ఆంధప్రదేశ్‌లో వైఎస్సార్‌ ‌క్రాగెస్‌ ‌పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ఆలయాలపై, హిందువుల మనోభావాల మీద నిత్యం ఏదోరకంగా దాడి జరుగుతూనే ఉంది. అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని స్వామివారి ఊరేగింపు రథం దగ్ధమైన ఘటన మరువక ముందే తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారమైన విజయవాడ కనకదుర్గమ్మ వెండి ఉత్సవ రథానికి ఉన్న మూడు వెండి సింహాలు మాయమయ్యాయి. ప్రస్తుతం ఒక్క సింహం విగ్రహం మాత్రమే మిగిలింది. దొంగలు దానిని కూడా పెకలించేందుకు ప్రయత్నించి విఫలమైనట్లుగా తెలుస్తోంది. మాయమైన వెండి సింహాల విలువ దాదాపు 15 లక్షల రూపాయలు ఉండవచ్చని అంచనా.

కనకదుర్గ అమ్మవారిని తెలుగు సంవత్సరాది అయిన ఉగాది రోజున ఈ రథంపై ఊరేగిస్తారు. సుమారు 20 ఏళ్ల క్రితం ఈ వెండి రథాన్ని తయారు చేయించారు. విజయవాడలోని దుర్గా ఇండస్ట్రీస్‌ ‌సంస్థ ఈ రథానికి వెండి తాపడం చేసింది. సుమారు 70 కేజీలకుపైగా వెండితో ఈ రథానికి తాపడం చేశారు. దీనికోసం అప్పట్లోనే సుమారు రూ.50 లక్షలు ఖర్చు చేశారు. దుర్గాదేవి సింహవాహిని. దీనిని ప్రతిబిం బించేలా ఉత్సవ రథం నాలుగు స్తంభాలకు నాలుగు వెండి సింహం విగ్రహాలను అమర్చారు. ఒక్కో  సింహం విగ్రహానికి 8 కేజీల వెండిని తాపడం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు 3 సింహాలు మాయమయ్యాయి. అంటే, మొత్తం 24 కేజీల వెండి చోరీకి గురైంది.

అంతర్వేది రథం దహనం ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో రథాల భద్రతపై దృష్టి సారించారు. అందులో భాగంగా దుర్గమ్మ రథాలను పరిశీలించారు. వెండి ఉత్సవ రథాన్ని పరిశీలించినప్పుడు ఈ విషయం బయటపడింది. రథానికి నాలుగువైపులా ఉండాల్సిన వెండి సింహాల్లో మూడు అపహరణకు గురైనట్లు తేలింది. నాలుగో సింహాన్ని దొంగలు బలంగా లాగడానికి ప్రయత్నించడంతో సగం వేలాడుతోంది. ఈ రథం ఆలయ ప్రాంగణంలోనే సమాచార కేంద్రానికి సమీపంలో ఉంటుంది. ఇక్కడ సిబ్బంది పర్యవేక్షణ కూడా ఉంటుంది. అయినప్పటికీ.. సింహాలు మాయం కావడం గమనార్హం. కరోనా లాక్‌డౌన్‌ ‌సమయంలోనే చోరీ జరిగినట్లు భావిస్తున్నారు. కరోనా కలకలం మొదలైన నాటి నుంచి ఈ రథానికి వేసిన టార్పాలిన్‌ ‌పట్టను అధికారులు తొలగించలేదు. దొంగలు పని పూర్తయ్యాక టార్పాలిన్‌ను యథాతథంగా చుట్టేయడంతో సిబ్బందికి కూడా అనుమానం రాలేదు.

మరోవైపు కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ముడిపడిన దుర్గమ్మ ఉత్సవ రథం విగ్రహాలు మాయమైనప్పటికీ ఏమీ జరగనట్లుగానే ఆలయ అధికారులు మౌనం వహించడం పలు అనుమానా లకు తావిస్తోంది. దీనిపై వెంటనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. పైగా పొంతనలేని మాటలతో మాయ చేసేందుకు ప్రయత్నించారు. సింహాలు స్టోర్‌ ‌రూంలో ఉండొచ్చని ఒకసారి, అంతకు ముందే పోయి ఉండొచ్చని మరోసారి చెబుతూ వచ్చారు. స్టాక్‌ ‌రిజిస్టర్‌ ‌పరిశీలిస్తే కానీ ఈ విషయం నిర్ధారించలేమని సాక్షాత్తు ఆలయ ఈవో సురేశ్‌బాబు కూడా చెప్పారు. స్టోర్‌ ‌రూంను, స్టాక్‌ ‌రిజిస్టర్‌ను పరిశీలించేందుకు గంటలు, రోజులు అక్కర్లేదు. నిమిషాల్లో తేల్చేయ వచ్చు. కానీ, చోరీ విషయాన్ని నిర్ధారించేందుకు మూడు రోజుల గడువు కావాలని ఈవో పేర్కొనడం ఆశ్చర్యం. సింహాలు మాయమైన విషయమై మీడియా ప్రశ్నించినా అలాంటిది ఏమీ లేదని ఈవో బుకాయించారు. సింహాల చోరీ విషయాన్ని దాచిపెట్టి పోయిన వాటి స్థానంలో కొత్తవి పెట్టేందుకు ప్రయత్నించినట్లు కూడా తెలుస్తోంది. చోరీ జరిగిందో లేదో నిర్ధారించడానికి 3 రోజులు పడుతుందని ఈవో చేసిన ప్రకటన వెనుక అంతరార్థం ఇదేనని భావిస్తున్నారు. ఉత్సవ రథం వద్ద సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ వెండి సింహాలు మాయం కావడం వెనుక ఇంటిదొంగల పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దుర్గగుడిలో మూడు రథాలున్నాయి. రథం సెంటరు వద్ద పెద్ద రథం, మహా మండపం దగ్గర చిన్న చెక్క రథం, వెండి ఉత్సవ రథం ఉంటాయి. ఉగాదితోపాటు  బ్రహ్మోత్సవాల సమయంలోనూ వెండి ఉత్సవ రథంపై దుర్గమ్మను ఊరేగిస్తారు. చైత్ర మాసంలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఐదు రోజులపాటు రోజుకో వాహనంపై అమ్మవారు ఊరేగుతారు. ఐదో రోజున వెండి ఉత్సవ రథంపై అమ్మవారిని ఊరేగిస్తారు.

About Author

By editor

Twitter
Instagram