ఆంధ్ర వాఙ్మయంలో కథాకావ్యాలకు విశిష్ట స్థానం ఉంది. అవి నేటికాలంలో వచ్చిన విజ్ఞాన సర్వస్వాల వంటివి. మనో వికాసానికి, నిత్య జీవితానికవసరమైన వివిధ శాస్త్ర విషయాలను ఒక్కచోట కూర్చి విజ్ఞాన ప్రసారాన్ని చేయడానికి ఎంతో ఉపకరించిన గ్రంథాలు ఈ కథాకావ్యాలు. అలా వెలువడిన కావ్యాల్లో తలమానికం అయ్యలరాజు నారాయణామాత్యుల ‘హంస వింశతి’. చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ మాటల్లో, హంస వింశతి ‘శాస్త్రాన్ని శాస్త్రంగా చదువుకోదలచిన వారికోసం రాసినది.’
హంస వింశతి అక్షయ ప్రజా సాహిత్య నిక్షేపం. దీని కర్త అయ్యలరాజు నారాయణామాత్యుని గూర్చి ఆచార్య కె.వి.ఆర్.నరసింహం రామాభ్యుదయ పీఠికలో ప్రస్తావించారు. నారాయణామాత్యుని పూర్వులు నేటి కడప మండలంలోని ఒంటిమిట్టలో కీ।।శ।। 1660 ప్రాంతంలో నివసించారని తెలియ చేశారు. అదే విషయాన్ని చరిత్రకారుడు నేలటూరి వెంకటరమణయ్య కూడా ధ్రువీకరించారు. బ్రౌన్ 1820లో హంస వింశతిలోని పలుకుబడులకు కొన్నిటికి ‘అర్థము తెలియలేదు’ అని రాశాడు.
హంస వింశతి తెలుగులో ఒక• స్వతంత్ర కథా ప్రబంధం. ఈ జాతికి చెందిన కథాప్రబంధాలలో ‘శుక సప్తతి’ మొదటిది. ‘హంస వింశతి’ చివరిది. హంస వింశతి కథా ప్రయోజనం ఏమిటి? మొద• వీటిని పరమేశ్వరుడు సంతోషంగా పార్వతీదేవికి వినిపించాడట. వాటిలో చిత్ర విచిత్రమైన భామల చిత్తవృత్తి రహస్యం ఉంది. ఆ రహస్యం విప్పినప్పుడు పురోహితుడు విన్నాడు. కొలువుదీరిన పాలకుడు నలమహారాజు. ఈ కథలు హంస పక్షి చెప్పినవి.
హేమవతి ఉజ్జయినీ పట్టణంలోనే అందగత్తె. ఆమె వివాహిత. అయినా చిత్రభోగ మహారాజు కోరుకున్నాడు. భర్త విష్ణుదాసుడు దూర దేశం వెళ్లాడు. అదే అదనుగా ఆమె రాజు దగ్గరికి ప్రయాణం కట్టింది. కానీ పెంపుడు హంస పోనీయలేదు. పట్టి నిలిపి కథలు చెప్పింది. హేమవతి బయలుదేరడం, హంస కథ మొదలు పెట్టడం. తెల్లవారడం. ఇంతే. ఇదే ప్రవృత్తితో ఇరవై రాత్రులు గడిచాయి. అంటే హంస ఇరవై కథలు చెప్పింది. ఇరవై ఒకటో రోజు మగడింటికి వచ్చాడు. కథ కంచికి వెళ్లింది. భార్యాభర్తలు కలసి జీవించడమే ఫలశ్రుతి.
ఇన్ని కథలు విన్న హేమవతి చివరిగా ‘పరపురుష సంగమంబిహపర సుఖదూరంబు’ అన్నది. రాజుకు కూడా బుద్ధి వచ్చింది. అసలు ఈ భూమ్మీద అన్యకాంతలను కోరుకోకూడదు, కోరుకుంటే అది పాతకం అన్నాడు. కొందరు ప్రబుద్ధులు అసభ్య సాహిత్యమని ఆంగ్ల ప్రభువులకు జెప్పి ‘హంస వింశతి’ని నిషేధింపజేశారు. మళ్లీ 1947లో రాహు పీడ తొలగి స్వతంత్ర వికాసం కలిగింది.
హంస వింశతి సమకాలీన జీవన విధానానికి అద్దం పట్టిన గ్రంథం. సామాజిక చిత్రణం, శాస్త్ర విషయాలేగాక దీనిలో సామాన్యమైన గడ్డిపేర్లు మొదలు జంతువులు, పక్షులు, పర్వతాలు, నదులు, కొండలు, పల్లెలు పట్టణాలు, క్రీడలు, వేదవేదాంగాల వరకూ గల వివిధ విషయాల పేర్లను పట్టికలుగా ఇచ్చి విజ్ఞానాన్ని రాశీభూతంగా ఈ కావ్యంలో కవి పోగుచేయడంతో ఇది విజ్ఞాన సర్వస్వ లక్షణాలు గల గ్రంథంగా కీర్తిగాంచింది.
హంస వింశతిలో నామమాత్రంగా ఉన్న శాస్త్రీయపదాలను ఒక క్రమపద్దతిలో లక్ష్య లక్షణ సమన్వితంగా వివరించారు. ఉదాహరణకు నాట్యకళ అన్నదానిలో వివిధ నాట్య విధానాలు, శాస్త్రీయ, దేశీయ నాట్య పద్ధతులు వివరించారు. అలాగే గానకళలో సప్తస్వరాలు రాగతాళ భేదాలేకాక, ప్రాచ్య పాశ్చాత్య రీతులను సమన్వయం చేసి చూపారు. విద్యావర్గంలో అష్టభాషలు, అష్టాదశ పురాణాలు, అష్టాదశ సంహితలు, చతుషష్ఠి విద్యలు, ఛందస్సు, అలంకారాలు, యతులు, ప్రాసలు, వేదాలు, వేదాంగాలు, షట్చాస్త్రాలు, సూర్య సోమాది సిద్ధాంతాల వంటి అనేక విషయాలను చక్కగా వివరించారు. అంతేగాక వాద్యాలు, వాటి పేర్లు, తీరులు వంటి విషయాలను వివరించారు.
స్థావర జంగమాత్మకమైన ఈ విశ్వమంతా వికీర్ణమైయున్న విజ్ఞానాన్నంతటిని ఒక్క చోటకు చేర్చి ప్రజలకు పరిచయం చేయడమే విజ్ఞాన సర్వస్వాల ఆశయం. ఫ్రెంచ్ విజ్ఞాన సర్వస్వాల సంపాదకుల్లో ముఖ్యుడు డెన్నిస్ డిడిరో ఈ విధంగా వివరించాడు. ‘‘ప్రపంచ వీధుల్లో వికీర్ణమై పడియున్న విజ్ఞానాన్ని రాశి చేసి సమకాలికులకు పరిచయం చేయడమే కాక భావితరాల వారికి జ్ఞాన భాండాగారాన్ని అందించడము కూడా దీని (విజ్ఞాన సర్వస్వం) లక్ష్యమే’’ అన్నారు. ‘విజ్ఞాన సర్వస్వం ప్రయోజనాత్మక సాహిత్యం. జీవితానికి ఆనందాన్ని కల్గించేందుకు ఇది ఆధార భూతమైంది’ అని ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం అభిప్రాయపడ్డారు.
గ్రీకు మహాతత్వవేత్త ప్లాటో శిష్యుడైన అరిస్టాటిల్, స్ప్యూ సెవస్ అనువారు మొదటి విజ్ఞాన సర్వస్వం తయారు చేసినట్లు తెలుస్తుంది. పాశ్చాత్య దేశాల్లో విజ్ఞాన సర్వస్వం అనదగిన మరో గ్రంథాన్ని ప్రాచీన గ్రీకుల్లో జూలియస్ సీజర్ సమకాలికునిగా చెప్పే మార్కస్ నిర్మించినది. ప్లినీ అనే మేధావి కృషి ఫలితంగా నేచురల్ హిస్టరీ అనే 37 సంపూటాల గ్రంథం వెలుగులోనికి వచ్చింది.
ఐరోపా ఖండంలో విజ్ఞాన సర్వస్వాల నిర్మాణా నికి కృషి జరుగుతున్న సమయంలోనే ఫ్రాన్స్లో ఫాదరీ బూవే నగరానికి చెందిన విన్సెంట్ కీ।।శ।। 1190-1264 మధ్యకాలంలో ‘‘స్పెక్యులమ్ మాజెస్’’ అనే గ్రంథాన్ని సమకూర్చాడు. జర్మనీలో 1630లో ఆల్ స్టేట్ లాటిన్ భాషలో ‘‘ఎన్సై క్లోపీడియా’’ అనే పేరుతో వెలువరించిన గ్రంథం ఆధునిక విజ్ఞాన సర్వస్వాలకు మూలం.
ఇంగ్లీషులో అకారాది వర్ణక్రమంలో విజ్ఞాన సర్వస్వాలను నిర్మించడం 17వ శతాబ్దిలోనే ప్రారంభమైంది. జాన్ హారిస్ అనే ఆంగ్ల పండితుడు 1667-1719 ప్రాంతంలో ‘కళలు ప్రకృతి శాస్త్రాల ఆంగ్ల విశ్వకోశం’ అనే గ్రంథాన్ని ప్రకటించాడు. హారిస్కు సమకాలీన పండితుల రచనలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ప్రముఖ శాస్త్రవేత్త న్యూటన్ ‘ఆమ్లములు’ అనే అంశంపై వ్యాసం రచించి దీనిలోనే ప్రకటించాడు. ఆ తరువాత ఇదే నమూనాలో ఎన్సైక్లోపీడియా బ్రిటానికా, ఎన్సైక్లో పీడియా అమెరికానా, ఫ్రెంచ్ విజ్ఞాన సర్వస్వం తయారైనాయి.
విజ్ఞాన సర్వస్వం లక్షణాలు గల హంస వింశతిలో నిఘంటు లక్షణాలు కూడా ఉన్నాయి. నిఘంటువులు శబ్దజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు దోహదం చేసే గ్రంథాలు. శబ్దజ్ఞానం కూడా విజ్ఞాన సర్వస్వ లక్షణాలలో ఒకటి.
హంస వింశతిలోని పదజాలాన్ని గురించి కందుకూరి బాలప్రసాద్ భూపాలుడు అభిప్రాయం, ‘అయ్యలరాజు నారాయణ కవికి పద సంపద మెండు, సాధారణంగా వ్యాపారములకును, కృషులకును సంబంధించిన వ్యవహార పదములను ఈతని వలె చేర్చి పట్టికలుగా నొనర్చిన కవి మరియొకడు లేడు అన్య దేశ్య పదములను కూడా ఇతడు పుష్కలంగా వాడియున్నాడు’’ అన్నారు.
15వ రాత్రి కథ రెడ్లు, వారి వ్యవసాయం, వారు పండించే రకరకాల పంటలు, వడ్ల పేర్లు దాదాపు 200 రకాలు ఇచ్చారు. చిరుధాన్యాలు – 127 రకాలు, కూరగాయలు 129 రకాలు, దుంపకూరలు, 131 రకాలు, ఆకుకూరలు 132 రకాలు, పశుగ్రాసాలు దాదాపు 200 రకాల వరకూ చెప్పాడు. వినోదాలు – వేడుకల్లో కోడి పందాలు – వాటి రకాలు, కోడిపుంజుల పేర్లు – 214, విజయ సమయాలు గురించి వివరించాడు.
16వ రాత్రి కథ బెస్తల గురించి. దానిలో 187 రకాల చేపల పేర్లు, 186 రకాల జలచరాలు, చేపలు పట్టే వలలు రకాలు, చేపల వేటకు అనువుగా ఉండే సమయం వివరించాడు.
హంస వింశతి ప్రధానంగా కథా ప్రబంధం. కాబట్టి అన్ని వస్తువుల్ని, పదార్ధాలని లేదా ప్రదేశాల్ని కావ్యంలో వర్ణించేందుకు వీలుండదు. ప్రతీ విషయాన్ని వర్ణిస్తూ పోతే కావ్య లక్షణానికి భంగం కలిగే ప్రమాదమూ లేకపోలేదు. అందుకనే కవి ఆనాటి జన జీవన విధానానికి మూల భూతాలైన సాంఘికాది విషయాలను అవకాశమున్నంత వరకు ఇచ్చి మిగిలిన శాస్త్రాలన్నింటిని పట్టికలుగా తయారుచేసి ఇచ్చాడు.
హంస వింశతి అంటే బ్రౌన్కు చాలా ఇష్టమని అంటారు. అందుకే బ్రౌన్ 1845లో హంస వింసతిని ఒక శుద్ధ వ్రాతప్రతిని తయారు చేశాడు (•శీశ్రీ.×. ×.ణ. చీశీ.912). హంస వింశతిలోని పదాలన్నీ ఏర్చి, కూర్చి హంస వింశతి సూచకలను తయారు చేశాడు. ఈ గ్రంథాలన్నీ మద్రాసు ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయంలో ఉన్నాయి. పరిష్కర్తలెవ్వరూ అంతగా పట్టించుకోలేదేమో అనిపిస్తుంది. దీనికి కారణం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ‘హంసవింశతి’, ‘తారాశశాంకం’ వంటి రచనలను శృంగార ప్రబంధాల పేరుతో 1911లో నిషేధించింది. 36 సంవత్సరాల తరువాత 1947లో టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక వీటిపై నిషేధ్ఞాలు ఉపసంహరించిన తరువాత హంస వింశతి వెలుగులోనికి వచ్చింది. హంస వింశతి కథా ప్రబంధంగా పేరు పడిపోయింది కనుక, దీనిని ప్రచురించిన పరిష్కర్తలు కూడా కథ అనే దృష్టితోనే చూశారు. కానీ దీనిలో రాశీభూతంగా ఉండే విజ్ఞాన విషయాలకు సంబంధించిన పదాల జోలికంతగా పోలేదు.
ఉదాహరణకు కోడి పందాల గురించి రాస్తూ 5 జాతుల కోడిపుంజులు- డేగ, నెమలి, పింగళి, కోడిడేగ, కాకి. ఈ జాతులకు ఆయా సమయాల్లో ప్రాప్తించే భోగాలు 1. రాజ్యం 2. భోజనం 3, గమనం 4. నిద్ర 5. మరణం గురించి వివరించాడు కవి.
తే।। డేగ, నెమలి, పింగళి, కోడిడేగ, కాకి
వన్నెలైదింటి కిరులండు వన్నెలందు
రాజ్య భోజన గమన నిద్రా మరణము
లను విచారించి యువజాతులను వచించి
(హంస వింశతి, 3వ సంపుటి-213వ పద్యం)
కోడిపందాలు చీకటి పందాలని, వెన్నెల పందాలని రెండు రకాలు (కృష్ణ పక్షం- శుక్ల పక్షం). ఏ రంగు కోడి ఎప్పుడు విజయం సాధిస్తుందో చెప్పాడు. అయితే పళ్లెటూళ్లల్లో జానపదుల ఆచార వ్యవహారాలు వారి జీవన విధానంతో పరిచయముంటే తప్ప ఈ ప్రబంధాన్ని అంత సులువుగా పరిష్కరింప జాలరు. ఈ విజ్ఞాన ప్రబంధాన్ని పరిష్కరించి చక్కని ప్రతిని తయారు చేస్తే అది ఆంధ్రులకు మహోపకారమే అవుతుంది.
మూలం:
- హంస వింశతి : అయ్యలరాజు నారాయణా మాత్య ప్రణీతము : పరిష్కర్త – సి.వి.సుబ్బన్న అవధాని పీఠిక పేజీ – IV TO XVI
- హంస వింశతి : విజ్ఞాన సర్వస్వం ప్రథమ సంపుటం – డా।। జి. వెంకటరత్నం పరిశోధనా గ్రంథం, పేజి. 35, 64, 67టు 80.
డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు