మార్చి 8 అంతర్జాతీయ మహిళా దిన్సోతవం

ఏడాదిలో ఒకరోజున ప్రత్యేకించి కేటాయించినంత మాత్రాన మహిళలకు ఒరిగేదేమీ ఉండదు. అందుకే ‘ఎందుకీ దినోత్సవాలు? ఇవన్నీ మొక్కుబడి వ్యవహారాలు’ అంటూ పెదవి విరిచేవారు మనలో చాలామంది ఉంటారు. రోజు, పక్షం, నెల, సంవత్సరం – ఇలా నిరంతర ఉత్సవ నిర్వహణలు పరిపాటిగా మారాయి. విదేశాల్లోనైతే ఇవి మరీ. వారిలా మనమూ మక్కికి మక్కీ నిర్వహించుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఉత్సవాల నేపథ్యం, మన దేశానికి ఎంత మాత్రం వర్తిస్తాయన్నది గ్రహించి ఆచరించడం ఎంతైనా ముఖ్యం.

ఎప్పటి మాదిరే ఈసారీ అంతర్జాతీయంగా మహిళా దినోత్సవ నిర్వహణ తేదీ మార్చి ఎనిమిది. నిజానికిది శ్రామిక వనితలకు సంబంధించింది. శారీరకం, మానసికం ఏదైనా శ్రమే. ఆ రీత్యా చూసినప్పుడు, దీనికి శతాధిక సంవత్సరాల ఘనచరిత ఉంది. మహిళలకైనా, పురుషులకైనా చైతన్య దృక్పథం, హక్కుల అవగాహన ప్రధానం. ఈ రెండూ ఉన్నప్పుడే ఇంటా బయటా గెలుపు సుసాధ్యమవుతుంది. తాను జాగృతమై తోటివారినీ చైతన్యపరిచినప్పుడే ముందడుగు. ఎదుటి వ్యక్తి హక్కులకు భంగం కలిగించకుండా, తన హక్కుల్ని తాను కోల్పోకుండా మెలిగినప్పుడే పురోగతి. వీటిని సమన్వయం చేసుకోవడంలోనే మహిళాశక్తి దాగుంది. ‘రాజకీయ స్వతంత్రత, ఆర్థిక సమానత, నిస్వార్థ ప్రభుత, ద్వేషరహిత జాతీయత ఉంటేనే దేశం రాణిస్తుంది. లేకుంటే దుర్బలమై క్షీణిస్తుంది’ ఆకాశవాణి గీతిక మనలో కొంతమందికైనా బాగా గుర్తుండి ఉంటుంది. గతంలోని అస్వతంత్రత, అసమానతలు వనిత పిడికిలి బిగిసేలా చేశాయి. పాలకుల స్వార్థబుద్ధి, అధికారుల పెడవాదం బాధిత వనితల్లో ఉద్యమస్ఫూర్తిని రగిలించాయి. ఫలితంగానే పడతుల చేతుల్లో విజయబావుటాలు రెపరెప లాడాయి. మారుతున్న స్థితిగతులను పరిశీలిస్తే, మనం నిర్వర్తించాల్సిన పాత్ర సులువుగానే అవగతమవుతుంది. ఇప్పటికిప్పుడు మనకు కావాల్సిందీ మనమంతా కోరుకోవా ల్సిందీ ఇంకా చర్చోపచర్చల్ని కాదు, ఇంకెంతో ఆచరణని. మాటల మూటల్ని కట్టి పక్కనపెట్టి, చేతలు మొదలు పెడితేనే దినోత్సవానికి సార్థకత.

వనితల జాగృతికి భారత్‌లో మూలకేంద్రం గుజరాత్‌. అక్కడే కెప్టెన్‌ ‌లక్ష్మీసెహగల్‌, ‌మరికొందరు నేతలుగా శ్రామిక సంఘం మొదలైంది. అటు తర్వాత పని పరిస్థితులు ఎప్పటి కప్పుడు మరింతగా మెరుగవుతూ వచ్చాయి. అంతకుముందు ఎప్పుడో రష్యన్‌ ‌శ్రామిక మహిళల ఆందోళన రాజ్యాధికారాన్నే ఓడించింది. తదుపరి ప్రభుత్వం ఓటుహక్కును అనుమతించింది. మహిళలు పోరు పతాక చేపట్టిన తేదీ అలనాటి గణన ప్రకారం మార్చి 8 కాబట్టే, అది అంతర్జాతీయత సంతరించుకుంది. అప్పటి నుంచీ మన దేశంలోను ఉత్సవ నిర్వహణ. గత పాతికేళ్లను తరచిచూస్తే, ఏటా ఒక ప్రచారాంశాన్ని ఐక్య రాజ్యసమితి ప్రకటిస్తూ వస్తోంది. ప్రస్తుత అంశం – లింగ సమానత్వం. దాదాపు ఇదే భావనతో 2003, 2005, 2016ల్లోనూ నిర్వహించారు. గడచిన దశాబ్ద కాలాన్ని గమనిస్తే, 2011లో వంద దేశాల్లో ఉత్సవాలయ్యాయి. ఆ ఏడాది మార్చి 8ని అమెరికా – వనితల చారిత్రక మాసంగా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా నిరుటి ఇతివృత్తం-సమాన భవిష్యత్తు. నాడు 1996 నుంచి నేడు 2022 వరకు విభిన్న అంశాల ఆధారంగా వేడుకలు నిర్వహిస్తూనే వస్తున్నారు. అన్నింటా అంతటా వనితల భాగస్వామ్యం పెరగాలన్న ఏకైక లక్ష్యంతోనే భారతదేశంలో కూడా వార్షిక కార్యక్రమాల బాధ్యత వహిస్తు న్నారు. పాశ్చాత్య వైద్యంలో సుశిక్షణ అందుకున్న తొలి భారతీయ వనితారత్నం ఆనందీబాయి. అమెరికాకు మొదటగా ప్రయాణం చేసిన మహిళామణీ తానే. మొట్టమొదటి ఆటోరిక్షా సారథిగా పేరొందిన మరొక భారతీయురాలు షీలా. అంగవైకల్యం ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో ప్రథమంగా అత్యున్నత ఎవరెస్ట్ ‌శిఖరాన్ని అధిరోహించిన పర్వతారోహకురాలు ఆరుణిమ. మోడలింగ్‌ ‌రంగానికే తలమానికంగా నిలిచారు రీటా. స్విమ్మర్‌గా భారత, ఆసియా క్రీడాకారిణిగానూ చరిత్ర సృష్టించారు ఆర్తి. టెస్టు క్రికెట్‌లో తొలిసారి డబుల్‌ ‌సెంచరీ చేసిన క్రీడారమణి క్రికెటర్‌ ‌మిథాలీరాజ్‌. ‌మొదటగా అంతరిక్షానికి చేరుకున్న భారతీయ సాహసి కల్పనా చావ్లా. తొలి మహిళా పోలీస్‌ అధికారిణిగా రికార్డు నెలకొల్పారు కిరణ్‌బేడీ. భారత వైమానిక దళానికి వన్నె తెచ్చిన పడతి అంజలి. వీరందరి స్ఫూర్తినేపథ్యం మహిళా దినోత్సవానికి మరింత శోభనిచ్చింది, ఇస్తోంది. వీర ధీర శూర వనితలు వీరు కాక ఇంకెవరు?

సమత్వం ఎక్కడుందీ!

ఆకాశంలో, అవకాశాల్లో సగం అన్నది నినాదంగా మిగలాల్సిందేనా? ఇది చెవికి ఇంపు కలిగించడమే తప్ప, వీనులవిందు అందించడమే తప్ప, నేత్రానందం ప్రసాదించే అవకాశమే లేదా? జనాభా లెక్కల ప్రకారం, పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య తక్కువన్నది ప్రపంచ స్థితి. లింగ నిష్పత్తిలో సమత్వం ఆ కారణంగానే ప్రాధాన్యం సంపాదించింది. స్త్రీలు ప్రవేశించని రంగం లేదని, నిపుణత కనబరచని పని లేదనీ పదే పదే చెప్పడం సరే. వారు నిలబడగలిగేలా చేస్తున్నామా, ఆత్మ విశ్వాసం కోల్పోకుండా చూస్తున్నామా? అన్నదే మన దేశంలో నాటికీ నేటికీ ప్రశ్న. స్త్రీలంటే అప్పటికీ ఇప్పటికీ చిన్నచూపే. విధి నిర్వహణ ప్రదేశాల్లో రక్షణ అంతంత మాత్రమే. శ్రమకు సరిపడా ప్రతిఫలం లభిస్తోందా అన్నది ఈనాటికీ సందేహాస్పదమే. కాకుంటే – గతంలో కంటే వర్తమానంలో ప్రశ్నించే తత్వం పెరిగింది. నిలదీసి నిగ్గదీసి నిలువునా కడిగిపారేసే ధీరత అలవాటుగా మారింది. ఆడవారిని కించపరిచే దుష్టశక్తుల పనిపట్టే తెగువా విస్తృతమవుతుంది. వీటన్నింటితోపాటు, స్త్రీల పట్ల ఆలోచన ధోరణిని ఇంకా మార్చుకోవాల్సిన అగత్యమైతే ఇతర సమాజానికి చాలా ఉంది.

‘అమ్మను పూజించు

భార్యను ప్రేమించు

సోదరిని దీవించు

వనితలందరినీ గౌరవించు’

అన్నారు ఓ మనసున్న కవి.

ఆమె శక్తి విశ్వవ్యాప్తి అని శీర్షికా నాదం, పత్రికా నినాదం.

ఎందులోనైనా మగవారికి పోటీగా దీటుగా సాటిగా ఆడవారు రాణిస్తారు. మానసిక సామర్థ్యమే వారి అదనపు బలం.. అన్నారు జాతిపిత.

మగువా! లోకానికి తెలుసా నీ విలువా?

నీ సహనానికి సరిహద్దులు కలవా?

అంతులేని నీ శ్రమ అంచనాలకందునా

నీవులేని జగతిలో దీపమే వెలుగునా

అన్నారొక సినీ సాహితీవేత్త.

ఇవీ, ఇటువంటి ఇంకెన్నో మహిళా దినోత్సవాన తళుకులొలుకుతాయి. పత్రికలు, రేడియోలు, టీవీలు, ఇతర సామాజిక మాధ్యమాలు ఊరూవాడా హోరెత్తిస్తుంటాయి. ప్రముఖుల సందేశాలు, వ్యాసాల పరంపరలు, సంగీత సాహిత్య నర్తన పక్రియలన్నీ మహిళా దినోత్సవాన్ని మారుమోగిస్తుంటాయి. అన్నీ ఈ 8నే. అంతకుముందు 7న, ఆ తర్వాత 9న వాతావరణంలో తేడా ఏమిటన్నదే మనమంతా గుర్తించాలి. మహిళా దినోత్సవం… జాతీయమైనా, అంతర్జాతీయమైనా ఒక్కరోజుకే పరిమితమైంది కాదు, కారాదు, కానివ్వకూడదు. ఆ రోజునే, అంతవరకే -అనుకోవడం, అనడం మహాపాపం. మాతృద్రోహం.

బాధ్యత అందరిదీ

వనిత అనే పదం వయో విభాగానికే మితం కాదు. బాలిక, యువతి, మహిళ, వృద్ధురాలు అందరూ ఆ కోవవారే. ఇంట్లోని ఆడవారిని గమనించి గుర్తించి ఆదరించి గౌరవించడం తెలిస్తే; బయట కూడా అదే విధమైన ప్రవర్తన ఉంటుంది. బాధ్యతల నుంచి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు, అధికార అనధికారులు ఎవరూ తప్పించుకోలేరు. ఒక స్త్రీ మూర్తి పట్ల ఏదైనా అపచారం జరిగిందంటే, స్పందన అత్యంత తీవ్రంగా ఉండి తీరాల్సిందే. ఇలా జరుగుతుందని తెలియదు, మేం అనుకోలేదు అని కన్నవాళ్లంటే సరిపోదు. ఇటువంటి వాడని తెలుసుకోలేకపోయాం అని టీచర్లు చెబితే చాలదు. మాకు తెలిసినంతవరకు బాగానే ఉండేవాడు, ఎందుకో ఇప్పుడిలా అని నిందితుడి బంధువులు, స్నేహితులు సన్నాయి నొక్కులు నొక్కితే కుదరదు. నష్టపరిహారం; ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూస్తాం అంటూ అధికారులు నసిగితే బాధితులెవరూ భరించరు. ఇదివరకెన్నడూ ఇలాంటివి వినలేదు, మాకూ చాలా బాధగా ఉందని ప్రజాప్రతినిధులు సంతాప సానుభూతులు తెలిపినంత మాత్రాన ఏదీ ఒరిగి పడదు. సామాజిక బహిష్కరణ, చట్టపరమైన కఠిన శిక్షలే మహిళలను నేరగాళ్ల నుంచి పరిరక్షిస్తాయి. ప్రసార సమాచార సాధనాలూ పడికట్టు పదాలను వదులుకోవాలి. అబల, నిర్భాగ్యురాలు, పాపం ఆడపిల్ల వంటి ఊకదంపుడు ప్రయోగాలు ఎంత త్వరగా మానితే అంత మంచిది. నేరం కంటే, సమాం స్పందించే తీరే బాధితులు లేదా ఫిర్యాదీలపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. విద్యుదాఘాతం తగిలినంత వేగంగా – స్పందనలుంటేనే నేరస్థుల గుండెలదురుతాయి. వేధింపుల వంటి రోజువారీ నేరాలు మనం చూస్తుండ గానే తగ్గుముఖం పడతాయి. వనితల కోసం దినోత్సవం నిర్వహించుకోవడమంటే అదీ.

ఆచరిస్తే సరి

సాధికారత గురించి మాట్లాడనివారు లేరు. మహిళలూ మీకు జోహార్లు అంటూ ఏటేటా కవితలల్లేవారికీ కొదవలేదు. ఆకాశం, అవకాశం నినాదాల జోరు సరేసరి. టన్నులకొద్దీ పదజ్ఞానం కన్నా, ఎంతో కొంతైనా ఆచరించి చూపడం మిన్న. అది సాకారమైనప్పుడే ఆడపిల్ల పెదవి మీద దరహాసం మెరుస్తుంది. అంతేకానీ-ఇంట్లోనూ బయటా మాటలూ చేతలూ ఆమె కన్నీటికి కారణమైతే, జాతికి నిష్కృతి ఉండదు. ప్రాంతీయం నుంచి అంతర్జా తీయం దాకా ఇంతే.

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram