ఈ జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరగుతున్న  అల్లూరి 125వ జయంత్యుత్సవాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్న సందర్భంగా

భారత స్వాతంత్య్రోద్యమానికి అనేక దశలు ఉన్నాయి. మితవాదం, అతివాదం, తీవ్ర జాతీయవాదం కూడా ఆ గమనంలో కనిపిస్తాయి. వాదం, పంథా ఏదైనా వారందరి ధ్యేయం దేశానికి స్వాతంత్య్రం. మైదానాలో భారత జాతీయ కాంగ్రెస్‌ ‌నాయకత్వంలో ప్రధానంగా ఉద్యమం జరిగినా, కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అలాంటివే గిరిజనోద్యమాలు. గెరిల్లా యుద్ధ పంథాలో  కొండకోనలలో జరిగిన అలాంటి గిరిజనోద్యమాలలో కీలకమైనది తూర్పు కనుమలలో జరిగిన విశాఖ మన్య విప్లవం. ఈ విప్లవ నాయకుడు అల్లూరి శ్రీరామరాజు. మైదాన ప్రాంతం నుంచి మన్యం వెళ్లి, గిరిజనులను ఏకం చేసి భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు ఏనాటికీ మరచిపోలేని ఒక మహోద్యమాన్ని నిర్మించారు శ్రీరామరాజు (ప్రజా బాహుళ్యంలో సీతారామరాజు అనే పేరు ప్రసిద్ధమైనా, అసలు పేరు శ్రీరామరాజు). ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవాల వేళ రామరాజు 125వ జయంత్యుత్సవాలను కూడా జరుపుకోవడం ఎంతో ఆనందాయకం.   


మైదాన ప్రాంతానికి చెందిన శ్రీరామరాజు, విశాఖ మన్యసీమలో భారత గిరిజనోద్యమాలకే మకుటాయమానమైన ఉద్యమాన్ని నిర్వహించడం ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులనే బట్టే జరిగింది. ఆయన విశాఖ జిల్లా భీమునిపట్నానికి సమీపంలోని పాండ్రంగిలో జూలై 4, 1897న అమ్మమ్మగారింట పుట్టాడు. వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ తల్లిదండ్రులు. వీరి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు. వెంకటరామరాజు ఫోటోగ్రాఫర్‌. ‌పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, తరువాత రాజమహేంద్రవరంలో స్టూడియోలు నిర్వహించారు. ఆయన జాతీయవాది. రాజమండ్రి ఇన్నిస్‌పేటలోని ఆయన స్టూడియోలో తిలక్‌, ‌లాజ్‌పతిరాయ్‌ ‌వంటి మహనీయుల ఫోటోలు దర్శనమిచ్చేవి. బెంగాల్‌ ‌విభజన వ్యతిరేకోద్యమ ప్రచారం కోసం 1907లో రాజమండ్రిలో ఏర్పాటు చేసిన సభలో బిపిన్‌ ‌చంద్రపాల్‌ ‌ప్రసంగించారు. ఆ సభా వేదిక గోదావరి తీరంలో ఇన్నిస్‌పేటలోనే ఏర్పాటయింది. 1908లో వెంకటరామరాజు కలరాతో హఠాత్తుగా మరణించారు. సూర్యనారాయ ణమ్మ పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వాడ చేరింది. కొవ్వాడ, నరసాపురం టేలర్‌ ‌స్కూల్‌, ‌రామ చంద్రపురం, విశాఖ ఏవీఎన్‌ ‌విద్యాసంస్థ, తునిలలో బంధువులు, సన్నిహితుల ప్రాపకంలో రామరాజు విద్యాభ్యాసం సాగింది. పినతండ్రి, ట్రెజరీ డిప్యూటీ కలెక్టర్‌ ‌రామకృష్ణంరాజు రామచంద్రపురానికి బదలీ అయినప్పుడు శ్రీరామరాజు కుటుంబాన్ని అక్కడికి రప్పించారు. ఆయనకు కాకినాడ బదలీ కాగా, శ్రీరామరాజును అక్కడి పిఠాపురం రాజా విద్యా సంస్థలో చేర్పించారు. ఇక్కడి రెండు పరిచయాలు చెప్పుకోదగినవి. ఆనాడు ఆ విద్యాసంస్థకు అధిపతి రఘుపతి వెంకటరత్నం నాయుడు. మూడో ఫారమ్‌లో వేర్వేరు తరగతులే అయినా మద్దూరి అన్నపూర్ణయ్యతో రామరాజుకు స్నేహం ఏర్పడింది. చిన్నతనం నుంచి రామరాజుకు ఇంగ్లిష్‌ ‌చదువు మీద గౌరవం ఉండేది కాదు. ఈ సంగతి అన్నపూర్ణయ్య జ్ఞాపకాల ద్వారా తెలిసింది. రామరాజుకు సంస్కృత విద్య పట్ల ఆసక్తి, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. తునిలో ఉండగానే ఇంగ్లిష్‌ ‌చదివి ఉద్యోగం సంపాదించమని పోరుతున్న తల్లితో కొలువులో చేరతానని చెప్పి కొంత డబ్బు తీసుకుని 1915లో ఇల్లు విడిచి వెళ్లిపోయాడు శ్రీరామరాజు. ఉత్తర భారతమంతా తిరిగి, హరిద్వార్‌ ‌దర్శించుకున్నాడు. అక్కడ నుంచే అమ్మకు ఉత్తరం రాశాడు.

 విశాఖ మన్యానికి గుమ్మం వంటి గ్రామం కృష్ణదేవిపేట. జూలై 24, 1917న శ్రీరామరాజు దేశ పర్యటనలో భాగంగానే ఆ ఊరు చేరుకున్నాడు. ఊరి పెద్ద చిటికెల భాస్కరనాయుడు ఆశ్రయం ఇచ్చాడు. గ్రామం ఆయనను ఒక యతిలా చూసింది. ఆ గ్రామంలోను, పక్కనే ఉన్న కొంగసింగి వంటి గ్రామాలలోను రామరాజు మండల దీక్షలు నిర్వహించారు. అప్పుడే మన్యంలో పరిస్థితులు అర్ధమయ్యాయి. 1882 నాటి అటవీ చట్టాలతో గిరిజనులంతా దిక్కులేని వారైపోయారు.

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత కరవు వచ్చింది. ప్రజలకు ఉపాధి కల్పించడానికి బ్రిటిష్‌ ‌ప్రభుత్వం పనులు ప్రారంభించింది. మన్యంలో రోడ్ల నిర్మాణం అలా మొదలయినదే. గూడెం డిప్యూటీ తహసీల్దార్‌ అల్ఫ్ ‌బాస్టియన్‌ ‌బినామీ పేరుతో కాంట్రాక్టు తీసుకుని, మన్యం మునసబులు, ముఠాదారులను బెదిరించి గిరిజనులను పనికి రప్పించి కూలి ఇవ్వక వేధించేవాడు. ఇలాంటి సమయంలో పెద్దవలస మాజీ ముఠాదారు కంకిపాటి బాలయ్యపడాలు (ఎండు పడాలు), బట్టిపనుకుల మునసబు గాం గంతన్న దొర, అతని సోదరుడు గాం మల్లు దొర, గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు, సంకోజు ముక్కడు, కర్రి కణ్ణిగాడు వంటివారు 1922 జనవరిలో శ్రీరామ విజయ నగరం వచ్చి రామరాజుకు గోడు వినిపించుకున్నారు. దానితో శ్రీరామరాజు బాస్టియన్‌ ‌మీద పై అధికారులకు ఫిర్యాదు రాశారు. ఫలితం-రామరాజు మన్యంలో సహాయ నిరాకరణ ఆరంభించాడంటూ ఆ జనవరి 29న ఏజెన్సీ కమిషనర్‌ ‌స్వెయిన్‌ ‌విచారణ జరిపాడు. దీనికి కారణం ఉంది. ఫిబ్రవరి 1- 4 మధ్య జాతీయోద్యమంలో పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. ఆ ఒకటో తేదీన సహాయ నిరాకర ణను తీవ్రం చేస్తున్నట్టు గాంధీజీ ప్రకటించారు. దేశం నిండా తొలిసారి గొప్ప ఉద్యమ స్పృహ నెలకొంది. మూడో తేదీన ఇక్కడ రామరాజును పొలిటికల్‌ ‌సస్పెక్ట్‌గా భావించి నర్సీపట్నం జైలులో ఉంచారు. ఆ ఫిబ్రవరి 4న చౌరీచౌరా ఉదంతంతో గాంధీజీ తాను ఇచ్చిన సహాయ నిరాకరణ పిలుపును ఉపసంహరించుకున్నారు. తాను చెప్పిన పంథాలో ఉద్యమిస్తే సంవత్సరంలోనే స్వాతంత్య్రం తథ్యమన్న గాంధీజీ మాటతో ఎంతో ఆశతో ఉన్న దేశ యువతను గాంధీజీ నిర్ణయం ఇతర పంథాల వైపు అడుగులు వేయించింది. అలాంటి వారిలో రామరాజు కూడా ఒకరు.

చింతపల్లి మీద దాడితో…

రామరాజు మొదట మన్యవాసులను సంస్క రించారు. కోర్టులకు పోకుండా పంచాయతీల ద్వారా వివాదాలు పరిష్కరించుకునేటట్టు చేశారు. కల్లు మానిపించారు.వారినే ఏకం చేసి ఉద్యమించారు. విశాఖ కొండలలో తిరుగుబాట్లు కొత్తకాదు. శాంతభూపతి, ద్వారబంధాల చంద్రయ్య, కారం తమ్మనదొర, రేకపల్లి అంబురెడ్డి వంటి ఎందరో అక్కడ తిరుగుబాట్లు చేశారు. రాజు మన్యవాసుల ఉద్యమ దృష్టిని విస్తృతం చేశారు. గెరిల్లా యుద్ధ రీతిని ఎంచుకున్నారు. ఈ వ్యూహాలను ఆయన ఉత్తర భారత యాత్రలో ఉండగా నేర్చుకుని ఉండాలని పోలీసులు ఊహించారు. రామరాజు 1921లో నాసికాత్య్రంబకం వెళ్లారు. అప్పుడు అక్కడ సావర్కర్‌ ‌సోదరుల నాయకత్వంలో అభినవ భారతి ఉద్యమ ప్రభావం ఉంది. మన్య ప్రజల సంప్రదాయిక ఆయుధాలు, ఆధునిక ఆయుధాలతో ఉద్యమం జరగాలని ఆయన వ్యూహం. మన్య విప్లవ ధ్యేయం, ఈ విప్లవానికీ మైదాన ప్రాంతంలోని కాంగ్రెస్‌ ఉద్యమానికీ మధ్య ఉండవలసిన బంధం వంటి అంశాలలో శ్రీరామరాజుకు స్పష్టత ఉంది. గెరిల్లా పోరుకు మొదట ఆయుధాలు కావాలి. అందుకు పోలీస్‌ ‌స్టేషన్లు కొట్టాలి. ఎండు పడాలు, గంతన్న, రామరాజు-మల్లు నాయకత్వాలలో మూడు దళాలు ఏర్పాటు చేశారు. ఆ ఆగస్ట్ 22 ‌పట్టపగలు మొదట చింతపల్లి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌మీద దాడి చేశారు- దాదాపు మూడు వందల మంది. దారిలో కనిపించిన చింతపల్లి ఎస్‌ఐ ఈరెన అప్పలస్వామినాయుడుకి సంగతి చెప్పి మరీ దాడి చేశారు మన్యవాసులు. 11 తుపాకులు దొరికాయి. ఈ ఆయుధాలు తీసుకు వెళుతున్నానని ఒక లేఖ రాసి మరీ వెళ్లారు రామరాజు. నిజానికి చింతపల్లి స్టేషన్‌ ‌మీద దాడితోనే రామరాజు ఉద్యమ తత్త్వం తెలుస్తుంది. ఉద్యమ కారుల చేత ‘వందేమాతరం-మనదే రాజ్యం’ అంటూ, ‘గాంధీజీకి జై’ అంటూ రామరాజు నినాదాలు చేయించారు. ఆగస్ట్ 23‌న కృష్ణదేవిపేట పోలీస్‌ ‌స్టేషన్‌ ‌మీద దాడి జరిగింది. సిబ్బంది పారిపోయింది. 7 తుపాకులు దొరికాయి. ఆగస్ట్ 24‌న రాజవొమ్మంగి స్టేషన్‌ (‌తూర్పు గోదావరి)ను ఎంచుకుని దాడి చేశారు. 8 తుపాకులు దొరికాయి. లాగరాయి ఫితూరీని సమర్ధించిన నేరానికి అరెస్టయిన మొట్టడం వీరయ్యదొర అప్పుడు ఆ స్టేషన్‌లోనే ఉన్నారు (ఈయన తండ్రి సొబిలను దొర. 1879 నాటి ఫితూరీలో ఉన్నాడు). వీరయ్యదొరను విడిపించడం కూడా ఈ దాడి ఆశయాలలో ఒకటి. ఈ దాడులలో వందలాది తూటాలు, బాయ్‌నెట్లు, యూనిఫారాలు కూడా కొండదళం స్వాధీనం చేసుకుంది.‘ఆంధ్రపత్రిక’,‘కృష్ణాపత్రిక’, రాజమండ్రి నుంచి వెలువడే ‘కాంగ్రెస్‌’ (‌మద్దూరి అన్నపూర్ణయ్య సంపాదకుడు) ఆ వార్తలను ప్రచురించాయి. నిజానికి పోలీసులను చూస్తేనే హడలిపోయే మన్యవాసులు వరసగా పోలీసు స్టేషన్ల మీద దాడి చేయడంతోనే మద్రాస్‌ ‌ప్రెసెడెన్సీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎ ‌గ్రాహమ్‌కు టెలిగ్రామ్‌లు వెళ్లాయి. తూర్పు, కృష్ణా, ఇటు ఒరిస్సాలోని మల్కన్‌గిరి నుంచి పోలీసు బలగాలన్నీ చేరు కున్నాయి. ఆ వాతా వరణంలోను జైపూర్‌ ‌మహారాజు ఐదు ఏనుగుల మీద పోలీసుల కోసం పంపిన సామగ్రిని సెప్టెంబర్‌ 3‌న ఒంజేరి ఘాట్‌లో రాజుదళం వశం చేసుకుంది. ఇది ఒక సంచలనం.

చింతపల్లి, కృష్ణదేవిపేట, రావొమ్మంగా స్టేషన్ల మీద సాధించిన విజయం కంటే దామనపల్లి అనే కొండ మార్గంలో సెప్టెంబర్‌ 24,1922‌న దక్కిన విజయం ఎంతో గొప్పది. దామనపల్లికి రాజు దళం వస్తున్నదన్న సమాచారం తెలిసి స్కాట్‌ ‌కవర్ట్, ‌నెవెల్లి హైటర్‌ అనే ఒరిస్సా పోలీసు అధికారుల నాయ కత్వంలో రెండు పటాలాలు వెళ్లాయి. ఇందులో హైటర్‌ ‌మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొన్నాడు. కానీ ఆ ఇద్దరినీ కూడా కొండదళం మట్టుపెట్టింది. అక్టోబర్‌ 15‌న అడ్డతీగల మీద రాజు దాడి చేశారు. కానీ ఆయుధాలు దొరకలేదు. అక్టోబర్‌ 19‌న చోడవరం స్టేషన్‌లోను ఇదే అనుభవం.అప్పటికే స్టేషన్లలోని ఆయుధాలను ట్రెజరీలకి తరలించడం మొదలయి పోయింది.

కొండలలో పోరాడడంలో నేర్పు ఉన్న మలబారు దళాలు వచ్చిన తరువాత డిసెంబర్‌ 6‌న పెద్దగడ్డ పాలెం, లింగాపురం అనేచోట్ల రాజుదళం వారితో తలపడవలసి వచ్చింది. దళాల దగ్గర లూయీ ఫిరంగులు ఉన్నాయి. ఒక భీకర పోరాటమే జరిగింది. రెండుచోట్ల కలిపి ఎనిమిది మంది రాజు అనుచరులు వీరమరణం చెందారు. ఈ మృత దేహాలను మన్యంలో ఊరేగించి, భయానికి బీజం వేశారు. డిసెంబర్‌ 23‌న ఉద్యమకారులను పట్టిస్తే నగదు బహుమానాలు ఇస్తామంటూ ప్రకటన వచ్చింది. నాలుగు మాసాలు మన్యంలో మౌనం తాండవించింది.

రామరాజు ఉద్యమం చల్లారిపోయిందని అంతా భావిస్తున్న తరుణంలో ఏప్రిల్‌ 17, 1923‌న రామరాజు దళం ఆకస్మాత్తుగా అన్నవరం పోలీస్‌ ‌స్టేషన్‌లో ప్రత్యక్షమై మొత్తం యంత్రాంగాన్ని కలవర పరిచింది. పైగా ప్రజలు ఆయనకు హారతులు పట్టారు. అన్నవరం సంఘటన తరువాత మన్య వాసుల ఉద్యమంలోకి వేగిరాజు సత్యనారాయణ రాజు(అగ్గిరాజు) వచ్చారు. ఆ ఏడాది సెప్టెంబర్‌ 17 ‌రాత్రి మల్లుదొర దొరికి పోవడం ఉద్యమానికి కీడు చేసింది. ఆ సంవత్సరం డిసెంబర్‌లో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ ‌సమావేశాలకు రామరాజు మారువేషంలో హాజరయ్యారు.

కాలం గడుస్తున్న కొద్దీ అణచివేత తీవ్రమైంది. అప్పటికే మన్యంలో ఉన్న బలగాలకు 1924 జనవరికి అస్సాం రైఫిల్స్ ‌తోడుగా వచ్చింది. వీరికి కూడా మొదటి ప్రపంచ యుద్ధంలో అనుభవం ఉంది. అప్పటికి మన్యం మీద ప్రయోగించిన బలగాల సంఖ్య దాదాపు వేయి. రాజుదళం సంఖ్య వంద. అస్సాం రైఫిల్స్ అధిపతే మేజర్‌ ‌గుడాల్‌. ఆ ‌సంవత్సరం ఏప్రిల్‌లో గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న థామస్‌ ‌జార్జ్ ‌రూథర్‌ఫర్డ్‌ను విశాఖ మన్యంలో పోలీసు చర్యకు స్పెషల్‌ ‌కమిషనర్‌గా నియమించారు. చీరాల పేరాల, కన్నెగంటి హనుమల ఉద్యమాలని అణచిన అనుభవం ఇతడిది. ఏప్రిల్‌ ‌నుంచి జూన్‌ 24 ‌వరకే అతడి అధికారం ఇచ్చారు. అంటే అంతలోనే ఉద్యమం అణగిపోవాలి. మన్యం పోలీసు హింసతో, అత్యాచారాలతో తల్లడిల్లిపోయింది. మే ఆరవ తేదీన మంప చేరుకుని, రామరాజు ఒక చేనులోని మంచె మీద పరున్నాడు. రాజు వేకువనే మంచె దిగి అక్కడి కుంటలో స్నానం చేస్తుండగా ఈస్ట్‌కోస్ట్ ‌దళానికి చెందిన కంచుమేనన్‌, ఇం‌టెలిజెన్స్ ‌పెట్రోలింగ్‌ ‌సబిన్స్‌పెక్టర్‌ ఆళ్వార్‌నాయుడు అరెస్టు చేశారు.

అరెస్టు చేసిన రాజును ఒక నులక మంచానికి కట్టి, యథాప్రకారం గిరిజనుల చేతనే మోయిస్తూ కృష్ణదేవిపేటకు పయనమయ్యారు. దారిలోనే ఉంది కొయ్యూరు. అక్కడే ఉన్న మేజర్‌ ‌గుడాల్‌ ‌రాజును కట్టిన మంచాన్ని బలవంతంగా దింపించాడు. మాట్లాడతానని గుడారంలోకి తీసుకువెళ్లాడు. అక్కడే ఇద్దరికీ వాగ్యుద్ధం జరిగింది. ఆగ్రహించిన గుడాల్‌ ఒక చెట్టుకు కట్టి కాల్చి చంపాడు. సజీవంగా రాజును అప్పగించాలంటూ కృష్ణదేవిపేట వచ్చి కూర్చున్న రూథర్‌ఫర్డ్ ఈ ‌సంగతి తెలిసి గూడాల్‌ ‌మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరికి రాజు ఎక్కడైతే ఉద్యమ కారునిగా రూపొందాడో ఆ కృష్ణదేవిపేటలోనే తాండవ ఒడ్డున అంత్యక్రియలు జరిపారు.

జూన్‌ 7‌న గాం గంతన్నను పోలీసులు కాల్చి చంపారు. ఈ మధ్యలో ఎందరో ఉద్యమకారులను గ్రామస్థులు, బంధువులు పోలీసులకు అప్పగించారు. మల్లుదొరకి, బోనంగి పండుపడాలుకి మొదట ఉరిశిక్ష పడింది. తరువాత ద్వీపాంతర శిక్షగా మారింది. నిజానికి ఉద్యమకారుల ‘యుద్ధ నేరాలు’ విచారించడానికి 1922లోనే విశాఖపట్నంలో స్పెషల్‌ ‌ట్రిబ్యునల్‌ ఏర్పాటయింది. ఎల్‌హెచ్‌ అరంట్‌ అడిషనల్‌ ‌సెషన్స్ ‌జడ్జి. 270 మంది వరకు ఉద్యమకారులను ట్రిబ్యునల్‌ ‌విచారించి రకరకాల శిక్షలు విధించింది. 12 మందిని అండమాన్‌ ‌కాలాపానీకి పంపారు.

తన పంథా ఎలాంటిదైనప్పటికీ భారతీయులంతా గౌరవిస్తున్న గాంధీజీని రామరాజు గౌరవించడం విశేషం. పంథాలు వేరైనా తామంతా భారతమాత దాస్యశృం•లాలు తెంచడానికి ఉద్యమిస్తున్న సంగతిని ఆయన గుర్తించిన తీరు అద్భుతం. మైదానంలో జరుగుతున్న కాంగ్రెస్‌ ఉద్యమంతో మన్యం పోరాటాన్ని అనుసంధానం చేయాలని ఆయన కోరుకున్నారు. మైదాన ప్రాంతాలకు చెందిన తన మిత్రులను ఉద్యమంలోకి రావలసిందిగా ఆహ్వానాలు పంపారు. అనేక ప్రత్యేకతలు కలిగిన రామరాజు ఉద్యమానికి భారత స్వాతంత్య్ర సమర చరిత్రలో ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌సందర్భంగా అయినా సముచిత స్థానం దక్కాలని కోరుకుందాం. రామరాజును, ఆయన వెంట నడిచి, ఎన్నో త్యాగాలు చేసిన గిరిజన స్వాతంత్య్ర సమరయోధులను మనమంతా ఎప్పటికీ తలుచుకుందాం.

– జి. కిషన్‌ ‌రెడ్డి, కేంద్ర పర్యాటక, ఈశాన్య భారత ప్రాంత సంస్కృతి, అభివృద్ధి వ్యవహారాల మంతి

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram