జై సియారామ్‌! ‌జై సియారామ్‌! ‌జై సియారామ్‌!

అన్న నినాదాలతోనే ఉపన్యాసం ఆరంభించారు మోదీ. సభాస్థలిని అలంకరించిన ఆధ్యాత్మిక శిఖరాలు ఆయనతో గొంతు కలిపాయి- జైసియారామ్‌! ‌జైసియారామ్‌….!

ఈ ‌నినాదం ఇవాళ రామచంద్రుడి అయోధ్యలో ప్రతిధ్వనించడమే కాదు, వాటి ప్రకంపనలు ఈ ధరాతమంతటికీ అనుభవంలోకి వస్తున్నాయి.

ఈ చిరస్మరణీయ సందర్భంలో యావన్మంది రామభక్తులకు, దేశప్రజలకు, విశ్వవ్యాప్తంగా వివిధ ఖండాలలో ఉన్న సోదర భారతీయులకు హృదయ పూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను.

వేదిక మీద ఉన్న పరిపూర్ణులైన పెద్దలకి నా అభివాదాలు. ఆదరణీయ ముఖ్యమంత్రి శ్రీమాన్‌ ‌యోగి ఆదిత్యనాథ్‌, ‌గవర్నర్‌ శ్రీ‌మతి ఆనందీబెన్‌ ‌పటేల్‌, ‌పరమపూజ్య మహంత్‌ ‌నృత్యగోపాల్‌దాస్‌, ‌మనందరికి గౌరవనీయులు శ్రీమోహన్‌రావ్‌ ‌భాగవత్‌, ‌దేశం నలుమూలల నుంచి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్న సాధుసంతులకు, గురువులకు, పవిత్రమూర్తులకు, సోదర భారతీయులకు నా అభివాదములు.

చరిత్రాత్మకమే కాకుండా ఎంతో శుభకరమైన ఈ కార్యక్రమానికి నన్ను తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అసలు ఇది పాల్గొనకుండా ఉండడం ఎంతమాత్రం సాధ్యం కాని మహా కార్యక్రమం. ఎలాగంటే, రాముడు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయకుండా నేనెలా విశ్రమించగలను!(‘రామ కాజు కీన్హే బీను మోహి కహా విశ్రాం’)

ప్రచండమైన సూర్య భగవానుని ఆశీస్సులతో పవిత్ర సరయూ నదీతీరాన భారతదేశం ఒక పవిత్ర ఘట్టాన్ని నేడు వీక్షిస్తున్నది. భారత్‌ ‌నలుదిక్కుల నుంచి… కన్యాకుమారి నుంచి క్షీర్‌భవాని, కోటేశ్వర్‌ ‌నుంచి కామాఖ్య, జగన్నాథ్‌ ‌నుంచి కేదార్‌నాథ్‌, ‌సోమనాథ్‌ ‌నుంచి కాశీ విశ్వనాథ్‌, ‌సామెత్‌ ‌శిఖరం నుంచి శ్రావణబెళగొళ, బుద్ధగయ నుంచి సార్‌నాథ్‌, అమృత్‌సర్‌ ‌నుంచి పట్నా సాహెబ్‌, అం‌డమాన్‌ ‌నుంచి అజ్మేర్‌, ‌లక్షద్వీప్‌ ‌నుంచి లే వరకు దేశమంతా రాముని కోసం, రాముని చేత పరివేష్టితమై ఉంది.

దేశం మొత్తం రామనామంతో ప్రతిధ్వనిస్తున్నది. ఆ నామ స్మరణతో ప్రతి హృదయం జ్వలిస్తున్నది. యావద్దేశం ఉద్విగ్నభరితమై, చిరకాలంగా ఎదురు చూస్తున్న ఈ చారిత్రక సందర్భంలో భాగం కావడానికి ఉప్పొంగిపోతున్నది.

శతాబ్దాల నిరీక్షణ ఇవాళ్టితో ముగియబోతున్నది. తాము జీవించి ఉండగానే, ఈ కళ్లతో మందిర నిర్మాణం చూడగలమా అనుకున్న వారందరికి బహుశా ఇప్పుడు ఇది చూస్తుంటే నమ్మశక్యంగా లేకపోవచ్చు కూడా.

సోదర సోదరీమణులారా! పెద్దలారా! ఒక భవ్య మందిర నిర్మాణంతో కొన్నేళ్లుగా గుడారంలోనే దశాబ్దాలుగా ఉండిపోయిన రాముడి ప్రతిమను అందులోకి తరలించుకోగలిన సమయం సమీపించింది. మర్యాదా పురుషోత్తముడైన రాముడికి భవ్య మందిర నిర్మాణం ప్రారంభమైంది.

శతాబ్దాలు సాగిన విధ్వంసం, పునరుత్థానం అనే చర్విత చర్వణ ఘట్టాల నుంచి రామ జన్మభూమి ఇవాళ స్వేచ్ఛను పొందింది. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఉద్యమం నేటితో ముగిసింది.

 స్వాతంత్య్రోద్యమం కోసం కొన్ని తరాల ప్రజల సర్వం త్యాగం చేశారు. భారతీయులను బానిసలుగా చూస్తూ సాగిన ఆ పాలనాకాలంలో ఉద్యమం జరగని రోజుంటూ లేదు. దేశం కోసం త్యాగం చేయని చోటంటూ భారత్‌లో లేదు. అలా స్వాతంత్య్రోద్యమం సాగింది. ఎందరో మహనీయుల త్యాగం వల్ల ఆగస్ట్ 15‌ను స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

రామాలయం కోసం కూడా పెద్ద పోరాటం జరిగింది. అందుకు తరతరాలుగా వేలాదిమంది ప్రాణాలర్పించారు. శతాబ్దాల నాటి సంకల్పం, సహనం, అంకితభావం, పోరాట స్పూర్తి ఈ రోజులో ప్రతిఫలిస్తున్నాయి. వారి పోరాటం, త్యాగం వల్లే నేడు రామ మందిర నిర్మాణం సాకారమవుతోంది. 130 కోట్ల మంది తరఫున వారందరికి శిరస్సు వంచి ధన్యవాదాలు చెబుతున్నాను. అయోధ్య రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. వారి హృదయం ఆనందంతో నిండిపోయింది.

మిత్రులారా! శ్రీరాముడు మన హృదయాలలో పరివేష్టించి ఉన్నాడు. మనం ఏ పని ప్రారంభించా లనుకున్నా ప్రేరణ కోసం ఆయన వైపే చూస్తాం. ఇంద్రియాలతో మాత్రమే గుర్తించగలిగే రాముని ఆ మహిమకేసి ఒకసారి చూడాలి.

రాముడి ఆలయం ఆనవాలు లేకుండా చేశారు. ఆయన అస్తిత్వాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ఎన్ని చేయాలో అన్నీ చేశారు. అయినప్పటికీ రాముడు భారతీయుల హృదయాలలో నిండుగా కొలువై ఉన్నాడు. సనాతన సంస్కృతికి రాముడే మూల బిందువు. శ్రీరాముడంటే భారతీయ మర్యాద. మూర్తీభవించిన గౌరవం. అలాంటి పురుషోత్తముడికి భవ్య మందిర నిర్మాణం ప్రారంభమైంది. హనుమంతుడి ఆశీస్సులతో ఇవాళ రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరిగింది.

ఇక్కడికి (శంకుస్థాపనకు) వచ్చే ముందు నేను హనుమంతుని దర్శించాను. రాముని కార్యకలాపాలన్నీ హనుమంతుడే నిర్వహించాడు. ఈ కలియుగంలో రాముని విగ్రహాలను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా ఆయనదే. ఈ భూమిపూజోత్సవం కూడా ఆయన ఆశీర్వాదాతోనే ఆరంభమైంది.

ఈ దేవాలయం మన సంస్కృతికి సరికొత్త ప్రతీకగా నిలుస్తుంది. ఇక్కడ సరికొత్త అన్న పదాన్ని ఉద్దేశపూర్వకంగానే ప్రయోగించాను. అనంతమైన మన కొంగ్రొత్త ఆశకు ఇదే ప్రతీకాత్మకంగా ఉంటుంది. మన జాతీయతా భావనను ఇది సంక్షిప్త రూపంలో చూపుతుంది.

 లక్షలాది ప్రజల సమష్టి ఆత్మ విశ్వాసానికి ఈ ఆలయం చిహ్నంగా నిలుస్తుంది. ఆశకు ఊపిరి నిస్తుంది. భావితరాల ఆలోచనలలో అంకితభావం, పట్టుదలలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.

మందిర నిర్మాణం అనంతరం అయోధ్య ఒక గొప్ప తీర్థస్థలంగా స్థానం సంపాదిస్తుంది. అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆర్ధిక ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాంత ఆర్థిక స్వరూపమే మారిపోతుంది. ప్రతి రంగంలోను కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. రామయ్యను, సీతమ్మను దర్శించుకోవడానికి సుదూర దేశాల నుంచి ఇక్కడికి తరలివస్తారు. యావత్‌ ‌ప్రపంచమే ఇక్కడకు వచ్చి వాలుతుంది. పరిస్థితులు ఎంత మారిపోతాయో చూడండి!

రామ మందిర నిర్మాణం దేశ ఐక్యతకూ, కోట్లాది ప్రజల మనో సంకల్పానికీ ప్రతీక. ఇదొక అద్భుతమైన సందర్భం. నరుడిని నారాయణుడితో కలిపే ఘట్టం. ప్రజలను ఆధ్యాత్మిక భావాలకు చేరువ చేసేందుకు ఈ మందిరం దోహదం చేస్తుంది. ఇది వర్తమానాన్ని గతస్మృతులతో, వ్యక్తిని సంస్కారాలతో అనుసంధానం చేసేది. ఈరోజు చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోయే సందర్భం. భారత కీర్తిని దిగంతాలకు పెంచే శుభపరిణామం. కోట్లాది రామభక్తుల సత్య సంధతనూ నిరూపిస్తుంది. సత్యం, అహింస, నమ్మకం, త్యాగానికి, న్యాయబద్ధమైన భారతదేశానికి అద్భుతమైన బహుమానం ఈరోజ.

 కరోనా మహమ్మారి నేపధ్యంలో అనేక నియమాల నడుమ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముని మందిర నిర్మాణ కార్యక్రమ్మాన్ని కూడా అలాంటి నియమాలనే పాటిస్తూ ప్రపంచానికి ఒక గొప్ప ఉదాహరణగా భూమిపూజా కార్యక్రమం జరుపుతున్నాం. మందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సమయంలో కూడా అవే నియమాలు పాటించాం. దేశ ప్రజలందరూ ఇతరుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించారు. రాముడి ఆదర్శాలు కలియుగంలో పాటించేందుకు మార్గం ఇది. దేశ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం.

చిన్న చిన్న గోపాల యాదవ బాలురు కృష్ణుడితో కలిసి గోవర్ధనగిరిని మోయడంలో సహాయం చేసారు. మావళీలు ఛత్రపతి శివాజీ స్వరాజ్య సంగ్రామంలో పోరాడారు. అత్యంత పేదవారు విదేశీ దురాక్రమణ దారులకు వ్యతిరేకంగా, మహారాజ సుహళ్‌ ‌దేవకు అండగా నిలిచారు. దీనులు, దళితులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, అన్ని వర్గాలవారు స్వాతంత్య్రోద్యమంలో మహాత్మా గాంధీకి సహకరించారు. అదే రీతిలో దేశ ప్రజలందరి సహాయ సహకారాలతో రామ మందిర నిర్మాణం జరుగుతుంది.

నాడు రాళ్లపై ‘శ్రీరామ’ అనే నామాన్ని రాసి సేతువు నిర్మించారు. అదేవిధంగా ప్రతీ ఇటుకపై శ్రీరామ నామాన్ని రాసి ప్రతీ గృహం, ప్రతీ గ్రామంలో పూజలు చేసి పంపిన రామ శిలలు ఈ మందిర నిర్మాణంలో ఉపయోగపడుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని దేవాలయాల ప్రాంగణాల నుండి తెచ్చిన పవిత్ర మృత్తిక, నదీజలాలు, అక్కడి ప్రజల భక్తివిశ్వాసాలకు ప్రతీక. అవన్నీ ఈ మందిర నిర్మాణంలో ఉపయోగించడం ఒక అద్భుత ఆలోచన. గతంలో ఏనాడూ జరగని సంఘటన, ‘నభూతో న భవిష్యతి’. భారతీయుల ఆధ్యాత్మిక విశ్వాసం, సాముహిక ఆలోచన, ఐక్యతాభావన, సాముహిక శక్తి ప్రపంచానికి ఒక అధ్యయన అంశం, పరిశోధన చేయవలసిన విషయం.

రామచంద్ర ప్రభువును తేజస్సులో సూర్యునితో, సహన క్షమాగుణాలలో పృథ్వితో, బుద్ధికి బృహస్పతితో, కీర్తిలో ఇంద్రునితో సమానంగా చూస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా సత్యవాక్పరిపాలకునిగా కొలుస్తారు. ఆయనను సంపూర్ణ ఆదర్శపురుషునిగా అభివర్ణిస్తారు. కనుకనే యుగయుగాలుగా రాముడు భారత ఇతిహాసంలో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడ••. రాముడు సామాజిక సమరసత ద్వారా అందరిని ఆదరించే విధానం తన పాలనలో ప్రవేశపెట్టాడు. ఆయన గురువు వసిష్టునితో జ్ఞానం, నావికుని (గుహుడు)తో ప్రేమ, శబరితో మాతృత్వ మధురిమ, హనుమంతుడు, వనవాసి బంధువులతో సహకారం, ప్రజల నుంచి విశ్వాసం సంపాదించాడు. అంతేకాదు ఒక చిన్న ప్రాణి ఉడత సహాయాన్ని కూడా స్వీకరించాడ••. అయన అద్భుతమైన వ్యక్తిత్వం, వీరత్వం, ఉదారత, సత్యనిష్ట , నిర్భీకత, ధైర్యం, దృఢత్వం, దార్శనికత యుగయుగాలుగా స్ఫూర్తిదాయ కంగా నిలిచి ఉన్నాయి. రాముడు ప్రజలందరి మీద ఒకే రకమైన ప్రేమభావాన్ని ప్రదర్శించాడు. కానీ పేదవారు, కటిక దరిద్రుల పట్ల అత్యంత కరుణాత్మకంగా వ్యవహరించాడు. అందుకే సీతాదేవి రాముని మీద పేదల, దీనుల బతుకులను సరిదిద్దేవాడని ప్రశంసలు కురిపించింది.

భారతీయ పరంపరలోని అన్ని కోణాలలోను రాముని ఆదర్శవంతమైన వ్యక్తిత్వం దర్శనమిస్తుంది. ప్రతి ఒక్క జీవితానికి ఆయన సుగుణాలు ఆచరణనీయమే. వేల సంవత్సరాల క్రితం వాల్మీకి రాసిన రామాయణం, తరువాత తులసీదాసు రచించిన కావ్యం, కబీర్‌, ‌గురునానక్‌ ‌ప్రవచించిన వాక్కులలో, స్వాతంత్య్రోద్యమ వేళ మహాత్మా గాంధీ ఆలపించిన భజనల ద్వారా రాముని జీవనం మానవాళికి స్పూర్తిని కలిగించింది. భారతదేశంలోని అన్ని భాషలలో రామాయణం లభిస్తుంది. రాముడు ఒక్కొక్కచోట ఒక్కొక్క రూపంతో దర్శనమిస్తాడు. అయినప్పటికీ అన్ని చోట్ల అయన ఉన్నాడు. అంతా రామమయమే. రాముడు అందరివాడు.

తులసీ రామాయణంలో సగుణ రూపుడాయన. నానక్‌, ‌కబీర్‌ ‌రచనలో నిర్గుణుడు (రూపం లేనివాడు). బుద్ధుడు కూడా రామునితో బంధం ఉన్నవాడే. అయోధ్య జైన మతానికి కూడా కేంద్రంగా విలసిల్లింది. రాముని సర్వవ్యాపకత్వం ఇలా కనిపిస్తున్నది. ఇదే దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

తమిళంలో కంబ రామాయణం ఉంది. తెలుగులో రంగనాథ రామాయణం ఉంది. ఒడియాలో రుయిపద్‌ ‌రామాయణ, కన్నడలో కుముదేందు రామాయణం ఉన్నాయి. కశ్మీర్‌ ‌వెళితే అక్కడ రామావతార్‌ ‌చరిత్‌ ‌కనిపిస్తుంది. మలయాళంలో రామచరితం ఉంది.

బంగ్లా భాషలో కృత్తిబస్‌ ‌రామాయణ ఉంది. గురుగోవింద్‌ ‌సింగ్‌ ‌కూడా గోవింద్‌ ‌రామాయణ్‌ ‌రాశారు. రామాయణాల రూపంలో మనం రాముడిని వివిధ రూపాలలో దర్శిస్తాం. కానీ రాముడు అంతటా ఉన్నాడు. రాముడు అందరివాడు. కాబట్టే రాముడు భారత్‌లోని భిన్నత్వంలో ఏకత్వానికి ఆత్మ.

ప్రపంచంలోని చాలా దేశాలు కూడా రాముని మొక్కుతాయి. అక్కడి పౌరులు రామునికి చెందిన వారిగా భావిస్తారు.

ప్రపంచం మొత్తం మీద ముస్లింలు అత్యధికంగా ఉన్న దేశం ఇండోనీసియా. అక్కడ రామాయణం వివిధ రూపాలలో కనిపిస్తుంది. మన దేశంలో వలెనే అక్కడ కకావిన్‌ ‌రామాయణ, స్వర్ణదీప్‌ ‌రామాయణ, యోగేశ్వర్‌ ‌రామాయణ ఉన్నాయి. ఈనాటికీ అక్కడ రాముడిని కొలుస్తారు, ఆరాధిస్తారు.

కంబోడియాలో రామ్‌కర్‌ ‌రామాయణం ఉంది. లావోలో ఫ్రా లాక్‌ ‌ఫ్రా లామ్‌ ‌రామాయణం ఉంది. మలేసియాలో హికాయత్‌ ‌సేరి రామ్‌, ‌థాయ్‌లాండ్‌లో రామకెన్‌ ‌పేరుతోను రామాయణాలు ఉన్నాయి.

ఆఖరికి చైనా, ఇరాన్‌లలో కూడా రాముడు, రామకథల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.

శ్రీలంకలో జానకి హరణం పేరుతో రామాయణం ప్రసిద్ది చెందింది. ఇక నేపాల్‌కైతే సీతమ్మ ద్వారా అయోధ్యతో ఆత్మీయ బంధం ఉంది.

ఈ విధంగా రాముడు ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాల్లో అన్నిచోట్లా కొలువై ఉన్నాడు. నేటికీ ఆయన కథలు అన్ని దేశాల్లోను వినిపిస్తున్నాయి. ఈ రోజున జరుగుతున్న రామ మందిర భూమిపూజా కార్యక్రమం ప్రపంచ ప్రజలందరికి ఆనందం కలిగిస్తున్నది. ఏ విధంగానైతే రాముని పేరు ప్రసిద్ధి చెందిందో, అట్లాగే అయోధ్య రామ మందిరం ప్రఖ్యాతిని సంపాదిస్తుంది. ఇక్కడ నిర్మిస్తున్న ఆలయం సర్వ మానవాళికి శాశ్వత ప్రేరణగా నిలుస్తుంది. అయన ఆదర్శాలను మందిర నిర్మాణం ద్వారా ప్రపంచ ప్రజలకు అందించేందుకు కృషి చేయవలసిన అవసరం ఉంది. భారతీయుల జ్ఞానం, జీవనదృష్టితో విశ్వ మానవాళికి మేలు జరగాలి. ఇది ఈ తరంతో పాటు రాబోవు తరాల బాధ్యత. రాముడు అందరి యోగ క్షేమాలు ఆకాంక్షించాడు. చిన్నారులు, వృద్ధులు, మహిళలు, వైద్యులను విశేషంగా ఆదరించాలని చెప్పాడు. నేడు కరోనా మహమ్మారి ఆ విషయాన్నీ రుజువు చేసింది. శరణాగతులను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాముని జీవితం తెలుపుతుంది. జనని జన్మభూమి స్వర్గం కన్నా మిన్న అని ఆయనే ప్రపంచానికి ఎలుగెత్తి చాటాడు. తలవంచి ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. కనుక భారత్‌ ఎం‌త శక్తిమంతంగా, సమర్థంగా తయారయితే దేశంలో అంతగా శాంతి, సుస్థిరతలు నెలకొంటాయని రాముని నీతి. ఇదే నీతి, రీతి యుగ యుగాలుగా భారతీయులకు మార్గనిర్దేశం చేస్తున్నది. జాతిపిత మహాత్మా గాంధీ ఇవే విధానాలను (మంత్రాలను), సూత్రాలుగా తీసుకోని రామరాజ్యం రావాలని ఆకాంక్షించారు. రాముని జీవనం, చరిత్ర గాంధీజీ రామరాజ్య కల్పనకు మూలం.

 స్థలం, సమయం, పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడాలని స్వయంగా రాముడే చెప్పాడు. ఆయన మనసులో ఉన్న ఆలోచలనలను కార్యరూపంలోకి తెచ్చేవాడు. పరిస్థితులకు తగ్గట్లుగా, సమయాను కూలంగా ఎలా వ్యవహరించాలో రాముని జీవితం తెల్పుతుంది.

రాముడు కాలానుగుణంగా వచ్చే మార్పులకు అనుకూలంగా, ఆధునిక కాలానికి తగ్గట్లుగా ఉన్నాడు. కాలానుగుణంగా నడవమని బోధించాడు. అయన ఆదర్శాలు పుణికిపుచ్చుకుని రామ మందిర నిర్మాణం కోసం భారత్‌ ‌ముందుకెళుతున్నది. రాముడు కర్తవ్య పాలన ముఖ్యమని చాటాడు. ప్రతికూల భావనలు వీడి నిత్యాన్వేన్వేషణ, పరిశోధన మార్గాల దిశగా పయనించమని ఉద్బోధించాడు. కనుక రామమందిర నిర్మాణానికి పరస్పర ప్రేమ, సోదరభావాలతో ముందుకు రావాలి. మనిషి రాముడిని ఆదర్శంగా స్వీకరించి అనుసరించి నప్పుడల్లా అభివృద్ధి జరిగింది. మనం దారి తప్పినప్పుడల్లా వినాశనం దిశగా వెళ్లాం. అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని అందరిని గౌరవిస్తూ, అందరిని వెంట తీసుకెళుతూ, అందరి నమ్మకాన్ని పొంది, అభివృద్ధి దిశగా సాగాల్సిన అవసరం ఉంది.

అప్పగించిన బాధ్యతలను ఎలా పరిపూర్ణం చేయాలో రాముడు చెప్పాడు.

సవాళ్లను ఎలా అధిగమించాలో, జ్ఞానత•ృష్ణ ఎలా ఉండాలో, జ్ఞానాన్ని ఎలా సాధించాలో చెప్పాడు. తమిళ రామాయణంలో చెప్పినట్టు మనం జాగు చేయవలసిన అవసరం లేదు. మనం ముందుకు సాగవలసిందే.

రామ మందిరాన్ని నిర్మించవలసింది ప్రేమ, గౌరవం, సహోదరత్వం అనే ఇటుకలతోనే. నైపుణ్యం, సంకల్పం, ఆత్మ విశ్వాసంతో స్వావలంబన భారతాన్ని నిర్మిద్దాం. ఈ భవ్యమైన మందిరంతో రాముని ఆదర్శం యుగ యుగాలుకూ ప్రేరణగా నిలుస్తుంది.

సియాపతి రామచంద్రకి జై

About Author

By editor

Twitter
Instagram