భారతదేశ ఎల్లలు దాటి విదేశాలలో సంఘం బీజాలు 1947 నాటికే పడినవి. కెన్యా అనే దేశంలో మొట్టమొదటి శాఖ 1947లో ప్రారంభమైంది. కెన్యా తరువాత సంఘం ప్రారంభమైన దేశం మయన్మార్‌గా చెప్పుకునే బర్మా.

డాక్టర్‌ ‌మంగల్‌ ‌సేన్‌ ‌ద్వారా సంఘం బర్మా దేశానికి పరిచయమైంది. ఆయన నిష్ఠాగరిష్ఠుడైన సంఘ ప్రచారక్‌, ‌యువకుడు, అత్యంత ఆకర్షిణీయ వ్యక్తిత్వం కలవాడు. సాహసి, ధైర్యవంతుడు. 19 సంవత్సరాలకే పంజాబు ప్రావిన్స్‌లో అభోటాబాద్‌ (‌నేడు పాకిస్తాన్‌లో ఉంది)కు ప్రచారక్‌ ‌వెళ్లి దేశ విభజన సమయంలో అత్యంత ధైర్యసాహసాలతో తోటి స్వయంసేవకుల ద్వారా హిందూ సమాజాన్ని రక్షించి సురక్షితంగా భారత్‌కు చేర్చినవాడు. సంఘ మొదటి నిషేధ సమయంలో కారాగార జీవితాన్ని అనుభవించి విడుదలయ్యాక, అప్పటికే ఉపాధి కొరకు బర్మా వచ్చిన తల్లిదండ్రులను కలుసు కునేందుకు అక్కడి చేరుకున్నారు. డాక్టర్‌ ‌మంగల్‌ ‌సేన్‌ ‌తల్లిదండ్రులు ఉన్న మాండలే (తిలక్‌ ‌జీవితం గడిపిన స్థలం) నగరానికి వెళ్లి చిన్ననాటి మిత్రులతో తన అనుభవాలను పంచుకున్నారు. మాండలే నగరం దగ్గర్లోనే ఉన్న మేమ్యో ప్రస్తుతం (ప్యిన్‌ ఊఁ ‌ల్విన్‌) ‌నగరాలలోని హిందూ యువకులు సంఘం పట్ల ఆకర్షితులయ్యారు. రంగూన్‌ ‌నగరం దేశ రాజధానితోపాటు హిందూ జనసాంద్రత గల పట్టణం కావడతో అక్కడి నుండి సంఘాన్నే స్థాపించి పటిష్టం చేయాలనుకున్నారు. అప్పటికే భారతదేశం నుండి వివిధ పనులు, వ్యాపారం కొరకు వలస వచ్చిన శిక్షితులైన స్వయంసేవకులు తోడవటంతో ఆయన పని సులువైంది. 1950 జనవరి 14 మకర సంక్రాంతి నాడు భారతీయ స్వయంసేవక్‌ ‌సంఘ పేరుతో సంఘం ప్రారంభమయ్యింది.

సంఘ కార్యక్రమాలు, కార్యపద్ధతి, ప్రార్థన, గణవేష… అన్నీ భారత్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ మాదిరిగానే ఉండే విధంగా నిర్ణయ మయ్యాయి. అనతికాలంలోనే డా।। మంగల్‌ ‌సేన్‌ ‌కృషితో వివిధ నగరాలకు సంఘ శాఖలు విస్తరిం చాయి. ఈ విధంగా కెన్యా తరువాత సంఘం ప్రారంభమైన రెండవ దేశంగా బర్మా నిలిచి పోయింది. ఆయన బర్మాలో నివసించింది కొద్ది కాలమే అయినా సంఘానికి పటిష్టమైన పునాది వేయగలిగారు. తన వీసా పొడగింపు లభించక 1957లోనే ఆయన భారత్‌కు తిరిగి రావలసి వచ్చింది. అయినా సంఘ కార్యక్రమాలు యథావిధిగా జరుగుచూనే ఉండేవి.

 ధీర్‌జీ రాక నూతన అధ్యాయానికి నాంది

1952లో శ్యామప్రసాద్‌ ‌ముఖర్జీ తన బర్మా దేశ యాత్రలో సంఘ కార్య విస్తరణ అవకాశాలు, అవసరాన్ని గుర్తించి భారత్‌ ‌వచ్చాక గురూజీతో చర్చిస్తూ ఒక యువక ప్రచారక్‌ను బర్మా సంఘ కార్యం కొరకు కేటాయిస్తే బాగుంటుందని చెప్పారు. అప్పటి నుండి ప్రయత్నాలు జరిగినా 1956లో రాంప్రకాశ్‌ ‌ధీర్‌జీను పంపారు. ధీర్‌జీ అక్కడే జన్మించడం, తల్లిదండ్రులు అక్కడే ఉండటంతో పని ఇంకా సులువైంది. అప్పటికే పంజాబ్‌లోని రోహతక్‌ (‌ప్రస్తుతం హర్యానా) జిల్లా ప్రచారక్‌గా ఉన్న అనుభవం ఆయనకు తోడైంది.

ప్రచారక్‌గా ధీర్‌జీ రాక స్థానిక కార్యకర్తలకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. నూతన ప్రదేశాలలోకి సంఘ శాఖలు విస్తరించాయి. హిందువులు ఎక్కువగా ఉండే చౌతగా, జియాహడీ నగరాలలోని గ్రామాలకు కూడా సంఘ శాఖల విస్తరణ ప్రారంభమయ్యింది. 1957వ సంవత్సరంలో మొదటిసారిగా శిక్షావర్గ ప్రారంభమయ్యింది. అదే సంవత్సరంలో శిబిరాలు కూడా ప్రారంభమయ్యాయి. స్థానిక యువకులు తమ జీవితాలను సంఘ కార్యం కొరకు, ధర్మకార్యం కొరకు కేటాయిస్తూ ప్రచారకులుగా రావటం మొదలైంది. అందులో అనిరుధ్‌ ‌యాదవ్‌ ‌జీ, భగవాన్‌ ‌వర్మ,  రామేశ్వర్‌, ‌గంగా ప్రసాద్‌జీ, సుభాష్‌జీ ఆహుజా, గజాధర్‌ ‌రాయ్‌లు ప్రముఖులు.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొన్నాళ్లకే బర్మా దేశానికీ స్వాతంత్య్రం వచ్చింది. బ్రిటీష్‌ ‌వలస పాలన నుండి 1948 జనవరి 4న బర్మా విముక్తి పొందింది. స్వాతంత్య్రం పొందిన తొలినాళ్ల నుండే బర్మా వేర్పాటువాదశక్తుల సమస్యలను ఎదుర్కొం టోంది. ఆ దేశంలో ముఖ్యంగా 9 భాషల ప్రజలున్నారు. వారు తమ భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని, స్వతంత్రంగా పాలించుకుంటామని పోరాటాలు ప్రారంభించారు. ఆ పరిస్థితులలో దేశాన్ని ఒక్కటిగా నిలుపుతూ, ‘భాష ఏదైనా మనమంతా ఒక్కటే’ అనే భావాన్ని వారిలో కలిగించాలన్నదే అక్కడి దేశ నాయకులను వేధించిన ప్రశ్న. సరిగ్గా ఆ సమయంలోనే సంఘ కార్యకలాపాలు బర్మాలో వ్రేళ్లూనుకోవడం అక్కడి నాయకత్వాన్ని ఆలోచింప చేసింది. వారు సంఘాన్ని నిశితంగా పరిశీలించటం మొదలుపెట్టారు. అందులో ముఖ్యంగా ‘జస్టిన్‌ ఊ ‌ఛాన్‌ ‌ఠూన్‌’ (U chan htun) ఒకరు. 1952లో  శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీ బర్మా పర్యటన నుండి సంఘ కార్యాన్ని నిశితంగా పరిశీలించటం మొదలుపెట్టారు. ధీర్‌జీ బర్మా వచ్చాక ఆయన సంఘానికి ఇంకా సన్నిహితుడైనాడు. గురూజీ 50 సంవత్సరాల జయంతి సందర్భంగా విడుదలైన రెండు పుస్తకాలను చదివి గురూజీ ఆలోచనలు, సంఘ భావాలతో ప్రేరణ పొందారు. 1956వ సంవత్సరములో జరిగిన 6వ ప్రపంచ బౌద్ధ మహాసమ్మేళనంలో సంఘం ద్వారా ప్రదర్శితమైన బుద్ధ ప్రదర్శన ఆయనను ఎంతగానో ప్రభావితం చేసింది. నియమితంగా సంఘ కార్యక్రమంలో పాల్గొంటూ, సంఘ శిక్షావర్గలకు దేశ నాయకులను తీసుకురావటం ప్రారంభించారు. అప్పటికే అనేక అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న దేశాన్ని ఒక్క త్రాటిపైకి తీసుకురావడానికి యువత ద్వారా దేశభక్తి నిర్మాణం చేయటమే మార్గం అని తోచింది. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సర్‌సంఘచాలక్‌ శ్రీ ‌గురూజీతో కలిసి చర్చించడానికి 1959 డిసెంబర్‌లో  రాంప్రకాశ్‌ ‌ధీర్‌జీతో పాటు భారత్‌ ‌వచ్చారు.  గురూజీతో చర్చిస్తూ, సంఘం కేవలం భారతీయతకే కాదు, తమకూ  అవసరమన్నారు. అయితే సంఘం తన పేరుతోపాటు ప్రార్థనను కూడా మార్చాల్సి ఉంటుంది. కారణం అప్పట్లో సంఘం పేరు ‘భారతీయ స్వయంసేవక సంఘ్‌’. ‌ప్రార్థన కూడా ‘నమస్తే సదా వత్సలే మాతృభూమే’తో ప్రారంభమై ‘భారత్‌ ‌మాతాకీ జై’ అనే నినాదంతో ముగుస్తుంది. కనుక బర్మా యువతకు ఎలా చేరగలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. గురూజీ సానుకూలంగా స్పందించారు. శ్రీ భాయీ మహావీర్‌ను బర్మా పంపిస్తూ, వారి పర్యటనలో చర్చించి నిర్ణయించ వలసిందిగా సూచించారు.

1961లో జరిగిన భాయి మహావీర్‌జీ పర్యటన బర్మా సంఘ చరిత్రలో ఒక మైలురాయి. సంఘం పేరును ‘సనాతన ధర్మ స్వయంసేవక సంఘం’గా నిర్ణయించారు. అప్పటికే గురూజీ ప్రార్థనలోని భావాలు ఏ మాత్రం మార కుండా ‘వందామహే సకల మంగళ ధర్మ సూత్తాన్‌’’ అని రాయించారు… చేసే ప్రతిజ్ఞ కూడా తదనుగుణంగా మారింది. దాంతో.. ఇపుడు బర్మాలోని స్థానిక బౌద్ధులు కూడా సంఘానికి రావచ్చు. సానుకూల వాతావరణం ఏర్పడుతున్న ఆ సమయంలోనే దేశాన్ని దురదృష్టం వెంటాడింది. చక్కగా సాగుతున్న ప్రభుత్వాన్ని కూలదోసి 1962లో సైన్యం రాజ్యాన్ని హస్తగతం చేసుకుంది. అయినా సంఘం స్థానిక యువతను ఆకర్షిస్తూ ‘శ్వేబో’ అనే నగరంలో స్థానిక నాగా ప్రజల కోసం అనాథ శరణాలయాన్ని ప్రారంభించింది. ఆ శరణాలయ కేంద్రంగా ‘శ్వేబో’ నగరంలో స్థానిక యువకులతో నాలుగు శాఖలు కూడా ప్రారంభ మయ్యాయి. ఈ వాతావరణ మంతా కొద్దిరోజులే. 1964లో సైనిక పాలన ద్వారా వస్తువుల జాతీయకరణ జరగడంతో దేశం ఒక్కసారిగా అగాథంలోకి పడిపోయింది. ప్రజల వ్యాపారా లన్నిటిని ప్రభుత్వం హస్తగతం చేసుకుంది. బౌద్ధులను తప్ప అన్యులనందరినీ ప్రభుత్వోద్యోగాల నుంచి తొలగించింది. ప్రైవేటు పాఠశాలలను స్వాధీన పరచుకుంది. రూ.100, రూ.50 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో రూ.90, రూ.45 నోటును ప్రవేశపెట్టింది. సామాజిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. వలసలు ప్రారంభమయ్యాయి. హిందువులు పెద్ద సంఖ్యలో భారతదేశానికి వలస వచ్చారు. అలా సముద్ర మార్గాం ద్వారా వచ్చినవారి సంఖ్య 4 లక్షలు కాగా, టమ్మూ – మోరే మార్గం ద్వారా నడకపై వచ్చిన వారి సంఖ్య కూడా అంతే ఉంటుంది.

క్లిష్ట సమయంలో సంఘం విధులు

కార్యకర్తల కుటుంబాలు అనేకం భారత్‌కు వెళ్లటంతో శాఖలు అన్నీ ఆగిపోయాయి. ప్రచార కుందరూ రంగూన్‌కు చేరుకున్నారు. హిందువు లంతా పలాయనమవడంతో ప్రచారకులు వెళుతున్న ఆ ఒక్క శాఖే నిలిచింది. ఆర్థిక వనరులు లేక ప్రచారకుల భోజనమే కష్టమైన పరిస్థితిలో… ఇబ్బందిగా ఉంటే ప్రచారకుందరు భారత్‌కు వచ్చేయాలని అప్పటి సర్‌ ‌కార్యవాహ మాధవరావు మూలే ఒక ఉత్తరంలో పేర్కొన్నారు. అటువంటి పరిస్థితులలో అక్కడ మిగిలి ఉన్న హిందువులను సంఘటిత పరుస్తూ అక్కడే ఉండాలనీ నిర్ణయించు కుని పనిని తిరిగి ప్రారంభించారు ధీర్‌జీ. ‘గృహ నిర్బంధంలో’ ఉన్న జస్టిస్‌ ఊ ‌ఛాన్‌ ‌ఝాన్‌ను ధీర్‌జీ కలిసినపుడు ‘‘ఎలాగైనా సంఘాన్ని కాపాడండి. అవసరమైతే కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్నా సరే – అదే ఈ దేశంతో పాటు దక్షిణ తూర్పు ఆసియా దేశాలకు ఆశాకిరణం’’అని అన్నారు. ఆ మాటల ప్రేరణతో అనేక కష్టాలను ఓరుస్తూ సంఘ ప్రచారకులు తమ పనిని తిరిగి ప్రారంభించారు.

హిందూ ధర్మరక్షణ సమితి ఏర్పాటు

విదేశంలో ఉన్న కారణంగా హిందూ బాలబాలిక లకు హైందవ ధర్మం పట్ల, ఆచారాల శాస్త్రీయత గురించి అవగాహన తక్కువగా ఉంటుంది. మయ న్మార్‌లో హిందువుల• తమ పండుగలు, పబ్బాలు జరుపుకుంటున్నా వాటిపట్ల సరియైన అవగాహన ఉండేది కాదు. ఈ కారణంగా హిందువు అంటే ఇతర మతాల కన్నా తక్కువ అనే అపోహ బాల బాలికల్లో ఏర్పడుతుండేది. వారిలోని ఆత్మన్యూనతా భావనలు తొలగించి హిందూ ధర్మం పట్ల సరైన అవగాహన కలిగించేందుకు 1971లో హిందూ ధర్మశిక్షా సమితి ఏర్పడింది. ప్రతి సంవత్సరం వేసవి సెలవులలో బాలబాలికలకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ధర్మబోధ చేయటం ప్రారంభించింది. నాలుగు స్థాయులలో పరీక్షలు జరిగేవి. అందుకోసం తగు పాఠ్య పుస్తకాలు శిశు, ఒకటవ భాగం, రెండవ భాగము, ప్రగతి భాగం అనే భాగాలుగా రూపొం దాయి. బర్మా హిందువులలోని వివిధ భాషలను దృష్టిలో పెట్టుకుని హిందీ, తమిళం, తెలుగు, బర్మీస్‌ ‌భాషలలో బోధన, పరీక్షలు ఉండేవి. చక్కటి అంశాలతో ఉత్తీర్ణులైన బాలబాలికలకు ప్రోత్సాహక బహుమానాలు ఉండేవి.

1971లో రంగూన్‌లో చిన్నగా ప్రారంభమైన హిందూ ధర్మశిక్షణ కేంద్రాలు దేశ వ్యాప్తంగా విస్తరించాయి. ఇప్పటికీ ప్రతి సంవత్సరము 1500-2000 మంది బాలబాలికలు ఈ పరీక్షలలో పాల్గొంటూ ఉంటారు.

– బండి జగన్మోహన్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రచారక్‌, ‌విశ్వవిభాగ్‌

About Author

By editor

Twitter
Instagram