ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

ప్రపంచంలో అతి ప్రాచీనమైనది మన ‘హిందుస్థాన్‌’. ఈ ‌దేశం ఎంత ప్రాచీనమో చెప్పడానికీ, నిర్ధారించటానికీ ఇవాళ్టి దాకా ఏ పురాతత్త్వవేత్తకూ సాధ్యం కాలేదు. ప్రపంచంలోనే అన్నిటికన్నా అతి ప్రాచీన గ్రంథాలు వేదాలు. సుమారు పది వేల సంవత్సరాలకు మునుపే వేదాలు జనించాయి. వాటిలో ‘అథర్వవేదం’ ఈ దేశ నిర్మాణ ఉద్దేశమేమిటో ఇలా చెప్పింది –

‘ఓం భద్రమిచ్ఛన్త ఋషయః సర్విదః

తపో దీక్షాముపాసే దురగ్రేః

తతో రాష్ట్రం బలమోజశ్చ జాతం

తదస్మై దేవా ఉపసన్నమంతు’

అంటే- ‘మానవ శ్రేయస్సు అనే పవిత్ర ఉద్దేశాన్ని మదిలో కాంక్షిస్తూ రుషులు ఘోర తపస్సు చేశారు. దాంతో బలసంపన్నమైన, కాంతివంతమై పరమ వైభవమైన ఈ దేశ నిర్మాణం జరిగింది. కనుక రండి, మనమంతా కలిసి ఈ దేశాన్ని పూజిద్దాం, ఉపాసిద్దాం! దేశ నిర్మాణ పవిత్ర ఉద్దేశాన్ని శ్రేష్టమైన, ఉదాత్తమైన తత్త్వజ్ఞానంతో సాకారం చేసేందుకు ఉత్తమమైన జీవన విలువలని అనుసంధానం చేశారు. ఎవరయితే ఈ విలువలని తమ జీవితాలతో మమేకం చేశారో, అలాటి సమాజంతో ముడిపడ్డ మానవుల వ్యవహారం నేటి దాకా మానవత్వానికి వ్యతిరేకంగా ఏ మాత్రం కనబడలేదు. మాజీ ప్రధానమంత్రి, మహాకవి అటల్‌ ‌బిహారీ వాజపేయి ఓ కవితలో అంటారిలా –

‘అందరిని బానిసలుగా చేయాలని

నేనెన్నడు కోరుకున్నాను?

రాముడు, కృష్ణుని పేర్లమీద

నేనెప్పుడు అఘాయిత్యం చేశాను?

భూభాగం కాదు,

హృదయాలను జయించాలనేదే నా నిర్ణయం.

తనువు మనసు జీవనమంతా హిందుత్వమే

నరనరాన హిందువును! ఇదే నా పరిచయం’

ఈ భూమిని చక్కగా సాగుచేసి సుజలంగా సుఫలంగా సారవంతంగా మాతృభూమి, పుణ్యభూమి రూపాన్ని ఇక్కడివారు తీర్చిదిద్దినారు.

ఇదీ మన హిందూ సంస్కృతి. ఇది దాని పరంపర. ఈ భావనలతో అలంకరించినదే మన హిందూ దేశం. ‘హిందూ’ ఈ పదమే అతి ప్రాచీనమైనది. హిందూ- ఇదొక ధర్మం, ఒక జీవన విధానం. హిందూ అనే పదం ఒక పూజా విధానానికి గాని, ఒక మతానికి గాని పెట్టిన పేరు కాదు. నిజం చెప్పాలంటే దాని పేరు ‘మానవ ధర్మం’. సమస్త విశ్వంలో, ఆ మాటకొస్తే సమస్త మానవాళికి ధర్మం. సృష్టి ఆరంభం నుండే గురుత్వాకర్షణ సిద్ధాంతమున్న ప్పటికీ, న్యూటన్‌ ‌దీని అస్తిత్వాన్ని కనుగొన్నాడు. కనుక న్యూటన్‌ ‌సిద్ధాంతంగా ప్రచారంలోకి వచ్చింది. ‘ఒక ఈశ్వరుడు, ఒక ప్రవక్త, ఒక గ్రంథం, ఒక ప్రత్యేక పూజా పధ్ధతి’తో మతమనేది ఏర్పడుతుంది. భారత్‌ ‌వెలుపల ఇస్లాం, క్రైస్తవం, పార్సీ, యూదు మొదలయిన మతాలున్నాయి. భారత్‌లో కూడా బౌద్ధ, జైన, సిక్కు, శైవ, వైష్ణవంతో సహా మహితాత్ములు ఏర్పరచిన పెక్కు మతాలున్నాయి. ప్రతి మతానికి తనదయిన ప్రత్యేకత, ఆధ్యాత్మికత, శ్రేష్టత ఉన్నాయి. ఎన్నడూ కూడా మతమనేది అందరిదీ ఒకటే అయి ఉండదు. ప్రతి ఒక్కడి స్వభావం, ఆలోచించే తీరు, ఆస్వాదించే శైలి, చింతన వేర్వేరు గానే ఉంటాయి. ఆరెస్సెస్‌ ‌జ్యేష్ట ప్రచారకుల్లో ఒకరు దత్తోపంత్‌ ‌ఠేంగ్డిజీ ఓ సారి ఇలా అన్నారు – ‘Religion is strictly personel. As strictly as a tooth brushట్ర’. మతమనేది కచ్చితంగా వ్యక్తిగతమైనది. ఒకరి టూత్‌ ‌బ్రష్‌ ‌లాగా. ‘ధర్మం’ అనే పదాన్ని ఇంగ్లిష్‌ ‌వాళ్లు ‘రిలీజియన్‌ -‌మతం’ అని అనువదించారు. ఈ కారణంగానే సర్వత్రా ‘ధర్మం’ పట్ల అనేక అపోహలు, తప్పుడు ఆలోచనలు వ్యాపించాయి. పెక్కు వివాదాలు చెలరేగాయి. చెలరేగుతూనే ఉన్నాయి. వాస్తవంగా చూస్తే భారత్‌లో ఉంటూ విభిన్న పూజా పద్ధతులను ఆచరిస్తున్న, విభిన్న భాషలు మాట్లాడుతున్న, విభిన్న జాతులలో కొనసాగుతున్న వారందరినీ ఏకతాసూత్రంతో ముడిపెట్టే తత్త్వమే ఈ హిందూ శబ్దం. ఈ దేశ జాతీయతకున్న పేరే- హిందూ. ఈ దేశ పౌరుల భాష, జాతి, సంప్రదాయాలు వేర్వేరు కావొచ్చు. ఐతే వీరందరి జాతీయత ఒకటే. దీన్నే వేల సంవత్సరాల నుండి మనం ‘హిందూ’ అని చెబుతున్నాం. ఇంగ్లిష్‌ ‌వాళ్ల• విదేశీ ఆక్రమణదారులు. వాళ్లు ఇక్కడి వివిధ అంశాలని అధ్యయనం చేశారు. ఇక్కడి పలు అంశాలలో భాగమై ఉన్న ఏకతాసూత్రంలో బంధించే ‘హిందుత్వ’ ని కూడా వారు అవలోకనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే మన దేశంలో దీర్ఘకాలం దాకా తమ పాలన కొనసాగించే దురాలోచనతోనే వాళ్లు ‘హిందూ-హిందుత్వ’ పదాలపై పెద్ద ఎత్తున దాడిచేశారు. జాతి – మత విద్వేషాలను రగిల్చారు. విభజించి పాలించే (డివైడ్‌ ‌రూల్‌) ‌పద్ధతిని అనుసరించారు. ఈ దుష్ట ప్రయత్నాల కారణంగా హిందువు సంకుచితుడిగా మారిపోయాడు. జాతిగత విద్వేషాలు, ఉచ్ఛనీచాలు, అస్పృశ్యత లాటి వికృత చేష్టలు -స్వభావాలు సమాజంలో పేరుకుపోయాయి. ఇవన్నీ మనల్ని అసంఘటిత పరిచాయి. దుర్బలులుగా మార్చాయి. విదేశీ ఆక్రమణదారుల వేటకి ఇవే మనల్ని బలి చేశాయి. ఒక హిందీ గీతంలోని చరణాలు వింటే ఈ విషయం నిజమని అర్థమవుతుంది.

 ఆ చరణాల అనువాదం ఇదీ –

‘హిందూ భావనని ఎప్పుడెప్పుడయితే మరిచామో

 పెను ప్రమాదానికి లోనయ్యాం

 సోదర భావం తెగింది, భూమిని కోల్పోయాం,

 ధర్మ సంస్కారాలు తుడిచిపెట్టుకుపోయాయి’

1875 దాకా ఇదొక విశాల దేశం. దీని సరిహద్దు పశ్చిమాన ఉపగణస్తాన్‌ (‌నేటి అఫ్ఘ్ఘానిస్తాన్‌) ‌లోని హిందూకుష్‌ ‌పర్వతం నుంచి ఉత్తరాన హిమాలయం, తూర్పున నేటి సంపూర్ణ పూర్వాంచల్‌, ‌బంగ్లాదేశ్‌, ‌మయన్మార్‌; ‌దక్షిణాన మూడు సముద్రాలతో కలగలసిన భూమి. ఈ విశాల దేశ వైశాల్యం 80 లక్షల చదరపు కిలోమీటర్లు. ఆ రోజుల్లో మనం సంఘటితమై ఉన్నాం. ఎప్పుడయితే మనం హిందూ భావనని మరచిపోయామో, సంకుచిత ఆచార వ్యవహారాలతో ఒకరితో మరొకరం విడిపోయామో అప్పుడే మనం ఇలాంటి స్థితికి లోనయ్యాం. మొగలుల దురాక్రమణతో తొలుదొల్త 1876లో ఉపగణస్తాన్‌ ‌హిందుస్తాన్‌ ‌నుండి విడిపోయి అఫ్ఘానిస్తాన్‌ అయింది (ఇవాళ దాని పరిస్థితి ఎలా ఉంది! మనకు ఎంత దూరమయిపోయింది! ఇదంతా తలచుకుంటే మనసు బాధకు లోనవుతుంది). తర్వాత క్రమంగా నేపాల్‌, ‌భూటాన్‌, ‌టిబెట్‌, ‌శ్రీలంక, మయన్మార్‌ ‌కూడా విడి పోయాయి. చివరికి ఆగస్టు 14, 1947న పశ్చిమ, తూర్పు పాకిస్తాన్‌లు కూడా మనతో విడిపోయాయి (తర్వాతి కాలంలో తూర్పు పాకిస్తాన్‌ ‌బంగ్లాదేశ్‌గా మారింది). ఇలా మనం క్రమంగా భూమిని కోల్పోతూ వచ్చాం. 1875లో ఈ దేశ వైశాల్యం 80 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటే, 1950 నాటికి 33 లక్షల చదరపు కిలోమీటర్లు మిగిలింది. 2021 నాటికి కేవలం 31 లక్షల చదరపు కిలో మీటర్లు మిగిలింది. మన స్వయంకృతాపరాధాల వల్ల, నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది. ఆత్మవిస్మృత సమాజం కర్తృత్వ హీనంగా, పురుషార్థహీనంగా మారుతుంది.

ఎలాగయితే ‘భూమిని కోల్పోవడం’ వంటి ఉదంతాలను గతంలో చూశామో; అలానే ‘సోదర భావం తెగడం, ధర్మ సంస్కారాలు తుడిచి పెట్టుకపోవడం’ వంటి పరిణామాలను కూడా ఇప్పుడు చూస్తున్నాం. హైదరాబాద్‌కు చెందిన మజ్లీస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ఏమన్నాడో గుర్తుంది కదా! ‘మేము ఈ దేశాన్ని 800 సంవత్సరాలు పాలించాం! ఆ సమయంలో హిందువులంతా మాకు బానిసలు’ అన్నాడు. అతడి మాటలన్నీ పచ్చి అబద్ధాలు. ఎందుకంటే ఈ దేశంలో మీరు కాసిం మొదలు, ఔరంగజేబు దాకా ఎవరయితే మొగల్‌ ‌చక్రవర్తులు వచ్చారో వారంతా విదేశీ దురాక్రమణదారులే. 1000-1100 సంవత్సరాలలో క్రూరంగా ఆక్రమణలూ, పాటు అత్యాచారాలూ గావించారు. లక్షలాది హిందువులను బలవంతంగా ముస్లిములుగా మార్చారు. ఇవాళ భారత ముస్లిం సమాజంలో 99 శాతం వారి వంశస్థులే ఉన్నారు (ఒవైసీ బ్రదర్స్ ‌సహా). ముంబయి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, మాజీ కేంద్ర విద్యా శాఖా మంత్రి ఎంసిచాగ్లా ఏమన్నారంటే ‘it is true that few genarations we have changed our religion . But we have not changed our fore fathers’. ఇదే క్రమంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నేత ఏ ఆర్‌ అం‌తులే ‘మూడుతరాలకు మునుపు మేము కూడా హిందువులు గానే ఉన్నాం’ అంటూ ఒక ప్రకటన చేశారు. విచారకరమైన విషయం ఏమంటే భారత ముస్లిం సమాజం ఈ విషయాన్ని మరచిపోయింది. ఈ కారణంగానే వారంతా జాతీయత విషయంలో యెంత దూరంగా ఉండిపోయారు? దౌర్భాగ్యం ఏమంటే తమ అధికార లాలసత, స్వార్థంతో ఓట్‌ ‌బ్యాంక్‌ ‌రాజకీయం చేసే క్రమంలో మన రాజకీయ నేతలు ముస్లింల తుష్టీకరణ కొనసాగిస్తూ వారి మనసులో వేర్పాటు వాద బీజాలు నాటి రెచ్చ గొడుతున్నారు. ఈ ధోరణి నేటికీ కొనసాగుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్‌లో 2021 ఎన్నికల సందర్భంలో, ఎన్నికలు ముగిశాక ఇలాటి ఘటనలెన్నో దేశ ప్రజలంతా చూశారు.

రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌సంస్థాపకులయిన డా. హెడ్గేవార్‌ ‌మన దేశ ప్రాచీన వైభవ స్థితినీ, ఆ తర్వాత జరిగిన పతనావస్థనీ లోతుగా అధ్యయనం చేశారు. హిందూ సమాజాన్ని ఆత్మ విస్మృతి భావన నుండి, హిందూ, హిందుత్వం పట్ల పేరుక పోయిన ఆత్మ న్యూనతా భావన (ఇన్ఫీరియారిటీ కాంప్లెక్‌) ‌నుండి బయటకు తేవాలని సంకల్పించారు. ఆ దిశగా నడుం బిగించారు.‘హిందూ – హిందుత్వం’ పట్ల ప్రజలలో నిద్రాణమై ఉన్న అభిమానాన్ని జాగృత పరచి, సంకుచిత భావాల ఊబి నుండి పైకి లాగి, సంఘటిత పరచి ఈ మహోన్నత దేశానికి పరమ వైభవ స్థితిని పునః కల్పించాలనే సంకల్పానికొచ్చారు. దీని కోసమే రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ని నెలకొల్పారు. ఆ సమయంలో కూడా కొందరు సూడో సెక్యులరిస్టులు, మెకాలే పుత్రుల రూపంలో ‘సో కాల్డ్’ ‌మేధావులు ఈ కార్యక్రమంపై బురద చల్లుతూ జాతివాదాన్ని ఆపాదించారు. ఆ సూడో సెక్యులర్‌ ‌శక్తులకు, సోకాల్డ్ ‌మేధావులకు రెండే రెండు మాటల్తో జవాబిచ్చారు డాక్టర్‌జీ. ‘మా దృష్టిలో సంఘం కులవాదంతో కాదు, జాతీయవాద భావన(రాష్ట్రీయ భావన)తో కూడుకొన్నది. అందుకే మేము మా సంఘానికి హిందూ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ అనే పేరు పెట్టలేదు. జాతీయతావాదంతో కూడుకున్నది కనుకనే రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ అనే పేరు పెట్టాం. మా దృష్టిలో సంఘటితమైన హిందూశక్తి ద్వారా జరిగే ప్రతి కార్యమూ జాతీయ భావనలతో కూడుకున్నది అని డాక్టర్జీ అన్నారు.’

మన చరిత్రలోకి తొంగి చూసినప్పుడు ఎందరో మహా పురుషులు ఈ మార్గాన్నే అవలంబించారనే విషయం స్పష్టంగా కనబడుతుంది. మహారాష్ట్ర లో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ‌కూడా ఆ సమయాన హిందువుల మదిలో దేశం, ధర్మం, సమాజం పట్ల భక్తి భావనలను జాగృత పరిచారు. వారి మనసులో సమాజం పట్ల తమ కర్తవ్యం ఎలా ఉండాలనేది బోధ పరిచారు. దాంతో సాధారణ హిందువులు సైతం అసాధారణ రీతిలో త్యాగపరాక్రమాలను చూపుతూ ప్రాణాలను బలిదానం చేశారు. ఇందులోంచే హైందవ సమాజ స్థాపన జరిగింది. పంజాబ్‌లో సిక్కు మత గురువులు ఈ మార్గాన్నే అవలంబించారు. ఖాల్సా సంప్రదాయ స్థాపన చేస్తూ గురు గోవింద సింగ్‌ ఏమన్నారంటే – ‘సకల్‌ ‌జగత్‌ ‌మే ఖాల్సా పంథ్‌ ‌జాగే బీ జగే ధర్మ్ ‌హిందూ సకల్‌ ‌భండ్‌ ‌భాజే’ అని. హిందూ ధర్మాన్ని రక్షించాలనే పిలుపు ఆయన ఇచ్చారు. శ్రేష్టమైన ఈ హిందూ ధర్మ పరిరక్షణ కోసం గురుగోవింద సింగ్‌ ‌కుటుంబం యావత్తూ ప్రాణాలను బలిదానం చేసింది. ఈ ప్రకారమైన జాతీయ భావనలతో కూడుకున్న ఆలోచనా ప్రవాహానికీ, కార్యానికీ నేటితో (విజయ దశమి) 96 ఏళ్ళు పూర్తవుతున్నాయి. ఒక ధ్యేయం, ఒక ఆలోచన, ఒక కార్యపధ్ధతితో 96 సంవత్సరాలుగా అఖండ – ఆసేతు హిమామాచలం దాకా ఈ కార్యం మున్ముందుకు సాగుతోంది. ఒక గీతంలో సంఘ గంగా వర్ణన ఇలా వినిపిస్తుంది – ‘కర్‌ ‌సుసించిత్‌ ఇస్‌ ‌ధారా కో సుజల, సుఫలా, ఉర్వరా బీ మాతృభూ కా, పుణ్యభూ కా రూప్‌ ‌హై ఇస్నే సంవారా ’ అని. సామాజిక జీవనంతో ముడిపడ్డ అన్ని క్షేత్రాలకు సంజీవని అందిస్తూ, దేశభక్తిని, సామాజిక బాధ్యతను జాగృత పరుస్తూ లక్షలాది మంది కార్యకర్తలు ఈ భగవత్కార్యాన్ని సఫలం చేసేందుకు జీవిస్తున్నారు. అవసరమైతే మృత్యువుని సైతం ఆలింగనం చేసుకుంటున్నారు. అయినప్పటికీ మిగతా స్వయంసేవకులు, సంఘ హితైషులు ఈ గీతంలో ప్రస్తావించిన ఓ ప్రశ్న- ‘శుష్క్ ‌మరుభూ శేష్‌ ‌క్యో ఫిర్‌ ‌తాప్‌ ‌భీషణ్‌ ‌సహ రహీ హై?’ (శుష్కమైన మరుభూమి ఎందుకు మిగలాలి? మరి భీషణమైన తాపాన్ని భూమి ఎందుకు సహిస్తున్నది?) అని అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేటికీ కొన్ని క్షేత్రాలు, సమాజంలోని కొన్ని వర్గాలు, కొన్ని సమస్యలు మనతో దగ్గర కాకుండా (సంపర్కం లేకుండా) ఎందుకున్నాయి అనే విషయాన్ని ఆలోచించాలి. దీని జవాబు ఒక్కటే. నా జీవితంలో దేశానికి, సమాజానికి ప్రథమ స్థానం. ఆ తర్వాతే నేను నా కుటుంబం – నా జాతి అని ఆలోచించాలి. ఈ భగవత్కార్యానికి మనం చేయూత నివ్వాలి. ఈ కార్యాన్ని సఫలం చేస్తూ మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. చివర్లో సంఘ్‌లో మనం పాడే ఓ గీతంలోని పంక్తులను గుర్తు చేసికుంటూ నా ఈ వ్యాసాన్ని ముగిస్తాను..

‘అప్ని విజయ్‌ ‌మే విశ్వాస్‌ ‌హమే పూరా హై

కింతు రక్త్ -‌స్వేద్‌ ‌కా కుండ్‌ ‌కుఛ్‌ అధూరా హై’

(మన విజయం మీద మనకు పూర్తిగా నమ్మకం ఉంది.

కాని ఇంకా రుధిర స్వేద కుండం పూర్తిగా నిండలేదు.)

స్వేద కుండాన్ని నింపేందుకు మనమంతా క్రియాశీలురం కావాలి, ఇదే నా మనవి.

– ‌సుహాస్‌రావు హీరేమఠ్‌, అఖిల భారతీయ కార్యకారణి సదస్యులు

అను: విద్యారణ్య కామ్లేకర్‌

About Author

By editor

Twitter
Instagram