ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)ను అమెరికా విదేశీ ఉగ్రవాద సంస్థలో జాబితాలో చేర్చింది. అంతేకాదు, స్పెషల్లీ డెజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రిరిస్ట్గా కూడా ముద్ర వేసింది. ఈ నిర్ణయం పట్ల భారత్ హర్షం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఏమీ మాట్లాడకపోయినా, ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ కూడా ఆ నిర్ణయాన్ని శ్లాఘించారు. పాకిస్తాన్ను నిట్టనిలువునా ముంచిన ఏప్రిల్ 22 నాటి పెహల్గావ్ కాల్పులకు కారణం ఈ సంస్థే. భారత్-అమెరికాల మధ్య త్వరలో జరగబోయే వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడడం విశేషం. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తాయిబా చాటున పనిచేసే ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్. పెహల్గావ్లో టీఆర్ఎఫ్ ఆ ఘాతుకానికి పాల్పడి 26 మందిని పొట్టన పెట్టుకున్న మూడు మాసాలలోనే ఇలాంటి కీలక నిర్ణయం అమెరికా తీసుకుంది. 2008 నాటి ముంబై పేలుళ్ల తరువాత పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ భారత పౌరుల మీద జరిపిన అతిపెద్ద ఘాతుకం ఇదేనని చెబుతున్నారు. కాగా అమెరికా నిర్ణయం గురించి ఆ దేశ విదేశాంగమంత్రి మార్కో రుబియా వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని బట్టి అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి నేటికీ కట్టుబడి ఉందన్న అంశాన్ని ప్రపంచానికి చాటుతున్నదని రుబియో వ్యాఖ్యానించారు. పెహల్గావ్ కాల్పులు తమ పనేనని టీఆర్ఎప్ ప్రకటించింది కూడా. దీని నాయకుడు షేక్ సజ్జాద్ గుల్. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్తాన్ మీద మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. పాకిస్తాన్ ఉగ్రవాదుల తయారీ కేంద్రంగా ఉన్నదని మొదటి నుంచి భారత్ ఆరోపిస్తూనే ఉంది. 2024లో భారత భద్రతా దళాల మీద జరిగిన దాడుల వెనుక కూడా టీఆర్ఎఫ్ పాత్ర ఉంది.