టీఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ మరోసారి ఫూల్‌ అయ్యారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మరోసారి సహనం కోల్పోయారు. అంతెత్తున ఎగిరిపడ్డారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. గులాబీ పార్టీ నాయకులు ఫూల్స్ ‌కావడానికి, కేసీఆర్‌ ‌సహనం కోల్పోవడానికి సంబంధం ఏముందన్న సందేహం కలుగుతుందా? ఉంది, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తన సహజశైలిలో కోపానికి రావడం, ఏకంగా మంత్రులనే అందరిముందే ఎడా పెడా తిట్టడమే దీనికి కారణం.

దాదాపు పదిహేను రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనా.. రోజుకో మంత్రి, ఎమ్మెల్యే అదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నా, విపక్షాల నేతలు విమర్శలు చేస్తున్నా, మీడియాలో పూటల తరబడి చర్చలు నడిచినా మిన్నకుండి పోయిన కేసీఆర్‌.. ‌పార్టీ కార్యవర్గ సమావేశంలో మాత్రం ఎగిరెగిరి పడ్డారు. అప్పటిదాకా తనకేమీ తెలియనట్లు, అప్పుడే మొత్తం అవగతం అయినట్లుగా వ్యవహరించారు.

ఈ నెల 7న ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్‌ ‌కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఏ జిల్లాలో ఆ వేడుకలు నిర్వహించాలో తర్వాత స్పష్టత వస్తుందన్నారు. రెండు నెలల పాటు రాష్ట్రమంతటా తిరుగుతానని స్వయంగా కేసీఆర్‌ ‌ప్రకటించారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని పునరుద్ఘాటించారు. మరో పదేళ్లదాకా తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సంచలన ప్రకటన చేశారు. కేసీఆర్‌ ‌పేల్చిన ఈ బాంబు తెలంగాణ మొత్తంలో ఒకరకంగా ప్రకంప నలు సృష్టించింది. ఇన్నాళ్లుగా జోరుగా జరుగుతున్న చర్చకు చుక్క పెట్టింది.

అయితే కేసీఆర్‌ ఈ ‌ప్రకటన చేయడానికి కారణముంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఓ సంచలన రాజకీయపరమైన ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కుమారుడు కేటీఆర్‌ ‌సీఎం కాబోతున్నాడని, ఇవాళో.. రేపో కేసీఆర్‌ ‌స్వయంగా ఈ ప్రకటన చేస్తారని, ముహూర్తం కూడా కుదిరిందని మీడియా, సోషల్‌ ‌మీడియా కోడై కూశాయి. మొదటగా మంత్రి ఈటల రాజేందర్‌ ‌నోటివెంట ఈ మాట వచ్చింది. ఆ తర్వాత వరుసబెట్టి నాయకులంతా కోరస్‌ అం‌దుకున్నారు. కేటీఆరే మా నేత అని, కాబోయే సీఎం కేటీఆరేనని సందర్భం కల్పించుకొని మరీ బహిరంగ ప్రకటనలు చేశారు. ఆ ప్రకటనలు మీడియాలో ప్రముఖంగా ప్రచురిత మయ్యేలా, ప్రసారమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

అంతేకాదు, కొందరు నేతలు కేటీఆర్‌కు ముందస్తుగా బహిరంగంగానే అభినందనలు చెప్పారు. కేటీఆర్‌ ‌సీఎం అయితే తప్పేంటంటూ మాట్లాడారు. కేటీఆర్‌ ‌ముఖ్యమంత్రి కావడం ఖాయమనే అభిప్రాయంతో చాలా మంది మంత్రివర్గంలో చోటు కోసం ఇలాంటి ప్రయత్నాలు చేశారు. కేటీఆర్‌ ‌ముందే, ఆయన పాల్గొన్న సభా వేదికపై నుంచే ఈ సంభోదనలు చేశారు. కేటీఆర్‌నే స్వయంగా కాబోయే ముఖ్యమంత్రి అంటూ సంభోదించారు. ఆ సమయంలో ఆయన ముసిముసినవ్వులు నవ్వడం తప్ప ఎలాంటి కామెంట్‌ ‌చేయలేదు. ఆ పరిణామం కూడా జరుగుతున్న ప్రచారానికి ఆజ్యం పోసింది. ఇంకేముంది.. మీడియా దీనిని ప్రధానాంశంగా ఎంచుకుంది. రోజుల తరబడి దీనిపైనే చర్చలు, వార్తలు, కథనాలు, ప్రత్యేక కథనాలు అందించింది.

ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన టీఆర్‌ఎస్‌ ‌కార్యవర్గ సమావేశంలో కేసీఆర్‌ ‌స్కూల్‌ ‌టీచర్‌గా మారిపోయారు. మంత్రులు, ముఖ్య నాయకులు, కార్యవర్గ సభ్యులంతా విద్యార్థుల మాదిరిగా పరిగణనలోకి వచ్చారు. కేసీఆర్‌ ‌పూనకం వచ్చినట్లు శివాలెత్తిపోయారు. చాలా ఉద్వేగంగా మాట్లాడారు. నన్ను రాజీనామా చేయాలని మీరంతా డిమాండ్‌ ‌చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కర్రు కాల్చి వాత పెడతానని హెచ్చరించారు. ఎక్కడైనా నోరుజారినట్లు మాట్లాడితే పార్టీ నుంచి పీకి పారేస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా గీత దాటితే తాట తీస్తా అంటూ హెచ్చరిం చారు. మరోసారి ఎవరైనా ఇలా మాట్లాడితే బండకేసి కొట్టి బయటకు విసిరేస్తా అన్నారు. సీఎం మారుతు న్నారని నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు.. నేను సీఎంగా ఉంటే మీకు నచ్చట్లేదా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు, మరో పదేళ్లు సీఎంగా తానే కొనసాగుతానని తేల్చి చెప్పారు. కేటీఆర్‌ను సీఎం చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని పూర్తిగా ఖండించారు. సీఎంగా తానే ఉంటానని అసెంబ్లీ సాక్షిగా ఇంతకుముందే చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. తానే స్వయంగా ఈ ప్రకటన చేసిన తర్వాత కూడా ఎందుకు మళ్లీ దాని గురించి మాట్లాడుతున్నారంటూ కేసీఆర్‌ అసహనం వ్యక్తంచేశారు. తన ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని, సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడొద్దని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. సీఎం మార్పు ఏదైనా ఉంటే తన వైపు నుంచి అధికారికంగా ప్రకటన వస్తుందని చెప్పారు.

వాస్తవానికి మంత్రుల ప్రకటనలు, ఎమ్మెల్యేల అభివాదాలు కేసీఆర్‌కు తెలియకుండా జరిగాయను కోవడం అమాయకత్వమే అంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్‌ ‌మీడియాలో పతాక శీర్షికల్లో వచ్చిన వార్తలను గురించి తెలియనట్లు నటించడం, అప్పటికప్పుడే తనకా విషయం తెలిసినట్లు సమావేశంలోనే అగ్గిమీద గుగ్గిలమవడం చూస్తుంటే అనుమానాలు కలుగు తున్నాయని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కేసీఆర్‌ ‌తాజా వ్యాఖ్యలు, విమర్శలు, తిట్లు, హెచ్చరికలు ఓ పథకం ప్రకారం చేసి ఉంటారన్న సందేహాలు కలుగుతున్నాయంటున్నారు.

కేటీఆర్‌ను సీఎం చేస్తారన్న ప్రచారం ఉధృతంగా సాగుతున్న సమయంలోనే విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక దళితుడినే సీఎం చేస్తానంటూ బహిరంగంగా, మీడియా వేదికగా ప్రకటించిన కేసీఆర్‌.. ఆ అం‌శాన్ని పక్కనపెట్టడం రెండుసార్లు తానే సీఎం పీఠాన్ని అధిష్టించడం, ఇప్పుడు కుమారుడికి ఆ సీటు అప్పగించాలని ప్రయత్నించడాన్ని విపక్షాలు ఎండగట్టాయి. అంతేకాదు, ఎస్సీ లేదా బీసీ వర్గానికి చెందినవారిని  ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్‌ను ఇరకాటంలో పెట్టాయి. ఆ కోణంలో కూడా విస్తృతంగా చర్చ జరిగింది. దీంతో ఇప్పటికిప్పుడు సీఎం మార్పు సరైన సమయం కాదనుకున్న కేసీఆర్‌.. ‌కార్యవర్గ సమావేశంలో అలా వ్యాఖ్యానించి ఉంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

– సుజాత గోపగోని, 6302164068, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram