గాంధీజీ ప్రభావంతో కలం పట్టి జాతీయోద్యమ భావాలను ముమ్మరంగా అక్షరీకరించిన జాతీయ మహాకవి తుమ్మల సీతారామమూర్తి. జాతీయాభిమానం ఆయన జీవనాడి. రాష్ట్రాభిమానం ఆయన ఊపిరి. అందుకే ‘రాష్ట్ర సిద్ధి కొరకు రక్తంబుగార్చి’ రాష్ట్రగానం ఆలపించాడు. మాతృభాషాభిమానం ఆయనకు ప్రాణం. ప్రతి పద్యంలో, పదంలో తెలుగు సొగసుల పరిమళాలను గుబాళింపజేసిన స్వచ్ఛమైన తెలుగుకవి. నైతిక పునరుజ్జీవన వికాసం, విశ్వహిత కాంక్ష, మానవతావాదం, పీడిత మానవ సానుభూతి గ్రామీణశోభ, శ్రామిక జన సంక్షేమం, దోపిడీకి నిరసనలు ఆయన కవితా లక్ష్యాలు.

తుమ్మలవారు గుంటూరు జిల్లా కావూరులో 1901 డిసెంబరు 25వ తేదీన ఒక సాధారణ కర్షక కుటుంబంలో జన్మించారు. ‘నా తండ్రి సుకృతంబు నాకు శ్రీరామరక్ష’ అని తండ్రి నారయ్య గారి గురించి చెప్పారు.

‘మడికొక్క పూట బడికొక్క పూటగా’ విద్య నేర్చి, కష్టించి; సేద్యం, కవితా సేద్యం సమాంతరంగా సాగించి ‘విత్తనాల ధాన్యం’ వంటి శ్రేష్ఠమైన కావ్యాలు రచించారు. ఆయన గురువులు కావూరి శ్రీరాములు, జాస్తి సుబ్బయ్య, తాడేపల్లి వేంకటప్పయ్యశాస్త్రి, దువ్వూరి వేంకటరమణశాస్త్రి. వారి దగ్గర చదివి భాషా పాండిత్యాన్ని సంపాదించుకున్నారు. 1930లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ‘ఉభయభాషా ప్రవీణు’డయ్యారు. 1930 నుండి 1957వరకు గుంటూరు జిల్లా బోర్డు ఉన్నత పాఠశాలల్లో తెలుగు పండితులుగా పనిచేశారు.

 బాల్యంలో చెరుకుపల్లి గ్రామంలో జరిగిన శతావధాన సభను చూసి పద్య రచన పట్ల మక్కువ పెంపొందించుకున్నారు. ‘ధర్మజ్యోతి’, ‘అమరజ్యోతి’, ‘రాష్ట్ర సిద్ధి’, ‘ఉదయగానం’, పరిగపంట’, ‘శబల’ వంటి పద్య కావ్యాలు రసవత్తరంగా రచించి పద్య కవితా వ్యాప్తికి కృషి చేసిన సంప్రదాయ కవి. ఎక్కట్టు పేరుతో సామాజిక స్పందనతో ముక్తకాలు ప్రచురించారాయన. గాంధీజీ స్వీయచరిత్రను ‘ఆత్మకథ’ పేరిట (1936) హృద్యమైన పద్యకావ్యంగా తీర్చిదిద్దారు.

ఈ కావ్యాన్ని గూర్చి తన అనుభూతిని వ్యక్తీకరిస్తూ ‘‘నాకృతులన్నింటనుత్తమము, పవిత్రమునైన ఈ కావ్యము నా సారస్వతానుభూతికి, నా తెనుగుదనమూదలగా రూపెత్తుట నా భాగ్యముగా భావింతును’’ అన్నారు. మహాత్ముని ఆస్థానకవిగా చెప్పుకున్న తుమ్మలవారు ‘మహాత్మ కథను’ రచించారు. గాంధేయవాద కవిగా 1920 నుంచి గాంధీ అడుగుజాడల్లో పయనిస్తున్న తుమ్మలవారి సత్యదీక్ష ఆయన మహాత్మ కథకు మెరుగులు దిద్దింది. ‘గాంధీ గానం’, ‘మహాత్మాగాంధీ’, ‘తారావళి’ వంటి లఘుకృతులు ఆయన గాంధేయవాదానికి తార్కాణాలు. గాంధేయవాద కవిగా ‘కవిని నేను గాంధీ కవిని నేను’ అని సగర్వంగా మహాత్ముని ఆస్థానకవిగా ప్రకటించుకున్నారు తుమ్మల. గాంధీజీ శిష్యుడైన ఆచార్య వినోబా భావే సర్వోదయ సిద్ధాంతాన్ని ‘సర్వోదయ గానం’గా రచించి ప్రశంసలందుకున్నారు. ఆయన ‘సందేశ సప్తశతి’లో సామాజికాంశాలైన గొప్ప భావాలను అభ్యుదయ, విప్లవకవుల కంటే మిన్నగా పద్యాల్లో చెప్పారు. భావ విప్లవాన్ని తుమ్మల ఆమోదించారు. భాషా విప్లవాన్ని అంగీకరించలేదు. కాలానుగుణ్యమైన సామాజిక మార్పులను తన కవిత్వంలో స్వాగతించారాయన. కవి ఏ ఇజానికి కట్టుబడకూడదన్న సిద్ధాంతం ఆయనది. ఇజాలకు కట్టుబడే కవుల తత్త్వాన్ని గర్హించారు కూడా. కాలానుగుణంగా సంస్కరణ దృక్పథంతో, భావవిప్లవంతో రచించిన కృతులు కలకాలం నిలుస్తాయన్నది ఆయన విశ్వాసం. ఆధునిక కవి తిలక్‌ ‌కూడా ‘ఇజమ్‌లో ఇంప్రిజనైతే ఇంగిత జ్ఞానం నశిస్తుంది’ అని ‘అమృతం కురిసిన రాత్రి’ కవితా సంపుటిలో చెప్పాడు.

ఆధునిక విమర్శకులు భావ విప్లవంతోపాటు భాషా విప్లవాన్ని అంగీకరించా లంటారు. కాని తుమ్మలవారు అమేయమైన ఆత్మవిశ్వాసంతో

‘‘భావ విప్లవమ్ము పచరించు కవి శాబ్ద

విప్లవమున కంగలింపడేని

గెలువడని బిభీషికలు కొట్టువారు నా

సృష్టి జూచి ఏమి చెప్పగలరు?’’

అని సగర్వంగా చాటి చెప్పుకున్నారు.

సరళసుందరమైన భాషలో భావ విప్లవాన్ని ప్రకటించి పాఠకుల మెప్పు పొందారు. పద్యాన్ని నిరసించే సంప్రదాయ వ్యతిరేక విమర్శకులైనా ఆయన భావాలను హర్షింపకుండా ఉండలేరు. ఆయన కవితా విహంగానికి శాంతి, అహింసలు రెండు పక్షాలు. గాంధీజీ ప్రభావంతో జీర్ణించుకున్న శాంతి – అహింసలు ఉన్న తన కవిత్వం, విప్లవ కవితా ప్రపంచంలో ఎంతమంది మెప్పు పొందగలదోనన్న సంశయాన్ని వ్యక్తపరచారు. ఆయన అభ్యుదయ, విప్లవకవుల భాషా విప్లవాన్ని అంగీకరించకున్నా సందర్భోచితంగా ముత్యాల సరాల గేయ ఛందస్సును మాత్రం ప్రయోగించారు. ఆయన ఛందస్సుల మర్మం తెలిసిన మహాకవి. ఛందస్సులు ఆయన భావాభివ్యక్తికి శృంఖలాలు కాలేదు. అవి ఆహ్లాదంతో అశ్వగమనాల్లా సాగాయి. మల్లెమాలల్లా పరిమళించి పాఠకులకు అనుభూతి సుగంధాన్ని పంచాయి.

ఆయన విప్లవమంటే గాంధీజీ కాంక్షించిన ఆదర్శ సమాజం. వినోబా భావే కోరుకున్న నవ సమాజం. విప్లవ కవుల సాయుధ పోరాట సిద్ధాంతాన్ని గాంధేయవాదిగా తుమ్మల సమర్థించలేదు.

తుమ్మలవారు తన కవిత్వంలో దోపిడీ వ్యవస్థను నిరసించారు. దోపిడీకి మూం స్వార్థం. యుగయుగాలుగా, తరతరాలుగా ధనవంతులు పేదల రక్తాన్ని పీలుస్తున్నారని అధిక్షేపిస్తూ,

‘‘యుగయుగాల నుండియును ధనవంతులు

నీతి లేక పాప భీతి లేక

పీల్చుచున్నవారు పేదల రక్తంబు

తీయ తీయని కొండ తేనియ వోలె’’

స్వార్థపరులైన ధనవంతులు పాపభీతి లేక పేదల రక్తాన్ని కొండ తేనెలా పీల్చేందుకు అలవాటుపడ్డారని ఆవేదనతో నిరసించాడు. దోపిడీ వ్యవస్థలో ధనికుల విలాసవంతమైన భవనాల నిర్మాణానికి తమ శక్తిని ధారపోసిన పేదవాడు ఆకలికి అలమటించి, చలికి చలించి, మొండిరోగాలతో మరణించడానికి స్వార్థపరమైన దోపిడీ వ్యవస్థే కారణమని నిరసించారు తుమ్మలవారు. స్వార్థపరులు విలాస ప్రీతికి పేదవారి పొట్ట కొట్టడం తగదని నిందించారు. పెచ్చు పెరిగిన దోపిడీ వల్ల ధనికుడి సంపద అపరిమితంగా పెరుగుతున్నది. పేదవాడు క్రమేపి పేదరికంలో మగ్గుతున్న స్థితిని సందేశ సప్తశతి కావ్యంలో,

‘‘మిద్దెవాడు నాల్గు మేడలవాడామె

గుడిసెవాడు పోయె గుట్టనీడ’’ అన్నారాయన. స్వతంత్ర భారతదేశంలోనూ కనిపించిన ఈ అసమస్థితిని నిరసించారు. స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు అసువులు ధారవోశారు. ఎన్నో కలలు కన్నారు. కాని ఆ కలలన్నీ కల్లలయ్యాయంటూ,

‘‘తెల్లవాడు పోయే దేశంబునకు నిక

నవత వచ్చునని జనమ్ము పొంగ

అదియు వచ్చెగాని అరసున్నతో వచ్చె’’ అన్నారు.

తుమ్మలవారు భాషాపరమైన చమత్కారంతో స్వతంత్ర భారతదేశంలో ప్రజలు కలలు కన్న ‘నవత’ అరసున్నతో వచ్చిందని (నవఁత- రాలేదన్న వ్యతిరేకార్థం) అధిక్షేపించారు. పీడితుల పట్ల మానవతా దృష్టితో సానుభూతి చూపారు. దారిద్య్రంతో, నిరక్షరాస్యతతో అలమటించే అమాయకులు కూడు, గుడ్డ, గూడు లేక ఆక్రోశిస్తున్న స్థితికి ఆర్ద్ర హృదయంతో చలించారు. వారి స్థితి బాగుపడకుంటే సమాజానికి శాంతి లేదని, జీవకాంతి రాదని నిర్మొహమాటంగా చాటారు.

అసమ సమాజంలో మహిళా కార్మికుల దుస్థితిని ఆర్ద్రతతో

‘‘రాణి వంటి చాన రాల్‌ ‌మోయుచున్నది

కరుణలేని మంటగాడ్పునందు

తట్టరాపుక తన తల బోడియయ్యెనీ

చెడ్డ్డ దేశమునకు పిట్టపిడుగు’’

రాణివాసంతో భోగాలనుభవించవలసిన అందాలరాశి పేదరికంవల్ల మండుటెండల్లో రాళ్లు మోసే దుస్థితికి జాలితో సానుభూతి చూపించారు. తుమ్మలవారి వర్ణన పాఠకుల గుండెలను పిండుతుంది.

‘‘మారుబట్ట లేక మానమ్ము నిలుపుకో /దగిన వెరవు లేక తల్లడిల్లే స్త్రీల పట్ల’’ ఆర్ద్ర హృదయంతో వారి స్థితి మారేంతవరకు మనసుకు శాంతిలేదన్నాడు.  ఆర్థిక దుస్థితివల్ల ‘‘నెలలు నిండి రొప్పు నెలతను వరికోత/ కంపు రాజ్యమెట్లు పెంపువడియు’’ అని తీవ్రంగా నిరసించారు. మాటల్లో కాదు, మన సమాజ, వ్యవస్థ చేతల్లో మార్పు రావాలని హెచ్చరించారు. నిండు గర్భిణిగా సోలుచు కూలికేగిన మాలెత పొలంలో గబ్బి మండల నడుమ ప్రసవించిన దృశ్యాన్ని ఆగ్రహంతో వర్ణించాడు. ఈ సన్నివేశం మానవత్వాన్ని పట్టి కుదుపుతుంది. ఈ సమాజపు దుస్థితిపై ఏవగింపు కలిగిస్తుంది.

ఆయన కవిత్వంలో శ్రామిక జనసంక్షేమాన్ని అభ్యుదయ కవులకంటే మిన్నగా వర్ణించారు. శ్రామిక- కార్మిక జనసంక్షేమం ఆయన లక్ష్యం. ఆయన వృత్తులన్నింటినీ సమానంగా గౌరవించాడు. ‘సందేశ సప్తశతి’లో

‘‘కలమెత్తిన హలమెత్తిన / మలమెత్తిన వారి నొక్క మైఁ జూడవలెన్‌

‌వలతియునలతియు లేదిట / పలువృత్తులు సాగినపుడె బ్రతుకులు సాగున్‌’’

‌సమాజ గమనానికి వృత్తులన్నింటి ఆవశ్యకత ఉంది. అందుకే కలమెత్తిన కవినీ, హలమెత్తిన రైతునీ, మలమెత్తిన పారిశుద్ధ్య కార్మికుని ఒకే రీతిలో చూసిన సమతా దృష్టి ఆయనది. తుమ్మలవారు తన ‘సర్వోదయగానం’లో (1960) సంపన్నులూ, మేధావులూ సర్వోదయ సిద్ధాంతం వైపు మొగ్గు చూపకుంటే, శ్రామికులైన పేదల సహన బంధాలను ఛేదించుకొని విజృంభిస్తారని హెచ్చరిక చేశారు. ఈ ఉపదేశం వల్ల కూడా శ్రామికులకు మేలు జరగదని గ్రహించారు. అందుకే చివరి ప్రయత్నంగా శ్రామికులందరినీ సమైక్యంగా కులమతాలను విస్మరించి ఒకే కులంగా పోరాడమని ప్రబోధించాడు. అప్పుడు ఏ ఆయుధం అవసరం లేకుండా వారి ఆశయమైన సమ సమాజం సాధించవచ్చునని ఆయన విశ్వాసం. ఆ సమాజం ఆదర్శంగా ఉండాలని ఆయన కాంక్ష. ఆ సమాజం ‘బికారిలేని, కటారిలేని, దొంగలేని’ విధంగా ఉండాలన్నది ఆయన కోరిక. పదిమందిలో ఆరుగురికి ఆహ్లాదం కలిగించే ప్రభుత్వ విధానం సరైంది కాదని ఆయన అభిప్రాయం. ప్రజలందరికీ సంతోషాన్ని  కలిగించే ప్రభుత్వ విధానమే సర్వోదయ సిద్ధాంతమన్నారు.

ప్రజా ప్రభుత్వం సామ్యవాదమైనా, ప్రజాస్వామ్య మైనా, మరే ప్రభుత్వమైనా కూడు, గూడు, గుడ్డలేని బికారి మెప్పు పొందలన్నారు. అదే సమసమాజం. గాంధీజీ కాంక్షించిన ఆదర్శ సమాజం. వినోబా కోరుకున్న సర్వోదయ సమాజం.

తుమ్మలవారు తెలుగుదేశపు గ్రామీణశోభను రమణీయంగా ‘సంక్రాంతి తలపులు’ ఖండకావ్యంలో రైతు జీవితాన్ని పంటల పండుగైన సంక్రాంతితో సమన్వయించి వర్ణించారు.

ప్రకృతి వర్ణనల్లో తుమ్మలవారి ప్రత్యేకతను సూచించే •ండకావ్యం ‘చుక్కలు’.  ఇందులో ఆకలితో అలమటిస్తూ తమ రక్తమాంసాలను ధనమదాంధులకు బలిపెట్టిన మాలమాదిగలు ఆకాశంలో ‘చుక్కలు’గా వెలిశారని ఉదాత్తంగా వాటిని మానవీకరించి ఉత్ప్రేక్షించారాయన.

ఆంధ్రాభిమానాన్నీ, ఆంధ్రత్వాన్నీ అణువణువునా జీర్ణించుకొని అక్షరీకరించిన కవి తుమ్మల

‘‘ఆంధ్రుడవై జన్మించితి / వాంధ్రుడవై యనుభవిపుంపుమీ యుర్విభావం / బాంధ్రుడవై మరణింపుము / ఆంధ్రత్వములేని బ్రతుకు నాశింపకుమీ’’ అని రాష్ట్రగానంలో ప్రబోధించారు.

‘తెలుగు తీపి’ ఖండికలో తెలుగు భాషా మాధుర్యం తెలియని వారిని అధిక్షేపిస్తూ

‘‘తల్లి బాస తీపి తగులని మానిసి

దేశి కవిత నిగ్గు తెలియనతడు’’

‘జాతిరుచలు కానజాలని మానసి’ – అని నిరసించాడు.

తుమ్మలవారిని ఒక ఆంగ్లేయ అధికారి తూష్టీభావంతో, ‘హూ ఆర్‌యు’ అని ప్రశ్నించాడట. అప్పుడు అప్రయత్నంగా ఆశువుగా ఆయన

‘‘రాష్ట్ర సిద్ధి కొరకు రక్తంబుగార్చిన/  కవిని నేను గాంధికవిని నేను

బడలి బడలి తల్లి బాసకూడెము సేయు/ కవిని నేను దేశికవిని నేను’’– అంటూ ఆత్మవిశ్వాసంతో జవాబు చెప్పారు.

వైవిధ్యభరితమైన బహుగ్రంథ కర్తగా, జాతీయ కవిగా, గాంధీకవిగా, మానవతావాద మహాకవిగా, సమసమాజ స్థాపనా భావుకతతో సాహితీ ప్రియుల మన్ననలందుకున్న తుమ్మలవారిని ఆంధ్ర విశ్వవిద్యాలయంవారు ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించారు. ఆయన అభిమానులు కనకాభిషేక గండపెండేరాలు బహూకరించి ఎన్నో ఘన సన్మానాలతో సత్కరించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంవారు 1985లో డి.లిట• డిగ్రీతో గౌరవించారు. తెలుగు భాషా సాహిత్యాలున్నంత వరకు తుమ్మలవారు సాహితీప్రియుల హృదయాల్లో చిరస్మరణీయులు.

– డా।। పి.వి.సుబ్బారావు 9849177594

వ్యాకసర్త : రిటైర్డ్ ‌ప్రొఫెసర్‌ & ‌తెలుగు శాఖాధిపతి, సి.ఆర్‌. ‌కళాశాల, గుంటూరు.

About Author

By editor

Twitter
Instagram