అమెరికాలో కఠినమైన ఓటర్ గుర్తింపు నిబంధనల కోసం వాదిస్తూ, భారత్లో ప్రతి ఓటరుకు ఫొటో ఐడీ ఉండటం, పోస్టల్ ఓటింగ్ ఒక శాతం కన్నా తక్కువగా ఉండటాన్ని తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసిం చడం, ప్రపంచవేదికపై భారత ఎన్నికల వ్యవస్థ పటిష్టతకు, విశ్వసనీయతకు పెద్దగుర్తింపు. భారత్లో వందల కోట్లమంది ఓటర్లతో కూడిన అతిపెద్ద ఎన్నికల పక్రియ ఎంత పారదర్శకంగా జరుగుతుందో ప్రపంచ దేశాలకు మరోసారి తెలిసింది. మనదేశంలో ఎన్నికల సంఘం పనితీరుపై కొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు మన విధానాన్ని ఆదర్శంగా తీసుకోవడం అధికారవర్గాలకు నైతిక బలాన్నిచ్చింది. దీనివల్ల రెండు దేశాల ఎన్నికల నిర్వాహకుల మధ్య పరస్పర సహకారం, సాంకేతికత శిక్షణ విభాగాల్లో సంబంధాలు బలపడే అవకాశం ఉంది.
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశానికి అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్, అమెరికా ఎన్నికల విధానంలో మార్పులు తెచ్చేందుకు భారత్ వైపు చూడటం ఇక్కడ కీలకం! దాదాపు 100 కోట్ల ఓటర్లు ఉన్న భారత్లో.. ప్రతి ఒక్కరికీ ఫొటో గుర్తింపు కార్డు ఉండటం, పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిం చడం ఒక అద్భుతంగా ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నా యనడానికి గొప్ప ఉదాహరణ. ఇప్పటికే అనేక చిన్న దేశాలు భారత ఈవీఎం సాంకేతికతను, ఎన్నికల నిర్వహణ పద్ధతులను వాడుతున్నాయి. ఇప్పుడు అగ్రరాజ్యం కూడా మన ఓటర్ ఐడీ పద్ధతిని ప్రశంసించడంవల్ల భారత ఎన్నికల సంఘం ప్రతిష్ట పెరగడమే కాదు మనది ఎంత పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థో ఇది నిరూపిస్తోంది. దేశీయంగా ఎన్నికల నిర్వహణపై వచ్చే కొన్ని రాజకీయ విమర్శలకు, ఇలాంటి అంతర్జాతీయ ప్రశంసలు సమాధానంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.
చర్చకు దారితీసిన ట్రంప్ ప్రశంస
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎన్నికల విధానాన్ని, ముఖ్యంగా ఓటర్ ఐడీ కార్డ్, తక్కువ పోస్టల్ ఓటింగ్ పద్ధతులను ప్రశంసించడం యుఎస్లో పెద్ద ఎత్తున రాజకీయ, సామాజిక చర్చలకు దారితీసింది. అమెరికాలో రాబోయే ఎన్నికల కోసం కఠినమైన ఓటింగ్ నిబంధనలు తేవాలని, ఓటు వేయడానికి ఫొటో ఐడీ తప్పనిసరి చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ‘భారత్ అంత పెద్ద దేశంలోనే ప్రతి ఒక్కరికీ ఓటర్ ఐడీ సాధ్యమైనప్పుడు, అమెరికాలో ఎందుకు కాదు?’ అనే అంశాన్ని రిపబ్లికన్లు బలంగా వాడుకుంటున్నారు. అమెరికా విశ్లేషకులు భారత్కు, అమెరికాకు ఉన్న తేడాలను చర్చిస్తున్నారు. భారతదేశంలో ‘ఎన్నికల సంఘం అనే ఒకే కేంద్ర వ్యవస్థ ఉంటుంది. కానీ అమెరికాలో ఎన్నికల నిర్వహణ అధికారం ఆయా రాష్ట్రాల చేతుల్లో వికేంద్రీకృతంగా ఉంటుంది. ట్రంప్ ప్రతి పాదిస్తున్న ఈ నిబంధనల వల్ల అమెరికాలోని పేదలు, వలస దారులు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని అక్కడి డెమొక్రాట్ పార్టీ నేతలు వాదిస్తున్నారు.
దౌత్య సంబంధాలపై సానుకూల ప్రభావం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎన్నికల విధానాన్ని ప్రశంసించడం భారత్-అమెరికా దౌత్య, వ్యూహాత్మక సంబంధాలపై కూడా సానుకూ ల ప్రభావాన్ని చూపుతుంది. భారత్, అమెరికాలను ‘ప్రపంచంలోనే అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్య దేశాలు’ అంటారు. ట్రంప్ వ్యాఖ్యలు ఈ ప్రజాస్వామ్య బంధాన్ని మరింత గౌరవప్రదంగా మార్చాయి. వ్యూహాత్మక రంగాలలోనే కాకుండా, భారతదేశంలోని అంతర్గత పాలన, ఎన్నికల వ్యవస్థల పటిష్టతను అమెరికా అగ్రనాయకత్వం అధికారికంగా అంగీకరించినట్లయింది. భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న డిజిటల్ ఓటర్ ఐడీ, బయోమెట్రిక్ ఆధారిత వ్యవస్థలపై అమెరికా అధ్యయనం చేసే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం గురించి చర్చలు జరిగినప్పుడు, భారత్ ఒక రోల్ మోడల్గా నిలుస్తుంది. ఇది గ్లోబల్ సౌత్ దేశాలకు నాయకత్వం వహిస్తున్న భారత్కు అంతర్జాతీయంగా మరింత ప్రాబల్యం ఇస్తుంది. ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్లో భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రస్తావన కూడా తెచ్చారు. దీనివల్ల భారత ప్రభుత్వ విధానాలు అమెరికాలోని రిపబ్లికన్ పార్టీకి మరింత దగ్గరయ్యాయి. ఇది భవిష్యత్తులో వాణిజ్య, రక్షణ రంగాల చర్చల్లో భారత్కు కొంత అనుకూలంగా మారవచ్చు.అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ట్రంప్ వ్యాఖ్యలను సమర్థిస్తూ భారత్ను ఒక అంతర్జాతీయ ప్రమాణంగా అభివర్ణించారు. ఇది రాబోయే రోజుల్లో భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లడానికి ఒక సానుకూల సంకేతం.
విపక్షాల విమర్శలు
ట్రంప్ ప్రశంసలపై దేశీయంగా కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలు భిన్నంగా స్పందించాయి. ‘భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను అమెరికా అధ్యక్షుడు అంతగా మెచ్చుకుంటే, ఆయనను అమెరికాకే తీసుకెళ్లి అక్కడ ఎన్నికలు జరిపించుకోమనండి’’ అంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విదేశాంగ శాఖ దీనిపై స్పందిస్తూ, భారత ఎన్నికలవ్యవస్థ పారదర్శకత, పటిష్టత అంతర్జాతీయంగా మరోసారి నిరూపితమైన నిజమని, ఈ వ్యాఖ్యలు వ్యవస్థకు దక్కిన గౌరవమని పేర్కొంది. మన దేశంలో ఈవీఎంలపై నిరంతరం ఆరోపణలు చేసే కొందరు నెటిజన్లు, ‘ట్రంప్కు మన ఓటర్ ఐడీ మాత్రమే నచ్చింది కానీ, ఇక్కడి ఈవీఎం విధానం కాదు కదా,’ అంటూ సామాజిక మాధ్యమాల్లో చర్చలు లేవనెత్తుతున్నారు.
ప్రజాస్వామ్యానికి బ్రాండ్ అంబాసిడర్
భారతదేశం ప్రజాస్వామ్యానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎదగడానికి డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రశంసలు ఒక బలమైన మైలురాయిగా నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యవిలువలు, ఎన్నికల పారదర్శకత గురించి చర్చ వచ్చినప్పుడల్లా ఇప్పుడు అందరి చూపు భారతదేశం వైపు మళ్లుతోంది. భారత దేశాన్ని కేవలం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగానే కాకుండా, ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’ అని మన ప్రభుత్వం తరచూ చెబుతుంటుంది. అమెరికా వంటి అగ్ర రాజ్యం మన ఎన్నికల పద్ధతులను (ఓటర్ ఐడీ విధానాన్ని) ప్రమాణంగా తీసుకోవడం వల్ల ఈ మాటకు అంతర్జాతీయంగా అధికారిక ముద్ర పడినట్లయింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ ఒక ఆదర్శంగా నిలుస్తోంది.వనరులు తక్కువగా ఉన్నప్పటికీ, వందల కోట్లమంది జనాభా ఉన్న దేశంలో ఇంత క్రమశిక్షణతో, పారదర్శకంగా ఓటింగ్ నిర్వహించడం సాధ్యమేనని భారత్ ప్రపంచానికి నిరూపించింది. ఇది ఇతర దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయడానికి స్ఫూర్తినిస్తుంది.కొన్ని పాశ్చాత్య థింక్-ట్యాంక్లు (ఉదాహరణకు వీ-డెమ్ లేదా ఫ్రీడమ్ హౌస్ వంటి అంతర్జాతీయ సంస్థలు) భారతదేశంలో ప్రజాస్వామ్య సూచీలు తగ్గుతున్నాయంటూ గతంలో కొన్ని నివేదికలు ఇచ్చాయి. కానీ, స్వయంగా అమెరికా అధ్యక్షుడే భారత ఎన్నికల సంఘం పద్ధతులను, ఓటింగ్ భద్రతను ప్రశంసించడంతో, ఆ విమర్శలన్ని టికీ గట్టి సమాధానం లభించినట్లయింది. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఎన్నికల సంస్కరణలు చేపట్టాలనుకుంటే, ఇప్పుడు వారు ఆదర్శంగా తీసుకునే దేశాల జాబితాలో భారత్ మొదటివరుసలో ఉంటుంది. డిజిటల్ ఓటర్ ఐడీలు, పటిష్టమైన భద్రతాప్రమాణాలతో కూడిన మన వ్యవస్థ ఇతర ప్రజాస్వామ్య దేశాలకు ఒక పాఠ్యపుస్తకంలా మారింది. భారత ఎన్నికల సంఘం ఏ ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగకుండా, ఇంతటి భారీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించగలదని అంతర్జాతీయంగా నిరూపితమైంది. వందలకోట్లమంది ఓటర్ల డేటాను భద్రపరుస్తూ, ప్రతి ఒక్కరికీ డిజిటల్, ఫొటో గుర్తింపుకార్డులను కేటాయించడంలో మన సాంకేతిక వ్యవస్థలు ఎంత పటిష్టంగా ఉన్నాయో ప్రపంచానికి వెల్లడైంది. ఎన్నికల ఫలితాలు ఏవైనా, ప్రజల తీర్పును వ్యవస్థలు గౌరవిస్తాయనే నమ్మకం పటిష్టపడింది. అమెరికావంటి దేశమే మన విధానాలను ఒక ప్రమాణంగా చూస్తోందంటే, అది మన రాజ్యాంగ నిర్మాతలు అందించిన వ్యవస్థల విజయమే!
నిర్వహణ సామర్థ్యానికి నిదర్శనం
భారతదేశ ఎన్నికల విధానం ప్రపంచ దేశాలకు నేర్పిన ‘ఎన్నికల పాఠాలు’ మన దేశ ఎన్నికల సంఘం అద్భుతమైన నిర్వహణ సామర్థ్యానికి నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భారత్ అనుసరిస్తున్న పద్ధతులను అధ్యయనం చేస్తున్నాయి. భారతదేశంలో ప్రతి ఓటరుకు ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు (ఎపిక్) ఉండడం వల్ల బూత్ లెవెల్లో మోసాలను అడ్డుకోవచ్చు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఓటు వేయడానికి కఠినమైన ఫోటో గుర్తింపు కార్డులు అవసరం లేదు. ట్రంప్ ప్రధానంగా ప్రశంసించింది భారత్లోని ఈ ‘వన్ ఓటర్-వన్ ఐడీ’ కచ్చితత్వాన్ని. పేపర్ బ్యాలెట్లతో పోలిస్తే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, ఓటు ఎవరికిపడిందో చూపే వీవీప్యాట్ల వల్ల కౌంటింగ్ వేగంగా, పారదర్శ కంగా జరుగుతుంది. భారత్ ఈవీఎంలు ఇంటర్నెట్కు అనుసంధానం కావు. ఈ భద్రతా విధానాన్ని ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటు న్నాయి. కొండ ప్రాంతాలు, అడవులు, ఎడారులలో ఉన్న ఒక్క ఓటరు కోసం కూడా పోలింగ్ బూత్ ఏర్పాటుచేసే నిబంధన భారత్లో ఉంది. కోట్లసంఖ్యలో ఉన్న సిబ్బంది, రక్షణ బలగాలను సమర్థవంతంగా మోహరించి, విడతల వారీగా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడం ప్రపంచంలోనే అతిపెద్ద లాజిస్టికల్ టాస్క్!
ఇండొనేషియాతో ఎంఓయూ
భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోని ‘ఇండియా ఇంటర్నేషనల్ ఇన్ట్ట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్స్ (ఐఐఐడీఈఎం)ద్వారా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాల ఎన్నికల అధికారులకు భారత్ శిక్షణ ఇచ్చింది. భూటాన్, నేపాల్, నమీబియా వంటి దేశాలు మన దేశ ఈవీఎంలను, ఎన్నికల సాఫ్ట్వేర్లను నేరుగా ఉపయోగించాయి. భారతదేశంలో తయారైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను (ఈవీఎం) వివిధ దేశాలు తమ ఎన్నికలలో నేరుగా ఉపయోగించాయి లేదా మన సాంకేతికతను తీసుకున్నాయి. భారత ప్రభుత్వ రంగ సంస్థలైన బెల్ (బీఈఎల్), ఈసీఐఎల్ సంస్థలు వీటిని తయారు చేస్తాయి. తాజాగా ప్రపంచంలోనే వ•డవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండోనేషియా, తమ ఎన్నికల విధానాన్ని ఆధునీకరించడానికి భారతదేశంతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా భారత్ తన ఈవీఎం సాంకేతికతను ఆ దేశానికి బదిలీచేస్తోంది. కెన్యా, ఆస్ట్రేలియా, రష్యా, నైజీరియా, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు ఎన్నికల సంస్కరణల్లో భాగంగా భారత ఈవీఎంల పనితీరును, వాటి సురక్షిత విధానాలను పరిశీలించాయి. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, విదేశాలకు ఎగుమతిచేసే ఈవీఎంల హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కోడింగ్, రంగులు, భారతదేశంలో మనం వాడే ఈవీఎంలకంటే భిన్నంగా ఉంటాయి. అలాగే మన దేశంలో వాడే సిరాని కూడా చాలా దేశాలకు భారత్ ఎగుమతి చేస్తుంది.
విదేశీ ప్రతినిధులకు శిక్షణ
భారత ఎన్నికలసంఘం విదేశీ ఎన్నికల అధికారులకు, ప్రతినిధులకు అందించే అంతర్జాతీయ శిక్షణ, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇందుకోసం ఈసీఐ ప్రత్యేకంగా ఒక అడ్వాన్స్డ్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీ వేదికగా పనిచేసే ఐఐఐడీఈఎం (ఇండియన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్) ద్వారా ఈ అంతర్జాతీయ శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పటివరకు దాదాపు 141 కంటే ఎక్కువ దేశాల ఎన్నికల అధికారులకు ఈ సంస్థ సామర్థ్య పెంపుదలకు శిక్షణిచ్చింది. ప్రజల్లో ఓటు హక్కుపై చైతన్యం తెచ్చేందుకు భారత్ అమలు చేస్తున్న ‘స్వీప్’ కార్యక్రమాలను విదేశీ యులకు ఈ సందర్భంగా వివరిస్తారు. ఈసీ సుమారు 28 కంటే ఎక్కువ దేశాల ఎన్నికల సంస్థలతో, ఐరాస, ఇంటర్నేషనల్ ఐడియా వంటి అంతర్జాతీయ సంస్థ లతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని ఈ ఉమ్మడి శిక్షణా కార్యక్రమాలను నడుపుతోంది. ఆవిధంగా ప్రపంచంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అందులో భారత ఎన్నికల సంఘం నైపుణ్యం, సాంకేతికత భాగస్వామ్యం అవుతుండటం విశేషం.