నూతన దేశాధ్యక్షుడిగా మహమ్మద్‌ ‌ముయిజ్జు ఎన్నిక కావడంతో భారత్‌ – ‌మాల్దీవుల సంబంధాలు నూతన మలుపు తిరిగాయి. తనకు ముందు ఉన్న అధ్యక్షుడు ఇబ్రహీం సోలీహ్‌ అనుస రించిన ‘మొదట భారత్‌’ అన్న విధానాన్ని తిప్పికొడతానంటూ అధికారంలోకి దూసుకు వచ్చిన ముయిజ్జు, అధికారం చేపట్టగానే, మాల్దీవ్స్ ‌నుంచి భారత దళాలను ఉపసంహరించు కోవలసిందిగా భారత ప్రభుత్వానికి అధికారికంగా విజ్ఞప్తి చేశారు.

మాజీ అధ్యక్షుడు యమీన్‌ ఎన్నికల బరిలోకి దిగడానికి వీలులేదంటూ సుప్రీం కోర్టు నిషే ధించడంతో పీపుల్స్ ‌నేషనల్‌ ‌కాంగ్రెస్‌ (‌పిఎన్‌సి), గత అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌కు చెందిన  పీపుల్స్ ‌పార్టీ ఆఫ్‌ ‌మాల్దీవ్స్ (‌పిపిఎం) కలిసి పోగ్రెసివ్‌ ‌కాంగ్రెస్‌ అన్న పేరుతో పోటీ చేశాయి.

చైనా అనుకూల నాయకుడు, 2018లో అధికారాన్ని కోల్పోయిన యమీన్‌ ‘ఇం‌డియా ఔట్‌’ (‌భారత్‌ ‌నిష్క్రమించు) అన్న ప్రచారం ప్రారం భించారు. ఉతురుతిల పల్హు నావికా కేంద్రం వద్ద ఒక కొత్త రేవును నిర్మించి, నిర్వహించడంపై సోలిహ్‌ ‌నేతృత్వంలో భారత్‌, ‌మాల్దీవులు ఒక ఒప్పందంపై సంతకం చేయడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. భారత్‌ 50 ‌మిలియన్‌ ‌డాలర్ల రుణాన్ని ఇచ్చింది. ఈ రేవు మాల్దీవుల జాతీయ రక్షణ దళాల (ఎండిఎన్‌ఎఫ్‌) ‌సామర్ధ్యాలను పెంచడంతో పాటు, విస్తృతమైన దాని ప్రత్యేక ఆర్ధిక మండలాల పర్యవేక్షణను మెరుగుపరుస్తుంది. గత కొద్ది సంవత్సరాలలో భారత్‌ 1000‌కి పైగా ఎండిఎన్‌ ఎఫ్‌ ‌దళాలకు శిక్షణను ఇవ్వడమే కాక, 70శాతం శిక్షణ అవసరాలను నెరవేరుస్తోంది.

సొలిహ్‌ ‌ప్రభుత్వం నిర్మిస్తున్న నావికా కేంద్రం అంతిమంగా భారత్‌ ‌సైనిక స్థావరం అవుతుందంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా, యమీన్‌, ‌ముయిజు మావే ప్రచారం చేశారు. వాస్తవానికి అక్కడ ఉన్న 77మంది భారతీయ సిబ్బందిలో 50మందికి ధృవ హెలికాప్టర్లను నిర్వహించే బాధ్యతను భారత్‌ అప్పగించగా, మిగిలినవారంతా డోర్నియర్‌ ‌విమాన నిర్వహణలో మునిగి ఉన్నారు. అక్కడ మోహరించిన భారతీయ సొత్తు అంతా కూడా వైద్యపరమైన అత్యవసరాలు, తరలింపులు, రక్షణ ఆపరేషన్లు, మాదకద్రవ్య అక్రమ రవాణాదారుల జాడలను పట్టడం, ఎండిఎన్‌ఎఫ్‌కు సహాయంగా సముద్రతీర నిఘా కోసం ఉన్నాయి.

మాల్దీవుల జెండాతో ఎండిఎన్‌ఎఫ్‌ ‌నిర్వహించే భారతీయ వనరులను 2019 నుంచి ఇప్పటి వరకూ 976 మిషన్లలో ఉపయోగించారు. నిజానికి, ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రి రిజిజుతో మాట్లాడుతూ, వైద్యపరమైన తరలింపుల విషయంలో భారత ఆస్తుల తోడ్పాటును అధ్యక్షుడు  ముయిజ్జు అంగీకరించారు.  తమ సార్వభౌమాధికారానికి ముప్పు అన్న సాకు చూపి భారత దళాలను బహిష్కరిస్తామన్న హామీ కారణంగా ముయిజ్జూ భారతీయ ఆస్తుల తొలగింపుకు, సొలిహె పాలనలో చేసుకున్న దాదాపు 100 ఒప్పందాలను సమీక్షించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు.

మూడొంతుల ప్రపంచ వాణిజ్యానికి మార్గంగా ఉన్న తూర్పు పడమర షిప్పింగ్‌ ‌లేన్లు పక్కగా స్థితమైన మాల్దీవులు భౌగోళికరాజకీయంగా కీలకమైంది. గత దశాబ్దంలో భారత్‌ ‌నుంచి చైనా పక్షంలో చేరడం ద్వారా మాల్దీవులు ప్రాంతీయ పోటీలో ఒక కీలకాంశంగా మారింది. అయితే, ముయిజ్జు భారత వ్యతిరేక వైఖరి మరొక రకమైన వదంతులకు దారి తీసింది. భారత్‌ ‌దళాల స్థానంలో చైనా దళాలను తీసుకువస్తారన్న భావన రావడంతో, ‘‘భౌగోళిక రాజ కీయ శత్రుత్వంలో చిక్కుకునేంత పెద్దది మాల్దీవులు కాదు’’ అంటూ ఒక ఇంటర్వ్యూలో ముయిజ్జు స్పష్టీకరించారు.

 సాధారణంగా ఎన్నికైన తర్వాత మాల్దీవుల అధ్యక్షుడు పొరుగుదేశాలలో పర్యటిస్తాడు, అందులో తొలుత భారత్‌ ‌పర్యటన ఉంటుంది. ఆ సంప్రదాయానికి ముయిజ్జు స్వస్తి పలికి టర్కీలో అధికారికంగా పర్యటించారు.  ఈ పరిణామానికి విస్మరించలేని రెండు ప్రధాన కోణాలు ఉన్నాయి – మొదటిది, బహిర్గతంగా కనిపించే భౌగోళిక రాజకీయ కోణం, రెండవది, తక్కువగా అంచనా వేసే మత పరమైన సంబంధం. విదేశాంగ విధానాన్ని భారత్‌, ‌చైనాల గుప్పిట నుంచి తప్పించి ముయిజ్జు నూతన మార్గంలో ప్రయాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. నాయకత్వ మార్పుతో మాల్దీవుల విదేశాంగ విధానంలో వస్తున్న భారీ మార్పులు ఇతర దేశాలు ఆలోచనలో పడేలా చేస్తున్నాయి.

క్షీణిస్తున్న విదేశీ మారక నిల్వలను మరింత దిగజారకుండా కాపాడుకోవడం, ఏడాదిలో మిగిలిన 45 రోజుల బడ్జెట్‌ ‌వ్యయం కోసం 200 మిలియన్‌ ‌డాలర్లను సేకరించడం అన్నది తక్షణ సవాలుగా మారడంతో ముయిజ్జు పలు దేశాలతో చర్చలను ప్రారంభించారు. భారత్‌ ‌డిసెంబర్‌ ‌నెల కోసం ఇస్తున్న 71 మిలియిన్‌ ‌డాలర్ల రుణానికి అనుబంధంగా, విదేశాంగ మంత్రి నేతృత్వంలోని బడ్జెట్‌ ‌కమిటీ మధ్యప్రాచ్య దేశాలు సహా తమ విదేశీ భాగస్వాములతో చర్చలను ప్రారంభించింది. అధికారికంగా పదవీ స్వీకారం చేయకుండానే ముయిజ్జు వివిధ దేశాలలో పర్యటించి, మాలే ఎయిర్‌పోర్ట్ ‌ప్రాజెక్టు కోసం యుఎఇ నుంచి 80 మిలియన్‌ ‌డాలర్లను సేకరించగలిగారు. పర్యాటకం, విద్య, వైమానిక అనుసంధానం, పరస్పర పెట్టుబ డులలో సంభావ్య సహకారం, చర్చలపై టర్కీ ఆసక్తిని ప్రదర్శించడం, అధ్యక్షుడు ఎర్దోగాన్‌ ‌వ్యక్తిగతంగా ఆహ్వానించడంతో ముయిజ్జు తన తొలి అధికారిక పర్యటనగా టర్కీకి వెళ్లారు.

టర్కీ, మాల్దీవులు మధ్య దౌత్యపరమైన సంబంధాలు 1979లో ఏర్పడ్డాయి. అయితే, 2004 సునామీ అనంతరం నాటి ప్రధాని ఎర్దోగాన్‌ ‌పర్యటనతో ఊపందుకున్నాయి. ఫలితంగా, మంత్రివర్గ ద్వైపాక్షిక పర్యటనలు, ఒఐసి (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ ‌కంట్రీస్‌) ‌సమన్వయం అన్నవి ఈ సంబంధాలను సుస్థిరం చేశాయి.

ఉమ్మడి ఆర్ధిక కమిటీని ఏర్పాటు చేసేందుకు 2021లో మాల్దీవులు, టర్కీ ఒక అంగీకారానికి వచ్చి, వీసా రహిత ప్రయాణానికి గల అవకాశాలను అన్వేషించాయి. ఈ చర్చలు మత సహకారం, మాలే, మాల్దీవుల ప్రధాన విమాశ్రయం వెలనాను కాజ్‌వే బ్రిడ్జి ద్వారా అనుసంధానం చేసే హుల్‌హుమలే ద్వీపం పై ఇస్లామిక్‌ ‌కేంద్రాన్ని నిర్మించడంపై దృష్టి కేంద్రీకరించాయి.

అభివృద్ధిలో భాగస్వామ్యం మాత్రమే కాకుండా, ముయిజ్జు టర్కీలో పర్యటించడానికి ప్రధాన కారణం మతపరమైన లంకె అనే చెప్పాలి. ఇస్లామిక్‌ ‌ఖిలాఫత్‌ను ఏర్పాటు చేయాలన్న నయా ఒట్టమాన్‌ ‌స్వప్నాన్ని సమర్ధించి వాదిస్తూ, ఇస్లాంకు ఆదర్శ నమూనా టర్కీ అని పేర్కొన్నారు. మతమనే ముడితో అనుసంధానమై, నూటికి నూరు శాతం ముస్లింలు ఉన్న అతి చిన్న ర్యామైన మాల్దీవులు టర్కీతో తన సంబంధాలను కాపాడుకోవాలని భావిస్తోంది. పాలన, పరిపాలనకు ఇస్లాం చట్టం అన్నది ఆధారంగా ఉండటాన్ని 1932లో రూపొందించిన మాల్దీవుల రాజ్యాంగం తప్పనిసరి చేస్తుండగా, రాజకీయ సంస్కరణలు, నూతన సవరణలతో కూడిన 2008 రాజ్యాంగం, ఆర్టికల్‌ 8 (‌డి) కింద, ‘ఒక ముస్లిమేతరుడు మాల్దీవులు పౌరుడు కాలేడు’ అంటూ ప్రకటించారు. కేవలం సున్నీ ముస్లింలకే భూయాజమాన్యం, పౌరసత్వం ఇస్తారు.

మాల్దీవుల అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం ఉన్న, ఈజిప్టులోని అల్‌- అఝర్‌ ‌యూనివర్సిటీలో విద్యనభ్యసించిన అబ్దుల్‌ ‌గయూమ్‌, ‌రాజీలేని ఇస్లామ్‌ను ప్రతి పాదించి, 2004 సునామీ తర్వాత సౌదీ ఆర్ధిక సహాయంతో పాటు వహాబీ సిద్ధాంతం దేశంలోకి ప్రవేశించేందుకు అనుమతించారు. విప్లవాత్మక వహాబీ సిద్ధాంతం వేగంగా ద్వీపసమూహంలో వేళ్లూనుకుంది. గయూమ్‌ అనంతరం నషీద్‌ అధికారంలోకి వచ్చారు. బహుళపార్టీ వ్యవస్థను ప్రవేశపెట్టిన తర్వాత, ప్రజాస్వామ్య రీతిలో ఎన్నికను గెలిచిన నషీద్‌, ‌ముస్లిం బ్రదర్‌హుడ్‌ను పోలిన అధలాత్‌ ‌పార్టీ సహా అనేక పార్టీలతో కలిసి విస్త్రతమైన కూటమిని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పర్యాటకం, ఆరోగ్యం, విద్య వంటి విషయాలలో ఇజ్రా యెల్‌తో  సహకార ఒప్పందాలపై సంతకాలు చేసినందుకు నషీద్‌కు వ్యతిరేకంగా అధలాత్‌ ‌పార్టీ ప్రజా నిరసనలను రెచ్చగొట్టడం, ఆయన రాజీనామాకి దారి తీసింది. ఒక యాక్టివిస్ట్ ఇమేజి ఉన్న నషీద్‌ను పాశ్చాత్య అనుకూలుడు, సెక్యులర్‌ అని భావించేవారు. తన యోగ్యతలను రుజువు చేసుకునేందుకు  తర్వాతి అధ్యక్షుడు వహీద్‌ ‌జిఎంఆర్‌ ‌గ్రూపుతో చేసుకున్న అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టును రద్దుచేసి, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌కు ఆతిథ్యమిచ్చారు.

ఇస్లాం పరిరక్షకునిగా తనను తాను ప్రదర్శించు కున్న గయూమ్‌ ‌సోదరుడు అబ్దుల్లా యమీన్‌ 2013‌లో ఇస్లామిస్టుల మద్దతుతో అధికారంలోకి వచ్చారు. 2015లో సౌఫాన్‌ ‌గ్రూపు నివేదిక ఆధారంగా మత సంప్రదాయవాదం ఎంత బలమైన ప్రభావాన్ని కలిగి ఉందో అంచనా వేయవచ్చు. నివేదిక ప్రకారం సిరి యాలో పోరాటానికి వెడుతున్న వారి అంతర్జాతీయ తలసరి చిట్టాలో మాల్దీవులు మొదటి స్థానంలో ఉంది. 2017 నుంచి ద్వీపంలో తీవ్రవాదదాడులు పెరిగాయి. 2018లో అధికారంలోకి వచ్చిన ఇబ్రహీం సోలిహ్‌ ఈ ఇస్లామిక్‌ ‌తీవ్రవాదులను ఎదుర్కొని, పిటిఎ (తీవ్రవాద నిరోధక చట్టం 1990) కింద 17 సంస్థలను గుర్తించారు. ఐఎస్‌ఐఎస్‌ ‌నడిపే వాయిస్‌ ఆఫ్‌ ‌హింద్‌ ‌పత్రిక మాల్దీవువాసులను జిహాద్‌లో చేరి, మాల్దీవులు (భారత్‌) ‌లో కూడా తీవ్రవాద చర్యలకు పాల్పడమని బహిరంగంగా పిలుపిచ్చింది.

అధలాత్‌ ‌పార్టీ నుంచి తన రాజకీయ కెరీర్‌ను ప్రారంభించిన ముయిజ్జు.  యమీన్‌తో చేతులు కలిపి భారత్‌ ‌నుంచి మాల్దీవులను దూరం చేసి తన ఇస్లామిక్‌ అనుకూల వైఖరిని మెరుగుపెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. యమీన్‌ను అనర్హుడిగా ప్రకటించిన అనంతరం ఎన్నికలలో అధ్యక్ష అభ్యర్ధిగా అనుకోకుండా ముయిజ్జు ప్రవేశించారు. ఆయన అధికారాన్ని చేపట్టిన కొద్ది రోజులకే కూటమిలో చీలికలు ప్రారంభమయ్యాయి. నూతన పార్టీని ఏర్పాటు చేసేందుకు యమీన్‌ ‌రాజీనామా  చేయడంతో పోగ్రెసివ్‌ ‌పార్టీ ఆఫ్‌ ‌మాల్దీవ్స్ ‌బహిరంగంగా బయటకు వచ్చింది. ఫిబ్రవరి 2024లో కీలక పార్లమెంటరీ ఎన్నికల తర్వాత కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడికి మద్దతు అవసరం. ఆయన టర్కీ పర్యటన భారత్‌పై ఆధారపడడాన్ని తగ్గించడమే కాక మధ్య ప్రాచ్య దేశాలతో సన్నిహిత సంబంధాలు, ఇస్లామిస్టులను ఆకర్షించడమనే జంట లక్ష్యాలను సాధించడం కోసం చేపట్టిందే.

దౌత్యపరమైన సంబంధాలను విస్తృతం చేయాలన్న లక్ష్యం, హిందూమహాసముద్ర ప్రాంతంలో ప్రభావాన్ని పొందాలన్న ఎర్దొగాన్‌ ‌లక్ష్యానికి అనుకూలంగా ఉంది. పాకిస్తాన్‌, అజెర్బైజాన్‌లతో త్రైపాక్షిక కూటమిని స్థిరీకరించుకున్న టర్కీ ప్రస్తుతం భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌, ‌మాల్దీవులతో అటువంటి ఒప్పందం చేసుకోవడానికి ఉత్సాహపడుతోంది. ఈ నేపథ్యంలో మాల్దీవులను, టర్కీని సన్నిహితం చేయడంలో పాకిస్తాన్‌ ‌మౌనంగా పోషించిన పాత్రను పరీక్షించాలి. ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంలో కలిసి టర్కీతో వ్యాపార, ఆర్ధిక సహకార ఒప్పందంపై ముయిజ్జు సంతకాలు చేశారు. తూర్పు జెరూసాలెం రాజధానిగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పాలస్తీన సృష్టి ద్వారా శాశ్వత శాంతిని సాధించవచ్చని వారు తమ విశ్వాసాన్ని పునరు ద్ఘాటించారు.

లక్షద్వీప్‌లోని మినికాయ్‌ ‌నుంచి 60 నాటికల్‌ ‌మైళ్ల దూరంలో ఉన్న మాల్దీవులు తన వ్యూహాత్మక దృష్టికోణాన్ని మార్చుకోవడం వల్ల భారత్‌కు పర్యవ సానాలు ఉంటాయి. స్థిరమైన, భద్రత కలిగిన మాల్దీవులు అన్నది ప్రాంతీయ భద్రతకు కీలకం. పొంచి ఉన్న ఇస్లామిస్టు టర్కీ ఉనికి, ఇస్లామిక్‌ ‌చట్రంలోకి మాల్దీవులు జారుకోవడం అన్నవి నూతన సవాళ్లను లేవనెత్తుతాయి. భారత రక్షణ సహకార సమీక్షను నిలిపి, తీవ్రవాద వ్యతిరేకత, సైబర్‌ ‌భద్రత, మాల్దీవుల పౌర రక్షణ దళాల శిక్షణను టర్కీ ఇచ్చేందుకు సహకారాన్ని మరింత పెంచుకునే మార్గాలను ముయిజ్జు అన్వేషిస్తున్నారు.

 భారత్‌ ‘‌నైబర్‌హుడ్‌ ‌ఫస్ట్’ ‌విధానంలో మాల్దీవులు ఒక ముఖ్యమైన భాగస్వామి. భౌగోళిక సామీప్యం వల్ల, భారత్‌ ‌తప్ప మరొక దేశమేదీ ‘తొలి ప్రతిస్పందనాత్మక’ పాత్రను పోషించలేదు. ఐఒఆర్‌లో టర్కీ  ప్రవేశించడంతో,  ఈ పరిణామాలను సన్నిహితంగా పర్యవేక్షిస్తూ, దేశీయ భాగస్వాములతో చర్చలను నిర్వహించి, ఏకరూప ఆలోచనలు గల గల్ఫ్ ‌భాగస్వాములతో కలిసి పని చేయాలి.

  – డా. రామహరిత

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram