స్వతంత్ర భారతదేశ తొలి పత్రికా సంపాదకులలో ఒకరైన బుద్ధవరపు వేంకటరత్నం సమాజం కోసం నిరంతరం సేవలు అందించి, నమ్మిన సిద్దాంతం కోసం కడవరకు నిలిచిన చిరస్మరణీయులు అని పలువురు శ్రద్ధాంజలి ఘటించారు. ఆర్‌ఎస్‌ఎస్‌  స్వయంసేవక్‌గా ఉంటూ క్విట్‌ ఇండియా ఉద్య మంలో చురుకుగా పాల్గొన్న ఆయన, ఆర్‌ఎస్‌ఎస్‌ ఆశయాలప్రచారం కోసం ఏర్పాటైన జాగృతి వారపత్రికకు 23 ఏళ్ల వయసులోనే వ్యవస్థాపక సంపాదకుడిగా బాధ్యతలు స్వీకరించి, దానిని తీర్చిదిద్దారని నివాళులు అర్పించారు. హైదరాబాద్‌ ‘జాగృతి’ భవనంలో నవంబర్‌ 21 తేదీన ఏర్పాటైన బుద్ధవరపు సంస్మరణ సభలో పలువురు, ఆయన ఆయన వ్యక్తిత్వాన్ని, ప్రతిభా పాటవాలను, పత్రిక రంగానికి ఆయన సేవలను, ఆయనతో గల అనుబంధాన్ని స్మరించుకున్నారు. ఆయనకు సాహిత్యం ప్రధాన అంశమే అయినా పత్రికా సంపాకదకుడిగా, ఔత్సాహికుడిగా అన్ని అంశాలపై ఆసక్తి పెంచుకున్నారని అన్నారు.

బుద్ధవరపు వేంకటరత్నం పాత్రికేయంలో దిట్ట అని, విలువలు పాటిస్తూ, జాతీయత ప్రధాన లక్ష్యంగా వృత్తిని కొనసాగించారు తప్ప ఎవరికి తలవంచలేదని కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ‘జాగృతి’ ప్రకాశన్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు చిలకమారి సంజీవ అన్నారు. బుద్ధవరపు మంచి కథ, నవలా రచయిత అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా సేవలు అందించిన ఆయన పూజ్య గురూజీ సూచనల మేరకు జాతీయ వారపత్రిక ‘జాగృతి’ వ్యవస్థాపక సంపాదకుడిగా వ్యవహరించారని తెలిపారు. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, అటల్‌ బిహారీ వాజపాయ్‌ లాంటి అఖిల భారత స్థాయి నాయకులు ఆంధ్రప్రాంత పర్యటనకు వచ్చినప్పుడు వారి ఉపన్యాసాలను చక్కటి ధారణ, గంభీరస్వరంతో తెలుగులోకి అనువదించే వారన్నారు. ఆయన రాసిన పదుల కొద్దీ కథలు నాటి భారతి, ఆంధ్రపత్రిక లాంటి పత్రికలు ప్రచురించాయని, ఆయన చేసిన సమీక్షలు, విమర్శలు జాతీయతను ప్రస్ఫుటించేలా ఉండేవని అన్నారు. ఎన్నో దేశభక్తి గీతాలు రాశారని జీవితాం తం జాతీయత, దేశభక్తితో కూడిన జీవితం గడిపారు.

‘జాగృతి’ అసోసియేట్‌ ఎడిటర్‌ కె.దుర్గారెడ్డి మాట్లాడుతూ, పత్రిక 75 ఏళ్ల (2022) సందర్భంగా వెలువరించిన ప్రత్యేక సంచిను పత్రిక పరివారంతో కలిసి బుద్ధవరపుగారికి  అందించే అవకాశం, అదృష్టం కలిగిందని, ఆ తరువాత మరి కొన్నిసార్లు కలిసినప్పుడు, పత్రిక గురించి అనేక విశేషాలు తెలియచెప్పారన్నారు. అంత వృద్ధాప్యంలో కూడా వారి జ్ఞాపకశక్తి అమోఘం. పత్రికకు ‘నేను కేవలం శరీరాన్నయితే, భండారు సదాశివరావు గారు ఆత్మ’ అనే నిరహంకార భావన వేంకటరత్నంగారిలో దర్శించామని అన్నారు.

జాగృతి పూర్వ సంపాదకులు వడ్డి విజయసారథి మాట్లాడుతూ, వేంకటరత్నం ప్రచారం కోరని రచయిత, కవి అని అన్నారు. ఎన్నో రచనలు చేసినా తాను కర్తగా చెప్పుకునే వారు కాదని, అది సంఘ సంప్రదాయం కూడా కాదనేవారని తెలిపారు. ఆయన అభిమానవంతుడని, ఎవరి నుంచీ ఎన్నడూ ఉచిత సహాయాన్ని అర్థించని వ్యక్తిత్వమని అన్నారు. 2003 ప్రాంతంలో సతీవియోగం కలిగి, మరోవంక రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయినప్పుడు మిత్రులం కలసి చేయాలన్న సహాయాన్ని మృదువుగా తిరస్కరించారని గుర్తు చేశారు.

 ఆర్‌ఎస్‌ఎస్‌ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్‌ మాట్లాడుతూ, ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్డి సంవత్సరంలో శతాయుష్షుతో జీవితాన్ని చాలించిన వేంకటరత్నం నిస్వార్థ పాత్రికేయ ప్రముఖులని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావ సంవత్సరంలోనే పుట్టి, పదిహనేళ్ల వయసులో (1940) సంస్థలో చేరి తరువాత నాలుగేళ్లకు (1944) ప్రచారక్‌గా, మరో నాలుగేళ్ల (1948)కు ‘జాగృతి’ జాతీయ వార పత్రిక వ్యవస్థాపక సంపాదకుడిగా ఎదిగారన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆశయాలు వ్యాప్తి కోసం ఏర్పడిన ఈ పత్రికకు పూజ్య గురూజీ ఆదేశాలపై సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించారు. గురూజీ ప్రేమాభిమానాలు పొందిన ఆయన వారి మార్గదర్శనంలో వ్యక్తిత్వాన్ని పండిరచుకున్నారని, వారిపై రచనలు చేశారని చెప్పారు. సమాజంలో ఆర్‌ఎస్‌ఎస్‌పై వ్యతిరేకత ఉన్న సమయంలో తన రచనల ద్వారా దానికి సమాధానం చెప్పారన్నారు. ప్రజా సంబంధాలను నిర్వహించడంలో బుద్ధవరపువారు దిట్ట అని, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో విభేదించే భోగరాజు పట్టాభిసీతారామయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణ వంటి వారితో పత్రికకు రచనలు చేయించారని, వారి గురించి ప్రచురించారని చెప్పారు. కాసు బ్రహ్మానందరెడ్డి లాంటి నాటి ముఖ్యమంత్రులతో సన్నిహిత సంబంధాలు ఉన్నా, వాటిని వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకోలేదని, స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రభుత్వ పించన్‌ సహా నివాస స్థలం కానీ తీసుకోని అరుదైన వ్యక్తిత్వం కలవారు అని అన్నారు. ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి కావాలన్నారు.

బుద్ధవరపు వారి ఆత్మీయలు పున్నారావు, ఆయనతో గల అనుబంధాన్ని పంచుకుంటూ… వారి చివరి దశాబ్దంలో వారితో సన్నిహితంగా మెలిగే అదృష్టం కలిగిందని తెలిపారు. వారు తనతో అనేక అనుభూతులు పంచుకొనేవారని, ముఖ్యంగా… పూజ్య గురూజీతో గల సాన్నిహిత్యం,వారు తమ పట్ల కనబరిచిన వాత్సల్యం గురించి మురిపెంగా వివరించేవారని చెప్పారు. గురూజీ మద్రాసు నుంచి విజయవాడ వస్తుండగా, కృష్ణా వరదల కారణంగా రైలు కృష్ణా కెనాల్‌ స్టేషన్‌లో నిలిచిపోవడం, వారి కోసం టీ తీసుకొని వేంకటరత్నం రైలు వంతెనపై నది దాటి వెళ్లడాన్ని (అప్పటికి ప్రకాశం బ్యారేజీ నిర్మాణం కాలేదు)ఉదాహరణగా చెబుతూ, అది గురూజీ పట్ల ఆయనకు గల భక్తి భావమని వివరించారు.

వేంకటరత్నం కుమార్తె అరుణకుమారి తమ జ్ఞాపకాలు పంచుకొంటూ, సయయపాలన, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడడం, నిర్భయత్వం, స్థితప్రజ్ఞత ఆయన ప్రత్యేకతలని గుర్తు చేసుకున్నారు. తమ తండ్రిగారిపై వారి గురువు రఘుపతి వేెంకటరత్నంనాయుడి ప్రభావం ఎక్కువగా ఉండేదని చెప్పారు. నిత్యం ఏదో ఒకటి రాయడం అలవాటుగా ఉండేదని, దాదాపు పాతికేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాలు కోల్పోయి (2001), నాలుక కూడా తెగి ఇంటికే పరిమితమైనా, రాజకీయ, సామాజిక అంశాల గురించి ముచ్చటించే వారని, తనను చూడవచ్చిన వారితో జ్ఞాపకాలు పంచుకొనేవారని చెప్పారు. వైకల్యానికి బాధపడలేదు… కాలు లేకపోయినా కలం ఆగలేదని తెలిపారు. ఆచార్య కసిరెడ్డి మాట్లాడుతూ, తాను వేంకటరత్నం అభిమానినని, ఆయన రాసిన గీతాలను (అప్పట్లో ఆయన రాశారని తెలియదు) విద్యార్థిగా అనేక సందర్భాలలో పాడానని తెలిపారు. భండారు సదాశివరావు గారి ద్వారా ఆయన గురించి ఎంతో తెలుసుకున్నానని చెప్పారు. ఆత్మ నిర్భరతతో జీవనం సాగించిన వ్యక్తి అని నివాళులు అర్పించారు.

  • జాగృతి డెస్క్‌

About Author

By editor

Twitter
YOUTUBE