హిందూఫోబియా, వలస బానిసత్వం నిలువెల్లా కలిగి ఉన్న కొంతమంది మేధావులు, సోషలిస్టులు వృద్ధి మందగమనానికి హిందూత్వతో ముడిపెట్టారు. ఈ భావ దారిద్య్రానికి నిజమైన దోషులు సోషలిస్టులు, వారికి ఊతమిస్తున్న పెద్దలు అవుతారు.
ఇది వలసరాజ్యాల కాలం నాటి దుష్ప్రచారం. 100 దేశాలలో నివసిస్తున్న 200 కోట్ల మంది హిందువులను ఏదో ఒక కారణంతో ఎగతాళి చేసే హక్కు ఎవరికీ లేదు. 1950లు, 1980ల కాలంలో భారత్ వృద్ధి మందగమనానికి లేదా 3.5 శాతం తక్కువ జీడీపీ వృద్ధికి హిందూత్వ కారణమని తేల్చడం హిందూ ధర్మం పట్ల ఉన్న ద్వేషాన్ని తేటతెల్లం చేస్తున్నది.
ఇటీవల జరిగిన హిందూస్తాన్ టైమ్స్ వార్షిక నాయకత్వ సదస్సులో, ప్రధానమంత్రి నరేంద్రమోదీ హిందూత్వ ఆధారంగా ఆర్థిక వృద్ధి మందగమనాన్ని అంచనా వేయడం వెనుక వలసవాద మనస్తత్వాన్ని సరిగ్గానే ఎత్తి చూపారు.
ఆర్థిక పురోగతి, అభివృద్ధి మందగమనానికి హిందూత్వను ఎందుకు ఆపాదించాలి అనేది పెద్ద ప్రశ్న. కొంతమంది మేధావులు హిందువులను వేలెత్తి చూపడానికి అవమానకరమైన వ్యాఖ్యలను, పక్షపాత ప్రణాళికను ఎందుకు చేస్తారు?
భారత్ గత రెండు దశాబ్దాల కాలంలో ఏడు నుండి ఎనిమిది శాతం వృద్ధి సాధించడానికి ఈ హిందువులే కారణమనే విషయాన్ని స్వయంప్రకటిత మేధావులు, ఆర్థికవేత్తలు ఎందుకు విస్మరిస్తున్నారు?
కొంతమంది మేధావులు అంటిపెట్టుకున్న వలసవాద బానిస మనస్తత్వం వృద్ధి మందగమనానికి హిందూత్వతో ముడిపెట్టి ఉండవచ్చు. ది ఆక్స్ఫర్డ్ కంపానియన్ టు ఎకనామిక్స్ ఇన్ ఇండియా ప్రకారం, ఆర్థికవేత్త రాజ్ కృష్ణ 1982లో అప్పటి 3.5 శాతం ఆర్థిక వృద్ధిని స్వాభావిక సాంస్కృతిక దృగ్విషయంతో అనుసంధానించడానికి ప్రయత్నించారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఫ్యాకల్టీ సభ్యుడైన రాజ్ కృష్ణ హిందువులు పెద్దగా ఆలోచించరు, ఆశయం లేకుండా నిశ్చింతగా ఉంటారు అంటూ నిందలు వేశారు.
సరే, రాజ్ కృష్ణ లేదా అతని శిష్యుల వాదనలు నమ్మదగినవి కావు. ఆయన ఉద్దేశపూర్వకంగా, ప్రణాళిక ప్రకారం తప్పు చేసి ఉండవచ్చు. ఇందిరా గాంధీ లేదా నెహ్రూ కాలంలో ఆర్థిక పురోగతి, అభివృద్ధిని అంచనా వేయడానికి స్వీకరించిన నమూనాలలోనూ, ఏలుబడిలోనూ సోషలిజమ్ ప్రభావం ఎక్కువగా ఉండేది. 1991లో ఆర్థిక సంస్కరణలు ఆవిష్కృతమయ్యేంత వరకు, ప్రభుత్వ నియంత్రణలు అత్యంత దారుణంగా ఉండేవి. వృద్ధిని అణచివేసేవి.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో స్వేచ్ఛా వాణిజ్యం, వ్యాపారాలు, వ్యక్తుల స్ఫూర్తిని గొంతు నొక్కడం ఆనవాయితీగా ఉండేది. పాలనా నమూనా కూడా సోషలిస్ట్ స్వభావాన్ని సంతరించుని ఉండేది. కమ్యూనిస్ట్ సామ్రాజ్యం లాగా ప్రధానమంత్రి దగ్గర ఎక్కువ అధికారం కేంద్రీకృతమై ఉండేది.
భారత్లో సామాజిక-ఆర్థిక అభివృద్ధి గొంతు నొక్కారని, పేదరికంపై పోరాటాన్ని హిందువులు నెమ్మదిస్తున్నారని ఆరోపించడం అత్యంత బాధాకరమైన విషయం. 2023లో ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ వృద్ధి రేటు మందగమనంతో హిందూత్వాన్ని అనుసంధానించడంపై చర్చను పునరుద్ధరించారు.
సెప్టెంబర్, 2025తో ముగిసిన త్రైమాసికంలో, భారత్ ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం విస్తరణను నివేదించింది. దేశంలో దాదాపు 65 కోట్ల మంది ఉద్యోగాలు చేస్తున్నారు.
అదే విధంగా, 2024-25లో ప్రపంచవ్యాప్తంగా 7.3 శాతం వృద్ధి రేటును నివేదించిన ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. ఇది జీ-20 దేశాలలో అత్యధిక వృద్ధి రేటుగా నమోదైంది. చైనా, ఇండోనేషియా దేశాలు వరుసగా 5.3 శాతం, 5.1 శాతంతో రెండవ, మూడవ స్థానంలో నిలిచాయి. ఇటలీ, కెనడా వంటి దేశాలు కొన్ని త్రైమాసికాల్లో తమ ఆర్థిక వ్యవస్థలలో హెచ్చుతగ్గులను నివేదించాయి. జర్మనీ 0.2 శాతం బలహీనమైన వృద్ధితో పిరమిడ్ దిగువన ఉందని నివేదించబడింది.
భారత్ అద్భుతమైన ఆర్థిక పనితీరుకు సాంస్కృతిక, నాగరికత లేదా ధార్మిక ముద్రను ఎందుకు వేయడంలేదు? ఇది హిందూఫోబియా మనస్తత్వం కాకపోతే మరేమిటి? స్వయం ప్రకటిత మేధావులు ఆర్థిక పురోగతి లేకపోవడం లేదా నెమ్మదించడానికి హిందూ కోణాన్ని ఎందుకు తీసుకువచ్చారు? ఈ హిందూఫోబియా మనస్తత్వం ఫలితంగా ‘హిందూ వృద్ధి రేటు’ అంతర్జాతీయంగా విద్యావేత్తలు, ప్రజల నమ్మకాని చూరగొంది. తద్వారా భారత్, హిందువులు అభివృద్ధికి అసమర్థులనే తప్పుడు భావనను ప్రేరేపించింది. ఆ భావనను బలోపేతం చేసింది.
నాగరికత ముద్రను వేయడం లేదా హిందువు లను సోమరిపోతులుగా లేదా ఆధునికత లేనివారిగా తప్పుగా చిత్రీకరించడాన్ని తిరస్కరించాలి. నిజానికి, మొదటి నాలుగు దశాబ్దాలలో స్వీకరించిన సోషలిస్ట్ విధానాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థను నిద్రాణస్థితిలోకి నెట్టివేశాయి.
భారత్ స్వేచ్ఛాయుతమైన, సరళమైన, ఊహించదగిన విధాన నమూనాలో సామర్థ్యాన్ని ఆవిష్కరించడం ద్వారా ఉన్నత శిఖరాన్ని అధిరో హించగలదు. భారతీయ మార్గంలో వృద్ధిని మరింత వేగవంతం చేయడానికి వలసవాద మనస్తత్వం నుండి బయటపడటం, కాలం చెల్లిన సోషలిస్ట్ సిద్ధాంతా లను తిరస్కరించడం తప్పనిసరి.
కె.ఎ.బదరీనాథ్
డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్,
సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అండ్
హోలిస్టిక్ స్టడీస్, న్యూఢిల్లీ.