పెహల్గావ్లో భారతీయ మహిళల నుదుటి కుంకుమ చెరిపేయడం పాకిస్తాన్ చేసిన నూరో తప్పు. ఫలితం- ప్రపంచ పటం మీద ఆ దేశం తుడిచిపెట్టుకు పోయే పరిస్థితులు క్షిపణి వేగంతో బలపడ్డాయి. ఈ నేపథ్యంలో అంకురించినదే ఆపరేషన్ సిందూర్. సర్జికల్ స్ట్రయిక్స్ మోతాదు పొరుగు ఉన్మాదికి ఎంతమాత్రం సరిపోలేదని అర్ధమైన భారత్ అపరేషన్ సిందూర్ను ఎంచుకుంది. అమాయకుల ప్రాణాలను తీయవద్దని, నెత్తుటికాండకు స్వస్తి పలకాలని డెబ్బయ్ అయిదేళ్లుగా చెబుతున్నా పట్టించుకోని పాకిస్తాన్కు బీభత్సమైన తీరులో భారతదేశం తుది హెచ్చరిక చేసింది. అణ్వాయుధాలకీ బెదరబోమని తేల్చింది.
ఎన్ని దాడులు.. ముంబైలో పేలుళ్లు (1993, 2006, 2008), తమిళనాడు పేలుళ్లు (1998), ఎర్రకోట మీద దాడి (2000), జమ్ముకశ్మీర్ అసెంబ్లీ భవనం, భారత పార్లమెంట్ భవంతి మీద (2001) దాడులు, రఘునాథ్ ఆలయం, అక్షరధామ్ మీద దాడులు (2002), వారణాసిలో వరస పేలుళ్లు (2006, 2010), జైపూర్ పేలుళ్లు (2007), హైదరాబాద్ పేలుళ్లు (2013), పఠాన్కోట దాడి, యూరి దాడి (2016).. ఇవి కొన్ని మాత్రమే. జమ్ముకశ్మీర్ను ఎన్నిసార్లు రక్తంతో తడిపారో లెక్కలేదు. ఢిల్లీ, ముంబైలను ఆ ముష్కరులే ఎన్నిసార్లు లక్ష్యం చేసుకున్నారు! ఎంత రక్తపాతం, ఎన్ని మరణాలు.. ఎంత వ్యధ, ఎంతెంత కన్నీరు! కిడ్నాప్లు, హైజాక్లు… ఇక మరొక్క ఉగ్రవాద దాడి జరిగినా అది యుద్ధచర్యగానే పరిగణిస్తామని, ప్రతి దాడి తప్పదని చెప్పేసింది బాధిత భారత్.
ఏప్రిల్ 22న పెహల్గావ్లో 26 మంది అమాయక పర్యాటకులను మతం అడిగి చంపిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం మీద భీకర ప్రతీకారం తీర్చుకుంది భారత్. మతం అడిగి హిందువులను చంపిన పాకిస్తాన్ మతమేదో తెలిసినా, ఆ మతాన్ని ప్రేమించే దేశాలేవీ దానికి వత్తాసు పలకకపోవడమే గొప్ప వైచిత్రి. మే 7వ తేదీ అర్ధరాత్రి మొదలైన గగనతల యుద్ధంతో 100 మందికి పైగా కరుడు గట్టిన ఉగ్రవాదులు ఆనాటి సూర్యోదయం చూడలేదు. దానత్వం మూర్తీభవించిన దాయాది దేశంలోని 9 ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే గురి పెట్టింది భారత సేన. కొన్ని గంటల విరామం తరువాత 11 వైమానిక కేంద్రాలను నామరూపాలు లేకుండా చేసింది. మొత్తం 20 దాడుల. అంతే, అణ్వాయుధాలు సిద్ధం చేశామంటూ, మోదీని లేపేస్తామంటూ బీరాలు పలికిన పొరుగుదేశం రెండు దశాబ్దాలకు కూడా కోలుకోలేని రీతిలో చతికిల పడింది. అయోధ్యలో రామాలయాన్ని కూల్చి మసీదు కడతామని పేలిన పాకిస్తాన్ గుండె మీదే భారత్ దాడి చేసింది. దాడులన్నీ భారత్ను హిందూరక్తంతో తడపడమే ధ్యేయంగా కుట్రలు పన్నుతున్న మూకల మీదే జరిగాయి. ప్రపంచాన్ని ఔరంగజేబ్ కాలానికీ ఇంకా వీలైతే అల్లావుద్దీన్ ఖిల్జీ కాలానికీ వెనక్కి మళ్లిద్దామనుకుంటున్న కుళ్లు మెదళ్లు చిట్లిపోయాయి. ఇంతకీ ఇది పూర్తి స్థాయి యుద్ధం కానేకాదు. భారత సైనిక పాటవానికి చిరు ఉదాహరణ. పెహల్గావ్ ఘటన తరువాత భారత్ సింధు జలాలను ఆపేస్తే, సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేసి కాల్పులకు తెగబడింది పాకిస్తాన్. అంటే మౌఢ్యం వీడక తన అంతాన్ని తానే వీక్షించడానికి ఆ రోగ్ దేశం తహతహలాడుతోంది.
ఆపరేషన్ సిందూర్ రెండు అణ్వాయుధ దేశాల మధ్య ప్రపంచ చరిత్రలో జరుగుతున్న సైనిక చర్య. ఇది పూర్తిగా గగనతలంలో, డ్రోన్ల సాయంతో జరిగింది. కేవలం ఉగ్రమూకల శిబిరాలనే లక్ష్యంగా, సాధారణ పౌరులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తపడిన వ్యూహంతో సాగింది.
భారత సరిహద్దులకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న 9 ఉగ్రవాద శిబిరాలను డ్రోన్లతో ధ్వంసం చేయడమే అపరేషన్ సిందూర్ లక్ష్యం. అదే జరిగింది. 25 క్షిపణులను ప్రయోగించారు. భారత్ గురి పెట్టిన ఉగ్రమూకల శిబిరాలు: మురీద్కే, బహవల్పుర్, తెహ్రాకలాన్, సియాల్కోట్, సయ్యద్ నా బిలాల్, బర్నాలా, కోట్లీ, ముజఫరాబాద్లో (రెండు) శిబిరాల మీద దాడులు జరిగాయి. ఈ శిబిరాలు లష్కరే తాయిబా, జైష్ ఏ మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్కు చెందినవి. సైనిక, వైమానిక, నౌకా దళాలు కలసి చేసిన ఈ దాడి అర్ధరాత్రి 1.05కు మొదలై, 1.30 వరకు సాగింది. కేవలం 25 నిమిషాలే. ఈ దాడులను జాతి మొత్తం స్వాగతించింది. ప్రధాని, ఆయన మంత్రిమండలి హర్షం వ్యక్తం చేసింది. తరువాత ప్రధాని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలసి పరిస్థితి వివరించారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్ సోనియా ఖురేషీ, వైమానిక దళ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, విదేశాంగ కార్యదర్శి మిస్రి దేశానికి తెలియచేశారు.
ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్తాన్ కొంత ఆవేశపడింది. మే 9వ తేదీ అర్ధరాత్రి డ్రోన్లు, క్షిపణులతో భారత్పై విరుచుపడే ప్రయత్నం చేసింది. ఢిల్లీ, పంజాబ్, హరియాణాలలోని భారత సైనిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించింది. దీనికి భారత వాయుసేన దీటుగా సమాధానం చెప్పింది. పాకిస్తాన్కు అత్యంత కీలకమైన సైనిక స్థావరాలను, వైమానిక కేంద్రాలను ఎంపిక చేసుకుని దాడికి దిగింది. అంటే మే 10 అర్ధరాత్రి దాడి చేసింది. నిజంగా ఈ దాడి భారత్-పాక్ తాజా ఘర్షణలో కీలకమైనది. పాక్ను అమెరికాకు పరుగెత్తాలా చేసింది. దాడి చేసిన కేంద్రాలు: చక్లాలా ఎయిర్బేస్, మురిద్ ఎయిర్బేస్, రఫీఖ్ ఎయిర్బేస్, రహీమ్ యార్ఖాన్ ఎయిర్బేస్, సుక్కుర్ ఎయిర్బేస్, నూర్ ఖాన్ ఎయిర్బేస్, సుక్కుర్ ఎయిర్బేస్, చునియన్ ఎయిర్బేస్. ఇందులో నూర్ఖాన్ ఎయిర్బేస్ దాడితో ఆపరేషన్ సిందూర్ మలుపు తిరిగిందని చెబుతు న్నారు. దీని తరువాతే పాకిస్తాన్, భారత్ కాల్పుల విరమణకు అంగీకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి వర్తమానం వెళ్లింది. పాకిస్తాన్ మిలటరీ కార్యకలాపాలల డైరెక్టర్ నుంచి భారత్ మిలటరీ కార్యకలాపాల డైరెక్టర్కు హాట్లైన్ పిలుపు వచ్చింది.
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను, ఉగ్రవాదుల అప్పగింత మీద మాత్రమే ఆ దేశంతో చర్చలు ఉంటాయని భారత్ అమెరికాకు తెగేసి చెప్పింది. కశ్మీర్ మీద మాకు స్పష్టమైన వైఖరి ఉంది. చర్చలకు ఒక్కటే ప్రధానం. అది ఆక్రమిత కశ్మీర్ను తిరిగి అప్పగించడం. అంతకు మించి మాట్లాడడానికి ఏమీ లేదు. వాళ్లు ఉగ్రవాదుల అప్పగింత గురించి మాట్లాడితేనే మేం మాట్లాడతాం. మరొక అంశం ఏదీ చర్చించడానికి మేం సిద్ధంగా లేము. ఈ చర్చలకు వేరొకరు మధ్యవర్తిత్వం వహించాలని మేం కోరుకోవడం లేదు. అని అమెరికాకు చెప్పినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.
పెహల్గావ్ దాడి తరువాత పాకిస్తాన్కు అన్నీ ఎదురుదెబ్బలే తగిలాయి. ఆ దేశానికి జీవనాడి వంటి సింధు జలాలు ఆగిపోయాయి. ఆ దేశ సైన్యాధ్యక్షుడు అసీఫ్ మునీర్ కుట్ర ఫలితమే పెహల్గావ్ దాడి అన్నదే ప్రధానంగా వినిపిస్తున్నది. ఇంతలోనే రక్షణమంత్రి ఖ్వాజా అసీఫ్ మూడు దశాబ్దాలుగా మేం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న మాట నిజమని ఆ దేశ నేషనల్ అసెంబ్లీలో అంగీకరించారు. ఇదే మాట బిలావల్ భుట్టో (మాజీ విదేశాంగ మంత్రి) కూడా చెప్పారు. తాము మదర్సాలో చదివే పిల్లలను సైన్యానికి సహాయకులగా ఉపయోగించుకోవాలని కూడా రక్షణమంత్రి చెప్పడం విశేషం. పుల్వామా దాడి మా పనేనని ఒక సైనికాధికారి కూడా వెల్లడించాడు. మే 7 నాటి ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని దాదాపు అన్ని ఉగ్రవాద శిబిరాలను సర్వనాశనమయ్యాయి. పాకిస్తాన్ నేతలది తలొక దారి అని తేలిపోయింది. రష్యా నుంచి వచ్చి ఎస్ 400 (సుదర్శన చక్రం), రఫేల్ విమానాలు భారత్కు ఎంతో ఉపకరించాయి. ఇందుకు భారత్ ఆ దేశాలకు కృతజ్ఞులై ఉండాలి. ఆపరేషన్ సిందూర్ ప్రపంచానికి ఆధునిక యుద్ధ రీతిని పరిచయం చేసిందన్న కీర్తిని సాధించింది. భారత్ సైనిక పాటవం, ఆత్మ నిర్భర భారత్ ప్రయోజనం లోకానికి, దేశానికి వెల్లడయ్యాయి.
అమెరికా జోక్యంతో మే 10 న పాకిస్తాన్తో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది. పాకిస్తాన్లో నూర్ఖాన్ ఎయిర్బేస్ జరిగిన దాడిలో పక్కనే ఉన్న కిరానా కొండలలోని అణ్వాయుధాగారం దెబ్బ తిన్నదని, అణ్వాయుధాలన్నీ శక్తిని, లక్షణాన్ని కోల్పోయాయని, ఇప్పుడు పాక్ అణు దేశం కాదని వార్తలు వస్తున్నాయి. అణ్వాయుధాలు ప్రయోగం జరగకుండా, కొన్ని లక్షల ప్రాణాలు పోకుండా తామే కాపాడమని అమెరికా అధ్యక్షుడు ప్రకటించుకోవడం విశేషం. ఈ యుద్ధంలో పాక్దే విజయం అంటూ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించడం, ఆ దేశ పౌరులు సంబరాలు చేసుకోవడం అర్ధంకాని విషయం. పాక్ ద్వంద్వ వైఖరి ఇలా ప్రతి అడుగునా బయటపడుతూనే ఉంది. ఒక పక్క సైనిక వ్యవహారాల డైరెక్టర్ల స్థాయి సమావేశంలో సరిహద్దు లలో సైన్యాన్ని తగ్గించుకోవాలని అనుకోవడం ఒకటి. కానీ సరిహద్దులలోల కాల్పులు ఆగకపోవడం మరొకటి. కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు ఆర్భాటంగా పిలుపునిచ్చాడు. కానీ పాక్ వైపు నుంచి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. భారత్ తిప్పికొడు తూనే ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ మే 12న అంత తీవ్ర హెచ్చరిక చేసిన తరువాత కూడా సరిహద్దులలో తుపాకులు మోత ఆగలేదు.
జాగృతి డెస్క్