దేవాలయం అంటే  కేవలం భక్తి కాదు-ఉపాధి, సంస్కృతి, శాస్త్రం, సేవల సమ్మేళనం. ఉదాహరణకి` నూరు వృత్తులకు కేంద్రమైన తిరుమల ఆలయం ఒక మహానగరానికి సమానమైన జీవన వ్యవస్థ. తిరుమలను నిశితంగా చూసిన వారికి ఆలయ ఆధారిత వృత్తులు యువతకు ధర్మసమ్మతమైన, స్థిరమైన ఉపాధి మార్గాలు అని అర్థం అవుతుంది. ఇలాంటి మహోన్నత ఆలయాలు ఈ వేదభూమిలో ఎన్ని ఉన్నాయి! ఆ ఆలయాల నిర్మాతల ఆశయాలను ఆచరణలోకి తీసుకువస్తే వికసిత భారత్‌కు గొప్ప సేవ అవుతుంది. ఎవరికీ చేటు చేయకుండా, భారతీయ జీవన వ్యవస్థను స్థిరంగా నిలిపిన కులవృత్తులను పునరుజ్జీవింప చేయడం ఆర్థిక వ్యవస్థకు జవజీవాలు కల్పించే చర్య కాగలదు. కింది తరగతుల వారి ఆత్మ గౌరవాన్ని కూడా నిలిపే ఆ వృత్తులు నిజానికి పురాతన భారతీయ సృజనాత్మక ప్రతిభకు సాక్ష్యంగా కూడా ఉంటాయి. కాబట్టి కులవృత్తులను ఆదుకునే  దిశగా కూడా దేశం ఆలోచించాలని అంటున్నారు ఈ వ్యాసకర్త.

విషయ నేపథ్యం

రెండు, మూడు దశాబ్దాలుగా పలు సందర్భాల్లో తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్యదర్శనం కోసం ఆ తిరుమల గిరిమార్గంలో అలిపిరి నుంచి శేషాద్రి వరకు 18 కి.మీ. దూరం ప్రయాణిస్తూనే ఉన్నా, ఈ మధ్య ప్రయాణించినప్పుడు కొన్ని ఆలోచనలు పుట్టాయి. వాటి ప్రతి రూపమే ఈ వ్యాసం.

  1. అవతారిక

భారతీయ నాగరికతలో ఆలయం ఒక సంపూర్ణ జీవన కేంద్రం. ప్రాచీన కాలంలో రాజులు, గ్రామాలు, వృత్తులు, విద్యా సంస్థలు- అన్నీ ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని అభివృద్ధి చెందాయి.

భారతీయ జీవనంలో వృత్తులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఒకరి వద్ద సేవ చేసేకన్నా కుటుంబ వృత్తులకే ప్రాధాన్యం ఇచ్చేవారు. కుటుంబ వృత్తులకే కులవృత్తులని కూడా పేరు. కులం అంటే ఆనాడు నేటి అర్థంలో ఉండేది కాదు. ఒకే వృత్తికి చెందిన కుటుంబ సమూహాలకే కులం అని పేరు.

ఆ కులాల గురించి తెలుసుకుంటే భారతీయ ప్రాచీన ఆర్థిక వ్యవస్థలో వృత్తులకు గల ప్రాముఖ్యం తెలుస్తుంది.

 అందుకు వృత్తి అంటే ఏమిటో ముందుగా తెలుసుకోవాలి.

జీవికా, జీవనోపాయము,ఆజీవము, వార్త్త, వృత్తిః, వర్త్తనమ్, జీవనము అనేవి అమరకోశంలో వృత్తి శబ్దానికి పర్యాయ వాచకములుగా కనిపిస్తాయి. వీటన్నింటికీ జీవితాన్ని ఇచ్చేదే వృత్తి అని అర్థం.

దీనిని దృష్టిలో పెట్టుకునే అమరకోశంలో నృవర్గలో ఎన్నో కులవృత్తులను ప్రస్తావించారు. వాటిలో కొన్ని ముఖ్యమైన వృత్తులను ఇక్కడ ఉదాహరణకు తెలుసుకోవచ్చు.

అమరసింహుడి పురాతన సంస్కృత నిఘంటువు అయిన అమరకోశ, దానిలోని నృవర్గ (మానవ తరగతి), లోని అనేక వృత్తులను వర్గీకరిస్తుంది. ఈ గ్రంథం అత్యంత ప్రత్యేకత కలిగిన సమాజాన్ని ప్రతిబింబిస్తుంది, దీనిని వ్యాఖ్యాత క్షీరస్వామి మరింత వివరంగా వివరించారు. అమరకోశ ప్రకారం వారు వారు చేసే పనులను ఆధారం చేసుకుని వర్గీకరించిన వివిధ వృత్తులు ఇక్కడ ఉన్నాయి :

  1. విద్య, ధర్మం

ఉపాధ్యాయులు/గురువులు: ఉపాధ్యాయ (గురువు), అధ్యాపక (బోధకుడు), ఆచార్య (గురువు), గురువు అనేవి విద్య బోధన చేసే గురువుల వృత్తులు. అలాగే స్త్రీల విషయంలో కూడా!

ఉపాధ్యాయనిలు: ఉపాధ్యాయి, ఉపాధ్యాయ, ఆచార్య అని వారిని వ్యవహరించారు. అలాగే పూజారులు/బ్రాహ్మణులు: ద్విజుడు, అగ్రజన్మ, భూసురులు వంటివారు వివిధ శాస్త్రాలను, విద్యలను బోధన చేసేవారు, వేద పారాయణం, యాగాలు నిర్వహించడంలో నిమగ్నమై వారు ఉన్నారు.

  1. పరిపాలన, సైనిక దళాల విషయంలో`

రాజు/పాలకులు: రాజు, నృపుడు, పాలకుడు, ప్రభువు, సామంతరాజు, మంత్రి, సేనాధిపతి, దళపతి, కోశాధికారి, క్షత్తా అంటే ద్వారపాలకుడు/పరిచారకుడు, కంచుకీ వంటివారు.

సైనిక దళాలు: సూత (రథసారధులు),చారణ (అనుకరణ/నటుడు), సంసప్తకులు వంటి ప్రతిజ్ఞ చేసిన యోధులు.

అధికారులు: పాలపాల (సూపరింటెండెంట్), అధ్యక్ష (సూపర్‌వైజర్) దూత (దూత), నగర రక్షకుడు వంటి వారు.

  1. వాణిజ్యం, వ్యవసాయం

రైతులు: కృషీవల, కర్షక, కృషకాదులు,

వ్యాపారులు/వ్యాపారులు:వైదేహక, ఆపణిక (దుకాణదారు), విక్రేత వంటి వారు.

వంటశాలలో: పౌరోగవ అధ్యక్షుడు, సూద నిపుణుడు, పాచకుడు, సూపకారుడు, వల్లవులు, ఔదనికులు, అపూపికులు, కాందవికులు, భక్ష్య కారులు, అంధసికులు వంటివారు అందరూ పాకశాస్త్ర నిపుణులు.

పశువుల కాపరులు/పాడి పరిశ్రమ: గోపులు, గోపాలకులు, గోధుక్కులు (అంటే ఆవుల నుండి పాలు పితికేవారు)

నిర్దిష్ట వాణిజ్యం చేయువారు: వణిజులు, శౌండికులు, తైలికులు, (నూనె అమ్మేవారు), వైతంసికులు (మాంసం అమ్మేవారు).

  1. చేతివృత్తుల వారు

నిర్మాణం:పాలగంధులు (తాపీపని వారు), స్థపతులు, శిల్పులు,

వస్త్రాలు: తంతువాయులు (నేత కార్మికులు), తున్నవయులు (దర్జీవారు), రజకులు, నిర్ణేజకులు

లోహ/కళాకారులు: కుంభకారులు (కుమ్మరి వారు), శౌల్బికులు (రాగి పనివారు), కరులు (సాధారణ పనివారు), లోహకారులు (కమ్మరివారు), శస్త్రమారజులు (కవచాలు చేసేవారు).

ఆభరణాలు/ప్రత్యేకత: మాలకారులు (పూల వ్యాపారులు), శాంఖికులు (షెల్ కట్టర్లు), వైకాటికులు (ముత్యాలు/పూసలలో ప్రత్యేకత కలిగిన ఆభరణాల వ్యాపారులు).

  1. సేవలు, ప్రదర్శకులు

ప్రదర్శకులు: చారణులు (అనుకర్తలు), మార్దాంగికులు (మృదంగ వాదకులు), వేణు వాదకులు (వేణువు వాయిద్యకారులు), గాయకులు, నటులు, నర్తకులు, కవులు తదితరులు.

సేవా ప్రదాతలు: దివాకీర్తులు (క్షురకులు), భారవాహులు, చోరులు (దొంగలు), భృతకులు (సేవకులు ), లేఖకులు, దాసులు (బానిసలు).

దూతలు: కరణులు (రాయబారులు), వార్తాహరులు

రాజ సేవకులు: వైతాళికులు, ఘంటికులు (ఘంటలను మ్రోగించువారు) మాగధులు (రాజును స్తుతించే గాయకులు).

ఆలయాలలో కులవృత్తులు: ఈ వృత్తులన్నీ మనకు ఆలయాలలో ప్రాచీనకాలం నుంచి ఉపయో గించిన సంప్రదాయ కులవృత్తులు. ఇక్కడ మరో మారు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, కులమన్నది నేటి సమాజంలో అందరినీ వేరు పరచటానికి విదేశీయ చరిత్ర కారులు ప్రసిద్ధిని కలుగజేసిన అర్థంలో కాదు. భారతీయ శాస్త్ర సంప్రదాయంలో ఆలయం ఒక సామాజిక-ఆర్థిక కేంద్రమనే భావన స్పష్టంగా వ్యక్తపరిచేది కులం.

విమానార్చనాకల్పం మొదలైన గ్రంథాలలో విష్ణు దేవాలయ రహిత గ్రామంలో నివసించవద్దని నిషేధించారు. అలాగే వివిధ వృత్తులవారు గ్రామంలో ఏ ఏ దిక్కులలో నివసించాలో చెప్పారు. విమానార్చ నాకల్పంలోని ఈ వాక్యాలు ఈ విషయాన్ని స్పష్టపరుస్తాయి.

“విష్ణు పూజా విహీనే (గ్రామే).. .. న జాత్వపివశేత్..” అని చెప్పి ఆ గ్రామంలో విష్ణు దేవాలయం నిర్మించి .. “తదర్చకానాంతత్పార్శ్వే స్థానం, నాభ్యైశాన్యాం సభాస్థలం, ఆగ్నేయ్యాం గోష్ఠాగారం, నైఋత్యాం ఆపణం, పైశాచబాహ్యే ప్రాచ్యాంకులాలోర్ధ్వనా పితాంబషష్ఠానాం, యామ్యేతంతువాయ చక్రిణాం, వారుణే క్రయవిక్రయ కారిణాం వణిజాం, సౌమ్యే ద్విజ భృత్యానాం, వాదిత్రజీవినాం, ఆగ్నేయ్యాంక్రోశమాత్రేతక్షకాదీనాం, వాయవ్యే మృగవ్యాధ శాకునికాధోనాపితానాం .. .. ప్రకల్పయేత్.” అని చెప్పారు.

అలా ఒక గ్రామం అంటే అన్ని వృత్తుల వారు ఉండేదే అని సూచన చేశారు. విష్ణుపూజ లేని గ్రామంలో నివసించవద్దన్నారు. గ్రామంలో విష్ణు దేవాలయం నిర్మించాలి అని చెప్పి ఆ ఆలయం ప్రక్కనే అర్చకుల నివాసాలు ఉండాలట. ఆ ఆలయనాభికి ఈశాన్యంలో సభాస్థలం ఉండాలట. ఆగ్నేయంలో గోశాల, నైరుతిలో ఆలయ ద్రవ్యాలను అమ్మే దుకాణం, పైశాచ బాహ్యమైన తూర్పు భాగంలో కుమ్మరివారు, క్షురకులు, మూలికా వైద్యులు, దక్షిణంలో నేత పనివారు, పశ్చిమంలో వ్యాపారులు, ఉత్తరాన ద్విజ సేవకులు, తూర్య, నాదస్వర, కాంస్య, చర్మ వాద్య నిపుణులు, ఆగ్నేయం నుంచి క్రోశ దూరంలో వడ్రంగి వారు, వాయవ్యంలో వ్యాధాదులు .. ఇలా గ్రామాన్ని నిర్మించుకోవాలి అని చెప్పారు. అక్కడ సూక్ష్మంగా గమనించవలసింది గ్రామం అంతా ఒక ఆలయంపై ఆధారపడి జీవించాలి అని చెప్పటం. అది మన పూర్వుల గ్రామ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఆలయాలను నిర్మించడం అనే ఒక మహత్తరమైన ఆశయం కనబడుతుంది.

ఇంత ప్రశస్తమైన కులవృత్తులకు గొడుగు పట్టి పోషిస్తున్నది మన భారతీయ ఆలయ వ్యవస్థ.

మనదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు, యాభై ఒక్క శక్తి పీఠాలు, 108 వైకుంఠాలు, ఇవికాక ప్రతి వీధివీధిలో, వాడవాడలో, పల్లెపల్లెలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, నగరంలో, నదీ తీరాలలో, పర్వతాలలో, పర్వతాగ్రములలో లక్షలాది దేవాలయాలు, చిన్నవి, పెద్దవి ఉన్నాయి. వాటిలో శివాలయాలు, విష్ణ్వాలయాలు, శక్తి ఆలయాలు, గణపతి ఆలయాలు. కుమారస్వామి ఆలయాలు ఇలా ఎందరో దేవతల ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఎంతో ఆదాయాన్ని సమకూర్చే వ్యవస్థ కూడా ఉంది. ఈ ఆలయాలన్నీ కేవలం భక్తి, భక్తులు అనే రెండు అంశాల చుట్టూ తిరగటమే కాక ఈ కుల వృత్తుల పోషణ ద్వారా అనాదిగా భారతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటానికి దోహదం చేస్తున్నవి. ఈనాడు కూడా ఈ ఆలయ సంస్కృతిని రక్షించుకోవటం ద్వారా భారతీయ ఆర్థిక వ్యవస్థను ఎంతో ముందుకు తీసుకుని వెళ్లవచ్చును.

నేటికీ తిరుమల వంటి మహాక్షేత్రం ఈ భావనకు ప్రత్యక్ష ఉదాహరణ. రోజూ లక్షలాది భక్తులు సందర్శించే ఈ క్షేత్రం ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం భారతదేశంలోని అత్యంత మహత్తర ధార్మిక కేంద్రాలలో ఒకటి. ఇది భక్తి కేంద్రం మాత్రమే కాక, వందలాది వృత్తులు, నైపుణ్యాలు, సేవలను పోషిస్తున్న విశాల సామాజిక-ఆర్థిక వ్యవస్థ. తిరుమల గిరి ఏవిధంగా ఈ వృత్తులను పరిరక్షిస్తోందో ఇక్కడ గమనించవచ్చు.


దేవాలయ సేవ క్షీణిస్తే, కుటుంబ పరంపరల వృత్తులు నశిస్తాయి

ప్రాచీన స్మృతిగ్రంథాలలో ఆలయ-సంబంధ వృత్తుల పోషణ ధర్మంగా పేర్కొన్నారు:

దేవాయతనకర్మాణి యే కుర్వంతి నరోత్తమాః।

తేషాంజీవికయా రాజ్యం ధర్మేణైవ ప్రవర్తతే॥

ఆలయ సేవలకు సంబంధించిన కర్మలు నిర్వహించే ఉత్తమ నైపుణ్యంకలవారి వలన రాజ్య ఆర్థిక-ధార్మిక వ్యవస్థ నడుస్తుంది.అని చెప్పారు.

విష్ణుధర్మోత్తర పురాణం ఆలయాన్ని కళా-వృత్తుల కేంద్రంగా నిర్వచిస్తుంది:

“శిల్పం చ నృత్యం గీతం చ దేవాయతన సంశ్రయమ।”

శిల్పం, నృత్యం, సంగీతం అన్నీ ఆలయాన్ని ఆశ్రయించి వికసిస్తాయి అని చెబుతోంది.

ఆగమ గ్రంథాలు ఆలయ సేవకుల జీవనాధారాన్ని దేవతా విధిగా స్పష్టం చేస్తాయి.

వైఖానస ఆగమం ఇలా పేర్కొంటుంది:

ఆర్చకఃపరిచారశ్చమాలాకారఃతథైవ చ ।

దేవసేవాప్రస్ఱ్గఙనపోషణీయాఃప్రయత్నతః ॥

అర్చకులు, పరిచారకులు, మాలాకారులు మొదలైన ఆలయ సేవకులను దేవసేవ కారణంగా సముచితంగా పోషించాలి. వారిని పోషించడం రాజుల బాధ్యతగా చెప్పారు.

పాంచరాత్ర ఆగమంలో వృత్తి నాశనానికి హెచ్చరిక ఉంది:

దేవసేవాక్షయే జాతే నశ్యన్తి కుల పరంపరాః।

దేవాలయ సేవ క్షీణిస్తే, కుటుంబ పరంపరల వృత్తులు నశిస్తాయి. పూర్తి వేద పారాయణ కుటుంబాలు, సంప్రదాయ శిల్పకళలు, చెక్కు నూనె, దీప తయారీ వంటి వృత్తులు నశించే ప్రమాదంలో ఉన్నాయి.

మహాభారతం- శాంతి పర్వంలో:

ధర్మో హి జీవికానాం మూలమ।

ధర్మమే జీవికలకి మూలం అని చెబుతోంది. అంటే వృత్తి పాలనమంటేనే ధర్మమని చెప్పారు.

నారదస్మృతి యువత వృత్తి శిక్షణపై చెబుతుంది:

స్వకర్మనిరతః సిద్ధిం యువా ప్రాప్నోతి మానవః।

తన వృత్తిలో నిమగ్నుడైన యువకుడు సిద్ధిని పొందుతాడు.

స్వేస్వేకర్మణ్యభిరతఃసంసిద్ధింలభతేనరః.

స్వకర్మనిరతః సిద్ధిం యథావిన్దతి తచ్ఛృణు। శ్రీమద్భగవద్గీత ।18.45।

ఇదే విషయాన్ని భగవద్గీత మానవులు తమకు విహితమైన కర్మలను ఆచరించటం చేతనే సిద్ధిని పొందుతున్నారు. అని చెబుతోంది.. ఉదాహరణగా ధర్మవ్యాధుని చరిత్రను చూపుతున్నది.


అలిపిరి – తిరుమల సుగమ మార్గం

అలిపిరి నుంచి తిరుమలకు భక్తులు ప్రయాణించే టప్పుడు కనబడే తారు రోడ్డు. సుఖప్రయాణానికి అనువుగా ఆధునిక మార్గాన్ని నిర్మించారు. అలా నిర్మించడానికి, నిర్మించిన మార్గాన్ని 365 రోజులూ సంరక్షణ చేయటానికి బాగుచేత పనులకు గాను ఎందరో శ్రామికులకు, సూపర్‌వైజర్లకు, ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకు మరెందరికో ఉద్యోగులకు ఉపాధిని కలుగజేస్తున్నది. ఆ రోడ్డు పై పయనించే వాహనాల చోదకులకు, పెద్ద వాహనాలకైతే కండక్టర్‌లు వంటి వారికి, క్లీనర్లకు ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి.

అలాగే మార్గమధ్యంలో ఏ విధమైన ప్రమాదాలు జరిగినా వెంటనే అందుకోవటానికి రక్షక భట వ్యవస్థ ఉన్నది.

కొండచరియలు విరిగిపడితే ఆ రాళ్లను, మట్టిపెళ్లలను తొలగించి, మార్గం ఇరువైపులా కొండచరియలను గట్టి పరచటానికి తాపీపని వారు, సహాయక సిబ్బంది ఉపాధిని పొందుతున్నారు.

అలాగే మార్గానికి ఇరువైపులా అద్భుతమైన వృక్ష సముదాయం వాటికి నీరు పోసి పెంచే వృక్షం సంరక్షకులు, అదేవిధంగా అద్భుతమైన తిరుమల లోయలో కనువిందు చేసే జీవవైవిధ్య సౌందర్యం. దాన్ని కనురెప్పలు పడకుండా కాపాడే అటవీశాఖ శ్రామికులు, అటవీశాఖ అధికారులు. అలాగే తిరుమల మార్గంలో, నడక దారిలో, తిరుమలలో కనబడే పాములను తొలగించటానికి సుశిక్షితులైన స్నేక్ క్యాచర్స్. ఇలా తిరుమల మార్గం ఎందరికో ఉపాధిని కలుగ చేస్తోంది.

అయితే ఇక్కడ ఈ మార్గం వల్ల కనుమరుగై పోయి, క్షీణించి పోయిన, క్షీణించి పోతున్న వృత్తులు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని: ఈ బస్సులు, కార్లు, ఇతర వాహనాలు లేని రోజుల్లో నడవలేని వారిని కొండపైకి మోసుకుంటూ వెళ్లే డోలీ వాహకదార్లు, అలాగే ఎడ్లబండ్లు, గుర్రపు బండ్లు వాటి నిర్వాహ కులు మాయమైపోయారు.

గమనించవలసిన విషయం

ఇప్పటికీ కేదార్నాథ్, అమర్నాథ్ యాత్రలలో డోలీలు, పిట్టూలు, గుర్రాలు తదితర సంప్రదాయ రవాణా సౌకర్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. వారు కేదార్నాథ్‌కు ఆధునిక మార్గ సదుపాయాలను ఏర్పాటు చేయనివ్వకుండా ఆందోళన చేస్తూ పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తున్నారు.

అలాగే ఈ శేషాచల పర్వత శ్రేణిలో లభించే అరుదైన ఔషధాలను సేకరించే ఆటవిక సంప్రదాయ వైద్య నిపుణులు కనబడటం లేదు. అలాగే ఇక్కడ పూర్వం నివసించిన అటవీ ఉత్పత్తులను జనావా సాలకు అందించే గిరిజన వాడల వారు ఎక్కడికో వలస వెళ్లిపోయారు. ఇవన్నీ పర్యావరణానికి ముప్పు కలుగనివ్వని మాయమైపోయిన వృత్తులు.

ఇక కొండమీదకు చేరిన దగ్గరనుంచి ఏదో తెలియని అనుభూతికి లోను చేసే ఒక అపురూప మైన, చల్లని వాతావరణం. ఇక్కడ కనబడే వృత్తులను పరిశీలిస్తే ఇదికూడాపాతకొత్తల మేలి కలయిక.

ఉద్యానశాఖ

ఇక్కడ కనబడే సుందర ఫల, పుష్ప, ఔషధ ఉద్యాన వనాలు ఉద్యాన పాలక శాఖకు, ఉద్యాన పాలకులకు, వారి సహాయకులకు ఉపాధిని కలుగజేస్తున్నాయి. అలాగే అడుగ డుగునా కనబడే రక్షకభటులు కలియుగ దైవం శ్రీని వాసుని ప్రత్యక్ష సైన్యమే.

వాహనశాఖ

ఇంకా అతి విశాలమైన నగర శోభతో పరిఢవిల్లే తిరుమల గిరుల్లో ఒక చోట నుంచి మరోచోటకు పయనించటానికి ఎన్నో చిన్న పెద్ద వాహనాలు, ఉచిత రథాలు.. ఆ రథం చోదకులు, కండక్టర్‌లు, మెకానిక్‌లు, బస్‌డిపోల నిర్వాహకులు, ఇతర సిబ్బంది ఇరవై నాలుగు గంటలు, 365 రోజులు ఒక ప్రత్యేకమైన వ్యవస్థే.

వాణిజ్య సముదాయం

అలాగే అన్నివైపులా విస్తరించిన అనేక రకాలైన దుకాణాలు. నిత్యావసర వస్తువుల దుకాణాలు, ఆహార, ఫలహార శాలలు, వస్త్ర దుకాణాలు, శ్రీవారి చిత్రపటాలు, హారాలు, గాజులు, వివిధ అలంకారాల దుకాణాలు, స్త్రీ, బాల, వృద్ధ, పురుషులకు కావాల్సిన అన్ని విధాల వస్తు సముదాయాలను అందించే దుకాణాలు… ఇది ఒక మహా వాణిజ్య సముదాయం.

నివాస, పారిశుద్ధ్య వ్యవస్థ

ప్రతి రోజు సుమారు లక్ష నుంచి లక్షా యాభై వేల మంది, ఒక్కొక్క సారి రెండు, మూడు లక్షల మంది వరకు భక్తులకు నివాస వ్యవస్థ, దానికి దీటుగా పారిశుద్ధ్య వ్యవస్థ అందులో పనిచేసే నిర్వాహకులు, సేవకులు, కార్మికులు తదితరులు. ఇలా తిరుమల ఒక మహా నగరమే.

వైద్య ఆరోగ్య శాఖ

తిరుమలలో అకస్మాత్తుగా ఎవరికైనా అనారోగ్యం చేస్తే వెంటనే స్పందించేందుకు సంచార వైద్య వాహనాలు ఉన్నాయి. వాటితో పాటు ఒక వైద్యశాల ఉంది. కొండ దిగువన శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ వందలాది మంది వైద్య నిపుణులతో కూడుకుని ఉన్నది. ఇలా వైద్య వృత్తిలో కూడా ఈ తిరుమల ఆలయాన్ని ఆధారం చేసుకుని జీవించేవారు వేలమంది ఉన్నారు.

పర్యాటకశాఖ

తిరుమల అంటే శ్రీవారి ఆలయం మాత్రమే కాదు. అక్కడ వేలాది సంవత్సరాల చరిత్ర కల జాపాలి తీర్థం, పాప వినాశం, ఆకాశగంగ, వేణు గోపాలస్వామి ఆలయం వంటివి, 108 పుణ్య తీర్థాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. పవిత్రతకు, ప్రకృతి సౌందర్యానికి ఆకారమైన ఆ పుణ్య క్షేత్ర సముదాయాన్ని గురించి వివరించే గైడ్స్, తదితరులు కూడా ఉన్నారు.

నట, గాయక, పండిత వైతాళికులు

ఇక ఆలయం పరిసరాల్లోకి వెడితే ఆస్థాన మంటపంలో కానీ నాదనీరాజనం మంటపంలో ప్రవచనాలు, హరికథలు, నృత్య, గాన సభలు జరుగుతూ ఎందరో పండితులు, పౌరాణికులు, కళాకారులు, వ్యాఖ్యాతలు తిరుమల గిరులలో భక్తి లోకాన్ని సృష్టించే విధాతలుగా మనకు కనబడుతారు.

అర్చక, పరిచారకాదులు

అంతరాలయంలో చూస్తే “అర్చకస్తు స్వయం విష్ణుః చరరూపీ న సంశయః” అన్న ఆగమ వాక్యంలో చెప్పిన విధంగా ఎటుచూసినా నడిచే విష్ణు స్వరూపులైన అర్చకోత్తములు, వేదపండితులు, ఏకాంగులు, మాలాకార్లు, పరిచార కులు, జియ్యంగార్లు, ఆలయ నిర్వహణా సిబ్బంది, రక్షక భటులు, శ్రీవారి సేవకులు వంటివారు ఎందరో కనబడుతారు.

ప్రసాద-అన్నదాన వ్యవస్థ

శ్రీవారికి ఆయా సమయాలలో నైవేద్య సమర్పణ కోసం అనేక రకాలైన ప్రసాదాలను నిర్మించే పోటు నిపుణులు, పరిచారకులు, అలాగే ఆన్నదాన వ్యవస్థ కోసం వంట వారు కనబడుతారు.

పర్యావరణ సంరక్షణ

అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం వైజ్ఞానిక వేత్తలను కూడా ఇక్కడ నియమించారు.

పురావస్తు సంరక్షకులు

ఆయా శతాబ్దాలలో శ్రీవారికి ఎందరో మహారాజులు, జమీందారులు, సామాన్య భక్తులు సమర్పించిన ఎన్నో విలువైన వస్తువులను పురావస్తు సంగ్రహాలయంలో భద్రపరిచారు. దానికోసం అక్కడ కూడా ఎందరికో ఉపాధి లభిస్తోంది.

ఇవన్నీ సమన్వయంగా పనిచేయడం వల్ల తిరుమల ఒక భక్తి ప్రధానమైన, స్వయం సమృద్ధ ఆర్థిక వ్యవస్థగా, భారతీయ సంస్కృతిని ఒక ఉదాత్త మైన రీతిలో రక్షించే మహానగరంగా విలసిల్లుతోంది.

తిరుమల ఆలయ ఆధారిత వృత్తుల వర్గీకరణ

పై అనుభవాన్నిబట్టి తిరుమలను నిశితంగా పరిశీలిస్తే నూరుకు పైగా వృత్తులన్నీ మనకు కనబడుతున్నాయి.

తిరుమల ఆలయాన్ని ఆధారం చేసుకొని జీవిస్తున్న 100 వృత్తులు

  1. ఆగమ-వేద-పూజా వృత్తులు (1-15)

అర్చకులు, పరిచారకులు, వైఖానస ఆగమ పండితులు, ఋగ్వేద, యజుర్వేద,సామవేద, అథర్వణ వేద పండితులు, దివ్య ప్రబంధ గోష్ఠిసభ్యులు, సుప్రభాత సేవ పండితులు, తోమాల సేవ పండితులు, ఏకాంత సేవ పండితులు, యాగ-హోమ కర్తలు, మంత్రశాస్త్ర నిపుణులు, న్యాస-తంత్ర విధాన పండితులు,ఆలయ శాస్త్ర వ్యాఖ్యాతలు.

  1. ఆలయ కళలు-శిల్ప వృత్తులు (16-30)

రాయి శిల్పులు, పంచలోహ విగ్రహ తయారీదారులు, స్థపతులు (ఆలయ వాస్తు నిపుణులు), సుద్ద శిల్ప కళాకారులు, గోడచిత్ర (మ్యూరల్) కళాకారులు, చెక్క శిల్పులు, యంత్ర శిల్పులు, కలశ తయారీ దారులు, ధ్వజస్తంభ శిల్పులు, ఆలయ పునరుద్ధరణ నిపుణులు, లోహ శుద్ధి కార్మికులు, శిల్ప కళ గురువులు, వారసత్వ సంరక్షణ నిపుణులు, ఆలయ రంగుల తయారీదారులు, శిల్పకళ శిక్షణ కేంద్ర నిర్వాహకులు.

III. అలంకరణ-వస్త్ర-ఆభరణ వృత్తులు (31-40)

మాలాకారులు (పుష్పమాలలు), పుష్ప అలం కరణ నిపుణులు, కిరీటం తయారీదారులు, బంగారు ఆభరణ శిల్పులు, వెండి ఆభరణ శిల్పులు, ఆలయ వస్త్ర అలంకరణ నిపుణులు, పట్టు వస్త్ర నేతవారు, పత్తి వస్త్ర నేతవారు, సంప్రదాయ రంగుల డైయర్లు, ఆలయ దర్జీలు.

  1. నైవేద్యం-ప్రసాదం-పాకశాల వృత్తులు (41-55)

పాకశాల బ్రాహ్మణులు. లడ్డూ ప్రసాద తయారీ దారులు, సాత్విక వంటకారులు, మిఠాయి తయారీ దారులు, అన్నదానం వంటకారులు, పాకశాల పర్యవేక్షకులు, ఆహార నాణ్యత పరిశీల కులు, గోదాముల నిర్వాహకులు, నెయ్యి శుద్ధి నిపుణులు, పాలు సరఫరాదారులు, బియ్యం శుద్ధి కార్మికులు, ధాన్య నిల్వ సిబ్బంది, వంట పాత్రల సంరక్షకులు, పాకశాల శుభ్రత సిబ్బంది,

ప్రసాద ప్యాకేజింగ్ సిబ్బంది

  1. వ్యవసాయం-గోశాల-సరఫరా వృత్తులు (56-65)

గోపాలులు (గోశాల కార్మికులు),పశువైద్యులు, పుష్ప సాగుదారులు, తులసి తోట నిర్వాహకులు, సేంద్రీయ రైతులు, కూరగాయ సరఫరాదారులు, సుగంధ ద్రవ్య వ్యాపారులు, నూనె చెక్కు కార్మికులు, ఎరువుల సరఫరాదారులు,నీటి సరఫరా కార్మికులు.

  1. సంగీతం – నృత్యం – ఉత్సవ వృత్తులు (66-72)

నాదస్వర వాదకులు, తవిలు వాదకులు, వేద స్వర శిక్షకులు, ఆలయ సంగీతకారులు, భరతనాట్యం నర్తకులు, నాట్యశాస్త్ర పండితులు,ఉత్సవ సమన్వ యకులు,

VII. పరిపాలన – భద్రత – సేవా వృత్తులు (73-85)

ఆలయ పరిపాలనా అధికారులు, దేవాదాయ శాఖ సిబ్బంది, లెక్కలు-ఆడిట్ అధికారులు, హుండీ లెక్కింపు సిబ్బంది, కొనుగోలు అధికారులు, ఆలయ భద్రతా సిబ్బంది, పోలీసు విభాగ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ నిపుణులు, క్యూలైన్ నిర్వహణ సిబ్బంది, శ్రీవారి సేవకులు (వాలంటీర్లు), సమాచార కేంద్ర సిబ్బంది ,భక్తుల మార్గదర్శకులు.

VIII. వైద్యం-పరిశుభ్రత-సంక్షేమం (86-92)

డాక్టర్లు, నర్సులు, అత్యవసర వైద్య సిబ్బంది, ఆయుర్వేద వైద్యులు, శుభ్రత కార్మికులు, వ్యర్థ నిర్వహణ సిబ్బంది, ఆరోగ్య పర్యవేక్షకులు,

  1. సాంకేతికత-మీడియా – ఆధునిక వృత్తులు (93-100)

ఐటి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లు,క్యూ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ నిపుణులు, బయోమెట్రిక్ సిస్టమ్ ఇంజనీర్లు,

మొబైల్ యాప్ అభివృద్ధిదారులు,సైబర్ భద్రత నిపుణులు, డేటా విశ్లేషకులు, ఫోటోగ్రాఫర్లు / వీడియో గ్రాఫర్లు,ఆలయ మీడియా-ప్రచార నిర్వాహకులు.

ఒక ముఖ్యమైన మాట

ఈ 100 వృత్తులు కలిసే తిరుమల ఆలయం ఒక మహానగరానికి సమానమైన జీవన వ్యవస్థగా మారుతుంది. తిరుమలను నిశితంగా చూసిన వారికి దేవాలయం అంటే కేవలం భక్తి కాదు-ఉపాధి, సంస్కృతి, శాస్త్రం, సేవల సమ్మేళనం. ఆలయ ఆధారిత వృత్తులు యువతకు ధర్మసమ్మతమైన, స్థిరమైన ఉపాధి మార్గాలు అని అర్థం అవుతుంది.

అయితే ఇక్కడ బాధాకరమైన విషయం, నేటి ఆధునిక జీవన విధానంలో మనం మన ప్రాచీన కుల, కుటుంబ వృత్తులను పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఎన్నో విలువైన వృత్తులు అంతరించి పోతున్నాయి. దీనిని అధిగమించటానికే తిరుమల ఆలయం ఒకే సంస్థగా ధర్మం, ఉపాధి, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థలను ఏకకాలంలో పోషిస్తోంది. దీనిని సరైన విధానాలతో అభివృద్ధి చేస్తే, ఇది భారతదేశంలో సాంస్కృతిక ఆధారిత ఉపాధి నమూనాగా మారగలదు. ఈ బాటలోనే యావద్భారతావనిలో ప్రతి గ్రామంలో, పట్టణంలో, నగరంలో ఆలయాలను అభివృద్ధి పరచుకోవాలి. అప్పుడు ప్రతి ఆలయం భక్తులకే కాదు, లక్షలాది కుటుంబాలకు జీవనాధారం. పారంపర్య వృత్తులను కాపాడుతూ, ఆధునిక ఉపాధి రూపాలు సృష్టించడం ఈ కాలానికి అవసరం.

ఆలయ పరిరక్షణ = వృత్తి పరిరక్షణ = సంస్కృతి పరిరక్షణ అనే లక్ష్యంతో భారతీయ ఆలయ వ్యవస్థ ఒక నవ భారీ పరిశ్రమగా మారాలి. ఆలయ వ్యవస్థను యువతకు ఆకర్షణీయంగా మార్చాలంటే: సంప్రదాయ విద్య, ఆధునిక నైపుణ్యాల సమ్మేళనం అవసరం. ఆలయ నిర్వహణ కోర్సులు, ప్రాచీన వృత్తులలో శిక్షణను ఇచ్చే కోర్సులు, హెరిటేజ్ కన్జర్వేషన్ డిప్లొమాలు. డిజిటల్ డాక్యుమెంటేషన్, మీడియావంటివాటిని కల్పించాలి. ఇవి యువతకు స్థిరమైన ఉపాధిని కల్పించగలవు.

ఈ దిశగా ప్రభుత్వాలు, ఆలయ సంస్థలు, విద్యాసంస్థలు, యువత సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అలా చేస్తే వికసిత భారత్ భవిష్యత్ ఆర్థిక వ్యవస్థలో ఆలయాలు ఎంతో ఆశావహమైన, విప్లవాత్మక మైన మార్పులకు నాంది పలుకుతాయి. ఒక నాడు సస్య విప్లవం, పారిశ్రామిక విప్లవం చోటు చేసుకున్న రీతిలో ఇప్పుడు భారతీయ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా దేవాలయ ఆధారిత వృత్తుల పునర్జాగరణ ఒక విప్లవంగా రావాలి.

దేవాలయో రక్షతి రక్షితః

ఆచార్య రాణి సదాశివమూర్తి,

ఉపకులపతి,

శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం, తిరుపతి

About Author

By editor

Twitter
YOUTUBE