ఏప్రిల్ 13 జలియన్ వాలాబాగ్ దుర్ఘటన
107 సంవత్సరాల క్రితం జరిగిన జలియన్వాలాబాగ్ సంఘటన స్వాతంత్రోద్యమంలో ఓ కీలక మలుపు, భారతమాత నుదుట రక్త తిలకం. దేశ స్వాతంత్రోద్యమంలో ఓ రక్తసిక్త అధ్యాయం. ఈ మారణకాండలో వేలమంది నేలకొరిగిన విషాద ఘట్టం. దేశమాత స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాన్ని ఓ మలుపు తిప్పింది.
ఓడిన ప్రతిసారీ విజయానికి చేరువ అవుతూనే ఉంటాడు మనిషి.
“పెళపెళ మరిగే మనస్సుంటేనే
తళ తళ ఊహాలు తోచేది
సలసల కాగిన పిదపే పాలకు
కమ్మని పరిమళ మొచ్చేది”
ఉలి దెబ్బలు తింటేనే
శిల శిల్పంగా మారుతుంది.
భారతదేశానికి స్వాతంత్య్రం అంత సులువుగా రాలేదు. భగీరథుడే మనకు ఆదర్శం. అమృతసర్లోని స్వర్ణ దేవాలయానికి అత్యంత సమీపంలో 6.50 ఎకరాలల్లో జలియన్వాలా బాగ్ ఉంది. మహారాజా రంజిత్ సింగ్కోటలో న్యాయవాదిగా పనిచేసిన “హిమ్మత్ సింగ్ జలియన్వాలా” పార్థివ దేహాన్ని ఇక్కడ సమాధి చేశారు. ఆయన పేరుతోనే ఈ ప్రాంతానికి జలియన్వాలా బాగ్గా పేరొచ్చింది. చుట్టూ ఎత్తయిన భవనాల మధ్య ఉత్తరం వైపున 3 నుండి 4 అడుగుల వెడల్పు మార్గం మాత్రమే ఉంది. బాగ్లో తూర్పు వైపున నుయ్యి, ఆపై కొద్దిగా చెట్లు ఉన్నాయి. ఇక్కడి మైదానంలో వేడుకలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏటా వైశాఖీ ఉత్సవం ఇక్కడే జరుగుతుంది.
ప్రథమ ప్రపంచ సంగ్రామంలో పని చేసినవారికి అనేక అవకాశాలు కల్పిస్తామనీ, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పంజాబ్ నుండి 3.55 లక్షల మందిని బ్రిటిష్ ఇండియా సైన్యంలో చేర్చుకుంది. యుద్దం ముగిసింది సైన్యాన్ని వెనక్కి పంపించివేసింది. ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంతో పంజాబ్ ప్రజలు నిరుద్యోగులయ్యారు. దానికి ప్రతీకారంగా నిరసనలు తెలుపగా ప్రజలను విచారణ లేకుండా నిర్భందిం చడం ప్రారంభించింది. ప్రభుత్వం నిర్బంధానికి చట్టబద్దత కల్పించడానికి సర్ సిడ్నీ రౌలట్ అధ్యక్షతన 1917లో ఓ కమిటీ వేసింది. దాని సిఫారసుల ఆధారంగా మార్చి 18, 1919న రౌలట్ చట్టాన్ని ఆమోదించింది.
రౌలట్ చట్టం “అరాచక, విప్లవ నేరాల చట్టం” అమలులోనికి వచ్చింది. దీని ప్రకారం ఎవరినైనా అకారణంగా నిర్భంధించవచ్చును, కారణం చూపాల్సిన అవసరం లేదు. ఎంతకాలమైనా నిర్బంధంలో ఉంచవచ్చు. “దలీల్ లేదు, వకీలు లేడు, అప్పీలు లేదు” ఇది బ్లాక్ బిల్. దేశం నలుమూలలా జాతీయోద్యమాన్ని అణచడానికి ఈ బిల్లు అమలులోనికి వచ్చింది.
పంజాబ్ రాష్ట్రంలోని పవిత్ర పట్టణమైన అమృతసర్లో వయస్సు, మత, లింగ భేదం లేకుండా ప్పు్రలు రౌలట్ చట్టానికి, పోలీసు అధికారి పంజాబ్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మైఖేల్ ఓ డయ్యర్కు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు ప్రారంభించారు. 1919లో ఏప్రిల్ 9వ తేదీన శ్రీరామ నవమి రోజున హిందువులు, సిక్కులు, ముస్లిమ్లు ఊరేగింపులో చేతులు కలిపి నడిచారు. దీనికి నాయకత్వం వహించిన వారు డా॥ సత్యపాల్, సైపుద్దీన్ కిచ్లూ. బ్రిటిష్ వారికి 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం గుర్తుకు వచ్చింది. దానితో భయం పట్టుకుంది. వీరి సభను జరగకుండా భగ్నం చేయాలని ఆలోచించారు. దాన్ని అణచి వేయడానికి బ్రిగేడియర్ రెజినాల్డ్ డయ్యరు సైనికులను ఆయుధాలతో అమృతసర్కు పిలిపించాడు. వాస్తవానికి అమృతసర్లో సైనిక పాలన ఉంది. బజార్లు మూసివేశారు. ఆకాశంలో ఓ విమానం చక్కర్లు కొట్టడం కన్పించింది. జెండా మార్చి కూడా నిర్వహించారు. అన్ని బహిరంగ సమావేశాలు నిషేధించారు. కానీ ఈ నిషేధం గురించి ప్రజలందరికీ తెలిసి ఉండదని ఊహించ వచ్చు. 1919 ఏప్రిల్ 13 ఆదివారం, బైశాఖీ ఒక పవిత్రమైన రోజు, సాధారణంగా వేడుకలు, ప్రార్థనలకోసం కేటాయిస్తారు. అయితే ఆ రోజు సంబరాలు పెద్దగా జరగకపోయినా సాయంత్రం మాత్రం యధావిధిగా శాంతియుతంగా సభ జరుగుతుందని కరపత్రాలు పంచారు.
ఈ రోజు అనగా 1919 ఏప్రిల్ 10న డా॥ సత్యపాల్, సైపుద్దీన్ కిచ్లూలను అరెస్టు చేసి ధర్మశాల నుండి బహిష్కరించారు. వారి అరెస్టు వార్త వ్యాపించడంతో, విచారణ నిమిత్తం సివిల్ లైన్స్ కంటోన్మెంటు వద్ద నిరాయుధులైన జనం భారీగా గుమిగూడారు. పుకార్లు వలన ప్రజలు ఆగ్రహంతో అట్టుడికి పోయారు. అధికార భవనాలను తగులబెట్టి బ్రిటిష్ పౌరులపై దాడి చేయడానికి ప్రయత్నించారు. ఈలోగా ఒక గుంపు షేర్ వుడ్ అనే బ్రిటిష్ మహిళపై దాడికి పాల్పడింది. కానీ ఓ భారతీయ కుటుంబం జోక్యంతో ఆమె రక్షింపబడింది.
నిర్బంధించబడిన డా॥ సత్యపాల్, సైపుద్దీన్ కిచ్లూల వివరాలు తెలియజెయ్యమని 1919 ఏప్రిల్ 10వ తేదీన అమృత్సర్లో సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో ఓ ప్రముఖ నిర్ణయం తీసుకొన్నారు. అది 1919 ఏప్రిల్ 13వ తేదీన బైశాఖి ఉత్సవంలో సభ జరుగుతుందని ప్రకటించారు. (అది పంజాబీలకు నూతన సంవత్సరం). ఆ రోజున జలియన్వాలా బాగ్లో భారీగా ఉత్సవs చేస్తారు. పూజలకు భక్తులు వేల సంఖ్యలో జలియన్ వాలాభాగ్కి వస్తారని పోలీసువారికి సమాచారం అందింది. జనజాగరణకు పెద్దగా ప్రయత్నం చెయ్యక పోయినా జనాలు చేరారు. అయితే అప్పటికే ఆ ప్రాంతంలో సభలు సమావేశాలు నిర్వహించరాదని ఆంక్ష ఉంది. ఆ విషయం ప్రజలకు తెలియదు, కాబట్టి చుట్టుప్రక్కల గ్రామాల నుండి జలియన్వాలా బాగ్కు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకొన్నారు. సమావేశ మండపంలో కూడా అనేకమంది గుమిగూడారు.
నిషేదాజ్ఞలు ఉల్లంగిస్తున్నారన్న కోపంతో నాటి పంజాబ్ గవర్నర్గా ఉన్న మైకేల్ ఓ డయ్యర్ సమావేశాన్ని రద్దు చేయ్యమని పోలీస్ అధికారి జనరల్ డయ్యర్ను ఆదేశించారు. ఆ అధికారి పెద్ద బెటాలియన్తో వెళ్లి అన్ని గేట్లు మూసేసి శాంతియుతంగా జరుపుకుంటున్న సమావేశంపై 1650 రౌండ్స్ కాల్చాడు. 50 మంది సైనికులు తమ దగ్గర గల మందుగుండు అయ్యేవరకు “మ్యాడ్ మినిట” అనే పద్దతిలో కాల్చారు. సమావేశ స్థలంలో సుమారు 20,000 మంది ఉండి ఉంటారని అంచనా, ఈ కాల్పుల కారణంగా, తొక్కిసలాట కారణంగా, అనేకమంది మరణించారు. ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది 379 మంది మరణిం చారని, 1200 మందికి గాయాలయ్యాయని. ప్రజలు కాల్పుల వలన కాకుండా తొక్కిసలాట వలన భయకంపితులయి మరణించారని, ఆ సంఘటనపై వేసిన ఎంక్వైయిరీ కమీషన్ తేల్చింది. ఈ కమీషన్ రిపోర్టులో నాటి గవర్నర్ మైకేల్ ఓ డయ్యర్, జనరల్ డయ్యర్ ని అభినందిస్తూ ఆ సమయంలో సరైన చర్య చేపట్టారని ప్రకటించారు.
ఈ ప్రకటనపై అనేకమంది దేశ భక్తులు నిప్ప్పులు చెరిగారు, వారిలో ప్రధానంగా ఆ సంఘటన జరిగే సమయానికి అక్కడే ఉన్న ఉద్దాం సింగ్ మొదటివాడు. భారతదేశ స్వాతంత్య్ర చరిత్రలో ఇంతటి ప్రాణనష్టం ఇప్పటివరకు జరగలేదు. భారత జాతీయ కాంగ్రెస్ మాత్రం వెయ్యిమంది మరణించారని, పదిహేను వందల మందికి గాయాలు అయ్యాయని ప్రకటిం చింది. జలియన్వాలా బాగ్ లోపల ఓ నుయ్యి వుంది, దాని నుండి దురంతం జరిగిన తర్వాత 120 శవాలను వెలికితీశారని చరిత్ర చెపుతుంది. బహుశా వారు ఈ బుల్లెట్ల బారి నుండి తప్పించుకోవడానికి ఆ నూతిలో దూకి ఉంటారని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఈ దురంతం గురించి మాట్లాడుతూ రవీంద్రనాథ్ టాగూర్ తనను చాలా బాధించిందని పేర్కొంటూ, తనకు బ్రిటిష్వారు బహుకరించిన “నైట్ హుడ” బిరుదును త్యజించారు. సర్ శంకర్ నాయర్ తనకు ఇచ్చిన వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ షిప్ పదవికి రాజీనామా చేసారు. గాంధీజీ కైజర్ – ఐ హింద్ – (గోల్డ్ మెడల్) ను వదులుకున్నారు.
ఉద్దాంసింగ్ పంజాబ్లో 1899 డిసెంబర్ 26 న సంగ్రూర్ జిల్లా సునంలో జన్మించాడు. అనాథ ఆశ్రమంలో పెరిగాడు. సరిగ్గా ్పులియన్వాలా బాగ్ దురంతం జరిగే నాటికీ ఆయన వయస్సు 20 సంవత్సరాలు. ఆ రోజున జరిగిన సంఘటన తన కళ్లారా చూశాడు. ఈలోగా గధర్ పార్టీలో సభ్యుడిగా చేరాడు. ఆయుధాలు ఉపయోగించడం నేర్చు కొన్నాడు. డయ్యర్ను చంపడం కోసమే ఇంగ్లాండు వెళ్లాడు. అక్కడ క్రోక్షన్లో మైకేల్ ఓ డయ్యర్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. అదే సమయంలో ఉద్దాంసింగ్ కూడా అదే సభలో కూర్చున్నాడు. సమావేశం ముగిసేవరకు సమయం కోసం ఎదురు చూస్తున్నాడు, సమావేశానంతరం ఒక్కసారిగా ప్రజలందరూ అతని చుట్టూ మూగారు. వెంటనే ఉద్దాంసింగ్ తన కోటు జేబులో నుండి రివాల్వర్ తీసాడు. మైకేల్ ఓ డయ్యర్పై అతి దగ్గర నుంచి మూడు రౌండ్స్ కాల్పులు జరిపాడు. అప్పటికే మైకేల్ ఓ డయ్యర్ వయస్సు 74 సంవత్సరాలు. ఉద్దాం సింగ్ను పోలీసులు అరెస్ట్ చేసి ఉరిశిక్ష వేసారు.
మైకేల్ ఓ డయ్యర్ కమీషన్ ముందు ఇచ్చిన సమాధానం అతడిలోని రాక్షసత్వానికి అద్దం పడుతుంది. “జన సమూహాన్ని చెదరగొట్టడానికి కాల్పులు జరపలేదు. పార్కు నుండి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించిన వారిపై కాల్పులు జరిపాను. వీలైనంత ఎక్కువ మందిని చంపమని సైనికులను ఆదేశించాను”. అందుకే సైనికులు తెచ్చిన మందుగుండు సామాగ్రి అయిపోయే వరకు “మ్యాడ్ మినిట” పద్దతిలో కాల్పులు జరిపారు. కాగా మారణకాండలో మరణించిన వారి ప్రాణాలకు 5 వేల పౌండ్లు చొప్ప్పున ప్రభుత్వం వెలకట్టింది. అయితే చాలామంది ఈ మొత్తాన్ని తీసుకోలేదు. 120 మంది మరణించిన బావిని అద్దాలతో మూసి వేశారు. సంఘటన జరిగిన చోట స్మారక స్తూపం కట్టారు. ఇక్కడి గోడలపై కన్పించే తూటాల గుర్తులు చరిత్రకు ఆనవాళ్లు. ఆంగ్లేయ సైన్యాధికారుల రాక్షస క్రీడకు చిహ్నంగా చరిత్రలో నిక్షిప్తం చేయబడ్డాయి. ఇంతటి ఘన చరిత్ర ఉన్న మట్టిలో పుట్టడమే మనకు గర్వకారణం.
Sources:
1) Jallianwala Bhag Massacre (ed) by V.N. Datta and Settar
2) Khooni Vaisakhi by Nanak Singh

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు