ఆపరేషన్ సిందూర్లో కాల్పుల విరమణ ఒక ప్రహేళికగా చాలా మంది భావిస్తున్నారు. ఇప్పుడు విరమణ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఇది భారత్లో గొప్ప గందరగోళాన్ని సృష్టించిన మాట వాస్తవం. కానీ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ తమ విధానాలలో, చర్యలలో స్పష్టంగానే ఉన్నారు. కాల్పుల విరమణ క్రమాన్ని ఈ వ్యాసంలో పరిశీలిద్దాం.
‘వహా సే గోలీ చెలేగీతో యహా సే గోలా చెలాగా’ ఇదీ ప్రధాని నరేంద్ర మోదీ, సైన్యానికి చేసిన నిర్దేశం. అంటే పాకిస్తాన్ తూటాలు పేలిస్తే, క్షిపణుల తో సమాధానం ఇవ్వాలని అర్థం. అంత కచ్చితంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అకస్మాత్తుగా కాల్పుల విరమణకు అంగీకరించడం, పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్న దేశవాసులకు అర్థం కాలేదు. పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పడమే కాదు, పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో సానుకూల పరిణామం చోటుచేసుకుంటుందని, దాన్ని మనదేశంతో కలిపేసుకోవడానికి ఇంతకు మించిన అవకాశం మళ్లీ రాదని ప్రజలు గట్టిగా నమ్మారు. నరేంద్రమోదీ ఇప్పటివరకు తాను చేస్తాన న్నది చేసి చూపించిన ఆచరణశీలి కావడంతో ప్రజలు ఆయన్ను గట్టిగా నమ్మారు. పాక్ను అన్నిరకాలుగా ఓడించి, దాన్ని దోషిగా నిలబెట్టే సమయంలో అకస్మాత్తుగా కాల్పుల విమరణ అంటే అప్పటి వరకు ఒక ఉద్దేశంలో వున్న ప్రజలకు నమ్మశక్యం కాలేదు. గతచరిత్ర పునరావృత మవుతున్నదన్న బాధ ప్రజల్లో వ్యక్తమయింది. కానీ ప్రజల భావోద్వేగాలు వేరు. వారిమాదిరిగా ఒక పరిణిత రాజనీతిజ్ఞుడు ఎటువంటి ఉద్వేగాలకు లోనుకాడు. కేవలం లక్ష్యసాధనపైనే దృష్టిపెడతాడు తప్ప మరే ఇతర అంశాలకు ప్రాధాన్యమివ్వడు. దేశవాసుల ఉద్దేశంలో తప్పులేదు. కానీ వీరి పరిధికి, స్థాయికి రాని ఎన్నో కీలకాంశాలు ప్రధాని స్థాయి నాయకుడి దృష్టికి వస్తాయి. అన్ని కోణాల్లో అన్ని అంశాలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించు కుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. మోదీ లాంటి నాయకుడు కాల్పుల విరమణకు అంగీక రించారంటే బలీయమైన కారణం తప్పక ఉండి వుంటుంది. దేశంలో ఎందరో ఈ అభిప్రాయానికి వచ్చిన వారూ లేకపోలేదు. మిగిలిన వారు దీని అంతరార్థం తెలుసుకోవాలి!
పాకిస్తాన్ అంటే టెర్రరిస్తాన్ అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అభివృద్ధి మాట అట్లావుంచి అదొక ఉగ్రవాదుల ఉత్పత్తికేంద్రంగా మారిందన్న సంగతి తెలిసిందే. పెహల్గామ్ సంఘటన తర్వాత పాక్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ నిక్చచ్చి దాడులు నిర్వహించి అనుకున్న లక్ష్యాన్ని సాధించి అందరినీ ఆశ్చర్యపరచింది. ముఖ్యంగా ఇంతటి స్థాయి ప్రతీకారాన్ని భారత్నుం చి ఊహించని పాక్ ఇది తమపై జరిగిన యుద్ధంగా పరిగణించి, దాడులకు తెగబడింది. ఫలితంగా నాలుగురోజుల పాటు భారత్-పాక్ల మధ్య జరిగిన క్షిపణులు, డ్రోన్ల దాడులు, నియంత్రణ రేఖ వెంట పరస్పర కాల్పున అనంతరం ఎట్టకేలకు మే 10వ తేదీన అకస్మాత్తుగా రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడం సాధారణ ప్రజలకు అమితాశ్చర్యాన్ని కలిగించిన మాట వాస్తవం.
కాల్పుల విరమణకు కారణాలు
ఈ నిర్ణయానికి రావడానికి అంతకుముందు జరిగిన కొన్ని పరిణామాలు కారణమయ్యాయని చెప్పకతప్పదు. మొదటిది 10వ తేదీ సూర్యోదయ సమయానికి భారత్ బ్రహ్మోస్ క్రూయీజ్ క్షిపణులతో పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై దాడిచేసింది. వీటిలో ముందుగా దెబ్బతిన్నది పాక్ ప్రధాన సైనిక కేంద్రం రావల్పిండి సమీపంలోని చక్లాలా వైమానిక స్థావరం. దీంతో పాటు పంజాబ్ ప్రావెన్స్లోని సర్గోధా వైమానిక స్థావరంపై కూడా భారత్ దాడిచేసింది. ఈ రెండూ పాకిస్తాన్ వైమానిక దళానికి, సైన్యానికి అత్యంత కీలకమైన ప్రదేశాలు. ఇదే సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని జకోబాబాద్, భొలారీ, స్కర్థులపై కూడా దాడులు జరిగాయి. దాడుల కారణంగా ఇవి తీవ్రంగా దెబ్బ తినడమే కాదు ప్రాణనష్టం కూడా సంభవించినట్టు వార్తలు వచ్చాయి. ఈ దాడులు జరిగిన కొద్ది సమయంలోనే పాకిస్తాన్ రక్షణ దళాల్లో హై అలర్ట్ సందేశాలు వ్యాపించాయి. ముఖ్యంగా భారత్ తన తర్వాతి దాడిని న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్పై చేస్తుందన్న ఆందోళన వాటిల్లో స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో రావల్పిండిలోని సైనికాధికారుల వ్యూహాత్మక ప్రణాళికా డివిజన్తో సహా ప్రధాన కార్యాలయం చుట్టూ హై అలర్ట్ ప్రకటించి, భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇదే సమయంలో పాక్ అధికారులు జరుగుతున్న పరిణామాలను అమెరికాకు వివరించి తక్షణ జోక్యం కోరారు. అప్పటికే యు.ఎస్. అధికారులు మన అధికారులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఈవిషయం తెలుసుకున్న వెంటనే యు.ఎస్. మరింత చురుగ్గా తన ప్రయత్నాలను ప్రారంభించింది. మీరు తక్షణమే ఇండియన్ ఆర్మీతో నేరుగా హాట్లైన్ ఏర్పాటు చేయాలని యు.ఎస్. దాదాపు పాకిస్తాన్ను ఆదేశించింది. మధ్యాహ్నం తర్వాత 3.35 గంటలకు సమయానికి పాకిస్తాన్ డీజీఎంఓ జనరల్ ఖసీఫ్ అబ్దుల్లా మన దేశ డీజీఎంఓ లెఫ్ట్నెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్కి హాట్లైన్ ద్వారా ఫోన్ చేశారు. అయితే ప్రొటొకాల్కు భిన్నంగా పాకిస్తాన్తో సైనిక లేదా దౌత్యపరమైన చర్చలు జరిపేందుకు భారత్ అంగీకరించలేదు. ఇదే సమయంలో ఎవరి మధ్య వర్తిత్వం అవసరంలేదని తెగేసి చెప్పింది. అంతేకాదు తమ తదుపరి దాడులు ఇంధన, ఆర్థికకేంద్రాలు, కమాండ్ కంట్రోల్ కేంద్రాలపై కొనసాగుతాయని స్పష్టం చేసింది. అయితే పాక్ డీజీఎంఓ అభ్యర్థన మేరకు కాల్పులు నిలపడానికి అంగీకరించింది. ఆవిధంగా మే 10 సాయంత్రం వరకు రెండు దేశాలు కాల్పులను విరమించాలని నిర్ణయించాయి. యుద్ధం జరుగుతున్న తరుణంలో ఒక దేశ డీజీఎంఓ, తన ప్రత్యర్థి దేశ డీజీఎంఓకు ఫోన్ చేశారంటే లొంగి పోయినట్టే లెక్క! మరి ఇదెట్లా జరిగిందో పరిశీలించాలి.
ఆసక్తికర పరిణామాలు
కాల్పుల విరమణకు ముందు కొన్ని ఆసక్తికర పరిణామాలు సంభవించడం గమనార్హం. ముఖ్యంగా 8వ తేదీన భారత్-పాక్ల మధ్య సంఘర్షణ విషయం లో యు.ఎస్. మధ్యవర్తిత్వం వహిస్తుందా? అని విలేకర్లు ప్రశ్నించినప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ ‘దీనికి మాకు సంబంధం లేదు. మేం యుద్ధం చేయడంలేదు కదా’ అని సమాధాన మిచ్చారు. మరునాడే అంటే 9వ తేదీన భారత్ రావల్పిండి వద్ద నూర్ఖాన్ వైమానిక స్థావరంపై దాడి జరిగిన తర్వాత జె.డి.వాన్స్, స్టేట్ సెక్రటరీ మాక్రో రుబియో మాటల్లో తేడా వచ్చింది.ఈ స్థావరం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్కు సమీపంలో ఉండటం వీరి స్పందనకు మరో కారణం. అంతేకాదు ఇక్కడే పాక్ యుద్ధ విమానాలకు, ఇతర రవాణా వాహనాలకు ఇంధనాన్ని నింపడమే కాదు పాక్ యుద్ధ విమానాలను నిలుపుతారు కూడా. అదీకాకుండా పాకిస్తాన్కు చెందిన స్ట్రాటిజిక్ ప్లానింగ్ సెంటర్కు అతి సమీపంలో ఉంది. పాకిస్తాన్ అణ్వాయుధాల భద్రతను కూడా ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. అయితే భారత్ దాడిచేసిన నూర్ఖాన్ మాత్రమే కాదు, అట్టోక్ చమురు క్షేత్రం కూడా ఉన్నదని పాక్ టీవీల్లో జరిగిన చర్చల సందర్భంగా వెల్లడైంది. అయితే అట్టోక్ ప్రాధాన్యం ఏంటంటే ఇక్కడే అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యమున్న క్షిపణులు, మొబైల్ లాంచర్లు ఉంచుతారు. భారత్ జరిపిన దాడిలో వీటిల్లో కొన్ని ధ్వంసమయ్యాయి. నేషనల్ డిఫెన్స్ కాంప్లెక్స్ వీటిని అభివృద్ధి చేస్తుంది. ఇది ఇస్లామాబాద్కు పశ్చిమంగా ఉన్న కాలా చిత్తాధర్ పర్వత ప్రాంతంలో ఉంది. భారత్ డ్రోన్లు దాడి చేసిన అట్టోక్ చమురుక్షేత్రానికి, నేషనల్ డిఫెన్స్ కాంప్లెక్స్ సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉండటం గమనార్హం. ఆపరేషన్ సిందూర్లో మనదేశం ప్రధానంగా పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థను, నేవీని, వైమానిక స్థావరా లను ధ్వంసం చేసింది. ఒకవిధంగా చెప్పాలంటే పాక్ ఆయువుపట్టును తీవ్రంగా దెబ్బ తీసినట్లయింది. మే 10వ తేదీన ఉదయం 90 నిముషాల్లో 11 విమాన ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో తొలిసారి బ్రహ్మోస్ను ఉపయోగించడం గమనార్హం.
కిరానా పర్వతప్రాంతంపై దాడులు
భారత్ కిరానా పర్వత ప్రాంతంపై దాడిచేసిందన్న వార్తలు వచ్చాయి. ఇవి పంజాబ్లోని సర్గోడా జిల్లాలో ఉంటాయి. శిలలతో నిండివుండే ఈ పర్వతాలు పాక్ రక్షణశాఖ నియంత్రణలో ఉంటాయి. ఇక్కడే పాకిస్తాన్ తన అణ్వస్త్రాలను నిల్వచేస్తుందని చెబుతారు. ముఖ్యంగా కిరానా పర్వతాల సొరంగం ముందుభాగంపై ఎప్పుడైతే భారత్ హెచ్చరిక దాడి చేసిందో అప్పుడు 4.0 తీవ్రతతో భూకంపం సంభవించిందన్నది సోషల్ మీడియాలో వస్తున్న వార్తల సారాంశం. ఈ కిరానా పర్వతాల సొరంగం ముందుభాగంలో పెద్ద విస్ఫోటానికి సంబంధించిన చిత్రాలు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న చైనా వెంటనే అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్కు తెలియజేయడంతో పాటు మార్కో రూబియోకు కూడా తెలిపింది. దీంతో ట్రంప్ ఇందులో కలుగజేసుకున్నారనేది ఒక కథనం.
