ఈ సెప్టెంబర్ 5న భారతదేశంలోను,కలకత్తా హైకోర్టు జోక్యంతో దాదాపు పది రోజులు ఆలస్యంగా పశ్చిమ బెంగాల్లోను విడుదలైన చిత్రం ‘బెంగాల్ ఫైల్స్’. దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోతి. ఆయన తలపెట్టిన చితత్రయంలో ఇది మూడోది. మొదటిది తాష్కెంట్ ఫైల్స్, రెండు కశ్మీర్ ఫైల్స్. ఊహించినట్టే మొదటి రెండు చిత్రాల మాదిరిగానే ఇది కూడా దుమారం మధ్యనే థియేటర్లలో సాగుతోంది.
చారిత్రక వాస్తవాలు మౌనం దాల్చిన చోట సృజన గళం విప్పుతుంది. విప్పాలి కూడా. చరిత్ర ఉదారవాద వక్రీకరణకు, సెక్యులరిస్టు హింసకు గురైతే సృజనాత్మక పక్రియలు జూలు విదల్చక తప్పదు. సృజనాత్మకంగా చెప్పినంతమాత్రాన వాటికి విశ్వసనీయత లేదనడం తొందరపాటు. మన దేశ చరిత్ర రచన మీద వామపక్షం, ఉదారవాదం జరిపిన రాజకీయం అందరికీ తెలుసు. 1948 జూలై నాటికి భారత్కు స్వాతంత్య్రం రావలసి ఉండగా, 11 నెలలు ముందుకు జరిగింది. అదే మహా రక్తపాతానికి దారితీసింది. ప్రత్యక్ష చర్యకు ముస్లిం లీగ్ పిలుపునిస్తే, ముస్లిం మతోన్మాదులు రెచ్చిపోవడానికి వీలుగా నాటి బెంగాల్ ప్రధానమంత్రి సుహ్రావర్ది మొత్తం పోలీసు యంత్రాంగానికి సెలవు ప్రకటించాడు. కోల్కతా వీధులు, నవకాలీ (ఒక గ్రామం) సందులు రక్తంతో తడిశాయి. కోల్కతాలో గోపాల్ పాతా నాయకత్వంలో హిందువులు పైచేయి సాధిస్తే, నవకాలీలో ముస్లింలు అక్షరాలా హిందువులను చరిత్ర విస్తుపోయే తీరులో ఊచకోత కోశారు. 1946-47 నాటి ఆ హింసాత్మక ప్రవృత్తి, పాకిస్తాన్ మీద ప్రేమ బెంగాల్లోని కొందరు ముస్లింలలో ఇప్పటికీ రాజ్యమేలుతున్నాయని చెప్పడమే ఈ సినిమా ఉద్దేశం.
ఇందులో దర్శకుడు తీసుకున్న అంశాలు ఏవీ వక్రీకరణలు కావు. క్రియేటివ్ లిబర్టీ పేరుతో చారిత్రక ఘట్టాలను సత్యానికి సుదూరంగా నెట్టివేయడం, నమ్మిన రాజకీయ సిద్ధాంతానికి బానిసగా మలచడం ఇందులో ముమ్మాటికీ లేదు. చరిత్ర వర్తమానంతో మాట్లాడుతూ ఉంటుంది. గతకాలపు బెంగాల్ మతోన్మాదం ఇప్పుడు కూడా రంకెలు వేస్తోంది. తన అహింసా సిద్ధాంతం గాంధీజీని కూడా వెక్కిరించిందన్నదే దర్శకుడి వాదన. ఆయన సిద్ధాంతాన్ని అతిగా నమ్మి భంగపడ్డామన్న భావన నివురుగప్పిన నిప్పులా ఉందన్నది దర్శకుడి భావన. నాటి హత్యాకాండలో రెండు వర్గాలూ నష్టపోయాయి. కానీ ముస్లింలకు మాత్రమే సాంత్వన వచనాలు చాలు అనుకున్న నాయకుల మీద దర్శకుడికి నిరసన ఉంది. ఈ సాంత్వనను వారు(ముస్లింలు) వేరే విధంగా స్వీకరిస్తున్నారు. ఫలితమే, 2025 నాటికి హిందూ మెజారిటీ దేశంలో ముస్లిం ప్రధానమంత్రి కావాలన్న ఊహ. సెక్యులరిజం, ప్రజాస్వామ్యం అన్న భావనలలోని డొల్లతనాన్ని ఆ మాటలు చెబుతున్నాయి. మైనారిటీ హోదా అంటే లైంగిక అత్యాచారాలకీ, మెజారిటీలను నిరంతరం భయోత్పాతంలో ఉంచడా నికీ• లైసెన్స్ ఇవ్వడమా అని ప్రశ్నిస్తాడు దర్శకుడు. భారతదేశం వేరు, బెంగాల్ వేరు. అక్కడ రెండు రాజ్యాంగాలు. ఒకటి ప్రభుత్వానిది. రెండు ముస్లింలది. ఈ రాజ్యాంగం విస్తరిస్తున్నది కూడా. మరి సెక్యులరిం స్థానం ఎక్కడ? అందుకే బెంగాల్ మరొక కశ్మీర్ కానున్నదా అంటూ ప్రశ్నించాడు.
గుడ్డెద్దు చేలో పడినట్టు సినిమాను సమీక్షించిన వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దర్శకుడు వాస్తవాన్ని చూపెట్టే ప్రయత్నమే చేశాడని చెప్పడానికి సాక్ష్యం కావాలంటే నాటి ముస్లింలీగ్ ప్రత్యక్ష చర్య పిలుపునీ, నేటి పీఎఫ్ఐ ప్రణాళికలనూ కలిపి చూడవచ్చు. ఎవరు ఎన్ని విమర్శలైనా చేయవచ్చు. కానీ కొన్ని వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా నిర్మించిన చిత్రమని దర్శకుడు ఇచ్చిన ప్రకటన అక్షరసత్యమే. ఇది డిస్క్లెయిమర్ కాదు. తన వాదన మీద తాను ఉన్నానని చేసిన ప్రకటన. ఒక ఉదాహరణ: కోల్కతా వీధుల నిండా శవాలు, రాబందులు పీక్కు తినడం, రిక్షాల మీద, తోపుడు బళ్ల మీద రక్తమోడుతున్న శవాల దృశ్యాలు ఇవన్నీ ‘లైఫ్’ పత్రిక (అమెరికా) ఫోటో జర్నలిస్ట్ మార్గరెట్ బౌర్కే వైట్ తీసిన ఫోటోకు తెరరూపం. ఇది సమీక్షకులు తెలుసుకుంటే సబబు.
ప్రతిభావంతమైన చిత్రానువాదంతో దర్శకుడు ప్రేక్షకులను గతానికీ, వర్తమానానికీ నడుమ ఊయల ఊగిస్తాడు. గీతా మండల్ అనే గిరిజన మహిళా జర్నలిస్ట్ అపహరణ కేసు దర్యాప్తు చేయడానికి శివ్ అలోక్ పండిత్ అనే సీబీఐ అధికారి కోల్కతా వెళ్లడం, అక్కడి వాతావరణం, యావగింపు కలిగించే ముస్లిం బుజ్జగింపు, ముర్షిదాబాద్ ‘మైనారిటీ’ ఎమ్మెల్యే స్వైరవిహారం, సీబీఐ అధికారి ఎదురుగానే ఎమ్మెల్యే ఆ గీతను చంపి చూపించడం, అంతిమంగా ఎమ్మెల్యేని పండిత్ చంపడం ఇదీ కథ. గిరిజన యువతి తప్పిపోవడం, మైనారిటీ ఎమ్మెల్యే ఆగడాలు- వర్తమాన బెంగాల్ రాజకీయ, మత, సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేవే. వీటికి నేపథ్యం 1946-1947 దేశ విభజన నాటి పరిస్థితులేనని చెప్పడమే ఈ సినిమాలోని ప్రత్యేకత. ఆ గతానికీ, ఈ వర్తమానానికీ వారథి భారతీ బెనర్జీ పాత్ర. ‘బెంగాల్ ఫైల్స్’ భారతీయ భారీ చిత్రాల సరసన చేరింది. 204 నిమిషాలు (దాదాపు మూడున్నర గంటలు). అయినా వీక్షకులను రెప్ప వాల్చనీయదు.
‘ఈ రోజు మీ జీవితంలోనే అత్యంత ప్రధానమైన రోజు. చరిత్రాత్మకమైన ఘట్టంలో పాల్గొంటున్నారు’ అంటూ అద్దం ముందు నిలబడి కోటు సరి చేసుకుంటున్న భారత ఆఖరి వైస్రాయ్ మౌంట్బాటన్ వద్దకు వచ్చి ఎడ్వినా మౌంట్బాటన్ చెప్పే సన్నివేశంతో చిత్రం ఆరంభించారు. ఆ రోజు జూన్ 3, 1947. ఆ రోజే కేవలం తొమ్మిదిమంది కలసి భారత్-పాక్ అనే రెండు దేశాలను సృష్టించారు. ఇది విభజన ముస్లిం లీగ్ ఆశయం. భారత జాతీయ కాంగ్రెస్ పెద్దల పదవీదాహం. నిజానికి స్వదేశీ సంస్థానాలకు ఏదో ఒక దేశంలో చేరే హక్కుతో పాటు, స్వతంత్రంగా ఉండే హక్కు ఇచ్చి పెద్ద విపత్తుకు కూడా నాడే బీజం వేశారు. అది ఈ చిత్రం పరిధిలో లేదు.
వైస్రాయ్ దగ్గర నుంచి కథ మళ్లీ వర్తమానం దగ్గరకు వస్తుంది. పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ నియోజకవర్గంలో తప్పిపోయిన ఒక గిరిజన యువతి గీతా మాండల్ కేసు దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ రాజ్నాథ్ సింగ్ (పునీత్ ఇసార్) యువ ఐపీఎస్ శివ అలోక్ పండిత్ (దర్శన్కుమార్) నెత్తిన పెడతాడు. ఇందులో ప్రధాన సాక్షి ‘మా భారతి’. ఈమె ఇంటి నుంచే గీత మాయమవుతుంది. ఆ యువతిని అపహరించినవాళ్లు ముర్షిదాబాద్ ఎమ్మెల్యే సర్దార్ హుసేనీ (శాశ్వత్ చటర్జీ) మను షులు. ఇది అందరికీ తెలుసు. కానీ దర్యాప్తుకు ఎవరూ సహకరించరు. పోలీస్ యంత్రాంగం సహాయ నిరాకరణ చేస్తుంది. ‘ఇది భారత్ కాదు, బెంగాల్. ఇక్కడ రెండు రాజ్యాంగాలు. ఒకటి ప్రభుత్వానిది. రెండు ముస్లింలది. ఎమ్మెల్యే సర్దార్ హుసేనీ చెబితేనే ఎఫ్ఐఆర్ నమోదువుతుంది. మీరు చూసీ• చూడనట్టు వదిలేయండి’ అని కింది స్థాయి పోలీసులు శివ్కు ఉచిత సలహా ఇస్తారు. అదే మంచిది అంటూ మతిస్థిమితం లేని ఓ పాత్ర- చతుర్ (మిథున్ చక్రవర్తి) ఇక్కడ ప్రవేశిస్తుంది. చతుర్ గతంలో ఏదో కేసు దర్యాప్తు చేయ సాహసిస్తే నాలుకతో పాటు మర్మాయవం కూడా కోసేశారు. దర్యాప్తులోనే మా భారతి ద్వారా అటు చారిత్రక ఘటనలు, ఇటు వర్తమాన ఘటనలు ఆవిష్కృతమవుతూ ఉంటాయి.
ఈ చిత్రంలోని చాలా చారిత్రక ఘట్టాలు జనసామాన్యంలో లేవు. అయినంత మాత్రాన వాటి ఉనికిని ప్రశ్నించడమంటే, వక్రీకరణ అని తీర్పు చెప్పడమంటే అజ్ఞానాన్ని ప్రదర్శించుకోవడమే. ఈ చిత్రాన్ని విమర్శించిన చాలామందిలో ఇదే కనిపించింది. ఏమిటా వాస్తవ చారిత్రక ఘట్టాలు! క్విట్ ఇండియా ఉద్యమ ప్రకటనతోనే గాంధీజీ, ఇతర ముఖ్యనేతలను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. గాంధీ, సరోజినీనాయుడు, నెహ్రూ వంటి వారిని ఆగాఖాన్ భవన్లో ఉంచింది. అక్కడే గాంధీ తీవ్ర అస్వస్థులయ్యారు. 1944లో ఆయనను విడుదల చేశారు. అప్పుడే రంజాన్ మాసంలో జిన్నా-గాంధీ చర్చలు బొంబాయిలోని జిన్నా భవంతిలో 19 రోజులు జరిగాయి. దారుణంగా విఫలమయ్యాయి. 1940 కరాచీ ముస్లిం లీగ్ సమావేశం తరువాత జరిగిన ఈ చర్చలలో జిన్నా పరిపూర్ణమైన మతోన్మాదిగా, వేర్పాటువాదిగా కనిపిస్తాడు. ద్విజాతి సిద్ధాంతాన్ని నిష్కర్షగా వినిపించాడు జిన్నా. మీరు గతంలో హిందువులే మనందరి రక్తం ఒక్కటే అని గాంధీ అన్నారు (ఆ చర్చలను లీగ్ పుస్తకరూపంలో ఆనాడే వెలువరిం చింది). దేశ విభజనను ఆమోదిస్తూ కేబినెట్ మిషన్ చేసిన సిఫారసులను మొదట ఆమోదించిన జిన్నా, లీగ్కు లాభసాటి కాదన్న ఉద్దేశంతో పార్టీ ఒత్తిడి మేరకు వెనక్కి తీసుకున్నాడు. ఇంగ్లండ్ భారత్ను వీడి వెళ్లడం ఖాయమైంది. కానీ అది హిందూ భారత్ అవుతుందన్నదే ముస్లిం లీగ్ అభిప్రాయం. అందుకే ముస్లిం లీగ్ ఆశయం మేరకు పాకిస్తాన్ ఏర్పాటు అన్న డిమాండ్కు అనుగుణంగా జూలై, 1946 బొంబాయి నుంచి జిన్నా ప్రత్యక్షచర్యకు పిలుపునిచ్చాడు. అంటే హర్తాళ్. ఆర్థిక కార్యకలాపాల దిగ్బంధన. ఆగస్ట్ 16, 1946న దీనిని అమలు పరిచారు. కానీ హర్తాళ్ను హత్యాకాండగా మలిచాడు బెంగాల్ ప్రధానమంత్రి సుహ్రావర్ది. పోలీస్ శాఖకు సామూహిక సెలవు ప్రకటించాడు. దీనిని ముందే పసిగట్టినవాడు గోపాల్ పాతా. దుర్గాదేవి భక్తుడైన గోపాల్కు పెద్ద తాలింఖానా, అనుచరులు ఉండే వారు. ముస్లిం మతోన్మాదులను నివారించగలిగారు. ముస్లింలే ఎక్కువ మంది చనిపోయారు. దీనికి ప్రతీకారమే నవకాలి హత్యాకాండ. దీనికి బలైన వారే భారతీ బెనర్జీ తండ్రి, తల్లి. భారతిని మాత్రం అమర్జీత్ అరోరా (ఏకలవ్య సూద్/ రెండో ప్రపంచ యుద్ధంలో సైనికుడు) రక్షిస్తాడు. చివరికి అతడు కూడా ముస్లిం గూండాల చేతిలో దారుణంగా చనిపోతాడు. నవకాలి హత్యలన్నీ గులామ్ సర్వార్ హుసేనీ (నమాశి చక్రవర్తి) చేయించాడు. పీర్ ఆఫ్ దాయిరా షరీఫ్గా పనిచేశాడు. ఇది కూడా వాస్తవిక మైన పాత్రే. ఇక దేశ విభజనను మరునాడు ఆమోది స్తారనగా జూన్ 2, 1947న వైస్రాయ్ దగ్గరకు వచ్చిన గాంధీజీ తాను మౌనవ్రతంలో ఉన్నాను కాబట్టి మాట్లాడడం లేదని నిష్క్రమించడం కూడా వాస్తవమే. దేశం ముక్కలవుతున్నా వ్రతాలేమిటి అన్న ప్రశ్న మనను మనం వేసుకొనేటట్టు చేశాడు దర్శకుడు.
వర్తమాన ఘోరాలకు సంబంధించిన సన్ని వేశాలన్నీ ముక్కు సూటిగా చెప్పాలంటే సీపీఎం, టీఎంసీ కాలంలో జరిగినవే.
ఈ సినిమా ద్వారా అహింసా సిద్ధాంతాన్నీ, గాంధీమార్గాన్నీ దర్శకుడు బోనెక్కించదలిచాడని అర్ధమవుతుంది. ముస్లిం లీగ్ మతోన్మాదం, ద్విజాతి సిద్ధాంతం, వేరే దేశం డిమాండ్ రోజురోజుకీ బలపడిన నేపథ్యంలో కూడా గాంధీజీ అహింసను అంతగా నమ్మడం ఆత్మహత్యా సదృశమన్న అభిప్రాయానికి ప్రేక్షకులను తీసుకు వచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అది గతమే. కానీ అది వర్తమానాన్ని శాసిస్తున్నది కాబట్టి చర్చ తప్పదు. కోల్కతా హత్యాకాండ తరువాత నిరశనలో ఉన్న గాంధీజీ ముందు ఆయుధాలు విసర్జించే పని మొదలవుతుంది. గోపాల్ పాతా కూడా వస్తాడు. నా సోదరీమణులు, మాతృమూర్తులు అత్యాచారాలకు గురి అవుతుంటే, వారిని రక్షించుకోవడానికి ఏ ఆయుధం ఉపయోగించాలి అని సూటిగా ప్రశ్నిస్తాడు. అంతటి రక్తపాతం నేపథ్యంలోను గాంధీజీ, నిరాహార దీక్షే ఆయుధం, ప్రతిఘటన కాదనే చెబుతారు. అయితే నా ఆయుధాన్ని నేను వదలడం లేదని గోపాల్ నిష్క్రమిస్తాడు. ఒక మహిళ గాంధీజీ వద్దకు వచ్చి కొడుకులు, భర్త, గర్భి•ణి అయిన కూతురు అంతా చనిపోయారని ఇదే మిగిలిందంటూ ఒక ఎముక పడేసి విలపిస్తూ చెబుతుంది. అంతిమంగా గాంధీజీ కూడా తల బాదుకుంటాడు. గులాం సర్వార్ హుసేనీని చంపే అవకాశం నవకాలీ హత్యాకాండ సమయంలో భారతీ బెనర్జీకి వస్తుంది. విద్యార్థి దశలో గవర్నర్ మీద కూడా కాల్పులు జరిపిన భారతి సర్వార్ హుస్సేనీ పీక మీద పెట్టిన కత్తిని కూడా కింద పడేస్తుంది. గవర్నర్పై కాల్పుల తరువాత గాంధీజీని కలిసిన ఫలితం. ఆమె తండ్రి వేరే హత్య కేసులో గులాం సర్వార్కు బెయిల్ ఇస్తాడు. సెక్యులరిజం, ప్రజాస్వామ్యం గురించి చెబుతాడు. ప్రత్యక్ష దినం హింసలో సెక్యులరిజం, ప్రజాస్వామ్యం వంటి సిద్ధాంతాలను వెక్కిరిస్తూనే గులాం ఆయనను భయానకంగా చంపుతాడు. ఆరోజు నేను గులాంను వదిలిపెట్టకుండా ఉండవలసింది అంటుంది భారతి, చిట్టచివరి దృశ్యాలలో. తనకో తుపాకీ కావాలని కూడా కోరుతుంది. అంతేకాదు, జిన్నా నూరిపోసిన ద్విజాతి సిద్ధాంతమే తరం తరువాత తరం అన్నట్టు చాలా మంది ముస్లింల మెదళ్లలో ఎలా ప్రవహిస్తూ వస్తున్నదో కూడా చెప్పదలిచాడు దర్శకుడు. విభజన కాలం నాడు హింసకు నాయకత్వం వహించిన ముస్లిం మతోన్మాది పేరును గులామ్ సర్వార్ హుసేనీగా, నేటి పరిస్థితులలో అన్ని రాజ్యాంగ వ్యవస్థల పరిహసిస్తూ, కొత్త ప్రత్యక్షదినం కోసం నిత్యం ఎదురు చూసే పాత్రకు సర్దార్ హుసేనీ అని పెట్టడంలో అంతరార్ధం అదే అనిపిస్తుంది. ఇందులో జాతీయ చిహ్నం నాలుగు సింహాలకు ఒక వ్యాఖ్యానం చెప్పాడు దర్శకుడు. అది మిథున్ చక్రవర్తి వంటి నటుడి ద్వారా చెప్పించడమే ప్రత్యేక ఆకర్షణ. మొదట కనిపించే మూడు సింహాలు న్యాయం, ధర్మం, సత్యానికి ప్రతీకలు. నిజమే. కానీ నాలుగో సింహం? అదే ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. కానీ అది ఇప్పటి వరకు కనిపించడం లేదు అంటాడు మతిలేని చతుర్.
శివ పండిత్ సర్దార్ హుసేనీని ప్రశ్నించడానికి వెళతాడు. అతడికి ఒక కొడుకు ఉంటాడు. భవిష్యత్తులో నీవేమి కావాలని అనుకుంటాన్నావో అంకుల్కి (శివపండిత్కి) చెప్పమంటాడు సర్దార్. భావి ప్రధాని అంటాడు ఆ పిల్లవాడు. 2050 నాటికి మెజారిటీ హిందూ దేశానికి ఒక మైనారిటీ ముస్లిం ప్రధాని అవుతాడు తెలుసా అంటాడు. అప్పుడు సీబీఐ అధిపతి నుంచి అక్కడికి వెళ్లినందుకు శివ్ను క్షమాపణలు చెప్పమంటాడు. రాజీపడినట్టు నటించి రెండోసారి వెళ్లినప్పుడు గీతను తన ఎదురుగా నడిపించాడు సర్దార్. ఆమె శరీరం చిత్రహింసల పాలై ఉంది. శివ్ ఎదురుగానే కాల్చి చంపిస్తాడు. ఆ తరువాత సర్దార్ను శివ చంపేస్తాడు. ఎవరు ఎన్నయినా విమర్శించవచ్చు. కానీ బెంగాల్ ఫైల్స్ ఒక లోతైన గాయానికి గళమిచ్చిందని, తన బాధను బిగ్గరగా చెప్పే అవకాశం ఇచ్చిందని చెప్పక తప్పదు.
ఇటీవలి సంవత్సరాలలో వచ్చిన కొన్ని సినిమాలను చూస్తే కాంగ్రెస్, సెక్యులరిస్టులు, ఉదార వాదులు ఎందుకు ఉలికిపడుతున్నారో అర్ధం కాదు. కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ, రజాకార్, ఆర్టికల్ 370 చిత్రాలకు చాలా గడబిడ చేశారు. ఇవన్నీ జాతి ఆత్మకు తగిలిన గాయాలే ఇతివృత్తాలుగా తెరకు ఎక్కిన చారిత్రక వాస్తవాలు. ఆ ఇతివృత్తాలన్నీ ఇవాళ్టి తరాలకు తెలియకూడదన్నదే వాళ్ల ఆశయ మనుకోవాలా?
బెంగాల్ ఫైల్స్ ఇతివృత్తం, దాని మీద ఉన్న వివాదం, ఉద్వేగాల వల్ల కొన్ని విషయాలు మరుగున పడ్డాయి. అందులో ప్రధానమైనది- ఈ సినిమాలో నటించిన వారి ప్రతిభ. వారు పాత్రలకు చేసిన గొప్ప న్యాయం. పల్లవీ జోషి, సిమ్రత్ కౌర్ రాంధ్వా, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్కుమార్, జిన్నా, గోపాల్ పాతా, రాయ్చౌధురి పాత్రధారులు కూడా విశేషమైన ప్రతిభ చూపారు. గతాన్నీ, వర్తమానాన్నీ కలుపుతూ వివేక్ అగ్నిహోత్రి రూపొందించుకున్న చిత్రానువాదం ప్రశంసనీయం.అది కెమేరాతో చెప్పాలి కాబట్టి, నాటి నేటి నేతల, వైతాళికుల ఫోటోలతో రెండు పార్శ్వాలను చక్కగా ప్రతిబింబించారు. అత్తర్సింగ్ సయానీ ఫోటోగ్రఫీ ఇంకా బాగుండవచ్చునని అనిపిస్తుంది. రోహిత్ శర్మ అద్దిన బెంగాలీ సంగీత స్వరాలు చక్కనివే.
పల్లవీ జోషి (తల్లి భారతీ బెనర్జీ), సిమ్రత్ కౌర్ రాంధ్వా (యువ భారతీ బెనర్జీ), దర్శన్కుమార్ (శివ్ అలోక్ పండిత్), మిథున్ చక్రవర్తి (మతి స్థిమితం లేని చతుర్), అనుపమ్ ఖేర్ (గాంధీజీ), శాశ్వత్ చటర్జీ (సర్దార్ హుసేనీ), ఏకలవ్య సూద్ (అమర్జీత్ అరోరా), గులామ్ సర్వార్ హుసేనీ (నమాశి చక్రవర్తి), రాజేశ్ ఖెరా (జిన్నా), పునీత్ ఇసార్ (రాజనాథ్ సింగ్, సీబీఐ డెరెక్టర్), ప్రియాంశు బెనర్జీ(జస్టిస్ బెనర్జీ), దివ్యేందు భట్టాచార్య (రాజేంద్రలాల్ రాయ్చౌధురి), సౌరవ్దాస్ (గోపాల్ పాతా), మోహన్ కపూర్ (సుహ్రావర్ది), అనుభ అరోరా (గౌరి), పాలోమీ ఘోష్ (జర్నలిస్ట్ సీత).
– కల్హణ