సునీల్ అంబేకర్, ఆర్ఎస్ఎస్ అఖిలభారత ప్రచార ప్రముఖ్

భారతదేశ వ్యాప్తంగా కరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌పెను ప్రభావం చూపిస్తున్నది. ఇప్పటికే ఎంతోమందిని ఈ మహమ్మారి బలి తీసుకున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాను ఎదుర్కొనే ఆయుధం మనోధైర్యమేనని చాలా మంది నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ఆధ్వర్యంలో పలు సేవాకార్యక్రమాలతో పాటు వ్యాధి సోకినవారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే పనిని స్వయంసేవకులు భుజాలకెత్తుకున్నారు. ప్రతిఒక్కరు వ్యాక్సిన్‌ ‌తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు, పలు అవగాహన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.


దేశవ్యాప్తంగా 219 ప్రదేశాలలో వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో స్వయంసేవకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం చేస్తున్నారు. 43 ప్రముఖ నగరాలలో కొవిడ్‌ ‌సేవాకేంద్రాలు, 2442 కరోనా వ్యాక్సిన్‌ (‌టీకా) కేంద్రాలు సంఘ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అంతేకాదు, 10,000 స్థలాలలో వ్యాక్సిన్‌ ‌తీసుకోవడంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.

ఆర్‌.ఎస్‌.ఎస్‌. అఖిలభారత ప్రచార ప్రముఖ్‌ ‌సునీల్‌ అం‌బేకర్‌ ఇటీవల ప్రెస్‌మీట్‌ (ఆన్‌లైన్‌) ‌నిర్వహించి ఈ విషయాలన్నిటినీ వెల్లడించారు. కరోనా క్లిష్ట సమయంలో సంఘ్‌ ‌ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు.

అంబేకర్‌ ‌మాట్లాడుతూ కరోనా మహమ్మారి వలన దివంగతులైన వారందరికీ రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌శ్రద్ధాంజలి ఘటిస్తున్నదని చెప్పారు. ఈ విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఆక్సిజన్‌ ‌సప్లై చేస్తున్న సిబ్బంది, పోలీసు యంత్రాంగం, పారిశుద్ధ్య కార్మికులు యుద్ధవీరుల వలె పోరాడుతున్నారని చెప్పారు.

తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకరమైన పరిస్థితులలో సైతం పనిచేస్తున్నారని, వారి త్యాగం మరువలేనిదని అన్నారు. అయితే, ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే శక్తి భారత సమాజానికి ఉన్నదని చెప్పారు.

సేవాభారతితో సహా ఆర్‌.ఎస్‌.ఎస్‌. అనుబంధ సంస్థల కార్యకర్తలెందరో కరోనా ప్రభావిత స్థలాలలో సహాయ కార్యక్రమాలను చేయడంలో నిమగ్న మయ్యారని అంబేకర్‌ ‌తెలిపారు. కరోనా బారిన పడిన అనేక కుటుంబాలకు సహాయ సహకారాలను అందిస్తున్నామన్నారు. సంఘ్‌ ‌చొరవతో ప్రస్తుత అవసరాలను దృష్టిలో వుంచుకొని 12 రకాల సేవా కార్యాక్రమాలు ప్రారంభించబడ్డాయి. సంఘ్‌ ఆధ్వర్యంలో అనేకచోట్ల కొవిడ్‌ ఐసోలేషన్‌ ‌కేంద్రాలు ఏర్పాటుచేశారని చెప్పారు.

అలాగే ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొవిడ్‌ ‌కేంద్రాల్లో, ఆసుపత్రుల్లో సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. కొవిడ్‌ ‌హెల్ప్‌లైన్‌ ‌కేంద్రాలు, రక్తదాన శిబిరం, ప్లాస్మాదానం, అంతిమసంస్కారం, ఆయుర్వేద కషాయం పంపిణీ, కౌన్సిలింగ్‌ ‌సెంటర్‌, ఆక్సిజన్‌ ‌సరఫరా, అంబులెన్స్ ‌సేవ, భోజనం, రేషన్‌, ‌మాస్కులు పంపిణీతో పాటు మరెన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. వాక్సినేషన్‌ ‌కొరకు ప్రజలలో అవగాహన కల్గించడాన్ని సంఘం చేపట్టింది. రక్తం, ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొచ్చే విధంగా సమాజాన్ని ప్రోత్సహిస్తు, దాతల వివరాలు కూడా సేకరిస్తున్నారని చెప్పారు.

ఇండోర్‌లో ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌చొరవతో ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులు, రాధాస్వామి సత్సంగం వంటి సంస్థల సహకారంతో 2000 పడకల కొవిడ్‌ ‌కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు.

పుణేలో స్వయంసేవకుల జనజాగరణ కార్యక్రమం ఫలితంగా 600 మంది ప్లాస్మాను దానం చేశారని, దాని ఫలితంగా 1500 మంది ప్రాణాలు నిలబడ్డాయని చెప్పారు. తమ హెల్ప్‌లైన్‌ ‌నంబర్‌ ‌ద్వారా సాయం కోరినవారికి సాయమందిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే అనేకమందికి సాయం అందించినట్లుగా గుర్తుచేశారు.

 స్థానిక పాలనా యంత్రాంగాలకు సాయం చేసేందుకు స్వయంసేవకులు ఎల్లప్పుడూ ముందుంటారని అంబేకర్‌ అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు దేశ ప్రజలందరి సహకారం అవసరమని, ప్రభుత్వాలతో పాటు ప్రజల సహకారంతోనే కరోనాపై విజయం సాధించగలమని సునీల్‌ అం‌బేకర్‌ అన్నారు.

About Author

By editor

Twitter
Instagram