మూడు భూకంపాలు
అణ్వస్త్ర పరీక్షలు జరిపినప్పుడు సంభవించే భూకంపాలు రిక్టర్ స్కేల్పై 5 వరకు తీవ్రతను నమోదు చేస్తాయి. పరీక్షలు జరిపిన 10 నుంచి 70 రోజుల్లోగా, పరీక్షలు జరిపిన ప్రదేశంనుంచి 5-15 కిలోమీటర్ల లోతులో భూకంపాలు సంభవించే అవకాశముందని అణుపరీక్షలు నిర్వహించిన (అధికంగా యు.ఎస్) డేటా చెబుతోంది. అయితే ఈ భూకంపాలు, భూమిపై 50 కిలోమీటర్ల పరిధికి ఆవల ఏర్పడబోవని ఇటీవలి చరిత్ర చెబుతోంది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే మే 5వ తేదీనుంచి 10వ తేదీలోపున మూడు భూకంపాలు సంభవించాయి. మే 10వ తేదీ తెల్లవారుజామున 1.44 గంటలకు రిక్టర్ స్కేలుపై 4 తీవ్రతతో ఒక భూకంపం నమోదు కాగా, అదేరోజు ఉదయం 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనికి కొద్దిరోజుల ముందు అంటే మే 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు పాకిస్తాన్, అఫ్ఘ్ఘానిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో మరో భూకంపం సంభవించింది. వీటికి మూలం ఖైబర్ ఫక్తూన్క్త్వా ప్రావెన్స్లోని చింత్రాల్ జిల్లాలో ఉన్నట్టు గుర్తించారు. అంతేకాదు ఇది బెలూచిస్తాన్ రాజధాని క్వెట్టాకు సమీపంలో ఉండటం గమనార్హం. మరి క్వెట్టా, పాకిస్తాన్ చారిత్రక అణుపరీక్షా కేంద్రం చగాయ్ పర్వతాలకు దగ్గరగా ఉంది. ఈ జిల్లా అఫ్ఘ్ఘానిస్తాన్ సరిహద్దుకు అతి సమీప ప్రాంతం. అదేరోజు మధ్యాహ్నం 12.35 గంటలకు ఆఫ్ఘనిస్తాన్లో ఒక భూకంపం సంభవించడం గమనార్హం. ఈ భూకంపాలు సంభవించిన ప్రదేశాలు, సమయాలను పరిశీలిస్తే అణు పరీక్షలు లేదా మరే ఇతర సంఘటనలు జరిగివుండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవడం సహజం. ఒకవేళ ఈ భూకంపాలు ప్రకృతి సిద్ధంగా సంభవిస్తే, పాకిస్తాన్ అణ్వస్త్రాలు అంత సురక్షితంగా లేవనే చెప్పాలి. ఒక మానవకల్పితంగా భూకంపాలు ఏర్పడితే, పాక్ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ అత్యంత బలహీ నంగా ఉన్నట్టు భావించాలి.భారత్ దాడులు చేసిన ప్రదేశాలు కూడా ఈ ప్రాంతాలకు సమీపంగా ఉండటం గమనార్హం. ఏది ఏమైనా పాకిస్తాన్ అణ్వస్త్రాలు తగినంత భద్రంగా లేవన్నది మాత్రం సుస్పష్టం.
ఈజిప్టు విమానం ఎందుకొచ్చినట్టు?
ఇదిలావుండగా ఈజిప్ట్కు చెందిన ఒక సైనిక కార్గో విమానం పాకిస్తాన్కు చేరుకుంది. బహుశా అమెరికా అధికార్ల అభ్యర్థనమేరకు ఈ విమానం ఇక్కడకు చేరుకొని ఉండవచ్చు. ఇది ఎందుకు వచ్చిందనేదానిపై అధికారులు పెదవి విప్పకపోయి నప్పటికీ, భారత్తో సంఘర్షణ సమయంలో ఇది ప్రత్యక్షం కావడం కొన్ని అనుమానాలకు దారి తీస్తోంది. ఇక్కడి పరిణామాలకు సంబంధం లేకపోయినా ఈజిప్ట్ విమానం ఇక్కడ ప్రత్యక్షం కావడానికి కొన్ని కారణాలను ఊహించవచ్చు. బోరాన్-10 అనేది బోరాన్ మూలకానికి ఐసోటోప్. ఇది ఈజిప్ట్లో ప్రపంచంలోనే అత్యధికంగా లభిస్తుంది. ఈ బోరాన్-10కి అణుధార్మికతను పీల్చుకునే శక్తి ఉందన్న సంగతి ప్రపంచ వ్యాప్తంగా తెలిసిందే. ఎక్కడైనా అణు లీకేజీలు సంభవించి నప్పుడు బోరాన్-10ను ఉపయోగించి అరికట్టడం సర్వసాధారణంగా జరిగేదే. మరి పాక్ ప్రభుత్వం దీనిపై మౌనం వహించడం, అంతర్జాతీయంగా అత్యున్నత స్థాయిలో (యు.ఎస్) కలుగజేసుకోవడం అనేవి ఇక్కడ గుర్తించాల్సిన అంశాలు. కాగా యు.ఎస్.కు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ విమానం ఇస్లామాబాద్లో మే 10న దిగింది. ఒకవైపు ఈజిప్టు విమానం మరోవైపు యు.ఎస్. అధికారులు రావడం చూస్తుంటే పాక్ అణ్వస్త్రాలకు ఏదో జరిగిందని అనుకోవాల్సి వస్తోంది. యు.ఎస్. సంస్థ, అణ్వస్త్ర నిల్వలు, అణ్వస్త్ర భద్రత, రేడియేషన్కు సంబంధించిన అత్యవసర పరిస్థితులను ఎదుర్కో వడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మొత్తంమీద అణుసం బంధ సమస్యలపై ఈ సంస్థకున్న విమానం అన్ని రకాల పరిశోధనలు చేస్తుంది. ఈ నేపథ్యంలో పాక్ అణ్వస్త్రాలు దాచిన ప్రదేశం నుంచి రేడియేషన్ సమస్య ఏమైనా ఉత్పన్నమైందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆకాశ్ క్షిపణుల పనితీరు అద్భుతం
ఈ యుద్ధంలో ఆకాశ్ క్షిపణుల ఎంతో కీలకపాత్ర పోషించాయి. ఇవి ఆఫెన్స్, డిఫెన్స్కు పనికొస్తాయి. ఇవి నావిక్ ఉపగ్రహ వ్యవస్థ నియంత్రణలో పనిచేస్తాయి. నావిక్ వ్యవస్థ, జీపీఎస్ కంటే ఎంతో కచ్చితమైన మ్యాపింగ్తో పనిచేస్తుంది. ఉగ్రవాద శిబిరాలపై నిక్కచ్చిగా ఎటువంటి తేడా లేకుండా సైన్యం దాడిచేయడానికి అందుకు నావిక్ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడింది. ఆకాశ్ ఇతర వ్యవస్థల్లో మనదేశం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ను విస్తృతంగా ఉపయోగించింది. ఇవి తాము ప్రయాణించే సమయంలోనే ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగివుంటాయి. నిజంగా ఇది ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక పాకిస్తాన్ వ్యవస్థలు చైనా ఉపగ్రహ వ్యవస్థల నియంత్రణలో పనిచేస్తున్నాయి. ఇవి పనిచేయడానికి గ్రౌండ్ కంట్రోల్ వ్యవస్థలుండాలి. వాటిని పూర్తిగా మన వాయుసేన ధ్వంసం చేయడంతో, పాక్ వాయుసేనకు ఎటువంటి సమాచారం అందకుండా పోయింది. ఫలితంగా ఏం జరుగుతున్నదీ, ఏవిధంగా ప్రతిక్రియ చేయాలన్న విషయంలో పూర్తి అయోమయం నెలకొంది. ఒక రకంగా చెప్పాలంటే నిస్తేజం ఆవహించింది. సోషల్ మీడియాలో పాక్ ప్రజలు, ‘మా ఎయిర్ఫోర్స్ ఎక్కడ?’ ‘మా సైన్యం ఎక్కడ?’ అంటూ వీడియోలు పెట్టడం మనం చూశాం. వారికి అసలు విషయం తెలియదు కదా! ఈవిధమైన మన సాంకేతిక ఆధిపత్యాన్ని చూసి అమెరికా, రష్యా, చైనాలు బిత్తరపోయాయి. ఒకప్పుడు భారత్ సైన్యం చాలా పటిష్టమైంది, ధైర్యంగా యుద్ధాలు చేస్తుంది కానీ సాంకేతికంగా చాలా వెనుబడివున్నదన్న అభిప్రాయాలుండేవి. ఇప్పుడు వాటిని మన సైన్యం పటాపంచలు చేసింది.
జమలాపురపు విఠల్రావు
సీనియర్ జర్నలిస్ట్