ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ దక్షిణ కోస్తా రైల్వే జోన్ జూన్ 1న కార్యకలాపాలు ప్రారంభించింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు ఈ జోన్ పరిధిలో పనిచేయనున్నాయి. పాత వాల్తేరు డివిజన్ను విభజించి విశాఖ డివిజన్గా మార్చగా, మరో భాగాన్ని రాయగడ డివిజన్గా ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో కొనసాగిస్తున్నారు.
విశాఖపట్నం కేంద్రంగా దేశంలో 18వ రైల్వేజోన్గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నగరంలోని ముడసలోవ ప్రాంతంలో ఏర్పాటవుతోంది 52 ఎకరాల విస్తీర్ణంలో జోన్ హెడ్ క్వార్టర్స్ పనులు కొనసాగుతున్నాయి. ఇందుకూ రూ.183 కోట్ల పైగా ఇప్పటికే రైల్వేశాఖ మంజూరు చేసింది. తక్షణ కార్యకలాపాల కోసం సిరిపురంలోని ‘ది డెక్’ భవనంలో తాత్కాలిక కార్యాలయాన్ని సిద్ధం చేశారు. మొత్తం జోన్ పరిధిలో 3,532 రూట్ కిలోమీటర్ల మేర రైల్వే నెట్వర్క్ ఉండగా, డబుల్, ట్రిపుల్ లైన్లు తదితర ట్రాక్లతో కలిపి మొత్తం ట్రాక్ పొడవు 6,454 కిలోమీటర్లు కలిగి ఉంది. ఈ జోన్ పరిధిలోని గూడ్స్, ప్యాసింజర్ సేవల ద్వారా ఏడాదికి సుమారు 12 వేల కోట్ల రూపాయల నుంచి 15 వేల కోట్ల రూపాయల వరకు ఆదాయం లభిస్తుందని అంచనా. విశాఖ పట్నంలో రైల్వే జోన్ హెడ్క్వార్టర్స్ రావడం వల్ల కేవలం రైల్వే రంగానికే పరిమితం కాకుండా, స్థానిక ఆర్థిక వ్యవస్థ ఊహించని రీతిలో పుంజుకోనుంది. ముఖ్యంగా వ•డు రంగాలు లాభపడే వీలుంది.
అమలైన కీలక హామీ
ఆంధప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుచేస్తామని హామీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 2014 నుంచి 2019 వరకు జోన్ ఏర్పాటుకు కొంత ప్రయత్నం జరిగింది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ దీనిపై పెద్దగా స్పందించలేదు. 2024లో తిరిగి అధికారం లోకి వచ్చిన కూటమి దీనిపై గట్టి ప్రయత్నం చేసింది. మడసర్లోవ ప్రాంతంలో 52 ఎకరాల స్థలాన్ని జోన్ కార్యకలాపాలకు కేటాయించింది. ఈ ప్రాంతంలోని ఆక్రమణలను తొలగించి వాటిని రైల్వేశాఖకు అప్పగించింది. దాంతో రైల్వేజోన్ కార్యాలయం ఏర్పాటుకు సుగమమైంది. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 3, ఉప-సెక్షన్ (4) ప్రకారం కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ (రైల్వే బోర్డు) మే 4, 2026న పూర్తిస్థాయి గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ మేరకు భారతీయ రైల్వే వ్యవస్థలోనే అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన 18వ అధికారిక జోన్గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అవతరించింది.
3,532 కి.మీ.నెట్వర్క్
దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో మొత్తం 3,532 రూట్ కిలోమీటర్ల మేర రైల్వే నెట్వర్క్ ఉండగా, డబుల్, ట్రిపుల్ లైన్లు తదితర ట్రాక్లతో కలిపి మొత్తం ట్రాక్ పొడవు 6,454 కిలోమీటర్లకు చేరుకుంటుంది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లను కలిపి నాలుగు డివిజన్లు, 385 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. నాలుగు డివిజన్లలో సుమారు 62 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా, జోన్ ప్రధాన కార్యాలయంలో 128 మంది గెజిటెడ్ అధికారులు, 1,100 మంది నాన్-గెజిటెడ్ సిబ్బంది పనిచేయనున్నారు. ప్రతి ఏడాది సుమారు 100 మిలియన్ టన్నుల సరుకు రవాణా ఈ జోన్ పరిధిలో జరుగుతుంది. సరకులు, ప్రయాణికుల రవాణా ద్వారా ఏటా సుమారు రూ.15,500 కోట్లు ఆదాయం సమకూరుతుంది. విశాఖపట్నం సమీపంలోని వడ్లపూడి రైల్వే వ్యాగన్ డిపోలో రోజుకు సగటున 250 నుండి 300 వ్యాగన్ల నిర్వహణ, తనిఖీ, మరమ్మతు పనులు చేపట్టేసామర్థ్యం కలిగిన సంస్థ సౌత్ కోస్ట్ రైల్వేజోన్లో ఉంది.
నాలుగు జోన్లు.. 385 స్టేషన్లు..
కొత్తగా రూపుదిద్దుకున్న విశాఖ డివిజన్ పరిధి సుమారు 450 కి.మీ. ఇందులో ఇచ్ఛాపురం-పలస, విశాఖపట్నం – దువ్వాడ (270కి.మీ) ప్రధాన సెక్షన్గా ఉండనుంది. అలాగే, 102 కి.మీ పొడవైన విజయనగరం -కునేరు సెక్షన్ కూడా ఈ డివిజన్లో ముఖ్యమైనది. ఇక విజయవాడ డివిజన్ పరిధి సుమారు 956 కి.మీ. కాగా, గుంటూరు 630 కి.మీ, గుంతకల్లు 1452 కి.మీ పరిధిని కలిగి ఉన్నాయి. ఈ నాలుగు డివిజన్లు కలిసి ఆంధప్రదేశ్లో చాలా భాగం రైల్వే నెట్వర్క్ను కవర్ చేస్తుంది. కొంతభాగం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోకి కూడా విస్తరించి ఉంది.
133 ఏళ్ల వాల్తేరు డివిజన్ ప్రస్థానానికి ముగింపు
భారతీయ రైల్వేలో అత్యంత ప్రతిష్టాత్మక డివిజన్లలో ఒకటిగా గుర్తింపు పొందిన వాల్తేరు డివిజన్ ప్రస్థానం ముగిసిపోయింది. జూన్ 1 నుంచి ‘వాల్తేరు’ అనే పేరు అధికారికంగా రైల్వే మ్యాప్ నుంచి కనుమరుగై, దాని స్థానంలో కొత్తగా విశాఖపట్నం డివిజన్ ఆవిర్భవించింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో భాగంగా కేంద్ర ప్రభుత్వం వాల్తేరు డివిజన్ను విశాఖపట్నం, రాయ గడ డివిజన్లుగా విభజించింది. మే 31 అర్ధరాత్రి నుంచి ఈ మార్పు అమల్లోకి రాగా, ప్రస్తుత వాల్తేరు డీఆర్ఎం లలిత్ బోహ్రా నూతన విశాఖపట్నం డివిజన్గా తొలి డివిజనల్ రైల్వే మేనేజర్గా బాధ్యతలు చేపట్టారు. వాల్తేరు డివిజన్ చరిత్ర వ•లాలు 19వ శతాబ్దం చివరలో నిక్షిప్తమై ఉన్నాయి. మద్రాసు-కలకత్తాను కలిపే ‘తూర్పు తీర రైల్వే’ నిర్మాణంలో భాగంగా 1893లో వాల్తేరుకు తొలిసారిగా రైలు మార్గం ఏర్పడింది. అనంతరం 1896లో బెంగాల్-నాగపూర్ రైల్వే అధీనంలోకి వెళ్లిన ఈ ప్రాంతం..ఆ తర్వాత కాలక్రమేణా వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించు కుంది. విశాఖపట్నం పోర్టు వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో సరకు రవాణాకు వాల్తేరు ఒక ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెంది దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించింది. రైల్వే ఆదాయ వనరుల్లో వాల్తేరు డివిజన్ ఒక బంగారు బాతు లాంటిది. తూర్పు కోస్తా రైల్వే జోన్లోనే అత్యధిక ప్యాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన రికార్డు ఈ డివిజన్ సొంతం. ముఖ్యంగా ఇనుప ఖనిజం, బొగ్గు, ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల రవాణాలో వాల్తేరు ఎన్నో రికార్డులను సృష్టించింది. ఛత్తీస్గడ్లోని బైలడిల్లా గనుల నుంచి విశాఖ పోర్టుకు ఇనుప ఖనిజాన్ని చేరవేసే కొత్తవలస-కిరండూల్ (కేకే లైన్) మార్గం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి సజీవ సాక్ష్యం. ప్రపంచం లోనే అత్యంత ఎత్తయిన, క్లిష్టమైన మార్గాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ మార్గంలో 56 సొరంగాలు, 87 భారీ వంతెనలు, 1236 చిన్న వంతెనలు ఉన్నాయి. కేవలం సరకు రవాణాకే పరిమితం కాకుండా, పర్యాటక రంగంలోనూ వాల్తేరు తనదైన ముద్ర వేసింది. బొర్రాగుహలు, అరకు లోయ వంటి ప్రకృతి సిద్ధమైన అద్భుత ప్రాంతాల మీదుగా సాగే రైలు ప్రయాణం పర్యాటకులకు మరుపురాని అనుభూతిని కలిగిస్తోంది. విశాలమైన అద్దాల పెట్టెలు కలిగిన ‘విస్టాడోమ్’ రైలును ప్రవేశపెట్టి పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో ఈ డివిజన్ దేశంలోనే ముందు వరుసలో నిలిచింది. పర్యావరణ హితమైన రైల్వే నిర్వహణలో, స్వచ్ఛతలో అనేక జాతీయ పురస్కారా లను సైతం సొంతం చేసుకుంది. అయితే, విభజన కారణంగా ఈ ప్రకృతి రమణీయ మార్గంలో ఎక్కువ భాగం కొత్తగా ఏర్పాటైన రాయగడ డివిజన్లోకి వెళ్లిపోతోంది.
నిర్ణయాలు వేగవంతం
దక్షిణకోస్తా రైల్వేజోన్ ఏర్పాటుతో ఆంధ్ర ప్రదేశ్లో రైల్వే పరిపాలన, ప్రాజెక్టుల ఆమోదం, నిర్ణయాల పక్రియ అత్యంత వేగవంతం కానున్నాయి. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వంటి ప్రధాన ఓడరేవులను ఈ జోన్ అనుసంధానించడం వల్ల సరకు రవాణా సులువై, పారిశ్రామిక రంగానికి, రైల్వేకు భారీ ఆదాయం సమకూరనుంది. కొత్త రైల్వే లైన్ల విస్తరణతో స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. శ్రీ సత్యసాయి జిల్లా మినహా రాష్ట్రం మొత్తం, అలాగే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాలు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. దీని కింద విజయవాడ, గుంటూరు, గుంతకల్లు కొత్తగా ఏర్పాటైన విశాఖపట్నం (పాత వాల్తేరు విభజన ద్వారా ఏర్పడినది) అనే నాలుగు ప్రధాన డివిజన్లు పనిచేస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఆంధప్రదేశ్కు రూ.10,134 కోట్ల రైల్వే బడ్జెట్ను కేటాయించగా, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.1,06,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు శరవేగంగా ప్రగతిలో ఉన్నాయి.‘అమృత్ భారత్’ పథకం కింద ఆంధప్రదేశ్ వ్యాప్తంగా 74 రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్ని ర్మిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, విజయవాడ స్టేషన్లను కార్పొరేట్ లుక్తో, అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దుతున్నారు. జోన్ పరిధిలో 100% విద్యుద్దీకరణ, డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. రైళ్ల వేగాన్ని పెంచడానికి, ప్రమాదాల నివారణకు ఇప్పటికే 832 ఫ్లైఓవర్లు/అండర్పాస్లు పూర్తి కాగా, ప్రస్తుతం మరో 299 నిర్మాణంలో ఉన్నాయి.

తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్