– మల్లాప్రగడ బాలాత్రిపురసుందరి

భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

వెనక్కి జారబడి హాయిగా కూర్చున్నాను. నెమ్మదిగా కాకపోయినా జోరుగా మాత్రం వెళ్లడం లేదు. ‘మాతోనే వస్తున్నాము’ అన్నట్లు ఓవైపు పచ్చటి పొలాలు. గాలికి తలలూపుతూ కొబ్బరి చెట్లు, ఇంకోవైపు చల్లగా మెల్లగా పారుతున్న గోదావరి కాలువ. ఏ.సీ. ఆపేసి కారు కిటికీ తలుపులు దించేసి కూర్చున్నాను. పొలాల్లో పక్క నుంచి, తోటల్లో నుంచి పారుతున్న కాలువ మీదగా వీస్తున్న గాలి హాయిగా ఉంది. ‘ఎచటనుండి వీచెనో ఈ చల్లని గాలి… హాయిగా తీయగా మనసు పరవశింపగా’. పట్టలేని ఆనందాన్ని ఆపుకోలేని కంఠం పాత సినిమాలోని పాట మెల్లగా పాడుతోంది. తెరిచిన కళ్లు చుట్టూ ఉన్న అందాల్ని ఆస్వాదిస్తున్నా, కలేమో అని భ్రమపడేట్లుగా ఉంది మనస్సు.

ఎప్పుడో నలభై ఏళ్ల  క్రితం నా పెళ్లికి ముందు వచ్చాను మా స్వంతవూరు. ఆ ఊరు గురించి నాకేమీ అనుభూతులు, జ్ఞాపకాలు లేవు. మా నాన్నగారు మా చిన్నప్పుడు కథలు, కథలుగా చెప్పిన, నేను విన్న విశేషాలు తప్ప. కడలి అంటే ‘‘కకార పంచకాల’’కు ప్రశస్తి. కకార పంచకాలు ఏవంటే, కపోతేశ్వర స్వామి (దేవుడు), కడలి (ఊరు), కాదంబరి కుటుంబం (నియోగి బ్రాహ్మణ కుటుంబం), కాశీభట్ల కుటుంబం (వైదిక బ్రాహ్మణ కుటుంబం), కటికరెడ్డి కుటుంబం (కాపు). ఇంకా అక్కడి ఈశ్వరాలయంలోని బాలా త్రిపుర సుందరీదేవిని ఆదిశంకరాచార్యులు శ్రీచక్రం వేసి ప్రతిష్ఠించారని, ఆ దేవి పేరే నాకు పెట్టేమని ఏవేవో కబుర్లు చెప్పేవారు.

నేను పుట్టేటప్పటికే ఆ ఊరు వదిలి పెట్టేశారు నాన్నగారు, అమ్మా. అమ్మదీ అదే ఊరు. ఎప్పుడైనా అమ్మా, నాన్న మాత్రమే కడలి వెళ్లేవారు. కానీ మేం పిల్లలం ఎప్పుడూ వెళ్లలేదు. కళాశాలలో చదువుతున్న రోజుల్లో సెలవుల్లో చూడాలని పట్టుపట్టి ఆ ఊరు వెళ్లాను.

మనసు గతంలోకి ప్రయాణిస్తోంది…

అప్పుడు మావయ్యలు, అత్తయ్యలు, పిన్ని, బాబాయి అందరూ ఉండేవారు. అమ్మా నాన్నల్లాగే వాళ్లూ కాలగర్భంలో కలిసిపోయేరు. అప్పుడు పైలాపచ్చీసు! పట్టణంలోనే పెరిగిన నాకు ఆ తోటలూ, కాలువలూ, బల్లకట్టులూ, తాటి బొంగుల వంతెనలూ, ఆ పల్లె మొత్తం అద్భుతంగా అనిపించింది. తాటిబొంగు మీంచి తలపై బుట్టలు, తట్టలు పెట్టుకొని చకచకా నడుస్తూ కాలువ దాటుతున్న ఆ పల్లెజనాన్ని చూసి తనూ బొంగుపై నడవాలని సరదా పడింది. ‘వద్దే అమ్మలూ! పడిపోతావు కాలువలో! అసలే పట్నం నాజూకులు మీవి’అని మావయ్య హెచ్చరించేడు. ‘ఏం కాదు, అసలు పడను. నేను మా కళాశాలలో బ్యాలెన్స్ ‌వాకింగ్‌లో ఫస్ట్ ‌వచ్చాను తెలుసా’ అంటూ బొంగుపై కాలు పెడుతూ అడుగు మోపేను. ఎక్కడా పడకుండా దానిపై నడిచి కాలువ అవతలి గట్టుకు చేరిపోయాను. చంద్రుడిపై మొదటిసారి కాలుమోపిన ఆర్మ్ ‌స్ట్రాంగ్‌ ఎలా అనుభూతి చెందేడో నాకైతే తెలియదు కాని, ఆ క్షణంలో ఏదో గొప్పగా సాధించేసిన నా భావన ఆర్మ్ ‌స్ట్రాంగ్‌ అనుభూతికేం తీసిపోదరనిపించింది. బల్లకట్టుపై నిలబడి కాలువ దాటుతుంటే, లాగేది అవతలిగట్టునున్న వాళ్లయినా  నా వల్లే అంతా కదులుతున్న అనుభూతి. మామిడి తోటలలో కారం, ఉప్పు అద్దుకుని తిన్న మామిడికాయల రుచి ఇన్నేళ్లయినా ఇంకా నాలికపై ఊరుతున్నట్లే ఉంది. కొబ్బరితోటలలో తాగిన లేత కొబ్బరిబొండం నీళ్లు తలుచుకుంటుంటే ఇంకా చల్లగా గొంతు దిగుతున్నట్లు ఉంది. ఎవరింట్లో భోజనం అయినా పప్పు, కమ్మటి నెయ్యి, ఎర్రటి ఆవకాయ, గుమ్మడి వడియాలు, గడ్డపెరుగుతో నంచుకుంటూ జుర్రుకున్న మాగాయి టెంక. అబ్బ! ఆ రుచి నాకు ఆ ముందు కాని ఆ తర్వాత కాని ఎప్పుడూ అనుభవంలోకి రాలేదు.

‘ఎలా ఉందే మా ఊరు’ వెనక్కి వచ్చేసాక అమ్మ నవ్వుతూ అడిగింది. అన్నీ సర్దుతూ అక్కడి విశేషాలు చెప్తూ, చెప్తూ హుషారులో కొట్టుకుపోతున్న నేను ఎందుకో అమ్మ వైపు తిరిగేను. అమ్మ ముఖంపై నా చూపు ఒక్క క్షణం నిలిచింది. అమ్మ కళ్లలో ఆ మెరుపు – దాని వెనకాల దాగిన చిన్న దిగులు మబ్బు- నిజమేనా నేను చూస్తున్నది. నాన్న చెప్పడమే కాని ఆ ఊరు కబుర్లు, అమ్మ ఎప్పుడూ ఆ ఊసే తెచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఆ కళ్లు నాకు ఇంకేదో సత్యం చూపెడ్తున్నట్లున్నాయి. ఎన్నేళ్లయ్యింది అమ్మ ఆ ఊరు వదిలేసి! అంటే ఇన్నాళ్లూ అమ్మ మనసు మూలల్లో స్వంతగడ్డపై మమకారం అలాగే దాగి ఉంది. దాన్ని గుండె గుహలో దాచేసి, తలుపేసి తాళం పెట్టేసిందా? పిల్లల పెంపకం, వాళ్ల చదువులు, పెళ్లిళ్లు, పురుళ్లు… వీటన్నిటిలో మునిగిపోయి ఆ తాళం వేసుకుందేమో! లేక ఎక్కడ పెట్టిందో మరిచిపోయిందో మరి! ఎప్పుడూ అమ్మ ఆ ఊరి గురించి, తన బాల్యం, తన వివాహం, ఆ ఊరితో తన అనుబంధం – దేని గురించీ అస్సలు మాట్లాడేది కాదు. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎప్పుడో ఓసారి అమ్మా, నాన్న మా ఊరు వెళ్లి వచ్చేవారు. కానీ మేం పెద్దవుతున్నకొద్దీ మా చదువులు, ఇంటి ఖర్చులు వీటి మధ్యలో ఆ ప్రసక్తే ఉండేది కాదెప్పుడూ. ఇప్పుడనిపిస్తోంది భౌతికంగానే ఉండేది కాదేమో? నాకేదో నిజం తెలిసీ తెలియనట్లుగా ఉంది…

కారు వేగం క్రమంగా తగ్గింది. ‘‘బాబూ కామేశ్వరరావు గారి ఇల్లు ఎటు?’’ మా వారు ఎవరినో అడిగారు.

‘‘కాదంబరి వారేనా? అదిగో ఎదురుకెళ్లి, అటు కుడికి తిరిగితే వెంటనే కనిపించే తెల్లటి మేడ వారిదేను’’. మా వారు కారు పోనిచ్చారు. కామేశ్వరరావు గారు మాకు దూరపు బంధువు. బంధుత్వం కన్నా స్నేహం ఎక్కువ. కలిసి చాలా సంవత్సరాలైనా ఒకళ్ల గురించి ఒకళ్లం  తెలుసు కుంటూనే ఉన్నాం. తలుచుకుంటూనే ఉన్నాం. రాజమండ్రి స్నేహితుడి ఇంట పెళ్లికి వచ్చి, దగ్గరే కడలి కదా అని నేను సరదా పడితే అటువేపు మళ్లింది మా గాలి, మాదారి. పెద్దమనిషి చెప్పిన తెల్లటి మేడ ముందాగింది కారు.

‘‘రండి రండి మీ గురించే ఎదురుచూస్తున్నాం’’ నవ్వుతూ ఆహ్వానించారు కామేశ్వరరావు దంపతులు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన విశేషాలు అన్నీ కబుర్లుగా మారి దొర్లుతుంటే కాలం తెలియలేదు. కడుపులో ఆకలి కరకరమంటుంటే భోజనాల టైమయిందని తెలిసింది..

‘‘లేవండి భోజనాలకి’’ అంటూ లేచింది హేమ, కామేశ్వరరావు గారి భార్య. మాతో మాట్లాడుతూనే ఎప్పుడు వండిందో తెలియలేదు. చాలా రుచిగాను, బరువుగాను కూడా ఉంది భోజనం. కాస్సేపు విశ్రమించాక గుడివేపు వెళ్దామని నిర్ణయించుకొని నడుం వాల్చేము.

‘‘లే లే! సాయంత్రమైంది గుడికెళ్లాలి కదా!’’ అని మావారు లేపితే లేచాను. అందరం తయారై గుడికి వెళ్లాం. ఎప్పటిదో పురాతన దేవాలయం. నలభై ఏళ్ల క్రిందట నేను మొదటిసారి చూసిన దేవాలయం కపోతేశ్వరాలయం. దేవాలయంలోకి అడుగుపెడ్తుంటే అర్థం కాని అనుభూతి. ‘ఇక్కడి అమ్మవారి పేరే నాకు పెట్టారు కదా’ అనుకుంటుంటే, అందరికీ పిచ్చి అనిపించొచ్చునేమో కాని నాకు మాత్రం ఆనందంగానూ, అద్భుతంగానూ కూడా ఉంది. మా నాన్నగారు చెప్పినవన్నీ మనసులో గింగిరాలు తిరుగుతున్నాయి. ఆ ఊరి ప్రశస్తి అయిన ‘క’కార పంచకంలోని కపోతేశ్వర స్వామిని మొదటిగా  దర్శించుకున్నాం. జంట పావురాల రూపంలో లింగాకారంలో వెలిసిన స్వయంభువు స్వామి. భక్తిపూర్వకంగా నమస్కరించుకుని లింగాష్టకం చదువుకున్నాను. పక్కనే ఇంకో మందిరంలో దీపకాంతుల్లో  మెరిసిపోతున్న ఆమ్మవారిని కనుల నిండుగా దర్శించుకుని మనసు నిండగా అర్చించుకున్నాము. ఎనలేని శాంతిని, అలౌకికా నందాన్ని నింపుకొని గుడి ఉత్తరద్వారం మెట్లపైన కూర్చున్నాం. ఎదురుగా విశాలంగా పరుచుకున్న చెరువు – కపోతగుండం. ఆ వెనుక కొంత దూరంలో మనిషి శాశ్వత విశ్రాంతి మందిరం -శ్మశాన వాటిక – దాని వెనుకే తోటలు, పంట పొలాలు – మనిషికి జీవనాధారాలు. ఆనందం, విషాదం, భక్తి, ప్రశాంతత అన్నీ కలగలిపిన భావన నాలో! సంధ్య అందంగా ముస్తాబవుతోంది. కిలకిలారావాలతో పక్షులు నిండీ నిండని సంజ చీకట్లలో ఎగుర్తూ వెళ్తుంటే ‘పక్షులు గూళ్లకు చేరే వేళ’ అని చదివినదాని అర్థం అనుభవ పూర్వకంగా తెలిసింది.

అప్పుడు చెప్పారు కామేశ్వరరావుగారు ‘‘మా పెళ్లి తర్వాత మా ఊరు కడలి అని తెలిసి, మీ అమ్మగారు నన్ను కలవాలని కోరితే వెళ్లేను. ఏవేవో విశేషాలు వివరాలు ఈ ఊరి గురించి, ఎప్పుడో తనకి తెలిసిన, తనతో సంబంధం ఉన్న మనుషుల గురించి, ఈ కోవెల గురించి ఎన్నెన్నో అడిగారు. నాకు తెలిసినవన్నీ చెప్పేను. ఐనా మళ్లీ మళ్లీ అడిగినవే అడుగుతూ ఓ గంటా గంటన్నరా అవే మాటలు, ప్రశ్నలు, కబుర్లు. ఆ మాటల్లోనే చెప్పేరు మీ నాన్నగారు ఇక్కడ అమ్మేసిన పొలాలు, తోటలు. వాటిగురించి ఎక్కడెక్కడ ఉండేవో ఆ వివరాలు. చాలా పల్లెటూళ్లలో పంట పొలాలు, తోటలు కాంక్రీటు వనాలైపోయినా మా ఊళ్లో  భగవంతుని దయవలన అంత అభివృద్ధి రాలేదు’’ నవ్వుతూ అంటూ, ‘‘అదిగోనమ్మా ఆ కనబడుతున్న తోట. ఆ వెనక పొలాలు. అవే మీవి’’ అని శ్మశానం వెనకగా చూపించేరు.

‘‘మావి కాదండి బాబూ! ఆ స్వంతదారులు తగువుకి రాగలరు.’’ నేను సరదాగా అన్నాను.

అమ్మాయి ముక్త మాటలు గుర్తొచ్చాయి. ఎప్పుడైనా నేను నా బాల్యం గురించీ, మా అమ్మా నాన్నల గురించీ చెప్తూ – ఇలా గోదావరి జిల్లాలో కోనసీమలో తోటలమ్మేసి తాతగారు నేను పుట్టకముందే ఇటు వచ్చేసేరని చెప్పాను. అప్పుడది ‘అబ్బా! కనీసం రెండెకరాలైనా ఉంచి ఉంటే బాగుండేది కదమ్మా. మేమూ మా తోటలంటూ సెలవుల్లో వెళ్లి ఆ పల్లె అందాలలో పరవశించే వాళ్లం’ అని ముచ్చటపడేది. నేను నవ్వేదాన్ని. అది తలుచుకుని ఇప్పుడూ నవ్వొచ్చింది. కానీ, అంతలోనే మనసు భారమైంది. ‘అప్పుడు వాళ్ల మనస్థితి ఏమిటో? ఉన్న ఊరుని వదిలి వెళ్తున్నందుకు ఎంత బాధ పడ్డారో, కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నందుకు ఉత్సాహ పడ్డారో, సంశయ చిత్తులయ్యారో, ఎప్పుడు ఈ ఊరికి మళ్లీ  వస్తామో! ఈ మనుష్యులని మళ్లీ  ఎన్నాళ్లకు చూస్తామో.. అని బెంగ పడ్డారో! ఏమో? ఇప్పుడైతే ఇలా అనుకుంటే అలా గంటలో వెళ్లిపోగలం. ప్రయాణ సాధనాల్లేని రోజులవి. అంతా దూరాభారమే. ఎప్పుడూ ఆ ఊసే మా దగ్గర ఎత్తేది కాదమ్మ.

ఇష్టం లేదేమో, ఆ జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకోవడం అనుకునేదాన్ని. కాదేమోనని ఇప్పుడనిపిస్తోంది. తాను కోల్పోయిన దాని గురించి పదేపదే తలచు కోవడం వల్ల ప్రస్తుత జీవితంలోని ఆటుపోట్లని ఎదుర్కోవడానికి కావాల్సిన గుండె నిబ్బరం చెదురుతుందని భయపడిందేమో. మేం పిల్లలందరం పెరిగి పెద్ద వాళ్లమయి స్థిరపడ్డా, మాతో అవి పంచుకోవడానికి మేమెవ్వరం సమయం కేటాయించలేక పోయాము. అందుకే తన ఊరివాడు అనే అనుబంధంతో స్వంత ఊరి పట్ల ఆ దాచిపెట్టిన మమత ఒకసారి పెల్లుబికి కామేశ్వరరావు గారి ముందు బయటపడిందేమో!

ఇందాక కారులో తెలిసీ తెలియనట్లున్న నిజం నాకు ఇప్పుడు స్పష్టంగా తెలిసినట్లయింది. బోధివృక్షం కింద బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్లు, ఆ గుడి మెట్లమీద ఆ చీకటిలో, ఆకాశంలో మెరుస్తున్న చంద్రుని సమక్షంలో, ఎదుట పరుచుకున్న చెరువు నీటిలో ప్రతిఫలిస్తున్న సన్నని వెన్నెల వెలుగులో నాకు ఒక జీవిత సత్యం బోధపడింది.

కడలి నుండి కాకినాడ వెళ్లినా,  కాకినాడ నుండి కశ్మీరు వెళ్లినా.. భారతదేశం నుంచి అమెరికా వెళ్లినా, అక్కడినుంచి అంతరిక్షంలోకి వెళ్లినా, మనసుపొరల్లో పురాజ్ఞాపకాల నుంచి ఆర్ద్రతను పీల్చుకుంటూ మనిషి పెరుగుతాడు. ఎదుగుతాడు. విస్తరిస్తాడు. ఆతడే ఆరిపోతే జవం లేదు. జీవం లేదు. జీవితానికి అర్థం లేదు.

వచ్చేవారం కథ..

మాతృదేవోభవ

– సి.ఎన్‌. ‌చంద్రశేఖర్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE