తాము ఎవరితోనూ విభేదించమని, తమకెవరూ విరోధులు కారని, సమాజంలో సకారాత్మక పరివర్తన తీసుకురావడమే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ ‌లక్ష్యమని సర్‌ ‌కార్యవాహ దత్తాత్రేయ హొసబలే పేర్కొన్నారు. కర్ణాటకలోని ధార్వాడలో మూడు రోజులపాటు (అక్టోబర్‌ 29 ‌నుంచి 31) జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ అఖిల భారతీయ కార్యకారిణి మండలి సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా చివరిరోజు ధార్వాడ్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో దత్తాత్రేయ హొసబలే మాట్లాడారు.

అఖిల భారతీయ కార్యకారిణి మండలి సమావేశాలలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌కార్యక్రమాల సమీక్ష, భవిష్యత్‌ ‌కార్యాచరణపై సమగ్రంగా చర్చించామని ఆయన తెలిపారు. ప్రతి ఏడాది మార్చిలో అఖిల భారతీయ ప్రతినిధి సభ జరుగుతుందని, ఈ కార్యకారిణి మండలి సమావేశం దీపావళి ముందు జరుగుతుందని ఆయన తెలిపారు. అందరూ భయపడ్డట్టుగా కరోనా థర్డ్ ‌వేవ్‌ ‌వచ్చి ఉంటే; దానిని ఎదుర్కోవడానికి వీలుగా తాము 4 లక్షల మంది వాలంటీర్లను సిద్ధం చేశామని హొసబలే తెలిపారు. భగవంతుని దయవల్ల ఆ ముప్పు తప్పిందని హర్షం వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా 34 వేల స్థలాలలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ ‌శాఖలు జరుగుతున్నాయని, కొన్నిచోట్ల ఒకేస్థలంలో 4,5 శాఖలు కూడా జరుగుతు న్నాయని మొత్తం 54,382 శాఖలు జరుగుతున్నాయని వివరించారు. అలాగే 12,780 స్థలాలలో సాప్తాహిక్‌ ‌మిలన్‌లు జరుగుతున్నాయని, 7900 స్థలాలలో సంఘ మండలి, ఆ విధంగా మొత్తం సుమారు 55 వేల స్థలాలలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌కార్యకలాపాలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయని హొసబలే వెల్లడించారు.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ ‌దృష్ట్యా దేశం మొత్తం మీద 6,483 ఖండలు ఉండగా 5,683 ఖండలలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌కార్యకలాపాలు నడుస్తున్నాయని, నాగాలాండ్‌, ‌మిజోరాం, కశ్మీర్‌ ‌వంటి చోట్ల మాత్రమే సంఘ కార్యకలాపాలు ఇంకా మొదలు కాలేదని తెలిపారు. దేశం మొత్తం మీద 32,687 మండలాలకు ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌విస్తరించిందని హొసబలే అన్నారు. సుమారు 560 జిల్లా కేంద్రాలలో 5, అంతకంటే ఎక్కువ శాఖలు నడుస్తున్నాయని, 84 జిల్లాలలో అన్ని మండలాలు శాఖాయుక్తమయ్యాయని తెలిపారు. ఇప్పటికే దేశంలోని 60 నుంచి 70 శాతం మండలాలకు తాము విస్తరించామని, 2024 మార్చి నాటికి దేశంలోని అన్ని మండలాలకూ సంఘ కార్యకలాపాలను విస్తరిస్తామని దత్తాజీ అన్నారు.

2025 విజయదశమి నాటికి సంఘం ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తికానున్న సందర్భంగా కనీసం 2 సంవత్సరాల పాటు పూర్తి సమయం ఇవ్వగలిగిన కార్యకర్తలకు పిలుపు నిస్తున్నామని, 2022 నుంచి 2025 వరకు ఈ విధంగా పూర్తి సమయ కార్యకర్తలుగా పనిచేయడానికి ఎంతమంది ముందుకు వస్తారో 2022 మార్చి నాటికి తెలుస్తుందన్నారు. ఆ విధంగా ప్రతి ఖండకు ఒక పూర్తి సమయ కార్యకర్త చొప్పున దేశంలో సుమారు 6 వేల మంది పూర్తి సమయ కార్యకర్తలు పని చేయనున్నారని తెలిపారు.

కొవిడ్‌ ‌క్లిష్ట పరిస్థితుల కారణంగా పూర్తిస్థాయిలో శాఖా కార్యక్రమాలు కొనసాగకపోయినా దేశం మొత్తం మీద 1,05,938 గురుపూజా ఉత్సవాలు జరిగాయని, అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవాలను పురస్కరించుకుని స్వయంసేవకులు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇతర కేంద్రాలలో భరతమాత పూజా కార్యక్రమాలు, సాహిత్య వితరణ వంటివి చేశారని తెలిపారు. అలాగే స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని గుర్తింపుకు నోచుకోక, మరుగున పడిపోయిన రాణి అబ్బక్క, నాచ్చియార్‌ ‌వంటి వీరమాతలను, ఇంకా ఎందరో వీరులను దేశప్రజలకు గుర్తుచేసే, పరిచయం చేసే ప్రయత్నాన్ని ఈ సందర్భంగా తాము చేస్తున్నామని అన్నారు. సాహిత్య వితరణ, ఫొటోల ప్రదర్శనలు, సెమినార్లు, వెబినార్లు నిర్వహించడం ద్వారా గుర్తింపుకు నోచుకోని దేశభక్తుల చరిత్రలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

భారత స్వాతంత్య్ర పోరాటం ప్రపంచ చరిత్రలోనే విశిష్టమైందని, ఎందుకంటే ఇది అత్యంత సుదీర్ఘంగా జరిగిన పోరాటమని, ఈ పోరాటం దేశ ఏకాత్మతను చాటిందని హొసబలే తెలిపారు. వివిధ ప్రాంతాలకు, భాషలకు చెందిన లాల్‌, ‌బాల్‌, ‌పాల్‌లు; అలాగే భగత్‌సింగ్‌, ‌రాజ్‌గురు, సుఖదేవ్‌లు ఒకే లక్ష్యం కోసం కలసి పనిచేయడం, దేశం పట్ల వారికున్న సంవేదనను ఇందుకు ఉదాహరణగా ఆయన తెలిపారు. బెంగాల్‌కు చెందిన సుభాష్‌ ‌చంద్రబోస్‌ను తమిళనాడు ప్రజలు కూడా తమ వాడిగా, తమ నాయకుడిగా భావించడమే ఏకాత్మత అని, భారత స్వాతంత్య్ర పోరాటం భారతీయ ఏకాత్మ తను ఘనంగా చాటిందని హొసబలే తెలిపారు. స్వాతంత్య్రాన్ని సాధించటమంటే ఆంగ్లేయులను తరిమేయడం మాత్రమే కాదని, భారతీయ ఆత్మ జాగృతం కావాలని, భారతీయులలో ‘స్వ’ భావన జాగృతం కావాలని దత్తాజీ ఈ సందర్భంగా వ్యాఖ్యా నించారు. దేశం సర్వాంగీణ ఉన్నతికై కృషి చేస్తామని నేటి యువత సంకల్పం చేయాలని ఆర్‌.ఎస్‌. ఎస్‌. ‌యువతకు పిలుపునిస్తోందని పేర్కొన్నారు.

గురు తేజ్‌బహదూర్‌ ‌దేశంకోసం, ధర్మంకోసం ఆత్మబలిదానం చేసి 400 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాల నిర్వహణకు ఆర్‌.ఎస్‌.ఎస్‌. శ్రీ‌కారం చుట్టనున్నదని కూడా ఆయన తెలిపారు. భారతీయ సమాజం అస్పృశ్యత, దుర్వ్యసనాలు, భ్రూణ హత్యలు వంటి అవలక్షణాలను వదిలించుకోవాలని, అలాంటి సామాజిక పరివర్తన కోసం సంఘ్‌ ‌కృషి చేస్తున్నదని; అలాగే ధర్మజాగరణ, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమరసత, గ్రామీణ వికాసస్‌, ‌కుటుంబ ప్రబోధన్‌ ‌వంటి వివిధ కార్యక్రమాల ద్వారా సమాజంలో సామాజిక పరివర్తనకు సంఘం కృషి చేస్తున్నదని దత్తాత్రేయ తెలిపారు. శిక్ష-స్వాస్థ్య-స్వావలంబన్‌ (‌విద్య-ఆరోగ్యం-స్వావలంబన)లే లక్ష్యంగా తాము దేశవ్యాప్తంగా సేవాకార్యాలను నిర్వహిస్తున్నామని, సమాజంలో జాతిభేదాలు, అస్పృశ్యతల పేరుతో సామాజిక విభజనకు జరుగుతున్న ప్రయత్నాలను కూడా తిప్పికొట్ట నున్నామని, రాబోయే 3, 4 సంవత్సరాలలో దీనిపై దృష్టి పెట్టనున్నామని అన్నారు.

కరోనా కారణంగా గత రెండు సంవత్సరాల కాలంలో విద్య, ఉద్యోగ రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆ కారణంగా గ్రామీణ ప్రాంతాలలోని స్థానిక నైపుణ్యాలను గుర్తించి వాటి ద్వారా ఉపాధిని పొందే విధంగా ప్రజలను ప్రోత్సహించే ప్రయత్నం చేయనున్నామని, ‘రోజ్‌గార్‌ ‌సృజన్‌’ ‌పేరుతో పనిలేని వారికి పని కల్పించే ప్రయత్నం చేయనున్నామని వెల్లడించారు.

హిందూ జనాభా తక్కువగా ఉన్న నాగాలాండ్‌, ‌మిజోరం, కశ్మీర్‌, ‌లక్ష్యద్వీప్‌ ‌వంటి ప్రాంతాలలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌శాఖలు జరగకపోయినా అక్కడ తమ సేవా కార్యకలాపాలు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయని పాత్రికేయులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. దేశవ్యాప్తంగా జనాభా నియంత్రణకు ఒకే విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉన్నదని, ఈ విషయమై 5, 6 సంవత్సరాల క్రితమే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ ‌తీర్మానం చేసిందని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.

పర్యావరణ పరిరక్షణ అనేది రోజువారీ జరగాల్సిన కార్యక్రమమని, కానీ కొందరికి హిందూ పండుగలప్పుడు మాత్రమే పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత గుర్తుకురావడం సరికాదన్నారు. ఇలాంటి విషయాలలో రాత్రికి రాత్రే మార్పు సాధ్యంకాదని, అకస్మాత్తుగా పండుగలను నిషేధించడం వలన వాటి మీద ఆధారపడ్డ అనేకమంది ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారని, ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఏవైనా కారణాలతో ప్రభుత్వాలు పండుగలపై నిషేధం విధించాలనుకున్నప్పుడు అన్ని వర్గాలతో చర్చించి, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

దేశంలో మతమార్పిడులు ఆగవలసిన అవసరమున్నదని, నిజానికి మతం మారినవారు తాము హిందువుగానే చలామణి అవుతూ రెండు రకాల ప్రయోజనాలనూ అనుభవిస్తున్నారని, సుమారు 20 రాష్ట్రాలలో ఇప్పటికే మతమార్పిడి నిరోధక చట్టాలు అమలవుతున్నాయని, గతంలో హిమాచల్‌ ‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కాలంలో సైతం మతమార్పిడి నిరోధక బిల్లును ఆమోదించి అమలు చేసిన విషయాన్ని హొసబలే ఈ సందర్భంగా గుర్తు చేశారు.

About Author

By editor

Twitter
Instagram