స్వాతంత్య్ర పోరాటం ఏ జాతికైనా ప్రాతఃస్మర ణీయమే. అది ఆ జాతిని కలిపి ఉంచుతుంది. భవిష్యత్తులోకి నడిచేందుకు చోదకశక్తిగా ఉండగలుగు తుంది. కానీ, ఎంత గొప్ప స్వాతంత్య్ర పోరాటమైనా కాలక్రమంలో తన ప్రభావాన్నీ, పట్టునీ కోల్పోక తప్పదు. అది చరిత్రగా, గర్వించే గతంగా మాత్రమే మిగిలి ఉంటుంది. అలాంటి స్థితిలో మళ్లీ జాతి మొత్తానికి అంతస్సూత్రంగా పనిచేసేది ఏమిటి? ఆ దేశ రాజ్యాంగమే. నిజానికి భారత రాజ్యాంగం ఇప్పుడు నిర్వహిస్తున్న మహోన్నత బాధ్యత అదే.

‘మనమూ-మన భారత రాజ్యాంగము- ప్రత్యేకతలు’ అనే చిన్న పుస్తకం కొన్ని అంశాలు చర్చించింది. సామాజిక సమరసతా వేదిక (హైదరా బాద్‌) ‌ప్రచురణ ఇది. సంకలనకర్త కె.శ్యాంప్రసాద్‌. 47 ‌పేజీలతో, ఆరుభాగాలుగా ఉన్న ఈ పుస్తకం నుంచి లోతైన విశ్లేషణను ఎవరూ ఆశించరు. ఇంకా, ప్రచురించిన వారు సమరసతా వేదిక వారు కాబట్టి, ఆ అంశం పట్ల రాజ్యాంగ నిర్మాతల నిబద్ధత, తరువాతి తరం పాలకుల దృష్టి ఏమిటి అన్న కోణమే ఎక్కువగా స్వీకరించారు. కానీ ఈ నిబద్ధత అన్ని రాజ్యాంగ అంశాల ఎడలా లేదు. ఉండదని రాజ్యాంగ నిర్మాతలకు ఆనాడే తెలుసు. డాక్టర్‌ అం‌బేడ్కర్‌ ‌వంటి ద్రష్టలు రాజ్యాంగ పరిషత్‌లో ఉండడమే ఇందుకు కారణం. అందుకే దానికి తగ్గట్టు మలిచారు.

తొలిగా ఇంగ్లండ్‌, అమెరికా, ఫ్రాన్స్, ‌పాకిస్తాన్‌ల రాజ్యాంగాల గురించి చిన్న పరిచయం ఇచ్చారు. ఇందులో మొదటి రెండు చిరకాలంగా చెక్కుచెదర నివి. పరిణతి చెందిన ప్రజాస్వామ్య ధోరణి అందుకు దోహదం చేసింది. ఫ్రాన్స్ ‌రాజ్యాంగం కాలాను గుణంగా మారింది. వ్యక్తి స్వేచ్ఛకు పెద్దపీట వేసే ప్రజాస్వామ్యమే పునాదిగా ఫ్రాన్స్ ‌రాజ్యాంగం మార్పులు సంతరించుకుంది. ఇక మతరాజ్యం పాకిస్తాన్‌లో రాజ్యాంగం రాజకీయ కుట్రలను బట్టి మారినట్టు కనిపిస్తుంది.

ఈ నాలుగు రాజ్యాంగాలను బట్టే కాదు, ప్రపంచంలో మరికొన్ని రాజ్యాంగాల ఆవిర్భావాన్ని బట్టి చూసినా భారత రాజ్యాంగం సమున్నతంగా కనిపిస్తుంది. భారతదేశంలో తొలి రాజ్యాంగ రచనకు యత్నించినవారు అనిబీసెంట్‌. ‌సైమన్‌ ‌కమిషన్‌ను నిరాకరించిన తరువాత మోతీలాల్‌ ‌నెహ్రూ నాయకత్వంలో రాజ్యాంగ రచనకు 1929లో రెండో యత్నం జరిగింది. లక్నో ఒప్పందం మేరకు ముస్లింలకు తగిన ప్రాతినిధ్యం లేనందున ఆమోద యోగ్యం కాదని జిన్నా పేచీ పెట్టడంతో దానికి పురిట్లోనే సంధి కొట్టింది.ఆధునిక రాజ్యాంగానికి పునాదులు వేసినది 1935 భారత ప్రభుత్వ చట్టమే. స్వాతంత్య్రం రావడానికి ఒక ఏడాది ముందు నుంచే రాజ్యాంగ రచన ఆరంభమైంది. మొదట ఒక ఫ్రెంచ్‌ ‌నిపుణుని చేత రాయించాలని అనుకున్నారు. కానీ గాంధీ అంబేడ్కర్‌ ‌పేరును సూచించారు. వేయేళ్ల బానిసత్వం తరువాత ఏర్పడుతున్న ఒక దేశ పునర్నిర్మాణం, భవిష్యత్తులను దృష్టిలో పెట్టుకుని రాసినది మన రాజ్యాంగం. రాజ్యాంగ పరిషత్‌లో ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. కానీ లోతైన చర్చల తరువాత, జాతి హితం కోసం ఏకాభిప్రాయానికి వచ్చారు. మన రాజ్యాంగం సామాజిక న్యాయం అనే కల ఆధారంగా నిర్మితమైన మాట కూడా నిజం. నిజానికి రిజర్వేషన్‌ ఎస్‌సి, ఎస్‌టీలకు మాత్రమే వర్తించాలి. ఆ విషయాన్ని సుస్పష్టంగానే రాజ్యాంగంలో అంబేడ్కర్‌ ‌పేర్కొన్నారు కూడా. రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు, కేంద్రానికి తక్కువ అధికారాలు అన్న నెహ్రూ యోచనను అంబేడ్కర్‌ ‌నిర్మొహమాటంగా తోసిపుచ్చారు. ఇలాంటివి ఎన్నో కనిపిస్తాయి.

ఎంత చిన్న పుస్తమైనా కావచ్చు. భారత రాజ్యాం గంలో ఎన్ని షెడ్యూళ్లు ఉన్నాయి? ఎన్ని అధికర ణాలు ఉన్నాయి? ఎన్ని సవరణలు జరిగాయి? అన్న విషయాలకు కొంచెం స్థలం కేటాయించి ఉండవచ్చు. అలాగే రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైనా బెనెగల్‌ ‌నరసింగరావు వంటి కొద్దిమంది పేర్లే ప్రస్తావిం చారు. రాజ్యాంగ పరిషత్‌ ‌సభ్యుల జాబితాను ఇచ్చి ఉండవలసింది. కొన్ని ఘటనల సంవత్సరాల విషయంలో ఇంకొంచెం శ్రద్ధ వహించి ఉండాల్సింది.

మనమూ – మన భారత
రాజ్యాంగము – ప్రత్యేకతలు
సంకలనకర్త: కె. శ్యాంప్రసాద్‌,
‌పే: 48, వెల రూ 25/-
ప్రతులకు: సాహిత్య నికేతన్‌

About Author

By editor

Twitter
Instagram