ఆగస్ట్ 15 అరవింద జయంతి
జాతి అంటే భౌగోళిక ఆకారమనీ, నదులు, పర్వతాలు, పొలాలతో కూడినదనీ ఇతర దేశాలు భావిస్తాయి. కానీ భారతీయ మహర్షులు, మనీషులు జాతిని ఒక సజీవమైన ఆత్మగా అర్చించారు. తపస్సు ద్వారా, దర్శనం ద్వారా, చింతన ద్వారా వెలువడిన ఈ మంత్రం రాజకీయాల, వైజ్ఞానిక ఆవిష్కరణల కోలాహలంలో మానవునికి వినిపించలేదు. ఈ సత్యాన్ని రాజకీయ వేదికపై సింహగర్జనగా వెలువరించిన దివ్య విభూతి యోగి అరవిందులు.
భారతదేశంలోని యువకులు బ్రిటిషు పాలనలో నౌకరీల కోసం పాకులాడుతున్న సమయంలో, బాల్యంలో 14 ఏండ్లు ఇంగ్లండులో విద్యాభ్యాసం చేసిన ఒక భారతీయ యువకుడు 8 దశాబ్దాల క్రితం తన భార్యకు రాసిన ఒక లేఖలో తన మూడు లక్ష్యాలను గురించి ఇలా పేర్కొన్నాడు: ‘నాకు మూడు ‘పిచ్చి’లు ఉన్నాయి. మొదటిది : పరమేశ్వరుడు ప్రసాదించిన సద్గుణములు, ప్రతిభ, జ్ఞానం, వైభవం- అన్నీ ఆయనవే… రెండవది: నేను భగవత్ సాక్షాత్కారాన్ని తప్పక పొందుతాను… మూడవది : నా దేశం నా తల్లి. తల్లిగా నేను దేశాన్ని ఆరాధిస్తాను. మాతృభూమి వక్షస్థలంపై కూర్చొన్న దానవుడు ఆమె రక్తం పీల్చుతూ ఉంటే కుమారుని కర్తవ్యం ఏమిటి? అతడు విశ్రాంతిగా భుజించగలడా? తన తల్లి రక్షణకై పరుగెత్తడా? పతనం చెందిన ఈ జాతిని ఉద్ధరించే సామర్థ్యం నాకున్నదని తెలుసు. ఆ శక్తి జ్ఞానశక్తి… పరమేశ్వరుడు ఈ జీవన కార్యాన్ని పూర్తి చేయడం కోసమే నన్ను భూమిపైకి పంపాడు.’
ఈ లక్ష్యాలు మూడూ ఫ్రెంచి విప్లవంలోని మూడు సిద్ధాంతాలకు ప్రతిరూపాలు. మొదటిదానిలో సమానత్వం ఇమిడి ఉంది. అంతా భగవానునిదే అయినప్పుడు, కనీస అవసరాలకు మించి ఖర్చుచేసే హక్కు ఎవరికీ లేనప్పుడు సమాజంలో కృత్రిమమైన వర్గాలు ఏర్పడవు. దేశంలో అందరి వికాసం సాధ్యపడుతుంది. రెండవ లక్ష్యంలో సోదరత్వం ఇమిడి ఉంది. మన అందరిలోను, నిఖిల విశ్వంలోను ఉన్న ఒకే సత్తాను గుర్తించడం సోదరభావనకు ప్రాతిపదిక. మూడవ లక్ష్యంలో స్వాతంత్య్ర భావన ఉన్నది. ఒక దేశం బానిసత్వంలో ఉన్నంత వరకు దాని సంస్కృతి, దానిలోని పౌరులు పూర్తి వికాసాన్ని పొందలేరు.
అరవింద యోగి జీవనం ఈ మూడు మంత్రాలకు సజీవమైన మూర్తి, బరోడాలో ఉన్నత పదవిలో ఉన్నప్పుడు ఆయన ఎంతో నిరాడంబరంగా ఉండేవారు; తన జీతాన్ని తన కోసం వినియోగించుకో కుండా కష్టాలలో ఉన్నవారి కోసం ఉపయోగించారు. కటిక నేల మీద, ఇటుక తలగడగా చేసుకుని పడుకునేవారు. ధనవంతుడై కూడా దారిద్య్ర వ్రతాన్ని పాలించారు. సమానత్వాన్ని తేవడం కోసం స్వర్గం నుండి దిగివచ్చిన విప్లవ దేవత ఆయన.
అరవిందుడు భారతదేశం తిరిగి రాగానే ఇక్కడ ఆర్థిక, సామాజిక, ధార్మికాది సమస్యలను అధ్యయనం చేశారు. దేశంలో ‘అతి’ ఎక్కువగా ఉన్నదని గ్రహించారు. ఒక ప్రక్క మహారాజులు పాలు, నేతులలో మునిగి చనిపోతున్నారు; మరోప్రక్క ఎండు రొట్టెల కోసం ఎంగిలాకుల కోసం ఎముకల పోగులు ఒకరి పీకలు మరొకరు నులుముతున్నారు. సాధన సంపత్తికి కొదువ లేదు. అయితే వాసనలు, కోరికలు పంపిణీలోని సమస్థితిని దెబ్బతీశాయి. కనుక మనం కోరికలను తగ్గించుకోవడం అవసరం. అరవిందుని ఈ మంత్రాన్ని ఆచరిస్తే, దేశం ఆర్థిక విప్లవాన్ని సాధించి ఉండేది.
జాతి ఆత్మకు మేలుకొలుపు
రాజకీయ విప్లవానికి ఆయన జన్మదాత. ‘వందే మాతరం’ మంత్రంతో జాతి ఆత్మను మేలుకొలిపిన మొదటి రాజకీయవేత్త. దేశానికి నిజమైన పరిభాషను ఇచ్చిన, జాతి కీలకాన్ని తెలిపిన మొదటి జాతీయ నాయకుడు ఆయన. భారతీయ మహర్షుల శాశ్వత వాణి మొదటిసారిగా అరవిందుని ముఖతః రాజకీయ రంగం నుండి వెలువడింది. ప్రాచీన భారతంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు రాజనీతిలో నెలకొల్పిన ఆదర్శాల పరంపర ఆధునికయుగంలో తిరిగి కొనసాగింది. మహాభారత యుద్ధంలో ప్రవచించిన భగవద్గీత భారత రాజకీయాలలో తిరిగి ధ్వనించ సాగింది. ‘వందేమాతరం’ పత్రిక సంపాదకుడుగా అరవిందులు రాజకీయాలలో ప్రవేశించినప్పుడు ఆయన రచనలలో ప్రజలకు ఒక మంత్రశక్తి ప్రభావం అనుభూతమయింది. ఆయన వ్యాసాలు రాజకీయాలనే చర్చించినా వాటి వెనుక సంస్కృతి ఆత్మ దర్శనమిచ్చేది. లాల్-బాల్-పాల్ల యుగంలో ‘స్వాతంత్య్రం నా జన్మహక్క’ంటూ ఉద్గోష రూపంలో ప్రభవించిన విప్లవం అరవిందుని ఛ•త్రఛాయలో ఫలించసాగింది. ‘ఏ విధంగా అయినా సరే ఆ హక్కును పొంది తీరతాం’ అనే ఉద్గోష దేశమంతటా ప్రతిధ్వనించసాగింది.
‘జాతీయవాదం నేటి యుగధర్మం’
అరవిందులు జాతీయవాదానికి ఒక కొత్త వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. జాతీయవాదం ఒక కొత్త శక్తి రూపంలో, ఒక కొత్త ధర్మంగా, భగవానుని శక్తి అవతారంగా పృథ్విపై దిగివస్తోందని ఆయన బోధించారు. ఆయన దృష్టిలో రాజనీతి అంటే ఏవో జిత్తులు, ఎత్తుగడలు కాదు; భగవంతుణ్ణి సముదాయంలో ప్రతిష్ఠించే మంత్రం. నాలుగేండ్ల రాజకీయ జీవితంలో ఆయన రాజకీయ స్వాతంత్య్రాన్ని పొందాలనే తీవ్ర ఆకాంక్షను దేశమంతటిలో వ్యాపింపజేశారు; మరో కొత్త విప్లవం కోసమై సన్నద్ధులయ్యారు.
విప్లవం, పరివర్తన, వీటితో అరవిందుని జీవితంలోని కణకణమూ నిర్మితమయింది. ఒక భారతీయ యువకుడు పరాయి దేశంలో నాలుగు పర భాషలలో ప్రథమ స్థానాన్ని గడించి ప్రపంచంలో నాటి ఒక గొప్ప జాతి మేధాశక్తిని సిద్ధం చేశాడు; భారత్ శ్రేష్ఠత్వాన్ని నిరూపించాడు; భారత్కు తిరిగి వచ్చిన తర్వాత దేశ పరిస్థితులను గురించి ఆధునిక యుగంలో ఏ రాజకీయ వేత్త సంపాదించని పరిజ్ఞానాన్ని సంపాదించాడు. అంతేకాదు ఆయన ఈ భూఖండ సంస్కృతిని రూపుదిద్దిన మహర్షుల వాణిలోని మర్మాన్ని గ్రహించారు.
నాటి రాజకీయ నాయకులు పలువురి లక్ష్యం ప్రభుత్వాధికారం భారతీయుల చేతుల్లోకి రావడం మాత్రమే. నాడు దేశం అనే దేవత పిలుపుని ప్రజలు స్పష్టంగా గుర్తించలేకపోయారు. స్వాతంత్య్ర కాంక్ష రాష్ట్రాత్మ పిలుపు కావాలి. అరవిందుడు మన స్వాతంత్య్ర విప్లవంలో విప్లవాన్ని కాంక్షించాడు. మన విప్లవం పిలుపు కావాలి. దానికోసమై సంఘర్షణ దేవత చరణాలకు ఆరాధన కావాలి. మన విప్లవం పునాదులు బలహీనంగా ఉన్నాయి. ఆయన రోగగ్రస్థమైన మన విప్లవంలో మన సహజ సమృద్ధిని, మన ఆధ్యాత్మికతను పూరించి, దానికొక కొత్త జీవనాన్ని ప్రసాదించారు.
భారతీయ స్వాతంత్య్ర విప్లవ మహాసేనాని అయిన అట్టి దివ్యవిభూతి మరే దేశ చరిత్రలోనూ కానరాడు. దాస్య శృంఖలాలను తెంచివేయడానికి ఆయనలోని ఆవేదన, తపన, ఉన్మాదం, ఉద్వేగం, వీటితోపాటు ఆయనలోని గాంభీర్యం ప్రపంచ చరిత్రలోనే కానరాదు. వాస్తవానికి ఆయన ఏ రంగంలో ఎక్కువ సంవత్సరాలు గడిపి, అగ్రగామి అయ్యారో ఆ రంగంలో ప్రవేశించింది దేశ స్వాతంత్య్రం కోసమే. దేశాన్ని స్వాతంత్య్రం చేయడానికి ఒక అలౌకిక శక్తిని సంపాదించే లక్ష్యంతో ఆయన యోగమార్గాన్ని స్వీకరించారు.
అరవిందులు మూలతః విప్లవవాది. విప్లవానికి ఆధారం పవిత్రత. అరవిందులు రాజకీయ రంగంలో సహజసిద్ధమైన ప్రవృత్తిని, త్యాగభావన శ్రేష్ఠతను నింపి దానికి అతి నిర్మలమైన రూపాన్ని ఇవ్వడానికి కృషిచేశారు.
ద్వారకాప్రసాద్ గుప్త,
(జాగృతి, 14.8.1972)