– రాజనాల బాలకృష్ణ, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

ఆంధప్రదేశ్‌లో క్రైస్తవ మతప్రచారం, మతమార్పిళ్లు జోరుగా సాగుతున్నాయి. ఇది బహిరంగ రహస్యం. మరోవైపు హిందూ దేవీదేవతల విగ్రహాల ధ్వంసకాండ అంతే యథేచ్చగా సాగుతోంది. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. ఈ చలనరాహిత్యానికి కారణం ఏమిటి? ఇన్ని సంఘటనలు జరుగుతుంటే, ప్రజల్లో ఇంత పెద్దఎత్తున ఆందోళన, ఆగ్రహం వ్యక్తమవుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మౌనంగా, ఒకింత చిద్విలాసంగా, ప్రేక్షక పాత్ర వహించడం ఏమిటి? ఆయన అన్యమతస్తుడు కావడమే అందుకు కారణమా? దేవాదాయశాఖ మంత్రితో పాటు ఇతర మంత్రులు, అధికార పార్టీ నాయకులు హిందువుల మనోభావాలను మరింతగా గాయపరిచే విధంగా, బొట్టుపెట్టుకున్న అన్యమతస్తుల్లా మాట్లాడుతున్న మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? అలాగే, ముఖ్యమంత్రి మత విశ్వాసాలు ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభావితం చేస్తున్న తీరును ఏ విధంగా చూడాలి?


ఎన్నో ప్రశ్నలు హిందువులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవిధంగా భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా, రామతీర్థంలో హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రమూర్తి విగ్రహ శిరచ్ఛేదన ఘటన హిందూ సమాజాన్ని కలవరపరిచింది, కంటతడి పెట్టించింది. అయినా అసలు విషయాన్ని పక్కనపెట్టి దోషులను పట్టుకుని శిక్షించే ప్రయత్నం చేయకుండా ఇంకెవరో ఈ దుర్మార్గ చర్యలకు పాల్పడ్డారని నెపాన్ని, నేరాన్ని ఎవరిమీదకో నెట్టి ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది.

ఒకవేళ ముఖ్యమత్రి, మంత్రులు ఆరోపిస్తున్నట్లుగా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నాయనే అనుకున్నా, రాజకీయ గెరిల్లా యుద్ధం సాగుతోందన్న పలుకులు కూడా నిజమే అనుకున్నా, ప్రభుత్వం ఏ మంచిపని తలపెట్టినా మంచికి మసిపూసే ప్రయత్నంలో భాగంగానే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయన్న ముఖ్యమంత్రి వాదనను అంగీకరించినా.. మరి ఇన్ని దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది. ఎందుకంటే, గతంలో ఆయన ఎవరైనా.. ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాబట్టి, నేరం నాది కాదు అని తప్పించుకునే వెసులు బాటు జగన్‌కి లేదు. మీ ప్రతిష్టను దెబ్బతీసేందుకే అయినా మీ ప్రత్యర్థులు వరసగా నేరాలకు పాల్పడుతుంటే మీరేం చేస్తున్నారు, మీ పోలీసు యంత్రాంగం ఏం చేస్తోంది అన్న ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి.

ఈ ప్రశ్నలు, అనుమానాలు, సందేహాలకు మూలం జగన్‌ ‌మతవిశ్వాసం. ఎవరి వ్యక్తిగత మత విశ్వాసాలను ఎవరూ ప్రశ్నించరు. కానీ, వ్యక్తికీ, వ్యవస్థకు (ముఖ్యమంత్రి/ప్రభుత్వం) మధ్య ఉండవలసిన గీత చెరిగిపోతే మాత్రం ఎవరైనా ప్రశ్నించక తప్పుదు. ఒకవేళ ఈ నేరాలు జగన్‌ ‌రాజకీయ ప్రత్యర్థులే చేశారని అనుకున్నా.. సరైన సమయంలో జగన్‌ ‌ప్రభుత్వం స్పందించి ఉంటే, చర్యలు తీసుకుని ఉంటే ఆయన వాదనకు ఎంతో కొంత బలం చేకూరేది. కానీ ఆ పని చేయలేదు. అంతేకాదు, అంతర్వేది రథాన్ని తగులపెట్టిన దుర్మార్గులను రక్షించేందుకు పోలీసులు తేనె పట్టు, తాటాకులు కథను చక్కగా అల్లారు. అంతకుముందు జరిగిన అనేక సంఘటనలకు మతి స్థిమితం లేనివారు చేసిన పనిగా మతిభ్రమించిన ప్రకటనలు చేశారు. ఏ ఒక్క సంఘటనలోనూ ఇంతవరకు దోషులను గుర్తించలేదు. అసలు, ఆ ప్రయత్నమే లేదు. అంతర్వేది విషయంలో సీబీఐకి లేఖ రాసి చేతులు దులిపేసుకున్న పోలీసులు అదే అంతర్వేదిలో చర్చి మీద రాళ్లు వేసిన వారిని వెతికి, వేటాడి పట్టుకున్నారు, అరెస్ట్ ‌చేశారు. బెయిల్‌ ‌రాకుండా అన్నివిధాలుగా అడ్డుకున్నారు. ఇది జగన్‌ ‌ప్రభుత్వ నైజాన్ని, నిజరూపాన్ని ప్రపంచం ముందుంచింది. జగన్మోహన్‌రెడ్డి మత విశ్వాసాల ప్రభావం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలా ప్రభావితం చేస్తోందో అర్థమయ్యేలా చేసింది. ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం అనే అభిప్రాయం బలపడేందుకు దోహదం చేసింది.

ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. గత పద్దెనిమిది నెలల వైసీపీ పాలనలో అనేక హిందూ దేవాయాలపై దాడులు జరిగాయి. విగ్రహాలు ధ్వంసమయ్యాయి. రథాలు దగ్ధమయ్యాయి. ఇంకా అనేక విధాలుగా హిందువులను అవమానాలకు, ఆవేదనకు గురిచేసే సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయినా ముఖ్యమంత్రి పెదవి విప్పలేదు. మౌనం వీడలేదు. అదీగాక, రాష్టంలోని ప్రసిద్ధ దేవాలయా లలో అన్యమతస్తుల ఆగడాలు, దేవాలయ ఆస్తుల విక్రయానికి ప్రభుత్వపరంగా సాగిన ప్రయత్నాలకు సంబంధించి కూడా ఏనాడు మాట్లాడలేదు. ఇది సమాజానికి ఎలాంటి సంకేతాలు పంపుతుందో వేరే చెప్పనక్కర లేదు. గ్రామాల్లో జరుగుతున్న క్రైస్తవ మతప్రచారం, కొత్తగా వెలుస్తున్న చర్చిలు, ఊరూరా జగన్‌ ‌పేరున, ఆయన బొమ్మతో కనిపించే సువార్త ప్రచార పోస్టర్లు, ఫ్లెక్సీలు.. రాష్ట్రంలో ముందెన్నడూ లేనివిధంగా జరుగుతున్న మతప్రచారం, మత మార్పిళ్లు దీని వెనక ప్రభుత్వ ప్రోత్సాహం ఉందని చెప్పకనే చెపుతున్నాయి.

ప్రభుత్వం మాది అనే ధోరణి క్రైస్తవ సంస్థలు, క్రైస్తవ సమాజంలో కనిపిస్తోంది. చివరకు ముస్లింలకు ఇచ్చినట్లుగానే మాకు సొంత దేశం ఇవ్వండి అనేంత వరకు క్రైస్తవ ప్రచారకులు వెళ్లారు. అయినా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యలు లేవు. అంతేకాదు, అలాంటి ప్రచారాలకు పాల్పడుతున్న పాస్టర్లకు ప్రభుత్వ ఖజానా నుంచే నజరానాలు అందిస్తున్నారు.

పాస్టర్లకు నెల జీతాలు ఇచ్చే ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? ఇలా ఒక మతాన్ని ప్రోత్సహించడం, రాజ్యాంగ విరుద్ధం కాదా? మరోవైపు ఎండోమెంట్స్ ‌పరిధిలో లేని ధూప, దీప నైవేధ్యాలకు నోచుకోని దేవాలయాల పూజారులకు నెల జీతాలు కాదు కదా, కనీసం రక్షణ కల్పించే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడంలేదు. ఎండోమెంట్స్ ‌పరిధిలో లేని దేవాలయాల రక్షణ బాధ్యత ప్రభుత్వానిది కాదని వైసీపీ మంత్రులు బాహాటంగానే ప్రకటిస్తున్నారు. అంటే, ప్రభుత్వానికి హిందువుల పట్ల మాత్రమే కాదు, హిందూదేవుళ్ల పట్ల కూడా ఎలాంటి చిన్నచూపు ఉందో చెప్పకనే చెపుతోంది. అంతేకాదు, ఇంకొన్ని రోజులు పోతే, ఈ ధోరణి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో రాజుకున్న మత విద్వేషం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో, చివరకు హిందూ దేవాలయాలే కనుమరుగయ్యే పరిస్థితి దాపురిస్తుందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.

మరోవైపు వైసీపీ నాయకులు గాయపడిన హిందువుల మనోభావాలను మరింతగా గాయపరిచే విధంగా చేస్తున్న వ్యాఖ్యలు కూడా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపేలా చేస్తున్నాయి. అంతర్వేది రథదహనం.. అదే క్రమంలో అంతకుముందు, తర్వాత జరిగిన సంఘటనల నేపథ్యంలో కొడాలి నాని, తాజాగా రామతీర్థం విషయంలో స్వయంగా దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ‌చేసిన వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లుగా ఉన్నాయి. అయినా, ముఖ్యమంత్రి వారిని కనీసంగా మందలించలేదు సరికదా పరోక్షంగా ప్రోత్సహిస్తున్నరేమో అన్న అనుమానం కలిగేలా వ్యవహరిస్తున్నారు. అందుకే కావచ్చు, అమాత్యులు స్థాయి మరిచి ‘వెధవల’ స్థాయి వ్యాఖ్యలకు దిగజారారు.

అశోక్‌ ‌గజపతిరాజు టీడీపీ నాయకుడే కావచ్చు. కానీ, ఆయన వంశానికి ఒక చరిత్ర ఉంది. ఎన్నో దేవాలయాలు కట్టించిన ఘనచరిత్ర గల వంశం వారిది. వేల ఎకరాల భూములను దేవాలయాలకు ఇచ్చిన చరిత్ర వారిది. అలాంటి, వంశానికి చెందిన వ్యక్తిపై దేవాదాయ మంత్రి చేసిన వ్యాఖ్యలు హిందూసమాజం మొత్తాన్ని అవమానించే విధంగా ఉన్నాయి. అలాగే ఇతర హిందూధార్మిక సంస్థలతో కలిసి భారతీయ జనతా పార్టీ సాగిస్తున్న ధర్మ పోరాటాన్ని అణచివేయాలనుకుంటే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు. హిందూధర్మ ఆగ్రహాన్ని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాజకీయంగా ఎదుర్కోవాలని అనుకుంటే అందుకు రాజకీయ మూల్యం చెల్లించక తప్పదు.

ఉన్నమాటంటే ఉలుకెందుకో..

ఆంధప్రదేశ్‌లో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ అలజడులు సృష్టించాయి. నిజానికి బండి సంజయ్‌ ‌వ్యాఖ్యల్లో తప్పు పట్టవలసిందేమీ లేదు. ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం జగన్మోహన్‌రెడ్డి నమ్మే మత విశ్వాసాలకే పెద్దపీట వేస్తోందన్నది ప్రత్యక్షంగా కళ్ల ముందు కనిపిస్తున్న సత్యం. పాస్టర్లకు నెల నెలా జీతాలు ఇవ్వడం మొదలు, హిందూ దేవాలయాలపై జరుగతున్న వరస దాడుల విషయంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య ధోరణి వరకు, టీటీడీ సహా దేవాలయాల ఆస్తులను కొల్లగొట్టేందుకు సాగుతున్న కుట్రలు మొదలు, హిందూ ఆలయాలలో అన్యమతస్తులను అధికార పీఠంపై కూర్చోపెట్టడం వరకు ఏ విషయంలో చూసినా జగన్‌ ‌వేస్తున్న అడుగులు, సాగిస్తున్న కుట్రలు, కుతంత్రాలు వైసీపీ క్రైస్తవ పార్టీ, బైబిల్‌ ‌పార్టీ అనే విధంగానే ఉన్నాయి. కాబట్టి తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగే ఉపఎన్నిక, హిందువులు విశ్వసించే భగవద్గీతకు, క్రైస్తవులు విశ్వసించే బైబిల్‌కు మధ్య జరిగే రాజకీయ పోరాటంగా బండి సంజయ్‌ ‌పేర్కొన్నారు. జరుగుతున్న వాస్తవాన్నే సంజయ్‌ ‌తనదైన శైలిలో చెప్పారు. అందులో తప్పేముంది. ఉన్న మాటంటే ఉలుకేందుకో.

About Author

By editor

Twitter
Instagram