ఉగాది కృత్యం

చైత్ర శుద్ధ పాడ్యమి రోజు నుంచి తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ రోజు తెలుగువారు చాంద్రమానం, తమిళులు సౌరమానం ఆధారంగా ఉగాది పండుగ జరుపుకుంటారు. ఉదయమే అభ్యంగన స్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించి, ఇష్టదైవాన్ని ప్రార్థించడం, అనంతరం షడ్రుచులతో కూడిన (తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు, చేదు) ఉగాది పచ్చడిని తినడంతో పండుగ ప్రారంభమవుతుంది. అలాగే పంచాంగ శ్రవణం ద్వారా ఆ ఏడాది దేశ కాలమాన పరిస్థితులు, జాతక విశేషాలు తెలుసుకుని బంధుమిత్రులతో ఆనందంగా గడపడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఉగాది రోజున పాటిస్తారు.

పంచాంగ సారాంశం

తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలతో కూడినదే పంచాంగం. తిథులు శ్రేయస్సుకు, వారాలు ఆయుర్వుద్ధికి, నక్షత్రాలు పాప పరిహారానికి, యోగాలు రోగ నివారణకు, కరణాలు కార్యసిద్ధికి తోడ్పడతాయి. పంచాంగ శ్రవణంతో సర్వ శుభాలు కలుగుతాయి. చాంద్రమాన ప్రకారం ఈ సంవత్సరాన్ని శ్రీ క్రోధినామ సంవత్సరంగా పిలుస్తారు. ప్రభవాది 60 సంవత్సరాల్లో 38వది. క్రోధం, ఇతరులకు అసహనం, కోపతాపాలు పెంచేది క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరం అధిపతి శని, ఈ గ్రహాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకలసంపదలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. అలాగే, తిల దానం మంచిది.

పుష్కరాలు..

ఈ ఏడాది మే 1వ తేదీ చైత్ర బహుళ అష్టమి బుధవారం మధ్యాహ్నం 1.01గంటలకు దేవగురుడు బృహస్పతి వృషభరాశిలో ప్రవేశం. ఈ రోజు నుండి నర్మదానదికి పుష్కరాలు ప్రారంభం. పుష్కరాలు జరిగే 12 రోజులు దానధర్మాలు, నదీస్నానం మోక్షప్రదమైనవి. వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢ మాసాలు గురు, శుక్ర మూఢములు, శూన్యమాసం కావడం వల్ల శుభముహూర్తాలు లేవు. శ్రావణ మాసం నుండి ముహూర్తాలు ఉన్నాయి.

గ్రహణాలు..

ఈ సంవత్సరం మన దేశంలో గానీ, తెలుగు రాష్ట్రాలలో గానీ సూర్య, చంద్ర గ్రహణాలు లేవు.

————–

శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు

ఈ ‌సంవత్సరం రాజు, అపరసస్యాధిపతి, నీరసాధిపతి కుజుడు. మంత్రి, సేనాధిపతి, ఆర్ఘ్యాధిపతి, మేఘాధిపతి శని. పూర్వసస్యాధిపతి చంద్రుడు, రసాధిపతి గురుడు. నవనాయకుల్లో ఇద్దరు శుభులు కాగా, ఏడుగురు పాపులు. అలాగే, ఉప నాయకుల్లోని 21మందిలో ఆరుగురు శుభులు, 15మంది పాపులు. రాజు కుజుడు, మంత్రి శని కావడం, వీరు లగ్నాత్తు తృతీయ స్థానం కుంభరాశిలో కలయిక వల్ల, పరస్పరం శత్రువులు కావడం వల్ల పాలకుల మధ్య వైషమ్యాలు. అవగాహనా లోపం, పాలనలో గందరగోళ పరిస్థితులు నెలకొనవచ్చు. అయితే, పైస్థాయి వారి మాటే శిరోధార్యం కాగలదు.

అలాగే, మంత్రుల మధ్య పరస్పర వివాదాలతో కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలకు గడ్డుస్థితి నెలకొనవచ్చు. అదే సమయంలో దేశ ఖ్యాతి కూడా పెరుగుతుంది. ఊహించని విధంగా యుద్ధ వాతావరణం ఏర్పడవచ్చు. కొన్ని సమయాల్లో సైనిక చర్యలు అవసరం కావచ్చు. ప్రభుత్వాలకు ఆదాయం విశేషంగా పెరిగి అభివృద్ధి దిశగా పయనిస్తాయి. వ్యవసాయపరంగా కొన్ని సమస్యలు ఉన్నా ఉత్పత్తికి లోటు రాదు. రైతులకు ప్రోత్సాహం అందుతుంది. విద్య, పారిశ్రామికరంగాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత లభిస్తుంది. శాస్త్రసాంకేతికపరంగా మనదేశం కొత్త ఆవిష్కరణలు చేపట్టి అందర్నీ అబ్బురపరుస్తుంది. పెద్ద దేశాలు సైతం మద్దతుగా నిలుస్తాయి. కొన్ని లాభదాయకమైన గనులు బయల్పడే అవకాశాలున్నాయి.

బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయి. వ్యవసాయ అనుబంధ రంగాలు మరింత వృద్ధి చెందుతాయి. ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడంలో ఆచితూచి వ్యవహరించాలి. లేకుంటే ప్రజాగ్రహాం చవిచూడాల్సి వస్తుంది. కళారంగం వారికి గతంతో పోలిస్తే అనుకూలమని చెప్పాలి. రాజకీయ నాయకులకు ప్రజాదరణలో మిశ్రమ ఫలితాలు దక్కుతాయి. కొందరు నాయకులు, కళాకారులకు గడ్డు కాలం. మనదేశానికి అంతర్జాతీయ అవార్డు దక్కే వీలుంది. మహిళలు ఉన్నత పదవులు అధిరోహిస్తారు. పాడి పరిశ్రమ ఒడుదొడుకులు ఎదుర్కొన్నా పాలదిగుబడి బాగుంటుంది. నిత్యావసర వస్తువుల ధరలు కొంతమేర అదుపులోకి వస్తాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు, తూర్పు, ఈశాన్య ప్రాంతాలలో ప్రకృతి వైపరీత్యాల వల్ల జననష్టం జరిగే సూచనలు. కొన్ని రాష్ట్రాలలో అధికార పక్షాలకు ఇబ్బందికర పరిస్థితులు రావచ్చు. అక్టోబర్‌ 20 ‌నుండి వచ్చే జనవరి 20 వరకు కర్కాటకరాశి అయిన నీచస్థానంలో కుజుని స్తంభన కారణంగా భయోత్పాతాలు, భూకంపాది ప్రమాదాలు, రైలు, బస్సు ప్రమాదాలు, వ్యాధులు ప్రబలడం వంటి భయాలు కలుగుతాయి.

ఇక బెంగాల్‌, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలలో తుఫాన్ల వల్ల నష్టాలు సంభవించవచ్చు. కుజుడు రాజు కావడం వల్ల భూముల రేట్లకు రెక్కలు వచ్చే అవకాశాలున్నాయి. శని,కుజుల కలయిక కారణంగా ఉన్మాదులు, ఉగ్రవాదులు తమ ప్రతాపాన్ని చూపే వీలుంది. అక్టోబర్‌- ‌డిసెంబర్‌ ‌మధ్య కాలంలో వివిధ రకాల ప్రజాఉద్యమాలు, ఆందోళనలతో కొంత అశాంతి నెలకొనే అవకాశం ఉంది. అపరాల ఉత్పత్తులు పెరిగి మంచి గిరాకీ ఏర్పడుతుంది. కొన్ని వ్యాధులు ప్రబలి ప్రభుత్వాలకు సవాలుగా మారవచ్చు. వచ్చే ఏడాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం.

దేవగురువు ఉగాది నుంచి ఏప్రిల్‌ 30 ‌వరకు మేషరాశిలోనూ, మే1వ తేదీ నుంచి వృషభరాశి లోనూ సంచారం. అలాగే, శని సంవత్సరమంతా కుంభరాశిలోనే సంచారం. ఇక రాహు కేతువులు కూడా ఈ సంవత్సరమంతా మీనం, కన్యారాశులలో ఉంటారు.

మేషం

(ఆదాయం-8, వ్యయం-14.రాజపూజ్యం-4, అవమానం-3)

ఈ రాశివారికి మే 1వ తేదీ నుంచి గురుబలం విశేషం. శని, కేతువులు కూడా అనుకూలురు. రాహువు మాత్రం వ్యయ స్థానంలో పాపి. ఈరీత్యా వీరికి మే నుంచి అన్ని విధాలా అనుకూల సమయం. ఆదాయవ్యయాలలో వ్యత్యాసం ఉన్నప్పటికీ ఆర్థికంగా బలపడతారు. బకాయిలు అనూహ్యంగానే వస్తాయి. ప్రధాన సమస్యలు పటాపంచలవుతాయి. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు దక్కుతాయి. వ్యాపారస్తులు గతం కంటే మెరుగైన లాభాలను గడిస్తారు. భాగస్వాములతో తగాదాలు తీరతాయి. ఉద్యోగస్తులకు అనుకూల పరిస్థితులు . ఊహించని బదిలీలు, కొందరికి పదోన్నతులు రావచ్చు. రాజకీయవేత్తలు కొన్ని కొత్త పదవులు పొందుతారు. కళాకారులు అధికంగా అవకాశాలు దక్కించు కుంటారు. ప్రభుత్వ పురస్కారాలు దక్కవచ్చు. శాస్త్రసాంకేతికవర్గాలకు విశేష గుర్తింపు, ప్రశంసలు దక్కవచ్చు. నిరుద్యోగులకు అద్భుత అవకాశం లభిస్తుంది. వ్యవసాయదారులకు రెండు పంటలు లాభించి ఉత్సాహంగా గడుపుతారు. రాహు ప్రభావం వల్ల తరచూ ఆరోగ్య సమస్యలు,శత్రుబాధలు ఉండవచ్చు.కార్తిక, మార్గశిర మాసాలు మినహా అన్ని నెలలు సానుకూలమే. వీరు దుర్గామాతకు అర్చనలు, స్తోత్రాలు పఠిస్తే మంచిది.

వృషభం

(ఆదాయం-2, వ్యయం-8,రాజపూజ్యం-7, అవమానం-3)

ఈ రాశివారికి గురుడు మినహా మిగతా గ్రహాలు సానుకూలమై కనిపిస్తున్నాయి. మే 1 నుంచి జన్మరాశిలో గురు సంచారం వల్ల ప్రతి చిన్న విషయాన్ని అతిగా ఆలోచిస్తారు. వ్యయం పెరిగినా ఆదాయానికి లోటుండదు. గురుప్రభావం వల్ల స్థానమార్పులు, శారీరక అలసట, మానసిక అశాంతి. రాహువు సంచారం విశేష లాభదాయకం. న్యాయ పరమైన చిక్కులు తొలగి ఊరట లభించే సమయం. ఇంట్లో శుభకార్యాలకు సన్నద్ధమవుతారు. విద్యార్థులు మేథస్సుతో ఉన్నత విద్యలలో ప్రవేశిస్తారు. వ్యాపార స్తులు విరివిగా లాభాలు గడించి సంస్థల విస్తరణకు సిద్ధపడతారు. ఉద్యోగస్తులకు ఎన్నడో నిలిచిపోయిన ఇంక్రిమెంట్లు లేదా పదోన్నతులు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలు, వైద్యరంగాల వారికి మరింత ప్రోత్సాహం, సహకారం లభిస్తాయి. రాజకీయవేత్తలు కొంత కష్టపడ్డాక ఫలితం పొందుతారు. శాస్త్ర సాంకేతిక వర్గాల వారు అద్భుత ఆవిష్కరణలతో ప్రశంసలు అందుకుంటారు. వ్యవసాయదారులకు అధికంగా పంటలు పండి అప్పులు తీరుస్తారు. మహిళలకు సంవత్సరమంతా సానుకూలమే. జ్యేష్ఠం, భాద్రపదం, ఆశ్వయుజ మాసాలు మినహా మిగతావి శుభదాయంగా ఉంటాయి. వీరు గురునికి పరిహా రాలు చెల్లించుకోవాలి. శెనగల దానం మంచిది.

మిథునం

(ఆదాయం -5, వ్యయం-5, రాజపూజ్యం-3, అవమానం-6)

ఈ రాశివారికి గురుని వ్యయస్థితి సంచారం కారణంగా అన్ని విషయాలలో అతిగా స్పందించి మాటపడతారు. బంధువులు కూడా మీపట్ల అంతగా మక్కువ చూపరు. ఇంట్లో వాతావరణం కూడా కొంత గందరగోళంగా ఉండవచ్చు. భార్యాపుత్రులకు కూడా సర్దిచెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే ఇంట్లో శుభకార్యాల పరంపర ప్రారంభమవుతుంది. శని సంచారం వల్ల కొంత ఆస్తిని వ్యయం చేస్తారు. దశమ రాహువు కారణంగా ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.జ్ఞానసముపార్జనపై ఆసక్తి చూపుతారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉండవచ్చు. వ్యాపారస్తులు ఇంటి నిర్మాణాలు చేపట్టే వారికి శుభదాయకం. వ్యాపారస్తులు క్రమేపీ సంస్థలను విస్తరిస్తూ లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో సరైన న్యాయం జరిగే సమయం. వీరిపట్ల పైస్థాయి అధికారులు ఆదరణ చూపుతారు. కళాకారులు ఎడాపెడా అవకాశాలు సాధిస్తారు. రాజకీయవేత్తలకు కొన్ని కొత్త పదవులు రావచ్చు. అయితే, ప్రథమార్థంలో మాత్రం కొంత ఇబ్బంది పడతారు. వ్యవసాయదారులు మొదటి పంటలో సంతృప్తికర లాబాలు ఆర్జిస్తారు. మహిళలకు శుభదాయకంగా ఉన్నా కొన్నిసందర్భాలలో మనోబలం తగ్గుతుంది. జ్యేష్ఠం, భాద్రపదం, ఆశ్వయుజం, పుష్యమాసాలు మినహా మిగతా నెలలు అనుకూల మైనవి. వీరు గురుని, శనికి పరిహారాలు చేయించు కుంటే మేలు.

కర్కాటకం

(ఆదాయం -14, వ్యయం- 2, రాజపూజ్యం-6, అవమానం-6)

ఈ రాశివారికి గురుబలం విశేషంగా ఉంటుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. అధిక ఖర్చులకు వెనుకడుగు వేస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు, సత్కారాలు పొందుతారు. అవివా హితులకు వివాహకాలం. ఇంటి నిర్మాణాలు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం లభిస్తుంది. భాగ్యస్థానంలో రాహు సంచారం వల్ల మానసికంగా కొంత ఆందోళన. భగవంతునిపై విశ్వాసం ఉంచి ముందడుగు వేయండి. ఇక అష్టమ శని,కుజుల ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు, కొందరికి శస్త్రచికిత్సలు అవసరం కావచ్చు. అయితే మీ కష్టం వృథా కాదు. ఎవరినీ నొప్పించకుండా మీ పని మీరు చేసుకుని వెళతారు.

వ్యాపారస్తులు భాగస్వాములతో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు లభించ వచ్చు. ఆత్మవిశ్వాసం పెరిగి విధులను సమర్థ వంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశాల నుండి వీరికి పిలుపు రావచ్చు. కళాకారులు కొత్త అవకాశాలపై సంతకాలు చేస్తారు. రాజకీయవేత్తలు కొన్ని సమస్యలు ఎదురైనా లెక్కచేయక విజయాల బాటలో నడుస్తారు. వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభిస్తాయి. మహిళలకు కుటుంబంలో ఎనలేని గౌరవం దక్కుతుంది. చైత్రం, ఆషాఢం, ఆశ్వయుజం, పుష్య మాసాలు మినహా మిగతావి విశేషంగా కలసివస్తాయి. వీరు శనికి, కుజునికి పరిహారాలు చేయాలి.

సింహం

(ఆదాయం -2, వ్యయం-14, రాజపూజ్యం-2, అవమానం-2)

ఈ రాశివారికి గురుడు దశమస్థానంలో సంచారం గోచారరీత్యా ప్రతికూలమైనప్పటికీ మూర్తిమంతంచేత శుభదాయకుడు. పొదుపు చేయాలన్న కోరిక ఫలించదు. నమ్మినవారే వంచించే అవకాశాలు ఎక్కువ. ఇరురలు విషయాలలోనూ జోక్యం చేసుకో పోవడం మేలు. కుటుంబంలో కొన్ని సమస్యలు అగ్నిపరీక్షగా మారవచ్చు. అయితే గురుడు కొంత యోగాన్నిస్తాడు. ఆస్తులు కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. రాహు ప్రభావం వల్ల ఆరోగ్యం ముఖ్యంగా నరాలు, ఎముకలు, చర్మ సంబంధింత వ్యాధులు ఇబ్బంది పెట్టవచ్చు.. వ్యాపారస్తుల కొంతమేర లాభాలు పెట్టుబడులకే సరిపోతాయి. కళాకారులు కొన్ని అవకాశాలను పెండింగ్‌లో పెడతారు. విద్యార్థులు మరింత కష్టపడితే అనుకున్నది సాధిస్తారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. చైత్రం, వైశాఖ మాసాల్లో అప్రమత్తత అవసరం. గురు, శని, రాహు,కేతువులకు పరిహారాలు చేయాలి. శ్రీనృసింహస్తోత్రాల పఠనం ఉపయుక్తంగా ఉంటుంది.

కన్య

(ఆదాయం-5, వ్యయం-5, రాజపూజ్యం-5, అవమానం-2)

ఈ రాశివారికి సంవత్సరమంతా ఉత్సాహంగా సాగుతుంది. అష్టమ గురు దోషం మే 1 నుండి తొలగి పోయి శుభాలు కలుగుతాయి. ఉన్నత చదువుల యత్నాలు సఫలమవుతాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలన్న విద్యార్థుల కోరిక నెరవేరవచ్చు. ఆదాయ వ్యయాలు సమానంగా లోటు లేని జీవనం సాగిస్తారు. సమస్యలను ఎంతో నేర్పుగా అధిగమించి సత్తా చాటుకుంటారు. శని మానసిక వేదనను తొలగించి ఆనందాన్నిస్తాడు. సొంత ఇంటి కల నెరవేరేందుకు ఇదే సమయం. వివాహయత్నాలు సాగించే వారికి శుభదాయకం ఉంటుంది. శాస్త్రసాంకేతిక వర్గాల దీర్ఘకాల కల ఫలిస్తుంది. వ్యాపారస్తులు మరింత లాభపడతారు. భాగస్వాములు సంతృప్తి చెందుతారు.ఉద్యోగస్తుల• తమ సేవలకు తగిన పురస్కారాలు స్వీకరిస్తారు. రాజకీయవేత్తలు విజయాల వైపు పయనిస్తారు. వ్యవసాయదారులు రెండు పంటలూ లాభించి కాస్త ఊరట చెందుతారు. మహిళలకు మనోనిబ్బరం, ఆత్మవిశ్వాసం పెరిగి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. చైత్రం, శ్రావణం, ఆశ్వయుజం, పుష్యమాసాలు మినహా మిగతావి శుభదాయకంగా నడుస్తాయి. వీరు శివాలయంలో రుద్రాభిషేకం జరిపించుకుంటే ఉత్తమం.

తుల

(ఆదాయం-2, వ్యయం-8, రాజపూజ్యం-1, అవమానం-5)

ఈ రాశివారికి గురుడు మే 1వ తేదీ నుండి అష్టమస్థానంలో సంచారం కొంత సానుకూల, ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. శని, రాహుకేతువుల సంచారం అను కూలం. తండ్రి నుండి ఆస్తి సంక్రమించే అవకాశా లున్నాయి. కోర్టులో ఉన్న వివాదం సమసిపోయే సూచనలు. పరిశోధనలు వృద్ధిపథంలో సాగుతుంటే మరోవైపు అప్పులు, అడ్డంకులు, విపత్తులు, సవాళ్లుగా మారతాయి. ఆధ్యాత్మిక విషయాలలో ఎక్కువగా శ్రద్ధ చూపుతారు. విద్యార్థులకు చదువుల్లో ఉన్నతి, విదేశాలకు వెళ్లాలన్న సంకల్పం నెరవేరుతుంది. బకాయిలు రాబట్టు కునేందుకు కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి.

ఆర్థికంగా కొంత అస్థిరత ఉన్నా ఎటువంటి లోటు రాకుండా జాగ్రత్తపడతారు.శని అనుకూల ప్రభావంతో వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు. అక్టోబర్‌, ‌నవంబర్‌, ‌డిసెంబర్‌లో గురుని అష్టమస్థితి వక్రగతి వల్ల ఆరోగ్యం కొంత క్షీణించ వచ్చు. ద్వితీయార్థంలో వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలు కొన్ని పరిశ్రమలకు శ్రీకారం చుడతారు. రాజకీయవేత్తలకు మునుపటి కంటే మెరుగ్గా ఉండి గుర్తింపు పొందుతారు. కళాకారులు కోరుకున్న అవకాశాలు దక్కించుకునే వరకూ విశ్రమించరు. వ్యవసాయదారులకు రెండు పంటలూ ఆశాజనకంగా ఉంటాయి. తరచూ ప్రయాణాలు చేస్తూ అలసట చెందుతారు. ఆర్థికంగా కొంత అస్థిరత ఉంటుంది. అయినా ఎటువంటి లోటు లేకుండా జాగ్రత్తపడతారు. వ్యాపార విషయాలలో ఆకస్మిక సంఘటనలు ఎదురవుతాయి. దీంతో సందిగ్ధంలో పడతారు. వైశాఖం, మాఘ మాసాలు మినహా మిగతావి సానుకూలమైనవే. వీరు గురునికి పరిహారాలు చేయించడం మంచిది.

వృశ్చికం

(ఆదాయం-8, వ్యయం-14, రాజపూజ్యం-4, అవమానం-5)

ఈ రాశివారికి అర్ధాష్టమ శని దోషం ఉన్నప్పటికీ కుంభరాశిలో సంచారం వల్ల అప్పు డప్పుడు శుభత్వాన్నిస్తాడు. మే 1వ తేదీ నుండి గురుడు సప్తమరాశిలో సంచారం శుభదాయకం. రాహుకేతువులు పంచమ, లాభస్థానా లలో సంచారం సామాన్యంగా ఉంటుంది. వీరికి ఆర్థిక విషయాలలో ఎదురుండదు. కుటుంబంలో గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. మీ ఆశయాలు మంచివైనా వాటి సాధనలో కొందరు మోకాలడ్డుతారు. ఆస్తులు సమకూర్చుకోవడంలో నెలకొన్న స్తబ్ధత తొలగి ఊపిరిపీల్చుకుంటారు. దీర్ఘకాలికంగా నడుస్తున్న న్యాయపరమైన వివాదాలు కొలిక్కి వచ్చే సూచనలు. విద్యార్థులకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇంటి నిర్మాణం, తల్లి ఆరోగ్యం వంటి విషయాలలో కొంత ఆదుర్దా కనిపిస్తుంది. వ్యాపారులు గతంలో లేని లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు విధుల్లో సమర్థతను నిరూపించుకుంటారు. రాజకీయవేత్తలకు కొత్త బాధ్యతలు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణుల కృషి సఫలీకృతమవుతుంది. మరుగునపడిన వారికి గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయరుల ఆశలు ఫలించి రెండు పంటలూ అనుకూలిస్తాయి.  వైశాఖం, కార్తీకం, పుష్యమాసాలు మినహా మిగతావి విశేషంగా కలసివస్తాయి. వీరు శనీశ్వరునికి పరిహారాలు చేయడం, చండీపారాయణ మంచిది.

ధనుస్సు

(ఆదాయం-11, వ్యయం-5, రాజపూజ్యం-7, అవమానం-5)

ఈ రాశివారికి ప్రథమార్ధం విశేషంగా కలిసి వస్తుంది. ద్వితీయార్థంలో కొన్ని సమస్యలు తట్టుకుని మనోబలం పెంచుకుని ముందడుగు వేస్తారు. గురుని షష్ఠమస్థితి, రాహువు అర్థాష్ఠమస్థితి వల్ల ఆరోగ్యంపై శ్రద్ద చూపడం మంచిది. ఆర్థికంగా కొంత వెనుకబడ్డా అవసరాలకు లోటు రాదు. భూసంబంధిత వివాదాలను పరిష్కరించుకోవడం వంటి ఫలితాలు ఉంటాయి. ఇతరుల మెప్పు కోసం కాకుండా మీకు ఉపయోగమైన నిర్ణయాలు తీసుకోండి.కుటుంబంలో ఎటువంటి అరమరికలు లేకుండా ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా చెబుతారు. ఇంటి నిర్మాణాలపై నిర్ణయాలు తీసుకుని ఆ దిశగా కదులుతారు.

విద్యార్థులకు వైద్యవిద్యావకాశాలు లభించే అవకాశాలున్నాయి. అక్టోబర్‌-‌జనవరి మధ్య కాలంలో గురుని వక్రస్థితి వల్ల శుభకార్యాల నిర్వహణ, సంతానసౌఖ్యం, ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపా రస్తులు స్వశక్తిని నమ్ముకుని అభివృద్ధి వైపు నడుస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నతవర్గాలలో మంచి గుర్తింపు. రాజకీయవేత్తలు మునుపటి కంటే మెరుగైన అవకా శాలు దక్కించుకుంటారు. కళాకారులకు వద్దంటే అవకాశాలు అన్నట్లుగా ఉంటుంది. పారిశ్రామిక వేత్తలు, సాఫ్ట్‌వేర్‌ ‌రంగాల వారు మరింత ప్రగతిని సాధిస్తారు. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండో పంట లాభసాటిగా ఉంటుంది. మహిళల ఆశలు నెరవేరతాయి. మార్గశిరం, పుష్యమాసాలు మినహా మిగతావి శుభదాయకం. వీరు గురునికి, రాహువునకు పరిహారాలు చేయడం ఉత్తమం.

మకరం

(ఆదాయం-14, వ్యయం-14, రాజపూజ్యం-3, అవమానం-1)

ఈ రాశివారికి మే 1వ తేదీ నుండి గురుని పంచమకోణస్థితి అత్యంత శుభదాయకం. ఏలిననాటి శని నడుస్తున్నా సువర్ణమూర్తి కావడం అనుకూలం. రాహుకేతువులు కూడా శుభకారకులే. అనుకున్నది జాప్యం లేకుండా పూర్తి కాగలదు. ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి. అయితే వివిధ రూపాలలో ఖర్చులు కూడా ఎదురవుతాయి. ఇతరులకు చేయూతనివ్వడంలో ముందడుగు వేస్తారు. వివాహాది శుభకార్యాలు, సంతాన సౌఖ్యం వంటి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు విదేశీ విద్యలు, ఉద్యోగాలు దక్కుతాయి. ఎవరినీ నొప్పించని రీతిలో నిర్ణయాలు తీసుకుని ప్రశంసలు అందుకుంటారు. ఇంటి నిర్మాణ కల నెరవేరే సమయం. పెద్దవాహనాలు కొనుగోలు చేస్తారు. శని ప్రభావం కొంత ఆరోగ్యంపై పడొచ్చు. వ్యాపారస్తులు ఇబ్బడిముబ్బడిగా లాభాలు పొందుతారు. శాస్త్రసాంకేతిక వర్గాల వారు కొత్త పరిశోధనల ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తారు. రాజకీయవేత్తలకు పదవీయోగం, న్యాయపరమైన వివాదాల నుండి విముక్తి. పారిశ్రామికవేత్తలు, వైద్యులు ఆత్మవిశ్వాసంతో కార్యాలను చక్కదిద్దుతారు. కళాకారులకు అవకాశాలకు లోటు ఉండదు. కొందరికి అవార్డులు సైతం రావచ్చు. వ్యవసాయ దారులు రెండుపంటలూ అనుకూలించి ఉత్సాహంతో గడుపుతారు. మహిళలకు మానసికంగా మరింత బలం చేకూరుతుంది. చైత్రం, ఆషాఢం, ఆశ్వయుజ మాసాలు మినహా మిగతావి మరింత అనుకూలం. వీరు శనీశ్వరునికి తైలాభిషేకాలు, ఆంజనేయ స్వామికి అర్చనలు చేయడం ఉత్తమం.

కుంభం

(ఆదాయం-14, వ్యయం-14, రాజపూజ్యం-6, అవమానం-1)

ఈ రాశివారికి ఆదాయవ్యయాలు సమాన స్థాయిలో ఉంటాయి. గురుడు మే 1వ తేదీ నుండి చతుర్ధంలో సంచారం వల్ల ఆర్థికంగా బలపడడానికి కఠోర పరిశ్రమ చేయాల్సి ఉంటుంది. శని జన్మరాశి సంచారం మానసిక ఒత్తిడులు, వ్యయప్రయాసలు కలిగిస్తుంది. రాహు కేతువులు సామాన్యమైన ఫలితాలే ఇస్తారు.ఖర్చుల విషయంలో తగు జాగ్రత్తలు అవసరం.తల్లి లేదా ఆమె తరపు వారితో విరోధాలు. విద్యార్థులకు శ్రమానంతరం అనుకూల ఫలితాలు రావచ్చు. ఉద్యోగార్థుల యత్నాలు కొలిక్కి వచ్చే సమయంలో న్యాయపరంగా శ్రమానంతరం కొన్ని అనుకూల ఫలితాలు.  ద్వితీయార్థంలోఇంటి నిర్మాణ యత్నాలు నెరవేరతాయి. ఒక సందర్భంలో కాస్త సమస్యలు, ఇబ్బందులు ఎదురై కుదుపునకు గురైనా, ఆత్మబలమే తోడ్పడుతుంది. వ్యాపారస్తులు క్రమేపీ లాభాల బాటపడతారు. ఉద్యోగస్తులకు ద్వితీ యార్థంలో విశేష గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామిక వేత్తలు, వైద్యులు సేవలు విస్తృతం చేసి సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.రాజకీయవేత్తలకు పదవులు దక్కినా కొంత అసంతృప్తితోనే గడుపుతారు. కళాకారులు అందిన అవకాశాలు సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేస్తారు. వ్యవసాయ దారులకు రెండోపంట కలసివస్తుంది.మహిళలకు మనోనిబ్బరం పెరిగి తదనుగుణంగా ముందుకు సాగుతారు. చైత్రం, ఆషాఢం, భాద్రపద మాసాలు తప్ప మిగతావి సానుకూలం. వీరు శనీశ్వరునికి, రాహుకేతువులకు పరిహారాలు చేయాలి.

మీనం

(ఆదాయం-11, వ్యయం-5, రాజపూజ్యం-2, అవమానం-4)

ఈ రాశివారికి గురుడు మే 1 నుండి తృతీయ రాశిలో సంచారం, శని వ్యయస్థితి, జన్మరాహువు, సప్తమంలో కేతువు సంచారం నామమాత్రంగా ఉంటుంది. వీరు అన్నింటా తగు జాగ్రత్తలు పాటిస్తూ దైవాన్ని స్మరిస్తూ ముందుకు సాగడం మంచిది. ఆర్థిక విషయాలు గందరగోళంగా మారి అవసరాలకు కూడా ఇబ్బందిపడాల్సి వస్తుంది. ఇతరుల వ్యవహారా లలో జోక్యం ద్వారా మాటపడతారు. ఎవరినీ అతిగా విశ్వసించకుండా మీ ఆలోచనల మేరకు అడుగులు వేయడం మంచిది. ఆరోగ్యంపై తగు జాగ్రత్తలు పాటిస్తూ, ఎప్పటికప్పుడు వైద్య సలహాలు స్వీకరిస్తూ ఉండాలి. కుటుంబంలో మీ మాటంటే అంతగా పట్టించుకోని వైనం. ఏ వ్యవహారం చేపట్టాలన్నా ధైర్యం చాలక వెనుకడుగు వేస్తారు. రాహువు కారణంగా శత్రుబాధలు, మానసిక ఒత్తిడులు పెరుగుతాయి. భార్యాపుత్రుల తోనూ వివాదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకునే విధంగా యత్నిస్తారు. అయితే ఆత్మవిశ్వాసం పెంచుకుని పట్టుదల, నేర్పుగా సాగితే కొన్ని సమస్యలు అధిగమిస్తారు. ఇంటి నిర్మాణాలను మధ్యలో నిలిపి వేసే అవకాశం. సోదరీసోదరులతో సత్సంబంధాలు దెబ్బతినకుండా తగు విధంగా నడుచుకోవడం మంచిది.విద్యార్థులు ఎంత కష్టించినా ఫలితం కొంత నిరాశ కలిగిస్తుంది.

వ్యాపారస్తులు గతం కంటే లాభాలు తగ్గి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధి కారుల బెదిరింపులు, పనిలో భారం సవాలుగా మారవచ్చు. పారిశ్రామికవేత్తలు, వైద్యులు సహనంతో ఉంటే కొంత అనుకూలత పొందుతారు. కళాకారులు అందివచ్చిన అవకాశాలు సైతం వదులుకుంటారు. అలాగే, కొన్ని అగ్రిమెంట్లు రద్దు చేసుకుంటారు. వ్యవసాయదారులకు పంటలు సాధారణ స్థాయిలో ఉంటాయి. పెట్టుబడులకు ఇబ్బంది ఉండదు. మహిళలు మానసిక ఆందోళనతో గడుపుతారు. చైత్రం, ఆశ్వయుజం, పుష్యమాసాలు సామాన్యంగా, మిగతావి మిశ్రమంగా ఉంటాయి. వీరు నిత్యం ఆంజనేయస్వామి స్తోత్రాలు పఠించడం మంచిది.

శుభమస్తు! సర్వేజనాం సుఖినోభవంతు!!

About Author

By editor

Twitter
Instagram