తీర్మానం :

2021 అక్టోబర్‌ 29 ‌నుంచి 31 వరకు ధార్వాడ్‌ (‌కర్ణాటక)లోని రాష్ట్రోత్థాన విద్యాకేంద్రంలో జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ అఖిల భారతీయ కార్యకారిణి మండలి సమావేశాలలో ఆమోదించిన తీర్మానం.

బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై ఇటీవల జరిగిన హింసాకాండపై అఖిల భారతీయ కార్యకారిణి మండలి (ఏ.బీ.కే.ఎం.) తన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌ను మరింత ఇస్లామీకరణ చేయడానికి జిహాదీ ముఠాలు చేసిన పెద్ద కుట్రలో భాగంగా అక్కడి హిందూ మైనారిటీలపై కొనసాగుతున్న క్రూరమైన దాడులను ఖండిస్తున్నట్టు ఏ.బీ.కే.ఎం. స్పష్టం చేసింది.

హిందువులపై ఆగని దాడులు

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలు, హిందూ దేవాలయాలపై హింసాత్మక దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. గత నెలలో జరిగిన పవిత్రమైన దుర్గాపూజ పండుగ సందర్భంగా చెలరేగిన మతహింసలో అనేకమంది అమాయక హిందువులు మరణించగా, వందలాది మంది గాయపడ్డారని ఏ.బీ.కే.ఎం. తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే దుర్ఘటనలో వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయని, హిందూ సమాజానికి చెందిన అనేక మంది బాలికలు, మహిళలపై దాడి జరిగిందని, రెండు వారాల వ్యవధిలో దేవాలయాలు, దుర్గాపూజ పందిళ్లను దుండగులు ధ్వంసం చేసారని ఏ.బీ.కే.ఎం. ఆందోళన వ్యక్తం చేసింది.

ఇస్లామిక్‌ ‌మతోన్మాదుల పక్కా కుట్ర

సమాజంలో మతపరమైన ఉన్మాదాన్ని రెచ్చగొట్టేలా తప్పుడు వార్తలను వ్యాప్తి చేసిన నిందితుల్లో కొందరిని అరెస్టు చేయడం వల్ల ఈ దాడులు ఇస్లామిక్‌ ‌మతోన్మాదుల పక్కా కుట్రగా వెలుగులోకి వచ్చిందని అభిప్రాయపడింది. భారత్‌ ‌విభజన జరిగినప్పటి నుండి సంఖ్యాపరంగా బాగా క్షీణిస్తున్న హిందూ మైనారిటీలను సంపూర్ణంగా నిర్మూలించడానికి లక్ష్యంగా చేసుకున్నట్టు ఈ దాడుల వల్ల స్పష్టమవుతోందని ఏ.బీ.కే.ఎం. ఆందోళన వ్యక్తం చేసింది.

8 శాతానికి పడిపోయిన హిందూ జనాభా

దేశ విభజన సమయంలో తూర్పు బెంగాల్‌ (‌నేటి బంగ్లాదేశ్‌) ‌జనాభాలో దాదాపు 28 శాతం మంది హిందువులు ఉండేవారు. అది ఇప్పుడు 8 శాతానికి తగ్గిపోయింది. జమాత్‌-ఎ-ఇస్లామీ (బంగ్లాదేశ్‌) ‌వంటి మతోన్మాద ఇస్లామిక్‌ ‌గ్రూపుల దురాగతాల ఫలితంగా విభజన తర్వాత, ప్రత్యేకంగా 1971 యుద్ధం సమయంలో హిందువులు పెద్ద ఎత్తున భారత్‌లోకి వలస వచ్చారని ఏ.బీ.కే.ఎం. తెలిపింది. బంగ్లాదేశ్‌లోని మైనారిటీ హిందూ జనాభాలో అభద్రతాభావాన్ని సృష్టిస్తూ, మత సామరస్యాన్ని ఇప్పటికీ ఆ సంస్థలు నాశనం చేస్తూనే ఉన్నాయని ఏ.బీ.కే.ఎం. పేర్కొంది.

బంగ్లాదేశ్‌ ‌ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి

బంగ్లాదేశ్‌ ‌ప్రభుత్వం తమ దేశంలో మైనారిటీ లపై పెరుగుతున్న హింసాత్మక సంఘటనలను నిరోధించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏ.బీ.కే.ఎం. అభిప్రాయపడింది. బంగ్లాదేశ్‌లో హిందువులు తమ హక్కులను పొందుతూ వారి సురక్షితమైన, గౌరవప్రదమైన జీవితం గురించి హామీ ఇవ్వడానికి, హిందువులపై హింసకు పాల్పడిన వారికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం హామీ ఇవ్వాలని ఏ.బీ.కే.ఎం. డిమాండ్‌ ‌చేసింది.

బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై నిత్యం మారణకాండ జరుగుతున్నా, ప్రపంచ మానవ హక్కుల నిఘా సంస్థలు, ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడాన్ని ఏ.బీ.కే.ఎం. తప్పు పట్టింది. బంగ్లాదేశ్‌లో జరుగు తున్న హింసను ఖండించడానికి అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని, బంగ్లాదేశ్‌లోని హిందువులు, బౌద్ధులు, ఇతర మైనారిటీల భద్రత కోసం తమ గొంతును వినిపించాలని అఖిల భారతీయ కార్యకారిణి మండలి పిలుపునిచ్చింది.

మతోన్మాద శక్తులు పెరిగితే ప్రజాస్వామ్యానికి హాని!

బంగ్లాదేశ్‌లో లేదా ప్రపంచంలోని మరే ఇతర ప్రాంతాలలోనైనా ఇస్లామిక్‌ ‌మతోన్మాద శక్తుల పెరుగుదల ప్రజాస్వామ్యానికి, ప్రపంచంలోని శాంతి కాముక దేశాల ప్రజల మానవహక్కులకు తీవ్రమైన ముప్పు అని కూడా ఏ.బీ.కే.ఎం. హెచ్చరించింది. బంగ్లాదేశ్‌లోని హిందువులు-బౌద్ధుల భద్రత కోసం, అక్కడ జరుగుతున్న దాడులు, మానవహక్కుల ఉల్లంఘనలపై ప్రపంచ హిందూ సమాజం, హిందూ సంస్థల ఆందోళనలను బంగ్లాదేశ్‌ ‌ప్రభుత్వానికి తెలియజేయడానికి అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను ఉపయోగించాలని ఏ.బీ.కే.ఎం. భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది.

ఇస్కాన్‌, ‌రామకృష్ణ మిషన్‌, ‌భారత సేవాశ్రమ సంఘం, వీ.హెచ్‌.‌పీ., ఇతర హిందూ సంస్థలు ఇస్లామిక్‌ ‌మతోన్మాదుల హింసాకాండకు గురైన బాధితుల పక్షాన నిలబడి బంగ్లాదేశ్‌లోని హిందూ సోదరులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించినందుకు తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఏ.బీ.కే.ఎం. ప్రకటించింది. సవాలుగా పరిణమించిన ఈ క్లిష్ట సమయంలో బంగ్లాదేశ్‌లోని హిందువులకు, ఇతర మైనారిటీలకు యావత్‌ ‌హిందూ సమాజంతో పాటు ఆర్‌.ఎస్‌.ఎస్‌. అం‌డగా నిలుస్తోందని అఖిల భారతీయ కార్యకారిణి మండలి (ఏ.బీ.కే.ఎం.) హామీ ఇచ్చింది.

About Author

By editor

Twitter
Instagram