మానవాళిని ‘నేను’ నుంచి ‘మనం’ అనే భావనతో దగ్గరకు చేర్చిన గొప్ప హిందూ సంప్రదాయం రాఖీ బంధనం. సోదరీసోదరుల మధ్య నుంచి రాఖీ బంధనం ఇప్పుడు సామాజిక రక్షణకు ఆయుధమనే సూత్రంగా స్పష్టమయింది. యావత్‌ ‌విశ్వాన్ని ఒక్కతాటిపై నిలిపే వసుధైవ కుటుంబకం వంటి మహోన్నత చింతనకు భారతీయులు నిరంతరం కట్టుబడి ఉండే విధంగా చేస్తున్న అపురూపమైన పండుగ రాఖీ. నిజానికి హిందూ సంస్కృతిలో వచ్చే పండుగలన్నీ సమాజాన్ని కలిపి ఒక ఏకత్వం వైపు నడిపించేవిగానే ఉంటాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ ‌పండుగకు మరింత• శోభను, విస్తృత లక్ష్యాన్ని జోడించింది. ప్రతి స్వయంసేవక్‌ ‌సాటి స్వయంసేవక్‌కు రాఖీ కట్టి, ‘నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష. మనిద్దరం, దేశానికి రక్ష’ అని ప్రతిజ్ఞ చేస్తారు.

ఏటా శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి రక్షాబంధన్‌ ‌కార్యక్రమాన్ని భారతీయ సమాజం వేల సంవత్సరాల నుండి జరుపుకుంటున్నది. రక్షాబంధన్‌ ‌సందర్భంగా ఒకరికొకరు రక్షాసూత్రం కట్టుకొని ‘నీకు నేను రక్ష.. నాకు నీవు రక్ష’ అంటూ సమాజంలో ఉన్న అందరి మధ్యలోను ఒక మానసికమైన అనుబంధాన్ని, ఆత్మీయతను నిర్మించుకుంటారు. రక్షాబంధాన్ని రక్షాసూత్రం అని కూడా అంటారు. ఈ పౌర్ణమిని రాఖీ పూర్ణిమ, నారియల్‌ ‌పూర్ణిమ, కజారి పూర్ణిమ అని కూడా పిలుచుకుంటూ, రకరకాలుగా ఇదే ఆచారాన్ని పాటిస్తారు. సోదరుడు సోదరికీ, మానవాళి ప్రకృతికీ రక్ష అన్న ఆకాశమంత తత్త్వం ఇందులో ఉంది. నారియల్‌ ‌పూర్ణిమను ఆచరించే విధానమే ఇందుకు నిదర్శనం. ఇది ప్రధానంగా మత్స్యకార కుటుంబాలలో ఉంది. వారు ఆరోజు సముద్రుడికి, వరుణుడికి కొబ్బరికాయ, రాఖీ సమర్పిస్తారు. ఈ పండుగ వేళ సోదరుడి నుదుట తిలకం దిద్ది చేతికి రాఖీ కడుతుంది సోదరి. హారతి ఇచ్చి, మిఠాయి తినిపిస్తుంది. సోద రుడు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని భగవంతుడిని ప్రార్ధిస్తుందామె. ఇది సోదరీసోదరుల మానసికమైన అనురాగానికి ప్రతీక మాత్రమే కాదు, సామాజిక రక్షణకు ప్రతిన పూనుతూ ధరించే దీక్షా కంకణం కూడా. కొన్ని ప్రాంతాలలో ఇంకా అద్భుతమైన సంప్రదాయం ఉంది. సోదరుడికి రాఖీ కట్టే ముందే సోదరి తులసిమాతకు, ఆపై రావిచెట్టుకు రాఖీలు కడుతుంది. ఈ ప్రకృతిని రక్షిద్దాం అన్న సందేశంతో ఆ పని సోదరీమణులు చేస్తారు. దీనికే వృక్ష రక్షాబంధన్‌ అని పేరు. వారణాసిలోని కాలభైరవ స్వామి ఆలయంలో నల్లతాడు, జమ్ములోని వైష్ణోదేవి ఆలయంలో ఇచ్చే ఎరుపుసూత్రం కూడా ఇలాంటి భావనతో కూడిన బంధనాలే.

పురాణాలలోను, సమీపగతంలోను కూడా ఈ పండుగ ప్రస్తావన దర్శనమిస్తుంది. ఇతిహాస పరంగా- ద్రౌపదికి కృష్ణభగవానుడు రాఖీ కట్టాడని కొన్ని జానపద కథలు చెబుతున్నాయి. దేవదానవుల మధ్య యుద్ధాలు జరుగుతున్న కాలంలో శ్రావణ పౌర్ణమి గొప్పతనం ప్రస్తావనకు వస్తుంది. ఆ రోజే మనం ఇప్పటికీ రక్షాబంధన్‌ ఉత్సవం జరుపుకుంటున్నాం. ఆ యుద్ధంలో దేవతలు ఓటమిలు చవిచూస్తు న్నారు. అప్పుడు దేవతలందరితో కలిసి ఇంద్రుడు దేవగురువు బృహస్పతిని దర్శించాడు. దేవగురువు సూచన మేరకు శ్రావణ పౌర్ణమి నాడు యజ్ఞం నిర్వహించి, అందులో నుండి వచ్చిన శక్తిని ఒక దారంలో నిక్షిప్తం చేసి, రక్షలాగా ఇంద్రుడికి కట్టింది, ఆయన భార్య శచీదేవి (భవిష్య పురాణం). తరువాత విజయం దేవతల వైపు వచ్చింది. అంటే స్త్రీ మూర్తి శచీదేవి కట్టిన రక్ష దేవతలకు శక్తిని కలిగించింది. రాక్షసగణం నుంచి రక్షణ కల్పించింది. పూర్వం రాజులు యుద్ధభూమికి వెళ్లే ముందు రాణులు వీర తిలకం దిద్ది, యుద్ధానికి పంపించేవారు. పురుషుడుకి అవసరమైన శక్తి, ధైర్యం, శుభాశీస్సులు, విజయ కాంక్షను స్త్రీ మూర్తి అందించేది. స్త్రీ శక్తి స్వరూపిణి అని కూడా మనదైన భావన. కాబట్టి సోదరి, భార్య ఇద్దరితో సందర్భాన్ని బట్టి బంధనం కట్టించుకునే సంప్రదాయం ఉంది. స్త్రీపురుష బంధానికి అద్భుత మైన స్థాయి కల్పించిన ఆచారమిది. ప్రపంచంలో ఏ దేశం కూడా మహిళ పేరుతో లేదు. కేవలం మనమే మన భారతదేశాన్ని తల్లిగా భావించు కుంటాం. భారతమాతగా పిలుస్తాం. అందుకే ప్రపంచం మొత్తాన్ని మనం ఒక కుటుంబంలా భావించే తత్త్వం మన రక్తంలో చేరింది. దీని పేరే వసుధైవ కుటుంబకం అనే భావన. హిందూ సంస్కృతి చరాచర సృష్టిలో దైవత్వాన్ని దర్శిస్తుంది. దయగల హృదయమే భగవన్నిలయం అన్న భావన ఈ జాతికి జీవనాడి. దైవత్వంలో మానవత్వాన్నీ, మానవత్వంలో దైవత్వాన్నీ దర్శించడం అతి సహజ లక్షణం. ఈ లక్షణాలు క్రింది వివిధ రూపాలలో దర్శనమిస్తాయి. దయ, ప్రేమ, కరుణ, త్యాగం, సమర్పణ, శరణాగతి, భక్తి, సంవేదన శీలత, సత్యసంధత, శీల సంరక్షణ, ప్రతిజ్ఞా పాలన, పరోపకారం, క్షమాగుణం, ధర్మ సంరక్షణ, దీక్షా ధారణ, అనాథ రక్షణ, అన్నదానం, విద్యాదానం, జీవ కారుణ్యం, కర్తవ్య పాలన, ఇంద్రియ నిగ్రహం, అక్రోధం, శుచిత్వం, ధీరత్వం, అహింస, సర్వ ధర్మ సమభావన, వ్రత నిష్ఠ, భాతృ భావన, శాంతి, సమత్వము, మమత, అనురక్తి, ఆత్మీయత, జ్ఞాన సముపార్జన, వీటన్నింటినీ పుణికిపుచ్చుకున్న హిందూ సమాజం విశ్వమానవ కల్యాణం కోసం దీక్షా కంకణాన్ని ధరిస్తుంది.

పై దృక్పథంతో భారత ప్రభుత్వం తన సహజ తత్త్వచింతన ఆధారంగా విశ్వంలోని వివిధ దేశాలకు సహకారం అందించింది.

  1. నేపాల్‌, ‌టర్కీ దేశాల్లో భూకంపం వచ్చినపుడు వైద్య సహాయం (మందులు, వైద్య బృందాలు) నిత్యావసర వస్తువులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ‌బృందాల ద్వారా సహాయక చర్యలు అందించింది.
  2. ప్రాణాంతకమైన కొవిడ్‌ 19 ‌ప్రబలిన సమయంలో ప్రపంచంలోని దాదాపు 135 దేశాలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ‌సరఫరా చేసి ప్రాణనష్టాన్ని ఆపగలిగింది.
  3. పొరుగు దేశమైన శ్రీలంకలో ఆహారం, ఇంధన సంక్షోభం ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో గోధుమలు, బియ్యం, డీజిల్‌, ‌పెట్రోల్‌తో బాటు ఆర్థిక సహాయం కూడా అందించి తన ఉదారతను చాటుకుంది.
  4. మనం బాగుండాలంటే మన పొరుగువారు కూడా బాగుండాలనే సూత్రం ఆధారంగా అఫ్ఘానిస్తాన్‌లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమల స్థాపనకు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆర్థిక సహకారం అందించారు.
  5. అణుశక్తి ప్రయోగాలు దేశ అభివృద్ధి కోసమే అని ఎలుగెత్తి చాటిన ఏకైక దేశం భారత్‌ ‌మాత్రమే.

నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపించగలిగే ఏకైక మార్గం మన హిందుత్వమే. అవతల భౌతిక సుఖాల వెంట పరుగెత్తే మార్గం ఉన్నది. కానీ అంతిమంగా మనిషి కోరుకునే మానసిక అలౌకిక ఆధ్యాత్మిక ఆనందం కేవలం హిందూ ధర్మంలోనే దొరుకుతుంది. ఎందుకంటే ఇతర ధర్మాలన్నీ ‘‘మేము మాత్రమే మోక్షాన్ని ఇస్తాము… మేము మాత్రమే పుణ్యాత్ములం… మిగతా సమాజాలు, సంస్కృతులన్నీ మోక్షాన్ని, ఆనందాన్ని ఇవ్వలేవు’’ అనే సంకుచిత వాదంతో నిలబడే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే విశాలమైన బంధుభావంతో ఉండే హిందూ ధర్మం వైపు చూసేవారు పెరుగుతున్నారు. హిందూ ధర్మంలో ఉండే సర్వేజనా సుఖినో భవంతు… అనే మంత్రంలో ‘‘సర్వజనులూ సుఖంగా ఉండాలి’’ అనే బంధు భావన ప్రపంచాన్ని హిందూ ధర్మం వైపు చూసేటట్టుగా చేస్తున్నది. కాలం మారుతూనే ఉంటుంది. కానీ కాల పరీక్షకు నిలిచిన అనేక పండుగలు భారతీయ జీవనంలో కనిపిస్తాయి. అలాగే రాఖీ పండుగ కూడా. రాఖీల ఆకృతులు మారాయి. జీవన విధానం కారణంగా, వేగం కారణంగా కుటుంబాలు సుదూరంగా వెళుతున్నాయి. ప్రపంచం ఇంతగా విస్తరించినా రాఖీ బంధన్‌ ‌మాత్రం ఖండాంతరాల ఆవల నుంచి కూడా చేతిని బంధిస్తూనే ఉంది. రాఖీ అన్‌లైన్‌ ‌పేరుతో భారత్‌లో ఒక వ్యవస్థ ఏర్పాటయింది. ప్రపంచంలో సోదరసోదరీ మణులు ఎక్కడ ఉన్నా రాఖీ పంపుకుంటున్నారు. ఒక సజీవ సమాజంలో కనిపించే ఏకత్వ భావన లక్షణమిది. రాఖీ భారతీయ సమాజం రక్షించుకుంటూ వస్తున్న ప్రవాహశీలతకు అద్దం పడుతున్నది.

– కట్టా రాజగోపాల్‌,

‌ప్రాంత ప్రచార ప్రముఖ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌, ‌తెలంగాణ

About Author

By editor

Twitter
YOUTUBE