దేశీ పాలన నుండి విముక్తి పొంది, స్వాతంత్య్రాన్ని సాధించిన చరిత్రాత్మక పర్వాన్ని ఈ ఆగస్ట్ 15‌న భారత్‌ ‌మరోసారి గుర్తుచేసుకుంటోంది.  స్వాతంత్య్రాన్ని సంపాదించుకునేందుకు  సాగించిన నిరంతర సంఘర్షణ, చేసిన బలిదానాలను ఈ వేడుకలో గుర్తుచేసుకోవడం సహజం.  విదేశ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటం-మనది (స్వ) అనే భావన ఆధారంగా సాగింది. ఈ భావన స్వధర్మం, స్వరాజ్యం, స్వదేశీ అనే రూపాలలో ప్రకటితమైంది. సాధుసంతులు వల్ల వచ్చిన ఆధ్యాత్మిక చైతన్యం ఈ పోరాటంలో అంతర్నిహితంగా పనిచేస్తూనే ఉంది.

భారత్‌ ఆత్మలో యుగయుగాలుగా ఉన్న- ‘స్వ’ అనే భావం ఒక్కసారిగా ప్రకటితమై విదేశీశక్తులను అడుగడుగునా సంపూర్ణ శక్తితో ఎదుర్కోవలసి వచ్చింది. ఆ శక్తులు దేశ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్యా వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశాయి. స్వావలంబనతో కూడిన గ్రామీణ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయి. ఇలా అన్ని రంగాల్లో, అన్ని వైపుల నుంచి విదేశీ శక్తుల దాడి జరిగింది. ఆ దాడిని భారత్‌ ఎదుర్కొంది.

యూరోపియన్‌ ‌శక్తుల దాడిని భారత్‌ ఎదుర్కొన్న తీరు ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేక అధ్యాయం. విదేశీ దురాక్రమణదారుల దాడులను ఒకపక్క తిప్పి కొడుతూనే మరోపక్క వికృతులను సరిచేసి సమాజాన్ని బలోపేతం చేసే కార్యక్రమం కూడా సాగింది.

ఒకవైపు దేశంలోని వివిధ సంస్థానాలు, రాజ్యాలు ఆంగ్లేయ దుష్టపాలనను, దమననీతిని ఎదుర్కొంటే, మరోవైపు తమ సహజమైన, సరళమైన జీవన శైలిపై, జీవన విలువలపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా వివిధ గిరిజన జాతులు పోరాటం సాగించాయి.

తమ జీవన విలువలను కాపాడుకునేందుకు వాళ్లు చేసిన పోరాటాన్ని ఆంగ్లేయులు అత్యంత క్రూరంగా అణచివేశారు. దారుణ మారణకాండకు పాల్పడ్డారు. అయినా గిరిజనులు పోరాటం ఆపలేదు. 1857లో దేశమంతటా జరిగిన స్వతంత్ర సంగ్రామం ఈ పోరాటాల కొనసాగింపే. వీటిలో వేలాది మంది ప్రాణాలు అర్పించారు.

భారతీయ విద్యావ్యవస్థను నాశనం చేయడానికి విదేశీయులు చేసిన ప్రయత్నాలను ఎదుర్కొనడానికి కాశీ విశ్వవిద్యాలయం, శాంతి నికేతన్‌, ‌గుజరాత్‌ ‌విద్యాపీఠం, తిరునల్వేలిలో ఎండిటి హిందూ కాలేజీ, దక్కన్‌ ఎడ్యుకేషనల్‌ ‌సొసైటీ, గురుకుల్‌ ‌కంగడి వంటి అనేక సంస్థలు ఉద్భవించాయి. విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని జాగృతం చేశాయి. జగదీష్‌చంద్ర బోస్‌, ‌ప్రఫుల్లచంద్ర రే వంటి శాస్త్రవేత్తలు తమ ప్రతిభ ద్వారా దేశ ప్రజానీకంలో స్వాభిమాన భావాన్ని పెంపొందించారు. అలాగే నందలాల్‌ ‌బోస్‌, అవనీంద్రనాథ్‌ ‌టాగూర్‌, ‌దాదాసాహెబ్‌ ‌ఫాల్కే వంటి కళాకారులు, మాఖన్‌లాల్‌ ‌వంటి పత్రికా రచయితలు జాతీయభావ వ్యాప్తికి కృషి చేశారు. మహర్షి దయానందులు, స్వామి వివేకానంద మహర్షి అరవింద వారు ప్రజల్లో ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించి దారిచూపారు.

బెంగాల్‌లో రాజ్‌ ‌నారాయణ్‌ ‌బోస్‌ ‌ద్వారా హిందూ మేళాలు, మహారాష్ట్రలో లోకమాన్య బాలగంగాధర తిలక్‌ ‌ద్వారా గణేశ, శివాజీ ఉత్స వాలు ఈ దేశ సాంస్కృతిక మూలాలను బలోపేతం చేశాయి. అలాగే వెనుకబడిన, బలహీన వర్గాలలో విద్యావ్యాప్తికి, సామాజిక ఉన్నతికి అనేకమంది సంస్కర్తలు కృషి చేశారు. సామాజిక సమరసత సాధించడానికి డా. అంబేడ్కర్‌ ‌దారి చూపారు.

సమాజంలోని అన్ని రంగాలపై మహాత్మా గాంధీ ప్రభావం ఉంది. విదేశాల్లో ఉంటూ భారత స్వాతంత్య్ర సంగ్రామానికి తోడ్పడిన శ్యాంజీ కృష్ణవర్మ, లాలా హరదయాళ్‌, ‌మేడమ్‌ ‌కామా వంటి వారు కూడా గుర్తు చేసుకోవలసినవారే. లండన్‌లో ఇండియా హౌస్‌ ‌భారత స్వాతంత్య్ర సంగ్రామ కార్యకలాపాలకు కేంద్రమయింది. స్వాతంత్య్ర వీర సావర్కర్‌ ‌వ్రాసిన 1857లో స్వాతంత్య్ర సంగ్రామ గాథ భారతీయ విప్లవకారులకు ప్రేరణనిచ్చింది. స్వయంగా భగత్‌ ‌సింగ్‌ ఈ ‌పుస్తకాన్ని ప్రచురించి వేలాది కాపీలు పంచాడంటే దీని ప్రభావం ఎలా ఉండేదో అర్ధమవుతుంది.

దేశమంతటా ఉన్న 400లకు పైగా విప్లవ సంస్థల ద్వారా వేలాదిమంది విప్లవకారులు దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడారు. బెంగాల్‌లోని అటువంటి విప్లవ సంస్థ అనుశీలన సమితిలో పనిచేసిన డా।। హెడ్గేవార్‌ ఆ ‌తరువాత లోకమాన్య తిలక్‌ ‌ప్రేరణతో కాంగ్రెస్‌లో చేరారు. మధ్యప్రాంతపు కార్యదర్శిగా కూడా ఎంపికయ్యారు. 1920 నాగపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ ‌సమావేశాల యోజన సమితి ప్రముఖ్‌గా ఆయన సేవలు అందించారు. ఆ సమావేశాల్లోనే పూర్ణ స్వరాజ్యం కోరుతూ తీర్మానం ఆమోదించాలని డాక్టర్జీ సూచన ఇచ్చినా అందుకు అప్పటి కాంగ్రెస్‌ ‌నాయకత్వం సిద్ధపడలేదు. ఆ తరువాత కాంగ్రెస్‌ ఆ ‌తీర్మానాన్ని ఆమోదించింది.

రెండవ ప్రపంచ యుద్ధ కాలంలోనే నేతాజీ ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌కు నేతృత్వం వహించారు. మొదటి స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ఈశాన్య భారతంలో కొన్ని ప్రాంతాలను బ్రిటిష్‌ ‌పాలన నుండి విముక్తం చేసింది కూడా. ఎర్రకోటలో ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌సైనికులపై జరిగిన విచారణ దేశ ప్రజానీకానికి ఆగ్రహం కలిగించింది. దానితోపాటు నౌకాదళంలో భారతీయ సైనికుల తిరుగుబాటు కూడా బ్రిటిష్‌ ‌వారిని బెంబేలెత్తించింది. ఈ దేశాన్ని వదిలిపోవలసిన పరిస్థితి వారికి కల్పించింది.

‘స్వతంత్ర భానుడు ఉదయించాడు కానీ ఆ సూర్యుడిని విభజన అనే గ్రహణం పట్టుకుంది. అలాంటి క్లిష్ట, కష్ట పరిస్థితుల్లో కూడా భారతీయులు ధైర్యాన్ని కోల్పోలేదు. భారతదేశాన్ని జాగృతపరచాలి. అది ఈ దేశం కోసం మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం కోసం, సర్వ మానవాళి కోసం’ అని మహర్షి అరవిందులు అన్నారు. ఆయన మాటలు నిజమయ్యాయి. భారత స్వాతంత్య్ర సంగ్రామం అనేక దేశాలకు కూడా స్వతంత్ర పోరాటాన్ని సాగించడానికి ప్రేరణ అయింది. చివరికి రవి అస్తమించని బ్రిటిష్‌ ‌సామ్రాజ్యం పూర్తిగా కనుమరుగయింది. అన్నీ దేశాలు స్వతంత్రమయ్యాయి.

పోర్చుగీస్‌, ‌డచ్‌, ‌ఫ్రెంచ్‌, ‌చివరగా బ్రిటిష్‌ ‌వాళ్లు ఈ దేశానికి వచ్చారు. వ్యాపారం చేసుకుంటామని వచ్చిన వీరంతా ఇక్కడ తిష్ట వేసుకుని ఇక్కడి సంస్కృతిని నాశనం చేయడానికి, ప్రజలను మతం మార్చడానికి ప్రయత్నించారు. 1498లో వాస్కోడిగామా భారత భూభాగంపై అడుగుపెట్టినప్పుడే విదేశీ శక్తుల ప్రాబల్యానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమైంది.

ట్రావన్‌కోర్‌ ‌మహారాజు మార్తాండ వర్మ చేతిలో పరాజితులైన డచ్‌ ‌వారు ఈ దేశాన్ని వదిలిపోయారు. పోర్చుగీస్‌ ‌వాళ్లు కేవలం గోవాకు పరిమితమయ్యారు. బ్రిటిష్‌ ‌వాళ్లు మాత్రం కుటిల నీతితో సగానికి పైగా రాజ్యాలను ఆక్రమించుకో గలిగారు. మిగిలిన సగభాగంలో భారతీయ రాజులే పాలన చేశారు. వారితో బ్రిటిష్‌ ‌వాళ్లు ఒప్పందం చేసుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఈ సంస్థానాలన్ని భారతదేశంలో విలీనమయ్యాయి.

భారత్‌ ‌ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. నేడు అది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత సఫల ప్రజాస్వామ్య వ్యవస్థ. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడినవారే ఆ తరువాత దేశ రాజ్యాంగం రూపొందించడంలో కూడా ప్రముఖ పాత్ర వహించారు. అందువల్లనే భారత సాంస్కృతిక పరంపరను గుర్తుచేస్తూ రాజ్యాంగం మొదటి ప్రతిలో రామరాజ్యానికి చెందిన చిత్రాలు, వ్యాసుడు, బుద్ధుడు, జైనుడు వంటి వారి చిత్రాలు చేర్చారు.

‘స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు’ వేలాదిమంది స్వాతంత్య్ర వీరులకు స్మృత్యంజలి కావాలి. వారి వల్లనే మనం ఈనాడు ప్రపంచంలో ప్రముఖ ప్రజాస్వామ్య దేశంగా నిలబడుతున్నాం. దేశ స్వతంత్ర సాధనలో పాలుపంచుకున్న వేలాదిమంది వ్యక్తులు, సంస్థలను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. అప్పుడే ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా, స్వాతంత్య్రాల వెనుక ఎంతటి త్యాగాలు, పోరాటం ఉన్నాయో భావితరాలకు అర్థమవుతుంది, తెలుస్తుంది.

– దత్తాత్రేయ హొసబలే, రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌సర్‌కార్యవాహ

About Author

By editor

Twitter
Instagram