నేరం, ప్రతీకారం, కులం ఈ మూడింటి కలయికే బిహార్ రాజకీయం. తొట్టతొలి స్వాతంత్య్ర పోరాటంలో కీలక భూమిక పోషించిన బిహార్ తర్వాత కాలంలో నేరమయ రాజకీయాలకు, అరాచక శక్తు లకు కేంద్రంగా మారింది. స్వాతంత్య్రోద్యమ ఆరంభ దశలో బిహార్ నిర్ణాయక పాత్ర పోషించిందంటారు ‘History of the Freedom Movement in Bihar’ ఱఅ దీఱష్ట్ర•త్ణీ పుస్తకం రాసిన కె.కె.దత్తా. తొంభయ్యో దశకం తర్వాత బిహార్ రాజకీయ మైదానం నెత్తురోడిందనే భావన చాలా మందిలో ఉంది. కాని, జేపీ మూవ్మెంట్గా ప్రసిద్ధి చెందిన ‘బిహార్ ఉద్యమానికి’ ముందే రాజకీయ హింస క్రమంగా సామాజిక హింసగా పరిణమించింది. 1970లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో హతుల సంఖ్య, హంతకుల ప్రాబల్యమే జయాపజయాలను నిర్ణయించాయి.
తాజాగా పూర్ణియా లోక్సభ సభ్యుడు పప్పు యాదవ్ ఉరఫ్ రాజేష్ రంజన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. ‘నేతల గదుల్లోకి వెళ్లకుండా 90శాతం మంది మహిళలు రాజకీయాలు చేయలేరు’ అంటూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో జరిగిన మహిళా రిజర్వేషన్ల చర్చపై స్పందించిన పప్పూయాదవ్ ‘చట్ట సభల్లో మహిళల హుందాతనం గురించి మాట్లాడటం హాస్యాస్పదమంటూ నిర్లక్ష్య ధోరణిలో సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మహిళల్ని దేవతలుగా భావించినా.. వారిని ఆ దృష్టితో ఎన్నడూ చూడలేదని, గౌరవించలేదంటూ నీతి వాక్యాలు వల్లించారు. స్త్రీలపై రాబందుల్లా వాలిపోయేది ఎవరో తెలియా లంటే.. నేతల సీసీటీవీఫూటేజీలు చూడాలంటూ ఉచిత సలహా ఇచ్చారు.
దురుసుగా, పరుషంగా మాట్లాడటం పప్పూ యాదవ్కు ఇదేమీ కొత్త కాదు. సమీప గతంలో మహా కుంభమేళా సందర్భంగా ‘సంపన్నులు, సన్యాసులు, నేతలు త్రివేణీ సంగమంలో మునిగి, మరణించి ముక్తి పొందాలంటూ వికృత వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య కాలంలో పప్పూ యాదవ్ చేసిన హీనమైన వ్యాఖ్య.. బిహార్ రాజకీయ స్థితికి అద్దం పడుతుంది. పాట్నా నగరంలోని మహిళా హాస్టళ్లలోని యువతులు నేతల వద్దకు వచ్చేవారే అంటూ నోరు పారేసుకున్నారు. కోవిడ్ మహమ్మారి జనం ప్రాణాలు హరిస్తున్నవేళ డజన్లకొద్ది అంబులెన్సులను దాచి పెట్టిన అమాన వీయ గతం పప్పూ యాదవ్ సొంతం.
భయాన్ని అమ్ముకునే బేరగాళ్లే బిహార్ ఎన్నికల క్రీడలో విజేతలు. అలాంటి వారిలో పప్పూ యాదవ్ మొదటి వరుసలో ఉంటాడు. బీహార్ ప్రజలకు ఇలాంటి వ్యాఖ్యలు, పరుషమైన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించవు. నేర సామ్రాజ్యంలో నుంచి పప్పూ యాదవ్ రాజకీయ రంగప్రవేశం చేశాడు. మేన మామ శిక్షణలో కత్తిదూయడంలో నైపుణ్యం సాధించాడు. అంగబలం, అర్థబలం సమకూరిన తర్వాత…ఎన్నికల గోదాలోకి దూకాడు.
దైనందిన జీవితంలో హింసకు, అప్రజాస్వామిక ధోరణికీ, పరుష పదజాలానికి బీహారీలు అలవాటు పడ్డారు. గొంతు చించుకోని భయం స్వభావంగా మారిపోవడమే విషాదం. ఆర్తనాదం కూడా అత్యంత రహస్యంగా ఉండాలనే తత్వం స్వభావంలో భాగమైపోయింది. అందుకే రాజకీయాల్లో కొత్తదనాన్ని అంత త్వరగా ఆహ్వానించలేకపోయారు. ఉత్తర బిహార్లోని కోసీ రీజియన్లో పప్పూయాదవ్కు తిరుగులేదు. కేవలం చిన్నా చితక హత్యలు, బెది రింపులు కాదు అంతర్జాతీయ ఆయుధ డీలర్లతో ఉన్న సంబంధాల కారణంగా బిహార్ ముఖ్యమంత్రులు, నేతలు, సంపన్న పారి శ్రామిక వేత్తలు పప్పూ యాదవ్ పేరెత్తితే నిలువునా వణికిపోతారు.
పశ్చిమ బెంగాల్లోని పురూలియాలో ఆయు ధాలు జారవిడిచిన కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డెన్మార్క్కు చెందిన కిమ్ డేవీ 1995, డిసెంబర్ 17న అ•శీఅశీఙ అ-26 విమా నంలో వచ్చి అత్యాధునిక ఆయుధాలు పురూలియా అటవీ ప్రాంతంలో జారవిడిచారు. పశ్చిమ బెంగాల్ లోని కమ్యూనిస్టు ప్రభుత్వం నుంచి ఆనంద్ మార్గ్ అనుసరించేవారిని రక్షించడానికి ఆయుధాలు తరలించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇందులో పి.వి.నరసింహారావు ప్రభుత్వం పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వినిపించాయి. ఈ కేసులో పప్పూ యాదవ్ దోషిగా ఉన్నాడు. కిమ్ డేవీని క్షేమంగా దేశం దాటించే బాధ్యతను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పప్పూ యాదవ్ కు అప్పగించినట్టూ…కిమ్ డేవీ తన ఆత్మకథ ••ష్ట్రవ• మీ•శ్రీశ్రీ ఎవ •వతీతీశీతీఱ•్ణలో రాసుకున్నాడు.
పప్పూ యాదవ్, మహమ్మద్ షాహబుద్దీన్ లాంటి నేర ప్రవృత్తిగల నేతలు బిహార్ రాజకీయాల్లోకి రావడానికి ఒక నేపథ్యం ఉంది. రెండు కీలక పరిణామాలు బిహార్ రాజకీయాలను గుణాత్మకంగా మార్చేశాయి. లాలూప్రసాద్యాదవ్ రాజకీయ ఉత్థానం సైతం ఇదే సమయంలో మొదలైంది.
- ఎనభయ్యో దశకం తర్వాత బిహార్ రాజకీయాల్లోకి ప్రాంతీయ పార్టీలు ప్రవేశించాయి. ముఖ్యంగా ఓబీసీ సామాజిక వర్గాలైన యాదవ్, కుర్మి, కొయిరీలు తమ రాజకీయ ప్రాతినిథ్యం కోసం కాంగ్రేసేతరపార్టీల వైపు చూశారు. దీంతో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి మార్గం సుగమం అయ్యింది. మరీ ముఖ్యంగా బిహార్ సమాజంలో ఓబీసీల ప్రాబల్యం అధికం.
- సరిగ్గా ఇదే సమయంలో 1989 అక్టోబర్లో రామజన్మభూమి ఉద్యమం మొదలైంది రామశిల పూజలు మారుమూల ప్రాంతాల్లో ప్రారంభ•మైనాయి. అక్టోబర్ 24వ తేదీన భాగల్పూర్ వీధుల్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ‘రామశిల ఊరేగింపు’ మొదలైంది. సరిగ్గా మధ్నాహ్నం పన్నెండు గంటల సమయంలో రామశిల ఊరేగింపు ముస్లీం ప్రాబల్య ప్రాంతమైన ‘తార్ తార్ పూర్’లోకి ప్రవేశించింది. ఊరేగింపుపై హఠాత్తుగా రాళ్లదాడి మొదలు కావడంతో ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. చుట్టు పక్కల ఉన్న సుమారు 250 గ్రామాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. కొన్ని రోజుల తరబడి వేట కొనసాగింది. ఈ హింసాగ్నిలో సుమారు ఒక వెయ్యి 70 మంది మరణించారు.
ఈ రెండు పరిణామాలు బిహార్ రాజకీయ స్వభావ, స్వరూపాలను మార్చేశాయి. అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా ఓబీసీలు ఏకం కావడం, భాగల్పూర్ అల్లర్లు, అయోధ్య ఉద్యమం నేపథ్యంలో ముస్లీంల సంతుష్టీకరణలు లాలూప్రసాద్ రాజకీయ ప్రస్థానానికి మార్గం సుగమం చేశాయి. ముస్లీంలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచించిందనే నినాదంతో లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ రాజకీయాల్లో తన స్థానాన్ని పదిలం చేసుకునే ప్రయత్నంచేశాడు. దీంతో బిహార్ రాజకీయ మైదానం అతలాకుతలం అయిపోయింది. లాలూ ప్రసాద్యాదవ్ను ప్రజలు తమను రక్షించడానికి వచ్చిన మహానీయుడిగా భావించారు. రచయిత, పారిశ్రామికవేత్త మృత్యుం జయ శర్మ 2024లో రాసిన •దీతీశీ•వఅ తీశీఎఱవ – ••వ, తీఱఎవ •అ• శీశ్రీఱ•ఱమీ ఱఅ దీఱష్ట్ర•త్ణీ పుస్తకంలో లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయాల్లోకి వచ్చిన ఆరంభదశలో బిహార్ సమాజంలో ఎలాంటి రాజ కీయ సమ్మతి ఉండేదో విశ్లేషణాత్మకంగా రాశారు. ‘జంగిల్ రాజ్’కు పునాదులు ఇక్కడే పడ్డాయి.
కోసీ రీజియన్లో తనకున్న మందబలంతో పప్పూ యాదవ్ 1990లో సింఘేశ్వర్ శాసనసభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించాడు. 1991 తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్కు దగ్గరయ్యాడు. కోసీ రీజియన్ నుంచి తన ప్రాబల్యాన్ని సుపాల్, సహర్ష, మాధేపుర నుంచి పొరుగున ఉన్న సీమాంచల్ లోని పూర్ణియా వరకూ విస్తరించాడు.
పూర్ణియాలో 60శాతం హిందూ జనాభా ఉంటే 2011 జనాభా లెక్కల ప్రకారం 40శాతానికి పైగా ముస్లీంలు ఉన్నారు. దీన్నే ఆసరాగా చేసుకుని పప్పూ యాదవ్ వరుస విజయాలు సాధిస్తున్నాడు. చట్ట సభలకు ఎన్నికైన బిహార్ ప్రజాప్రతినిధులు..అన్ని వ్యవస్థలను తమ చెప్పు చేతల్లో ఉంచుకోవడంలో సిద్ధహస్తులు. నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి ప్రాంతీయ పార్టీల మద్దతు అత్యవసరం కావడంతో.. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు వ్యవస్థలను తమ ఇష్టానుసారంగా వాడుకున్నాయి.
నేరమే అధికారమైనప్పుడు..న్యాయ వ్యవస్థ కూడా అచేతనమవుతుంది. అందుకు ప్రబలమైన ఉదాహరణ సీపీఐ నేత అజిత్ సర్కార్ హత్య.1998 జూన్ 14న పట్టపగలు అజిత్ సర్కార్ ను ఏకే47 రైఫిల్తో కాల్చి చంపారు. 1980-2000వరకు పూర్ణియా రీజియన్లో జరిగిన సుమారు అన్ని హత్యల్లో పప్పూ యాదవ్ ప్రమేయం ఉందనేది బహిరంగ రహస్యం. అజిత్ సర్కార్ హత్య బిహార్ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది.
అజిత్ సర్కార్ హత్య కేసులో పప్పూ యాదవ్ ప్రమేయం ఉందని తేలడంతో ఢిల్లీలోని సీబీఐ కోర్టు 2008లో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పాట్నా హైకోర్టు 2013లో అజిత్ సర్కార్ హత్య కేసులో పప్పూ యాదవ్కు వేసిన శిక్షను రద్దు చేస్తూ కేసును కొట్టి వేసింది. బలమైన సాక్ష్యాలున్నా.. కేసును కొట్టివేయడంపై అనేక విమర్శలు వచ్చాయి. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్డీదేవీ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో పప్పూయాదవ్ చెలరేగిపోయినట్టు మృత్యుంజయ శర్మ రాసిన పుస్తకం చదివితే అర్థమవు తుంది. బిహార్లో హంతక రాజకీయాలు చేసిన వారంతా.. ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసిన ప్రజాప్రతినిధులే. రాజదండంలో దట్టించిన ఇంధనం భయమే అయినప్పుడు సామాన్యులు సమిధలవు తారు. బిహార్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రజా ప్రతినిధి సామంత రాజులుగా చెలామణి అయ్యారు. ‘మొకామా’లో అనంత్ సింగ్, మగధ్ రీజియన్ (నవాడా, జెహానాబాద్, గయా)లో అశోక్ మహతోలు హత్యలు, అత్యాచార ఘటనలతో స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు.
కుర్మీ సామాజిక వర్గానికి చెందిన అశోక్ మెహతో ‘రణ్ వీర్ సేన’ పేరిట సాయుధ ముఠాను నడిపాడు. సామూహిక హత్యలకు పాల్పడ్డాడు. కోసీ రీజియన్లో ఆనంద్ మోహన్ సింగ్ సమతా పార్టీ నేతగా, లోక్సభ సభ్యుడిగా ఉంటూ గోపాల్ గంజ్ జిల్లా మెజిస్ట్రేట్ ఎం.జి.కృష్ణయ్యను హత్య చేయించాడు.
ఎం.జి.కృష్ణయ్య తెలంగాణలోని పాలమూరు జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గంలో పుట్టి..సివిల్స్ రాసి తర్వాత గోపాల్ గంజ్ మెజిస్ట్రేట్ అయ్యారు. సివాన్ ప్రాంతంలో షాహబుద్దీన్ సామ్రాజ్యం నడిచేది. నేర ప్రవృత్తికి అధికార ముద్ర పడిన తర్వాత..లెక్కకు మించిన పప్పూ యాదవ్లు మన ప్రజాస్వామ్యాన్ని, చట్టసభల్నీ అపహాస్యం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు బిహార్ పాలన గాడిలో పడుతుందని అనిపించినా…అది అంత త్వరగా, సులభంగా సాధ్యమయ్యే పని కాదు. ‘‘వినేవారెవరూ లేనప్పుడు మంచిమాట కూడా శరీరం లోనే ఇంకిపోతుంది’’ అన్నాడు భర్తృహరి. ఇప్పుడు మన పాలకులు చెప్పే మంచిమాటలకు ప్రేక్షకులే తప్ప ఆచరణశీలురు ఎవరూ లేరు.
ప్రశాంత్ జోషి, జర్నలిస్ట్